హోం మంత్రిత్వ శాఖ
'నక్సల్ రహిత భారత్' సంకల్పంలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భద్రతా దళాలు
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల కొండ (కెజిహెచ్) వద్ద నక్సలిజంపై నిర్వహించిన
అతిపెద్ద ఆపరేషన్లో 31 మంది నక్సలైట్లు హతం
నాడు ఎర్ర జెండాల పాలనలో ఉన్న కర్రెగుట్టల కొండల్లో
ఇప్పుడు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది: కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, నక్సలిజాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించాలని నిశ్చయించుకున్నాం
2026, మార్చి 31 నాటికి నక్సల్ రహిత భారత్ సాకారం అవుతుంది
కేవలం 21 రోజుల్లోనే ఈ అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ను పూర్తి చేసిన మన భద్రతా బలగాలు
భద్రతా బలగాలకు ఎటువంటి ప్రాణనష్టం లేకుండా పూర్తయిన ఆపరేషన్
కఠినమైన వాతావరణం.. కష్టతరమైన కొండ ప్రాంతాల్లోనూ ధైర్యంగా, శౌర్యంతో నక్సలైట్లను ఎదుర్కొన్న మన సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ సిబ్బందికి అభినందనలు
యావత్ దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది
వివిధ రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయానికి.. మోదీ ప్రభుత్వ సమగ్ర విధానానికి
ఈ ఆపరేషన్ అద్భుత ఉదాహరణ
కేజీహెచ్లోని అత్యంత క్లిష్ట పరిస్థితులు.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల్లోనూ సైనికులు మనోధైర్యం కోల్పో
Posted On:
14 MAY 2025 8:11PM by PIB Hyderabad
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల కొండల్లో (కెజిహెచ్) నక్సలిజంపై జరిగిన అతిపెద్ద ఆపరేషన్లో భద్రతా దళాలు 31 మంది నక్సలైట్లను హతమార్చి, 'నక్సల్ రహిత భారత్' సంకల్పంలో చారిత్రాత్మక విజయాన్ని సాధించాయి.
కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ద్వారా ఈ విధంగా స్పందించారు. ఒకనాడు ఎర్రజెండాల నీడలో నక్సల్స్ పాలించిన కర్రెగుట్టల కొండల్లో ఇప్పుడు సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నామన్నారు. కర్రెగుట్టల కొండ పీఎల్జీఏ బెటాలియన్ 1, డీకేఎస్జెడ్సీ, టీఎస్సీ, సీఆర్సీ వంటి ప్రధాన నక్సల్ వర్గాల ఉమ్మడి ప్రధాన కార్యస్థానంగా ఉంది. నక్సల్ శిక్షణ, అలాగే వ్యూహరచన, ఆయుధాల సమీకరణకు ఇది కేంద్రంగా ఉండేదని హోం మంత్రి పేర్కొన్నారు. మన భద్రతా దళాలు ఈ అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ను కేవలం 21 రోజుల్లోనే పూర్తి చేశాయనీ, ఈ ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కఠినమైన వాతావరణం.. సవాళ్లతో కూడిన కొండ ప్రాంతంలో నక్సలైట్లను ధైర్యంగా ఎదుర్కొన్న సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ సిబ్బందికి అభినందనలు తెలిపిన హోం మంత్రి.. యావత్ దేశం వారిని చూసి గర్వపడుతోందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, నక్సలిజాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించాలని దృఢంగా నిశ్చయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. 2026, మార్చి 31 నాటికి భారత్ నక్సలైట్ల రహితంగా మారుతుందని ఆయన దేశ పౌరులకు హామీ ఇచ్చారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ శ్రీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఛత్తీస్గఢ్ పోలీస్ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్గఢ్ ఏడీజీ (యాంటీ-నక్సల్ ఆపరేషన్స్) శ్రీ అరుణ్ దేవ్ గౌతమ్లు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఆపరేషన్ గురించిన వివరాలను తెలియజేశారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని నక్సలైట్లకు దుర్భేద్యమైన కోటగా ఉన్న కర్రెగుట్టలు కొండ (కేజీహెచ్)లో 21 రోజుల పాటు జరిగిన 21 ఎన్కౌంటర్ల తర్వాత- ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్లు) 16 మంది మహిళా నక్సలైట్లతో సహా మొత్తం 31 మంది నక్సలైట్ల మృతదేహాలను, 35 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటి వరకు, 28 మంది నక్సలైట్లను గుర్తించారు. వారిపై మొత్తం రూ. 1 కోటి 72 లక్షల రివార్డులు ఉన్నాయి. ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు జరిగిన ఈ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా, ఎన్కౌంటర్ స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాలు నిషేధిత, చట్టవిరుద్ధమైన, అత్యంత శక్తిమంతమైన సాయుధ నక్సల్ సంస్థ పీఎల్జీఏ బెటాలియన్, సీఆర్సీ కంపెనీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ కేడర్లకు చెందిన నక్సల్స్వి కావచ్చని భావిస్తున్నారు.
