ఆయుష్
విశాఖపట్నంలో ప్రధాని నేతృత్వంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
21న యోగా సంగమంలో 11 లక్షలకు పైగా కార్యక్రమాలు
ఢిల్లీలో 100కు పైగా కార్యక్రమాలు
సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షించే భారతీయ దృక్పథం ప్రతిధ్వనించేలా అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 ఇతివృత్తం – యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్
Posted On:
20 JUN 2025 5:40PM by PIB Hyderabad
జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కార్యక్రమంలో, ప్రధాన వేదిక వద్ద 3 లక్షల మందికి పైగా ప్రజలు యోగా ఆచరిస్తారు. సార్వజనీన సంక్షేమాన్ని కాంక్షించే భారతీయ దృక్పథానికి అద్దంపట్టేలా అత్యంత విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితోపాటు ఆయుష్ సహాయ మంత్రి (స్వతంత్ర), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
మూడు లక్షల మంది ప్రజలతో కలిసి దైనందిన యోగాచరణ విధానాన్ని విశాఖపట్నం వేదిక నుంచి ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆచరిస్తారు. అదే సమయంలో ‘యోగా సంగమం’ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ప్రదేశాల్లోనూ యోగా జరుగుతుంది. సామూహిక ప్రదర్శన ఉదయం 6:30 నుంచి 7:45 వరకు నిర్వహిస్తారు. దేశంలో నలుమూలల నుంచి మునుపెన్నడూ లేనివిధంగా ప్రజానీకం ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని భావిస్తున్నారు.
ఈ అపూర్వమైన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ప్రదేశాలలో జరిగే యోగా సెషన్లలో 2 కోట్లకు పైగా ప్రజలు పాల్గొనవచ్చని అంచనా. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేందుకూ సమన్వయంతో కృషిచేస్తోంది. అంతేకాకుండా నమోదు చేసుకున్నవారందరికీ 50 లక్షలకు పైగా యోగా ధ్రువీకరణపత్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. ఇది ఈ పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ ఆరోగ్య, సంక్షేమ ప్రస్థానంలో చరిత్రాత్మకంగా నిలపనుంది.
వేడుకల్లో భాగంగా ఈరోజు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అద్భుతమైన సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 25,000 మంది గిరిజన బాలలు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. ఈ విశిష్ట కార్యక్రంలో గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో యోగా పరిధి విస్తృతమవుతుండడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ జాతీయ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీలోనూ రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని 109 ప్రదేశాల్లో జూన్ 21న యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చారిత్రక ఎర్రకోట వద్ద ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థల సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి ఎర్రకోట వద్ద బ్రహ్మకుమారీలు నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ యోగా దినోత్సవ ఇతివృత్తం ‘మన భూమి, అందరి ఆరోగ్యం కోసం యోగా’ (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్)ను ప్రముఖంగా చాటుతుంది.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం ‘మన భూమి, అందరి ఆరోగ్యం కోసం యోగా’ అందరూ క్షేమంగా ఉండాలన్న విస్తృత దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ‘సర్వే సంతు నిరామయ (అందరూ రోగాల నుంచి విముక్తులగుదురు గాక)’ అన్న భారతీయ తాత్వికత దీనికి మూలం. మానవుడు, తద్వారా ప్రపంచమూ ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షను అది వ్యక్తంచేస్తుంది.
