ఆయుష్
డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సంప్రదాయక వైద్య వ్యూహానికి కట్టుబడి ఉంటాం 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో నిబద్ధత పునరుద్ఘాటించిన భారత్
Posted On:
27 MAY 2025 3:39PM by PIB Hyderabad
‘‘ఆరోగ్యసంరక్షణ విషయంలో ఒకే ప్రపంచం’’ ఇతివృత్తంతో జెనీవాలో 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీని (డబ్ల్యూహెచ్ఏ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ పాల్గొంది. స్వాస్థ్య సంరక్షణకు ఉద్దేశించిన సమగ్ర విధానంలో భాగంగా సాంప్రదాయక వైద్య వ్యవస్థలను బలపరచడానికి తన బలమైన కట్టుబాటును కొనసాగించనున్నట్లు పునరుద్ఘాటించింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి శ్రీ అరిందమ్ బాగ్చీ భారత్ పక్షాన మాట్లాడుతూ... 2025–2034 మధ్య కాలానికి నూతన డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సాంప్రదాయక వైద్య వ్యూహం ఆమోదం లభించడాన్ని స్వాగతించారు. నిరూపణ ఆధారిత సాంప్రదాయక పద్ధతులకు జాతీయ, ప్రపంచ ఆరోగ్య విధానాల్లో స్థానం కల్పించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న విధానం ఇతర దేశాలకు ఆచరణీయ నమూనా కాగలదని కార్యక్రమంలో చెప్పారు. ఆధునిక వైద్యానికి తోడు, వైజ్ఞానికంగా చెల్లుబాటు అవుతూ ఉన్న ఆయర్వేద, యోగా, యూనానీ, సిద్ధ వంటి సాంప్రదాయక వైద్య వ్యవస్థలను ఆదరించే విధానాన్ని భారత్ అవలంబిస్తోంది. ఇదివరకు రూపొందించిన డబ్ల్యూహెచ్ఓ సాంప్రదాయక వైద్య వ్యూహం (టీఎం స్ట్రాటజీ 2014–2023)ను ఆచరించడంలో భారత్ బలమైన నాయకత్వాన్ని కనబరచిందని శ్రీ బాగ్చీ చెప్పారు. దీనికి తరువాయిగా తీసుకు వచ్చే విధానానికి మద్దతునిస్తామని ఆయన అన్నారు.
గుజరాత్లోని జామ్నగర్లో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సాంప్రదాయక వైద్య కేంద్రం (జీటీఎంసీ)ని ఏర్పాటు చేయడం ప్రపంచ సాంప్రదాయక వైద్య (టీఎం) అనుబంధ విస్తారిత వ్యవస్థకు భారత్ అందించిన ముఖ్య తోడ్పాటును ప్రతిబింబించింది. భారత ప్రభుత్వం అండదండలతో 2022లో ప్రారంభించిన ఈ కేంద్రాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్తో కలిసి ప్రారంభించారు. ఈ తరహా సంస్థల్లో ఈ కేంద్రమే మొట్టమొదటిది. ఇది సమాచార విశ్లేషణ, విధానపరమైన మద్దతు, ప్రమాణాల నిర్దేశం, పరిశోధన పూర్వక సహకారం అంశాల్లో కీలక పాత్రను పోషిస్తోంది.
ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ (ఐసీహెచ్ఐ)లో భాగంగా ఒక ప్రత్యేక సాంప్రదాయక వైద్య మాడ్యూల్కు సంబంధించిన పనులను మొదలుపెట్టడానికి డబ్ల్యూహెచ్ఓకు, ఆయుష్ మంత్రిత్వ శాఖకు మధ్య ఒక డోనార్ అగ్రిమెంటు కుదరడం ఈ సంవత్సరం చోటు చేసుకున్న ఒక ప్రధాన ఘట్టం. ఈ సరికొత్త అధ్యాయాన్ని ప్రధాని శ్రీ మోదీ తన ‘మన్ కీ బాత్ ’ ప్రసంగంలో ప్రశంసిస్తూ, ఇది ఆయుష్ వైద్య చికిత్స పద్ధతులు ఒక శాస్త్రీయమైన, ప్రామాణీకృత విధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణకు నోచుకోవడానికి వీలు కల్పించగలదన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ, ‘‘ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయక వైద్యం ఏకీకరణ చెందే ప్రక్రియలో తన వంతుగా తోడ్పాటును అందిస్తుండడం భారత్కు గర్వంగా ఉంది. వైజ్ఞానిక విశ్వసనీయతను పెంచి, ఆయుష్ పద్ధతులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడానికి మార్గాన్ని ఐసీహెచ్ఐ మాడ్యూల్ సుగమం చేస్తుంది. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగిపోయే, సురక్షిత, నిరూపణ ఆధారిత సాంప్రదాయక ఆరోగ్యసంరక్షణ దిశగా డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అన్నారు.
డబ్ల్యూహెచ్ఓ జారీ చేసిన వార్తా ప్రకటనలో పేర్కొన్న ప్రకారం- నియంత్రణను పెంచడానికి, సముచిత సందర్భాల్లో సాంప్రదాయక వైద్య సేవలను ఏకీకరించడానికి, దేశీయ జ్ఞానాన్ని పరిరక్షించడానికి, పర్యావరణ సుస్థిరత్వం కోసం పాటుపడడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి సభ్య దేశాలకు డబ్ల్యూహెచ్ఓ నూతన వ్యూహం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. భారత్ అమలుచేస్తున్న కార్యక్రమాలు ఈ సిద్ధాంతాలతో తులతూగుతున్నాయి. ఇది ప్రపంచ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సాంప్రదాయక వైద్యాన్ని విస్తరించడంలో ఇండియా నిబద్ధత కలిగిన భాగస్వామి పాత్రను పోషిస్తోందని చాటిచెబుతోంది.
అందరికీ ఆరోగ్య సేవలను కల్పించాలనే లక్ష్యంతో పాటు, స్థిరాభివృద్ధి లక్ష్యాలను కూడా సాధించడానికి సాంప్రదాయక వైద్య సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో డబ్ల్యూహెచ్ఓకు, ఆ సంస్థ సభ్య దేశాలకు మద్దతును అందించేందుకు భారత్ ఎప్పటి మాదిరిగానే కట్టుబడి ఉంటుంది.
***
(Release ID: 2131765)