ఆయుష్
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025కు సిద్ధమవుతున్న విశాఖపట్నం: సీనియర్ అధికారుల కీలక సమీక్ష
Posted On:
15 JUN 2025 1:26PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) దశాబ్ది వేడుకలకు భారత్ సిద్ధమవుతున్న వేళ 11వ ‘ఐడివై’కి జాతీయ స్థాయిలో ఆతిథ్యమిచ్చేందుకు విశాఖపట్నం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో నగరంలో పరిస్థితుల పరిశీలనతోపాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యోగాను ప్రపంచం నలుమూలలకూ చేరువ చేయాలన్న ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు జోరుగా సాగుతున్న సమయంలో ఈ సమావేశం నిర్వహించారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ ల నేతృత్వంలోని అధికారుల బృందం నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. ఈ బృందంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాష్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్తోపాటు ఆరోగ్య, పట్టణ ప్రణాళిక, ఆయుష్, ‘విఎంఆర్డిఎ' తదిరత కీలక విభాగాల అధిపతులున్నారు. ‘ఐడివై’ నిర్వహణకు ఎంపిక చేసిన “ఆర్కె బీచ్, రిషికొండ బీచ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, గీతం విశ్వవిద్యాలయం” వంటి ప్రధాన ప్రదేశాల్లో ఏర్పాట్లను ఈ బృందం క్షుణ్నంగా పరిశీలించింది. ఈ వేదికలు ప్రధాన యోగా ప్రదర్శన నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా యోగాను ప్రజా కేంద్రక ఉద్యమంగా మార్చాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య-శ్రేయో కార్యకలాపాల కేంద్రాలుగానూ పనిచేస్తాయి.
సమీక్ష సమావేశంలో భాగంగా అంతర-విభాగ సమన్వయం, జన సమీకరణ వ్యూహాలు, భద్రతపరమైన చర్యలు-ఏర్పాట్లు, సాంస్కృతిక ఏకీకరణ తదితర కీలకాంశాలపై సమగ్ర చర్చ సాగిది. యోగాను ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి సౌకర్యానికీ ప్రాధాన్యమిస్తూ మౌలిక సదుపాయాలు, ప్రజా భాగస్వామ్య సంసిద్ధతలకు పెద్దపీట వేస్తున్నారు. సమష్టి శ్రేయస్సు కృషి దిశగా సంస్థలు, సమాజాలను యోగా ఒక్కతాటిపైకి తేవాలన్న ప్రధానమంత్రి దార్శనికతను ప్రతిబింబిస్తూ, వివిధ విభాగాలు సహకార స్ఫూర్తితో ఉమ్మడిగా పనిచేస్తున్న తీరును ఉన్నతాధికారులు సమీక్షించారు.
రాష్ట్రంలోని 2 కోట్ల మందికిపైగా పౌరులకు యోగాను రోజువారీ అలవాటుగా మార్చే కృషిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “యోగాంధ్ర” కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సమాజంలోని అన్ని వర్గాలనూ భారీ ఎత్తున సమీకరించేలా దీన్ని రూపొందించింది. తదనుగుణంగా సామూహిక అవగాహన కార్యక్రమాలు, పాఠశాలలు-విశ్వవిద్యాలయాల్లో యోగా శిబిరాలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో 20 లక్షల మంది ధ్రువీకృత యోగాభ్యాసక బృందాన్ని రూపొందించే లక్ష్యంతో ప్రణాళికను అమలు చేస్తోంది. ఇక ‘ఐడివై’ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రదేశాలలో వేడుకలకు సర్వ సన్నాహాలు చేస్తుండగా, ఒక్క విశాఖపట్నం నగరంలోనే 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. యోగాను సార్వజనీనం, సుగమం, పరివర్తనాత్మకంగా రూపుదిద్దాలనే ప్రధానమంత్రి పిలుపును ఈ కార్యక్రమం శక్తిమంతంగా ప్రతిఫలిస్తుంది.
భారతీయ సంప్రదాయంలో అనాదిగా అంతర్భాగమైన యోగా- ‘ఐడివై’ స్ఫూర్తితో ప్రపంచ శ్రేయో ఉద్యమంగా రూపొందుతున్నదని ఆయుష్ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక రీతిలో క్షేత్రస్థాయి ప్రజా భాగస్వామ్యంతో భారీ కార్యక్రమాన్ని రూపొందించి, చురుగ్గా అమలు చేస్తుండటం ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నదని ప్రశంసించింది. ఈ నెల 21వ తేదీన ‘ఐడివై’ నిర్వహణ ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో యోగా సమాజాలకు ఎలా వారధి కాగలదో, ప్రజారోగ్య శ్రేయస్సుకు ఎలా దోహదం చేస్తుందో, “ఒకే భూగోళం-ఒకే ఆరోగ్యం” దిశగా భారత్ నిబద్ధతను ఎలా ప్రతిబింబిస్తుందో ప్రదర్శించడానికి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
****
(Release ID: 2136507)