యోగా ప్రయోజనాలు అందరికీ చేరాలన్న లక్ష్యంతో - ‘‘యోగా భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనాల్లో సానుకూల పరివర్తనను కలిగించడం మనకు గర్వకారణం’’ అని పేర్కొంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరు గ్రామ సర్పంచులకు లేఖ రాశారు. గత అంతర్జాతీయ యోగా దినోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి సందేశం గ్రామ పంచాయతీలలో నూతన ఉత్సాహాన్ని నింపి, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పంచాయతీలు, అంగన్వాడీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో యోగా సంబంధ కార్యకలాపాలు విస్తృతంగా పెరిగాయి.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా 10 విశిష్ట కార్యక్రమాల నిర్వహణ వల్ల దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అపూర్వ స్పందన లభించింది. దేశంలో జూన్ 21న జరిగే యోగా కార్యక్రమానికి లక్ష రిజిస్ట్రేషన్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 11 లక్షలకు పైగా సంస్థలు, బృందాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా పోర్టల్ ద్వారా తమ తమ ప్రదేశాల్లో యోగా సంగమం కార్యక్రమం కోసం నమోదు చేసుకున్నాయి. 2.25 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్ల నమోదుతో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలవగా, మరో మూడు రాష్ట్రాలు లక్ష రిజిస్ట్రేషన్ల మార్కును దాటాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 10 విశిష్ట కార్యక్రమాలు
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ 100 రోజుల వ్యవధిలో 10 విశిష్ట కార్యక్రమాలను రూపొందించింది. సమాజంలోని వివిధ వర్గాలకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు. దేశవిదేశాల్లో యోగా విస్తరిస్తున్నదనడానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవి:
· యోగా సంగమం: జాతీయ స్థాయి కార్యక్రమంతో పాటు లక్షకు పైగా ప్రదేశాలలో సామూహిక యోగా ప్రదర్శనలు.
· యోగా బంధన్: యోగా ప్రతినిధి బృందాల్లో అంతర్జాతీయ సహకారం, వినిమయం
· హరిత యోగా: మొక్కల పెంపకం, స్వచ్ఛత కార్యక్రమాల వంటి పర్యావరణ చర్యలతో యోగాను ఏకీకృతం చేయడం.
· యోగా పార్క్: పబ్లిక్ పార్కులను ప్రత్యేక యోగా స్థలాలుగా తీర్చిదిద్దడం.
· యోగా సమావేశ్: అట్టడుగు వర్గాల కోసం ప్రత్యేక విధానాలతో సమగ్ర యోగా ప్రచారం.
· యోగా ప్రభావ: అంతర్జాతీయ యోగా దినోత్సం, సామాజికంగా అది చూపినన ఫలితాలపై పదేళ్లకు సంబంధించి సమగ్ర ప్రభావ నివేదిక.
· యోగా అనుసంధానం: అంతర్జాతీయ స్థాయి నిపుణులు, విధాన రూపకర్తలతో జూన్ 14న ఆన్లైన్ యోగా సదస్సు.
· యోగా ఆవిష్కరణ (యోగా అన్ప్లగ్డ్): సాంకేతికత, ప్రస్తుత ధోరణులు, సాంప్రదాయక యోగాను మిళితం చేస్తూ యువత కేంద్రీకృతంగా కార్యక్రమాల నిర్వహణ.
· యోగా మహాకుంభ్: యోగాలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక కోణాలను చాటేలా వరుసగా విస్తృత స్థాయి కార్యక్రమాలు
· సంయోగ: యోగా ఫలితాలను ఆధునిక ఆరోగ్య రక్షణ పద్ధతులతో ఏకీకృతం చేసి ప్రదర్శించడం.
అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల మధ్య సంపూర్ణ సమన్వయంతో ఈ దశాబ్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు, యోగా శిబిరాలు, వివిధ ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీలతో కొన్ని వారాల పాటు సన్నాహక కార్యకలాపాలు సాగాయి.
ప్రపంచవ్యాప్తంగా భారత రాయబార కార్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు యోగా ఆచరణ, అవగాహన కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నాయి. ఇది భారత సాంస్కృతిక దౌత్యాన్ని బలోపేతం చేయడంతోపాటు ఆరోగ్యపరంగా దేశ స్థాయినీ పెంచుతుంది.
పదేళ్ల బలమైన పునాది, అన్ని రంగాల నుంచి ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం- 2025 భారతదేశ ఆరోగ్య ప్రస్థానంలో ప్రధాన ఘట్టంగా నిలవనుంది. సందేశం సుస్పష్టం — యోగా అన్నది ప్రపంచానికి భారత్ అందించిన కానుక మాత్రమే కాదు.. అందరికీ ఆరోగ్యకరమైన, సామరస్యపూర్వకమైన, సుస్థిర భవిత దిశగా ఇదొక అద్భుతమైన మార్గం.
***
(Release ID: 2138197)