రక్షణ మంత్రిత్వ శాఖ
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటం ఇప్పుడు రక్షణ సిద్ధాంతంలో భాగం, ఈ ద్విముఖ, పరోక్ష యుద్ధాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: భుజ్ వైమానిక స్థావరంలో రక్షణ మంత్రి
* ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మిస్తున్న పాకిస్థాన్కు ఆర్థిక సాయం అందించడాన్ని పునఃపరిశీలించాలని ఐఎంఫ్కు శ్రీ రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి
* ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదు... మనం చేపట్టిన చర్యలు ట్రైలర్ మాత్రమే.. అవసరమైతే సినిమా చూపిస్తాం: రక్షణమంత్రి
* ‘‘ప్రస్తుత కాల్పుల విరమణ పాకిస్థాన్కు పరీక్ష, ఆ దేశ ప్రవర్తనను భారత్ పరిశీలిస్తోంది’’
* ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐఏఎఫ్ విరుచుకుపడింది... ఆధిపత్యాన్ని సాధించడమే కాకుండా వాళ్లను మట్టికరిపించింది
Posted On:
16 MAY 2025 2:06PM by PIB Hyderabad
గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరం వద్ద వాయుసేన సిబ్బందిని ఉద్దేశించి ఈ రోజు(2025, మే 16) రక్షణమంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటం భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇప్పుడు అది రక్షణ సిద్ధాంతంలో భాగం. ఈ ద్విముఖ, పరోక్ష యుద్ధాన్ని కూకటివేళ్లతో సహా పెకలిస్తాం’’ అని రక్షణ మంత్రి అన్నారు. ప్రస్తుత కాల్పుల విరమణ పాకిస్థాన్కు పరీక్ష అని, ఆ దేశ ప్రవర్తనను భారత్ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ప్రవర్తన మెరుగుపడితే మంచిదే.. కానీ ఏదైనా అవాంతరాలు సృష్టిస్తే మాత్రం కఠినమైన శిక్ష విధిస్తామని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ‘‘మేం చేపట్టిన చర్యలు ట్రైలర్ మాత్రమే. అవసరమైతే సినిమా మొత్తం చూపిస్తాం. ‘ఉగ్రవాదంపై దాడి చేసి, తరిమికొట్టడం’ ఇదే నవ భారత్ అనుసరిస్తున్న నూతన విధానం’’ అని ఆయన అన్నారు.
భారత్ నాశనం చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పాకిస్థాన్ పునర్నిర్మిస్తోందని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇస్లామాబాద్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అందించిన బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని పునఃపరిశీలించాలని, భవిష్యత్తులో ఎలాంటి సాయం అందించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో సుమారుగా 14 కోట్ల రూపాయలను జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూద్ అజార్కు పాకిస్థాన్ ఇస్తోంది. అతడిని ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా గుర్తించింది. పాకిస్థాన్ ప్రభుత్వం మురిద్కే, బహావల్పూర్లో లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థల మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించింది. ఐఎంఎఫ్ అందించిన ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంలో పెద్ద మొత్తాన్ని ఉగ్రవాద మౌలిక వసతులను మెరుగుపరిచేందుకే పాకిస్థాన్ ఉపయోగిస్తుంది. దీనిని ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థ ఉగ్రవాదానికి అందిస్తున్న పరోక్ష సాయంగా పరిగణించాలా? పాకిస్థాన్కు అందించే ఏ సాయమైనా అది ఉగ్రవాదులకు నిధులు అందించడం లాంటిదే. భారత్ అందిస్తున్న నిధులను ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా పాకిస్థాన్ లేదా మరే దేశంలోనైనా ఉగ్ర మౌలికసదుపాయాల కల్పనకు ఐఎంఎఫ్ ఉపయోగించకూడదు’’ అని అన్నారు.
ప్రపంచమంతా ప్రశంసించిన ఆపరేషన్ సిందూర్లో భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) పోషించిన పాత్రను రక్షణ మంత్రి మెచ్చుకున్నారు. కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన వాయుసేన సిబ్బందిని ప్రశంసించారు. ‘‘శత్రు భూభాగంపై క్షిపణులను ప్రయోగించినప్పుడు భారత పరాక్రమాన్ని, శక్తిని ఈ ప్రపంచం చూసింది’’ అని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ పోరాటాన్ని ఐఏఎఫ్ ముందుండి నడిపించింది. ఈ పోరాటంలో శత్రువుపై ఆధిపత్యం చెలాయించి భారీ నష్టాన్ని కలిగించింది.
