కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సైబర్ మోసాల నివారణను బలోపేతం చేసేందుకు ‘‘ఆర్థిక మోసాల ప్రమాద సూచిక (ఎఫ్ఆర్ఐ)’’ను ప్రవేశపెట్టిన డీవోటీ
బ్యాంకులు, యూపీఐ సర్వీసు ప్రొవైడర్లు, ఆర్థిక సంస్థలతో సమాచారాన్ని పంచుకొనేందుకు వీలు కల్పించే ఎఫ్ఆర్ఐ
ఈ టూల్తో గుర్తించిన మొబైల్ నంబర్లకు డిజిటల్ చెల్లింపులు చేయడానికి ప్రయత్నించినప్పుడు హెచ్చరిస్తుంది, సైబర్ భద్రతను, ధ్రువీకరణ తనిఖీలను పెంపొందిస్తుంది
టెలికం, ఆర్థిక రంగాల్లో అనుమానిత మోసాలను గుర్తించి, వేగంగా, సంయుక్తంగా చర్యలు చేపట్టే అవకాశాన్ని ఎఫ్ఆర్ఐ ఇస్తుంది
దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల విధానానికి అత్యంత ప్రజాదరణ ఉంది, కాబట్టి కొత్తగా ప్రవేశపెట్టిన విధానం లక్షల మంది పౌరులను సైబర్ మోసాల బారిన పడకుండా కాపాడుతుంది
Posted On:
21 MAY 2025 4:38PM by PIB Hyderabad
సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలను ఎదుర్కొనే దిశగా ‘‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ)ను సంబంధిత వర్గాలతో పంచుకొంటున్నట్లు టెలికమ్యూనికేషన్ల విభాగం (డీవోటీ) ప్రకటించింది. సైబర్ మోసాల బారి నుంచి తమను తాము రక్షించుకొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఆర్థిక సంస్థలకు భరోసా ఇచ్చేందుకు డిజిటల్ ఇంటిలిజెన్స్ ప్లాట్ఫాం (డీఐపీ)లో భాగంగా ఎఫ్ఆర్ఐను రూపొందించారు. ఇది సైబర్ భద్రతను మెరుగుపరుస్తుంది. అలాగే ఈ టూల్తో గుర్తించిన మొబైల్ నంబర్లకు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు ప్రయత్నించినప్పుడు హెచ్చరిస్తుంది. తద్వారా సైబర్ భద్రతను, ధ్రువీకరణ తనిఖీలను పెంపొందిస్తుంది
‘‘ఆర్థిక మోసాల ప్రమాద సూచిక’’ అంటే ఏంటి?
ఇది ఆర్థిక మోసాల విషయంలో ఒక మొబైల్ నంబర్ మధ్యస్థ, ఎక్కువ లేదా అత్యంత ఎక్కువ ప్రమాదంతో సంబంధం కలిగి ఉందని వర్గీకరించే మోసం ఆధారిత స్కేలు. ఈ వర్గీకరణ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీలు), నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ), టెలికమ్యూనికేషన్ల విభాగానికి చెందిన చక్షు ఫ్లాట్ఫాం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సహా సంబంత వర్గాలు పంచుకున్న సమాచారం ఆధారంగా ఉంటుంది. ఏదైనా మొబైల్ నంబర్ అత్యంత ప్రమాదకరమని భావిస్తే తీసుకోవాల్సిన చర్యల అమలుకు ప్రాధాన్యమివ్వడానికి, వినియోగదారుల కోసం అదనపు రక్షణ చర్యలు చేపట్టడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు తదితర సంస్థలకు అధికారం కల్పిస్తుంది.
ముందస్తు నోటిఫికేషన్ ఎలా సాయపడుతుంది?
సైబర్ నేరాలకు పాల్పడటం, పున:ధ్రువీకరణలో విఫలమవడం, నిర్దేశించిన పరిమితిని దాటడం సహా ఇతర కారణాల వల్ల సేవలు నిలిపివేసిన మొబైల్ నంబర్ల జాబితాను (మొబైల్ నంబర్ రీవోకేషన్ లిస్ట్ – ఎంఎన్ఆర్ఎల్) డీవోటీకి చెందిన డిజిటల్ ఇంటిలిజెన్స్ యూనిట్ (డీఐయూ) క్రమం తప్పకుండా సంబంధిత వర్గాలతో పంచుకుంటుంది. సాధారణంగా ఈ నంబర్లను ఆర్థిక మోసాల కోసం వినియోగిస్తారు.
