రక్షణ మంత్రిత్వ శాఖ
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఎన్సీసీ బృందానికి రక్షణ మంత్రి అభినందనలు: ఈ బృందంలో అయిదుగురు అమ్మాయిలు, అయిదుగురు అబ్బాయిలు
ఈ సాహసానికి ప్రశంసగా రూ. 10 లక్షల చెక్ బహుమతి
Posted On:
12 JUN 2025 1:29PM by PIB Hyderabad
నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) పర్వతారోహణ బృందాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఈ రోజు (2025, జూన్ 12) సత్కరించారు. ఈ బృందంలో అయిదుగురు అమ్మాయిలు, అయిదుగురు అబ్బాయిలు ఉన్నారు. వారి సరాసరి వయసు 19 ఏళ్లు. వీరంతా ఎవరెస్ట్ శిఖరాన్ని 2025 మే 18న అధిరోహించారు. కల్నల్ అమిత్ బిష్త్ నాయకత్వంలోని ఈ బృందం ప్రదర్శించిన ధైర్యం, సాహసం, దేశభక్తిని రక్షణ మంత్రి ప్రశంసించారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఎలాంటి గాయాలకు గురవకుండా ఈ సాహసాన్ని పూర్తి చేసుకున్న ఈ బృందానికి రూ. 10 లక్షల చెక్కు బహుకరించారు.
న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో జరిగిన ఈ కార్యక్రమంలో అధిరోహణకు సంబంధించిన అనుభవాలను, కఠినమైన శిక్షణ, పటిష్ఠమైన ప్రణాళిక, ఎదుర్కొన్న సవాళ్లను క్యాడెట్లు వివరించారు. ధైర్యం, క్రమశిక్షణ, నిలకడ, సంకల్పంతో ఈ విజయం సాధించిన బృందాన్ని రక్షణ మంత్రి అభినందించారు.
ఈ క్యాడెట్లు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించడం ద్వారా ఈ దేశ యువత సామర్థ్యాన్ని సాహస క్యాడెట్లు నిరూపించారని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఎవరెస్టును అధిరోహించినప్పుడు వారు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పంతో భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
క్యాడెట్లలో జాతీయ భావాన్ని నింపడం, వారిని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా సన్నద్ధం చేయడం, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో ఎన్సీసీ చేపడుతున్న ప్రయత్నాలను రక్షణ మంత్రి మెచ్చుకున్నారు. ఈ విజయాన్ని సాధించడంలో క్యాడెట్లకు అండగా నిలిచిన వారి కుటుంబ సభ్యులను సైతం ప్రశంసించారు. ఎన్సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎవరెస్టును ఎన్సీసీ అధిరోహించడం ఇది మూడోసారి. గతంలో 2013, 2016లో ఈ పర్వతాన్ని ఎన్సీసీ అధిరోహించింది. ఈ పర్వాతారోహణ బృందంలో 10 మంది క్యాడెట్లు, అధికారులు, జూనియర్ కమిషన్డ్ అధికారులు, శిక్షకులు, నాన్ కమిషన్డ్ అధికారులు ఉన్నారు. భారత సైన్యానికి చెందిన సుబేదార్ మేజర్ బల్కర్ సింగ్ కూడా ఈ బృందంలో సభ్యునిగా ఉన్నారు. ఆయన సైన్యంలో ఎవరెస్టును అధిరోహించిన మొట్టమొదటి సుబేదార్ మేజర్గా నిలిచారు. 16 ఏళ్లున్న క్యాడెట్ ఈ బృందంలో అతి పిన్న వయస్కుడు.
2025, ఏప్రిల్ 3న రక్షణ మంత్రి ఈ అధిరోహణను అధికారికంగా ప్రారంభించారు. ఈ పర్వతారోహణ సమయంలో ప్రతి దశలోనూ సభ్యులు క్షేమంగా ఉండేందుకు భద్రతా నియమాలు, మార్గదర్శకాలకు లోబడి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
***
(Release ID: 2136055)