రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ ఒలీవియా: ఒడిశా సముద్ర తీరంలో 6.98 లక్షలకు పైగా ఆలివ్ రిడ్లే తాబేళ్లను రక్షించిన ఐసీజీ
Posted On:
19 MAY 2025 1:07PM by PIB Hyderabad
సముద్ర జీవజాల పరిరక్షణలో భాగంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఒలీవియా’ వార్షిక కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒడిశాలోని రుషికుల్య నదీ ముఖ ద్వారం వద్ద 6.98 లక్షలకు పైగా ఆలివ్ రిడ్లే తాబేళ్లను భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) కాపాడింది. ప్రతి ఏడాది నవంబర్ నుంచి మే వరకు ఆపరేషన్ ఒలీవియాను ఐసీజీ నిర్వహిస్తుంది. గహిర్మాత బీచ్తో సహా ఒడిశాలోని ఇతర సముద్ర తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాలను కల్పించడమే ఈ ఆపరేషన్ ఒలీవియా లక్ష్యం. ఏటా ఇక్కడకి 8 లక్షలకు పైగా తాబేళ్లు వలస వస్తాయి. ఒడిశాలోని రుషికుల్య నదీ ముఖద్వారం వద్ద పెద్ద సంఖ్యలో గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు రావడం ఐసీజీ చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనం. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం, ఏరియల్ నిఘా, సామాజిక తోడ్పాటుతో అంతరించిపోతున్న జాతులను పరిరక్షించేందుకు ఐసీజీ కృషి చేస్తోంది.
ఆపరేషన్ ఒలీవియా ప్రారంభించినప్పటి నుంచి 5,387 ఉపరితల గస్తీ, 1,768 వైమానిక గస్తీ కార్యక్రమాలను ఐసీజీ చేపట్టింది. తద్వారా అక్రమంగా చేపలు పట్టడం, తాబేళ్ల ఆవాసాలను నాశనం చేయడం లాంటి ముప్పులు తగ్గాయి. ఈ సమయంలో అక్రమంగా చేపలు పట్టేందుకు వినియోగించిన 366 బోట్లను స్వాధీనం చేసుకుంది. ఇది సముద్ర జీవులను రక్షించడంలో ఐసీజీకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. నిఘాతో పాటుగా స్థానిక మత్స్యకారులను టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజ్లను ఉపయోగించేలా ఐసీజీ ప్రోత్సహించింది. సుస్థిర చేపల వేట పద్ధతులను అనుసరించేందుకు, జీవ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఎన్జీవోలతో అధికారికంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
***
(Release ID: 2129602)