పీఎల్జీఏ బెటాలియన్, సీఆర్సీ కంపెనీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలకు బలమైన స్థావరాలుగా ఉన్న సుక్మా, బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలు అనేక మంది అగ్రశ్రేణి క్యాడర్లకు నిలయంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో, సవాలుతో కూడిన పరిస్థితుల్లో, భద్రతా దళాలు అనేక కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశాయి. దీంతో వారికి ఈ ప్రాంతంపై పట్టు లభించింది. ఫలితంగా, నక్సలైట్లు ఒక ఉమ్మడి కమాండ్ను ఏర్పాటు చేసి, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు సరిహద్దులోని అత్యంత సురక్షితంగా పరిగణించే కర్రెగుట్టల కొండ (కేజీహెచ్)లో ఆశ్రయం పొందారు. కేజీహెచ్ దాదాపు 60 కిలోమీటర్ల పొడవు.. 5 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు కలిగి, చాలా కఠినమైన, సవాలుతో కూడిన భూభాగం గల అత్యంత క్లిష్టమైన కొండ ప్రాంతం. గత రెండున్నరేళ్లుగా, నక్సలైట్లు ఈ ప్రాంతంలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పీఎల్జీఏ బెటాలియన్ సాంకేతిక విభాగం (టీడీ యూనిట్) సహా, ఇతర ముఖ్యమైన సంస్థలకు చెందిన దాదాపు 300-350 మంది సాయుధ నక్సలైట్లు ఆశ్రయం పొందారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సమగ్రమైన, సమన్వయంతో కూడిన ప్రణాళికను రూపొందించి ఏప్రిల్ 21న పెద్ద ఎత్తున ఉమ్మడిగా దాడులు ప్రారంభించాయి.
కేజీహెచ్లో జరిగిన ఈ ఆపరేషన్లో, వివిధ నిఘా సంస్థల నుంచి వచ్చిన సాంకేతిక, నిఘా బృందాల, క్షేత్ర స్థాయి సమాచారాన్ని సేకరించి, దానిని సంగ్రహించడం, విశ్లేషించడం కోసం బహుళ-ఏజెన్సీలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సేకరించిన నిఘా సమాచారాన్ని ఉపయోగించి, మోహరించిన దళాల బలాన్ని నిర్ణయించడం, నిరంతర సమీకరణను షెడ్యూల్ చేయడం, అలాగే సకాలంలో పోలీసు దళాలను మార్చడం వంటి ఖచ్చితమైన ఆపరేషన్ ప్రణాళికను బృందం అమలు చేసింది. నిఘా సమాచారాన్ని నిరంతరం విశ్లేషించి, ఫీల్డ్ కమాండర్లకు సరైన సమయంలో సమాచారం అందేలా చేశారు. ఇది నక్సలైట్లకు సహాయం చేసే వారిని, వారి రహస్య స్థావరాలను, ఆయుధ నిల్వలను గుర్తించడంలో భద్రతా దళాలకు ఎంతగానో సహాయపడింది. అనేక సందర్భాలలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ పరికరాల (ఐఈడీలు) నుంచి ప్రాణనష్టాన్ని నివారించడంలో కూడా ఈ సమాచారం సహాయపడింది. ఈ నిఘా ఆధారంగా, భద్రతా దళాలు గణనీయ సంఖ్యలో ఐఈడీలు, బీజీఎల్ షెల్స్, ఇతర పేలుడు పదార్థాలను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన వాటిలో అతిపెద్ద, అత్యంత సమగ్రమైన, సమన్వయంతో కూడిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్గా ఇది నిలుస్తుంది. ఉమ్మడి వేదికపై ఐక్యంగా పనిచేసిన వివిధ రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య చక్కని సహకారానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ.
ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు మొత్తం 214 నక్సల్స్ రహస్య స్థావరాలను, బంకర్లను ధ్వంసం చేశారు. మొత్తం 450 ఐఈడీలు, 818 బీజీఎల్ షెల్స్, 899 కట్టల కోడెక్స్, డిటోనేటర్లు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 12 వేల కిలోల ఆహార వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 21 రోజుల పాటు సాగిన ఈ చారిత్రాత్మక నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ లో లభించిన సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ లో పలువురు పెద్ద నక్సలైట్లు మరణించడం లేదా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా, గాయపడిన లేదా మరణించిన నక్సలైట్లందరి మృతదేహాలను భద్రతా దళాలు ఇంకా వెలికితీయలేకపోయాయి.
ఈ చారిత్రాత్మక ఆపరేషన్ కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం పెద్ద సంఖ్యలో బలగాలు, యుద్ధ పరికరాలు, ఇంకా సకాలంలో వాహనాలు, ఆయుధాలు, ఆహారం, వైద్య సదుపాయాల సమీకరణ సమర్థవంతంగా జరిగింది. కేజీహెచ్ ప్రాంతంలోని కఠినమైన, సవాలుతో కూడుకున్న భౌగోళిక పరిస్థితులు, దాక్కోవడానికి అనువైన వందలాది గుహలు, ఆకస్మిక దాడికి అనుకూలమైన ప్రదేశాలు, ఐఈడీల ప్రమాదాల గురించి సంయుక్త సమావేశంలో ప్రధానంగా బలగాలను హెచ్చరించారు. ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు భద్రతా దళాలకు వారి ఆపరేషన్ పరిధి గురించి పూర్తి సమాచారం అందించారు.
ఈ ఆపరేషన్ లో భాగంగా బీజీఎల్ షెల్స్, స్థానికంగా ఆయుధాల తయారీ, ఐఈడీలు, ఇతర మారణాయుధాల తయారీకి ఉపయోగించే నాలుగు నక్సల్ టెక్నికల్ యూనిట్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా వివిధ నక్సలైట్ల స్థావరాలు, బంకర్ల నుంచి పెద్ద ఎత్తున రేషన్ సరుకులు, మందులు, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కీలకమైన ఈ ఆపరేషన్ లో కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ (కోబ్రా), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)లకు చెందిన మొత్తం 18 మంది సిబ్బంది వివిధ ఐఈడీ పేలుళ్లలో గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయటపడి వివిధ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స పొందుతున్నారు. కర్రెగుట్టల వద్ద పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటడంతో చాలా మంది సైనికులు డీహైడ్రేషన్ కు గురయ్యారు. అయినప్పటికీ వారిలో మనోధైర్యం తగ్గకపోగా పూర్తి ధైర్యంతో, ఉత్తేజంతో నక్సలైట్లపై అలుపెరుగని ఆపరేషన్ కొనసాగించారు. వివిధ రాష్ట్ర, కేంద్ర సంస్థల మధ్య సమన్వయానికి, మోదీ అనుసరిస్తున్న సమగ్ర ప్రభుత్వ విధానానికి ఈ ఆపరేషన్ అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది. నక్సలైట్ల సాయుధ సామర్థ్యాలను తగ్గించడం, వారి సాయుధ దళాలను నిర్వీర్యం చేయడం, అజ్ఞాత ప్రాంతాల నుంచి నక్సలైట్లను