హోం మంత్రిత్వ శాఖ
సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను వెంటనే అమలు పరుస్తూ 2060 ఇళ్లకు సంబంధించి రూ. 25 కోట్లను కేటాయించిన హోం మంత్రి అమిత్ షా
ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో పాకిస్థాన్ కాల్పుల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారాన్ని అందిస్తామని ఇటీవల ప్రకటించిన ప్రధాని
పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ. 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ. 1 లక్ష చొప్పున అదనపు పరిహారం ఇస్తామన్న ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక ప్రకటనను వెంటనే అమలు చేసిన హోం మంత్రిత్వ శాఖ
పంజాబ్లోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా పరిహారం అందించనున్న ప్రభుత్వం
సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలుస్తోన్న మోదీ ప్రభుత్వం
Posted On:
09 JUN 2025 8:07PM by PIB Hyderabad
సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం ఇస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో 2060 ఇళ్లకు సంబంధించి రూ. 25 కోట్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనంగా కేటాయించింది. దీనితో వెంటనే ఆయా ఇళ్లకు పరిహారం అందనుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో పాకిస్థాన్ దాడుల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం ఇస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.
సరిహద్దు కాల్పులను ప్రత్యేకంగా పరిగణిస్తూ పూర్తిగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి రూ. 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి రూ. 1 లక్ష అదనపు పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేసేలా హోంమంత్రిత్వ శాఖ చూసుకుంటోంది. పంజాబ్ సరిహద్దు ప్రాంతాలలో కూడా ఇలాంటి పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది.
2025 మే 29, 30లలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా పూంచ్ను సందర్శించారు. సరిహద్దు కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆయన కారుణ్య ప్రాతిపదికన చేపట్టిన నియామక పత్రాలను అందజేశారు. నిబంధనల ప్రకారం సరిహద్దు కాల్పుల వల్ల జరిగిన నష్టానికి పరిహారం వెంటనే అందించాలి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని సరిహద్దు జిల్లాల్లో అనేక సరిహద్దు కాల్పుల సంఘటనలు నమోదయ్యాయి. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, గురుద్వారాలు, దేవాలయాలు, మసీదులు, వాణిజ్య సముదాయాలతో సహా మతపరమైన కట్టడాలపై జరిగిన కాల్పుల కారణంగా వందలాది కుటుంబాలు నష్టపోయాయి. జరగబోయే సంఘటనలను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ సమర్థవంతంగా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. సరిహద్దు జిల్లాల నుంచి మొత్తం 3.25 లక్షల మందిని సరక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆహారం, నీరు, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ సదుపాయంతో కూడిన దాదాపు 397 రక్షణ, వసతి కేంద్రాలలో 15,000 మందిని ఉంచారు.
రోగులను చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లేందకు సరిహద్దు జిల్లాలన్నింటిలో కలిపి మొత్తం 394 అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. వీటిలో 62 అంబులెన్సులు కేవలం పూంచ్ జిల్లాలోనే సేవలందించాయి. ఆరోగ్యం, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పశువులు, అవసరమైన సామాగ్రి తదితర విషయాల్లో సేవలందించేందుకు మొత్తం 2818 మంది పౌర రక్షణ స్వచ్ఛంద సేవకులను కూడా నియమించారు.
***
(Release ID: 2135304)