దేశ సరిహద్దులు దాటకుండానే.. పాకిస్థాన్లోని ఏ ప్రాంతంలోనైనా దాడి చేయగల భారత యుద్ధ విమానాల సామర్థ్యాన్ని శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ‘‘పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను, వైమానిక స్థావరాలను ఐఏఎఫ్ ఎలా ధ్వంసం చేసిందో ప్రపంచమంతా చూసింది. భారత్ యుద్ద విధానం, సాంకేతికత మారిపోయాయని ఐఏఎఫ్ రుజువు చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలపై నవ భారత్ ఆధారపడలేదని, మేడ్ ఇన్ ఇండియా పరికరాలు సైనిక సంపత్తిలో భాగమనే సందేశాన్ని చాటి చెప్పింది. భారత్లో తయారైన ఆయుధాలకు తిరుగులేదు’’ అని పేర్కొన్నారు.
బ్రహ్మోస్ క్షిపణి శక్తిని పాకిస్థాన్ సైతం అంగీకరించిందని రక్షణ మంత్రి అన్నారు. ఈ మేడిన్ ఇండియా క్షిపణి పాకిస్థాన్ గగనతలపు చీకటిని పగలుగా మార్చిందని చమత్కరించారు. అలాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రశంసించారు. డీఆర్డీవో రూపొందించిన ఆకాశ్ సహా ఇతర రాడార్ వ్యవస్థలు కీలకపాత్ర పోషించాయని చెప్పారు.
నిన్న శ్రీనగర్లోని బాదామీ బాఘ్ కంటోన్మెంట్ ఆర్మీతో, ఈ రోజు భుజ్లో వాయుసేనకు చెందిన సైనికులతో ముచ్చటిస్తూ.. భారత దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని భరోసా వ్యక్తం చేశారు. ‘‘రెండు విభాగాలకు చెందిన సైనికుల్లోనూ ఉత్సాహం, దేశభక్తిని నేను చూశాను. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైనికులు చేసిన సాహసం దేశం మొత్తాన్ని గర్వంతో నింపేసింది’’ అని అన్నారు.
పాకిస్థాన్పై 1965, 1971తోపాటు తాజాగా భారత్ సాధించిన విజయాలకు భుజ్ సాక్షిగా నిలిచిందని రక్షణమంత్రి తెలిపారు. జాతి ప్రయోజనాలను కాపాడాలనే అంచంచలమైన సంకల్పంతో సైనికులు దృఢంగా నిలబడే... దేశభక్తి నిండిన భూమిగా భుజ్ను ఆయన వర్ణించారు. వాయుసేనతో పాటు సైన్యం, బీఎస్ఎఫ్కు చెందిన సైనికులు మాతృభూమికి అందిస్తున్న సేవలకు కృతజ్ఞత వ్యక్తం చేశారు.
సాయుధ దళాలను అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో నిరంతరం సన్నద్ధం చేయాలనే ప్రభుత్వం అంకితభావాన్ని శ్రీ రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. శక్తిమంతమైన దేశం తన సైన్యాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, వనరులు, సాంకేతికతతో సహా అన్ని రకాలుగా అవసరమైన మద్దతు అందిస్తుందని తెలిపారు. గతంలో భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడేదని, ఇప్పుడు ఆయుధ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు, క్షిపణి రక్షక వ్యవస్థలు, డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లను దేశీయంగా తయారు చేసుకుంటోందన్నారు. ‘‘దిగుమతిదారులమన్న ఆలోచన నుంచి ఎగుమతిదారులుగా మనం మారుతున్నాం. ఇది ఆరంభం మాత్రమే’’ అని చెప్పారు.
ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంపై భారత్ పౌరులు, ప్రభుత్వం, సాయుధ దళాలు, ఇతర భద్రతా సంస్థలు అర్థం చేసుకొని ఐక్యతను ప్రదర్శించారని, ప్రతి పౌరుడూ సైనికుడిలా వ్యవహరించారని తెలిపారు. సైన్యానికి అడుగడుగునా ప్రజలు, ప్రభుత్వం తోడ్పాటు అందిస్తాయని అన్నారు. ‘‘మన దేశ సౌర్వభౌమత్వంపై దాడి చేసేందుకు ఎవరూ సాహసించలేని విధంగా, మనమంతా కలసి ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేద్దాం’’ అని అన్నారు.
పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు, ఆపరేషన్ సిందూర్లో ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పిస్తూ రక్షణమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వాయుసేన ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఇతర ఐఏఎఫ్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2129305)