ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం.. ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం

* ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధానమంత్రి...దుర్ఘటన నేపథ్యంలో అధికారులు, బృందాలతో భేటీ

Posted On: 13 JUN 2025 10:53AM by PIB Hyderabad

అహ్మదాబాద్ లో జరిగిన విమాన దుర్ఘటనలో ఎంతోమంది చనిపోయినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన సానుభూతిని తెలిపారు. వారికి కలిగిన అంతేలేని వేదన, వారికి కలిగిన లోటు ఎలాంటిదో తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు.

అంతకు ముందు, శ్రీ మోదీ అహ్మదాబాద్ లో విమానం కూలిపోయిన ప్రదేశానికి వెళ్లి, అక్కడి స్థితిని స్వయంగా పరిశీలించారు. దుర్ఘటన అనంతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అధికారులనూ, అత్యవసర ప్రతిస్పందన బృందాల సభ్యులనూ ఆయన కలుసుకున్నారు.

శ్రీ మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన రెండు సందేశాల్లో :

‘అహ్మదాబాద్‘లో జరిగిన విమాన ప్రమాదంతో మనమంతా స్తబ్దులమయ్యాం. ఇంత మంది ఉన్నట్లుండి, గుండె పగిలే విధంగా మన మధ్య నుంచి దూరమైన బాధను గురించి చెప్పాలంటే నోట మాట రాదు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారికి ఎదురైన వేదనను మనం అర్థం చేసుకోగలం. ఈ విషాదం మిగల్చిన వెలితి ఏళ్ల తరబడి మనల్ని వెన్నాడుతుంది. ఓమ్ శాంతి.’’

‘‘అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలాన్ని ఈ రోజున నేను చూశాను. విధ్వంసం సంభవించిన తీరు బాధాకరం. తదనంతర కార్యకలాపాల్లో అలసటనేదే ఎరుగకుండా విధులు నెరవేరుస్తున్న అధికారులను, సిబ్బందిని కలుసుకున్నాను. ఊహకైనా అందని ఈ పెనువిషాద ఘటనలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి కలిగిన శోకం ఎంతటిదో.. వారికి నేను నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.‌  

 

 

***‌


(Release ID: 2136233)