తరిమికొట్టడం, అత్యంత దారుణాలకు పాల్పడే నక్సలైట్ సంస్థ - పిఎల్జిఎ - బెటాలియన్ను ధ్వంసం చేయడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు సంయుక్త కార్యాచరణ ప్రణాళిక కింద నక్సల్స్ కు వ్యతిరేకంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా అంతరాలను పూడ్చడం, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం నక్సల్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, తద్వారా స్థానిక పౌరులు ప్రయోజనం పొందేలా చేయడం, అలాగే, కరడు గట్టిన నక్సల్స్ పైన, వారి మొత్తం వ్యవస్థ పైన భద్రతా దళాలు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడం ఈ ప్రణాళిక ముఖ్య అంశాలు. ఈ కార్యాచరణ ప్రణాళిక అమలు ఫలితంగా భద్రతా దళాలు కరడు గట్టిన నక్సల్ దళాలను, వారి వ్యవస్థను భారీగా దెబ్బకొట్టాయి. దీనితో నక్సలైట్ ప్రభావం కలిగిన ప్రాంతం గణనీయంగా తగ్గిపోయింది.
2024లో నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్ల విజయాన్ని ఆధారంగా చేసుకొని, 2025లో కొనసాగుతున్న ఆపరేషన్లలో గత నాలుగు నెలల్లో భద్రతా దళాలు 197 మంది కరడుగట్టిన నక్సలైట్లను నిర్వీర్యం చేయడం గమనార్హం. 2014లో నక్సలిజం తీవ్రంగా ప్రభావితం చేసిన జిల్లాల సంఖ్య 35 ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య కేవలం ఆరుకి తగ్గిపోయింది. అదేవిధంగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 18కి తగ్గింది. 2014లో 76 జిల్లాల్లోని 330 పోలీస్ స్టేషన్లలో 1080 నక్సల్ ఘటనలు నమోదు కాగా, 2024లో 42 జిల్లాల్లోని 151 పోలీస్ స్టేషన్లలో కేవలం 374 ఘటనలు మాత్రమే నమోదయ్యాయి. 2014లో నక్సల్స్ హింసలో 88 మంది భద్రతా సిబ్బంది అమరులు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 19కి తగ్గింది. ఎన్ కౌంటర్లలో మరణించిన నక్సలైట్ల సంఖ్య 63 నుంచి 2089కి పెరిగింది. 2024లో 928 మంది నక్సలైట్లు లొంగిపోగా, 2025 మొదటి నాలుగు నెలల్లో 718 మంది లొంగిపోయారు. 2019 నుంచి 2025 వరకు కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసుల సహకారంతో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్లతో సహా మొత్తం 320 శిబిరాలను ఏర్పాటు చేశాయి. 2014లో 66గా ఉన్న పూర్తి స్థాయి పోలీస్ స్టేషన్ల సంఖ్య ఇప్పుడు 555కు పెరిగింది.
నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ విస్తృత ఆపరేషన్ దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వడం ప్రారంభమయింది. పెద్ద, సాయుధ నక్సల్ యూనిట్లను అనేక చిన్న యూనిట్లుగా బలహీన పడుతున్న దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాలపై భద్రతా దళాల పట్టు బిగించడంతో పాటు వారు బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతం, నారాయణపూర్ జిల్లాలోని మాడ్ ప్రాంతంలో నిరంతరం ముందుకు సాగుతున్నారు.
(Release ID: 2128775)