సాధారణంగా సైబర్ మోసాలకు దుర్వినియోగం చేసే మొబైల్ నంబర్ల జీవితకాలం చాలా తక్కువ రోజులే ఉంటుంది. వీటిని పూర్తి స్థాయిలో ధ్రువీకరించడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నంబర్లతో సంబంధం ఉన్న ప్రమాదాన్ని ముందే గుర్తించడంలో తోడ్పడుతుంది. అంటే, అనుమానిత మొబైల్ నంబర్ను ఆర్థిక సంస్థలు గుర్తించినప్పుడు దానిని వివిధ కోణాల్లో విశ్లేషిస్తారు. అనంతరం మధ్యస్థ, ఎక్కువ, అత్యంత ఎక్కువ స్థాయి ఆర్థిక ముప్పును కలిగి ఉన్నదానిగా వర్గీకరిస్తారు. ఆ తర్వాత డీఐపీ ద్వారా ఈ నంబర్కు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే తెలియజేస్తారు.
ఎఫ్ఆర్ఐను మొదటగా స్వీకరించిన వాటిలో ఒకటైన ఫోన్ పే సంస్థ అత్యంత ఎక్కువ ముప్పు కలిగిన ఎఫ్ఆర్ఐ నెంబర్లకు లావాదేవీలను తిరస్కరించడానికి... ఫోన్పే ప్రొటెక్ట్ ఫీచర్లో భాగంగా స్క్రీన్పై హెచ్చరిక సందేశాన్ని చూపిస్తుంది. ఫోన్ పే పంచుకున్న డేటా ప్రకారం చిన్న సంకేతం ఆధారంగా గుర్తించిన ఫోన్ నంబర్లకు సైబర్ మోసాల కేసులతో సంబంధం ఉండే అవకాశం ఎక్కువని తేలింది. ఇది ఎఫ్ఆర్ఐ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మధ్యస్థ స్థాయి ఎఫ్ఆర్ఐ నంబర్లకు లావాదేవీలు జరుపుతున్నప్పుడు వినియోగదారునికి ముందు జాగ్రత్తగా హెచ్చరిక సందేశాన్ని డిస్ప్లే చేసే దిశగా ఫోన్పె చర్యలు తీసుకుంటోంది.
ఆర్థిక మోసాలను తగ్గించడానికి ఇతర రంగాల భాగస్వామ్యం
యూపీఐ లావాదేవీల్లో 90 శాతం వాటా ఉన్న ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి ప్రముఖ యూపీఐ వేదికలు డీఐపీ హెచ్చరికలను వాటి వ్యవస్థలతో అనుసంధానించడం ప్రారంభించాయి. ఉదాహరణకు:
· ఒక ప్రముఖ యూపీఐ ఫ్లాట్ఫాం లావాదేవీల్లో జాప్యాన్ని, వినియోగదారుల ధ్రువీకరణతో పాటు, హెచ్చరిక సందేశాలను ప్రవేశపెట్టింది.
· సైబర్ మోసాలను తగ్గించేందుకు ఇతర బ్యాంకులు సైతం ఈ సమాచారాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపుల విధానం యూపీఐ. కాబట్టి కొత్తగా ప్రవేశపెట్టిన విధానం లక్షల మంది పౌరులను సైబర్ మోసాల బారిన పడకుండా కాపాడుతుంది. టెలికం, ఆర్థిక రంగాల్లో అనుమానిత మోసాలను గుర్తించి, వేగంగా, సంయుక్తంగా చర్యలు చేపట్టే అవకాశాన్ని ఎఫ్ఆర్ఐ ఇస్తుంది.
టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు జాతీయ స్థాయిలో సాంకేతికత ఆధారితన పరిష్కారాలను అమలు చేయడం, సంబంధింత వర్గాలతో కలసి డీవోటీ పనిచేస్తుంది. తద్వారా సురక్షితమైన టెలికాం వ్యవస్థను పౌరులకు అందిస్తుంది. హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడానికి, ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడానికి ఆర్థిక సంస్థలు, డిజిటల్ చెల్లింపు వేదికలతో కలసి డీవోటీ పనిచేస్తుంది. వినియోగదారుల వ్యవస్థల్లో ఎఫ్ఆర్ఐ ఏకీకరణ ఒక పారిశ్రామిక ప్రామాణికంగా మారుతుంది. అలాగే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాగత స్థిరత్వాన్ని తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు.
<><><>
మరిన్ని వివరాలకు డీవోటీ సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించండి:
(Release ID: 2130425)