ఆయుష్
యోగా కనెక్ట్ 2025: ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ ఇతివృత్తంతో హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్... రేపు న్యూఢిల్లీలో నిర్వహణ
* పాలుపంచుకోనున్న 1,000 మంది... ప్రపంచ వ్యాప్తంగా
వీడియో అనుసంధానం ద్వారా
హాజరవనున్న ప్రధాన అంతర్జాతీయ యోగా సంస్థలు,
వెల్నెస్ కమ్యూనిటీల ప్రతినిధులు
* ‘యోగా ప్రభావ’ ఆవిష్కరణ కూడా రేపే...
ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం
గత పదేళ్లలో ప్రసరించిన ప్రభావంపై
రూపొందించిన అధ్యయన నివేదిక
Posted On:
13 JUN 2025 3:12PM by PIB Hyderabad
‘యోగా కనెక్ట్’ పేరుతో ఒక హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్ను ఈ నెల 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. ఇది పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి (ఐడీవై) ముందస్తుగా చేపడుతున్న ఓ కీలక కార్యక్రమం కానుంది. ఈ శిఖరాగ్ర సదస్సు దేశ విదేశాలకు చెందిన యోగా గురువులను, విధాన రూపకర్తలను, ఆరోగ్య రంగ నిపుణులను, వాణిజ్య రంగ దిగ్గజాలను, పరిశోధకులతో పాటు ప్రజలను ప్రభావితులను చేసే ప్రముఖులను కూడా ఒక చోటుకు తీసుకురానుంది.
ఈ కార్యక్రమానికి యోగా రంగంలో అత్యున్నత పరిశోధన సంస్థ అయిన ‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి’ (సీసీఆర్వైఎన్) సమన్వయాన్ని అందించబోతోంది. ‘యోగా కనెక్ట్’ను హైబ్రిడ్ ఫార్మేట్లో నిర్వహిస్తారు.. అంటే, ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రధాన అంతర్జాతీయ యోగా సంస్థలతో పాటు వెల్నెస్ సముదాయాలకు చెందిన 1,000 మందికి పైగా ప్రతినిధులు స్వయంగా, వీడియో అనుసంధానం ద్వారా పాల్గొంటారు. బహ్రెయిన్, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియాలు సహా అనేక దేశాల నిపుణులు శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగం పంచుకొనే ప్రతి ఒక్క వ్యక్తి యెగా, ఆరోగ్యసంరక్షణ, పరిశోధన, లేదా వెల్నెస్ వంటి తమ తమ రంగాల్లో ప్రముఖులు. వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, భారత్ ప్రతిపాదించిన యోగా ఉద్యమం ప్రపంచంలో ఎంతటి ప్రాధాన్యాన్ని పొందిందో చాటనున్నారు.
‘యోగ ప్రభావ’ ఆవిష్కరణ ఈ శిఖరాగ్ర సదస్సులో ఓ ముఖ్య ఆకర్షణ కాబోతోంది. అంతర్జాతీయ యోగ దినోత్సవం దేశ ప్రజానీకంపై గత పది ఏళ్లలో కలగజేసిన ప్రభావం ఎలా ఉందీ సీసీఆర్వైఎన్ అంచనా వేస్తూ రూపొందించిన ఓ అధ్యయన నివేదికే ఈ ‘యోగ ప్రభావ’. ఈ నివేదిక విద్యారంగ ప్రముఖులకు, పరిశోధకులకు, ప్రజారోగ్య రంగ వృత్తినిపుణులకు ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు. ఎలాగంటే దీనిలో దేశమంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల వ్యాప్తి, ప్రభావశీలత్వం, గొప్ప మార్పులకు కారణమైన యోగా దినోత్సవ ప్రభావం.. ఈ విషయాల గురించి అమూల్య సమాచారాన్ని పొందుపరిచారు.
దీనికి అదనంగా, మూడు కీలక జ్ఞానబోధక సంపుటాలనూ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. అవి:-
• దశాబ్ద కాలంగా యోగా ప్రసరించిన ప్రభావం (ఎలక్ట్రానిక్ మాధ్యమంలో రూపొందించిన పుస్తకం.. ‘ఇ-బుక్’).
• యోగా పరిశోధనకు సంబంధించిన సైన్టోమెట్రిక్ విశ్లేషణను వివరించే నివేదిక.
• భారతీయ వృక్ష వైభవం: భారతదేశంలో మొక్కల ప్రాధాన్యం, వాటి సందర్భ శుద్ధిని ప్రధానంగా ప్రస్తావించే, చిత్రపటాలు కూడా ఉన్న చిన్న పుస్తకం ఇది.
ఈ శిఖరాగ్ర సదస్సులో, వివిధ ఇతివృత్తాలపై కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఆ ఇతివృత్తాలు:-
1. ఒకరి నుంచి మరొకరికి సోకని వ్యాధుల నివారణకు యోగా
2. ఉమ్మడి యోగా ప్రోటోకాల్తో పాటు ఐడీవై కలగజేసిన ప్రభావ అంచనా.. ఈ రెంటిపైనా అధ్యయనాలు
3. యోగా-టెక్: నూతన ఆవిష్కర్తలు దీనిపై తమ నివేదికలు సమర్పిస్తారు
4. అందరూ అనుసరించే యోగా..దీనికి సంబంధించిన దార్శనికత
5. యోగాను అభ్యసిస్తే దాని వల్ల కలిగే ప్రయోజనాలు
6. యోగా-దానితో జీవనంలోని వివిధ దశల్లో మహిళల ఆరోగ్య స్థితి ఎలా ఉండవచ్చు.
7. యోగా తో ముడిపడ్డ వాణిజ్యం - పరిశ్రమ
యోగా రంగంలో లబ్ధప్రతిష్ఠులు అనేకమంది పాల్గొననుండడం ‘యోగా కనెక్ట్’లో ముఖ్య ఆకర్షణ కాబోతోంది. ఆ ప్రముఖులలో.. స్వామి బాబా రాందేవ్జీ, ఆచార్య బాలకృష్ణజీ, హెచ్ఆర్ నగేంద్రజీ, పరమ పవిత్రులు బిఖ్కూ సంఘసేనతో పాటు శ్రీ భరత్ భూషణ్జీ కూడా ఉన్నారు.
రాబోయే కాలంలో యోగా ఏ విధమైన రూపురేఖలను సంతరించుకొంటుందో ఇప్పుడే చాటిచెబుతున్న వ్యక్తులందరినీ ఒక చోటుకు చేర్చే సందర్భమే ‘యోగా కనెక్ట్’ కార్యక్రమం. ఇది భారత్ నాంది పలికిన ప్రపంచవ్యాప్త యోగా ఉద్యమానికి పదేళ్లు పూర్తి కావడాన్ని సూచిస్తుంది. 2014లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించడంతో ప్రపంచం నలు దిశలా యోగా ఉద్యమం మొదలైంది. ప్రపంచానికి భారత్ అందించిన ఒక కానుకే యోగా అని యునెస్కో కూడా గుర్తించింది. ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తూ, భారత్ ఆరోగ్యం, సమతౌల్యం, ఏకతల సందేశాన్ని ప్రపంచదేశాలకు అందిస్తూ వస్తోంది.
***
(Release ID: 2136210)