ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్మూ కాశ్మీర్లో జూన్ 6న ప్రధానమంత్రి పర్యటన
• అతి ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెన... ‘చినాబ్’ని ప్రారంభించనున్న ప్రధాని
• భారత్లో మొదటి కేబుల్ ఆధారిత రైల్ వంతెన ‘అంజీ’ని కూడా ప్రారంభించనున్న ప్రధానమంత్రి
• రూ.46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్రాలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతోపాటు కొన్నింటిని జాతికి అంకితమివ్వనున్న ప్రధాని
Posted On:
04 JUN 2025 12:37PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6న) జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంధానానికి పెద్ద పీట వేయాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధాని చినాబ్ వంతెనను ఉదయం 11 గంటలకు ప్రారంభించడమే కాకుండా వంతెనను చూడబోతున్నారు. ఆ తరువాత, ఆయన అంజీ బ్రిడ్జిని సందర్శించడంతో పాటు ఆ వంతెనను కూడా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. అనంతరం, రూ. 46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్రాలో ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతో పాటు వాటిని జాతికి అంకితమిస్తారు.
చినాబ్, అంజీ రైలు వంతెనలు
చినాబ్ రైలు వంతెన నిర్మాణ కళా కౌశలం పరంగా ఒక అద్భుతం. నది నుంచి 359 మీటర్ల ఎగువన ఈ వంతెన ఉంది. ప్రపంచంలో అన్నింటి కంటే ఎత్తయిన రైల్వే ఆర్చి వంతెన ఇదే. 1,315 మీటర్ల పొడవుతో ఉన్న విల్లు ఆకారంలోని ఉండే ఉక్కు వంతెన. భూకంపాలను, గాలులను తట్టుకుని నిలిచేలా తీర్చి దిద్దారు. జమ్మూ శ్రీనగర్ నడుమ అనుసంధానాన్ని పెంచడం కూడా ఈ వంతెన ముఖ్య ఉద్దేశం. ఈ వంతెన మీది నుంచి రాక పోకలు జరిపే వందే భారత్ రైలుకు కట్రా, శ్రీనగర్ల మధ్య ప్రయాణించడానికి కేవలం 3 గంటలు పడుతుంది. దీనితో ప్రస్తుత ప్రయాణ సమయం 2-3 గంటలు తగ్గనుంది.
అంజీ బ్రిడ్జి భారత్లో మొట్టమొదటి కేబుల్-ఆధారిత రైల్ బ్రిడ్జి. ఇది సవాళ్లను విసిరే భూభాగంలో దేశ ప్రజలకు తన సేవలను అందించనుంది.
సంధాన ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు
ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పొడవు 272 కి.మీ. దీనిని 119 కి.మీ. మేర విస్తరించిన 36 సొరంగాలతోను, 943 వంతెనలతోను నిర్మించారు. ఈ ప్రాజెక్టు కాశ్మీర్ లోయకు, దేశంలో ఇతర ప్రాంతాలకు నడుమ విస్తృతమైన, నిరంతరాయమైన రైలు సంధానాన్ని ఏర్పరుస్తుంది. ప్రాంతీయ రాకపోకల రూపురేఖలను మార్చడంతో పాటుగా సామాజిక, ఆర్థిక ఏకీకరణకు ప్రోత్సాహాన్ని అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా నుంచి శ్రీనగర్కు వెళ్లి, తిరిగి శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా కు వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రెండింటిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు స్థానికులు, పర్యాటకులు, తీర్థయాత్రికులతో పాటు ఇతరులకు వేగవంతమైన, ఉల్లాసాన్నీ కలిగించే నమ్మకమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి.
ఆఖరు స్టేషన్ వరకు సంధానాన్ని ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాల్లో సంధాన సదుపాయాలకు ఒక ప్రధాన ఊతాన్నివ్వడంలో భాగంగా, ప్రధానమంత్రి వివిధ రహదారి పథకాలకు శంకుస్థాపన చేయడంతో పాటుగా ఆ పథకాలను ప్రారంభించనున్నారు. వీటిలో రూ.1,952 కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టే జాతీయ రహదారి-701లో రాఫియాబాద్ నుంచి కుప్వాడా వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకూ, జాతీయ రహదారి-444లో శోపియా బైపాస్ రోడ్డు నిర్మాణానికీ ఆయన శంకుస్థాపన చేస్తారు. జాతీయ రహదారి-44లో రెండు ఫ్లయ్ఓవర్ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. వీటిని శ్రీనగర్లో గల జాతీయ రహదారి-1లోని సంగ్రామ జంక్షన్లోనూ, జాతీయ రహదారి-44లో బెమినా జంక్షన్లోనూ నిర్మించారు. ఈ ప్రాజెక్టులు వాహనాల రాకపోకల రద్దీని తగ్గించడమే కాక నిత్యం ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగించడంలో తోడ్పడనున్నాయి.
రూ.350 కోట్లకు పైగా ఖర్చుతో కట్రాలో నిర్మించబోయే శ్రీ మాతా వైష్ణో దేవి మీడియా ఎక్స్లెన్స్ ఇనిస్టిట్యూట్కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇది రియాసీ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి వైద్య కళాశాల. దీనిద్వారా ఆరోగ్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాల వ్యవస్థను చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరచనుంది.
***
(Release ID: 2133997)
Read this release in:
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam