ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా అధ్యక్షతన అత్యవసర ఆరోగ్య సేవల సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల వ్యవస్థలు, వనరులను బలోపేతం చేసేందుకు చేపట్టిన అత్యవసర, సమగ్ర చర్యలపై మంత్రికి వివరించిన అధికారులు
Posted On:
09 MAY 2025 5:18PM by PIB Hyderabad
దేశంలో అత్యవసర వైద్య సేవల సన్నద్ధతను సమీక్షించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
అత్యవసర వైద్య సేవల నిర్వహణకు సంబంధించి ప్రస్తుత స్థితిని అధికారులు మంత్రికి వివరించారు. అంబులెన్సుల మోహరింపు, పరికరాలు, ఔషధాలు, రక్తం సీసాలు, ఇతర ముఖ్యమైన పరికరాలు, వినియోగ వస్తువులతో సహా తగినంత వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచడంతో పాటు, పడకలు, ఐసీయూ, హెచ్డీయూల పరంగా ఆసుపత్రుల సన్నద్దత, భీష్మ క్యూబ్లు, అధునాతన మొబైల్ ట్రామా కేర్ యూనిట్లు తదితరమైన వాటిని ఏర్పాటు చేయడానికి తీసుకున్న చర్యల గురించి మంత్రికి వివరించారు.
అవసరమైన ఔషధాలు, సరిపడినంత రక్తం, ఆక్సిజన్, ట్రామా కేర్ కిట్లు తదితరమైనవి అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రులు, వైద్య సంస్థలకు సూచించారు. ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులు, నర్సులను సమీకరించి అవసరమైన సామగ్రితో సహా సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను సహకార పద్ధతిలో బలోపేతం చేసేందుకు రాష్ట్రాలు, జిల్లాల అధికారులు, సాయుధ దళాలు, స్థానిక వైద్య సంఘాలు, నర్సులు, పారామెడిక్స్, ప్రైవేటు రంగ ఆసుపత్రులు, స్వచ్చంద సేవా సంస్థలు తదితరమైన వాటితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వీటికి అదనంగా విపత్తు సన్నద్ధత కోసం దేశవ్యాప్తంగా ఎయిమ్స్, పీజీఐఎంఈఆర్, జిప్మర్, ఇతర ప్రముఖ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అత్యవసర ఆరోగ్య సేవల్లో సామర్థ్య నిర్మాణాన్ని పెంపొందించేందుకు గాను సీపీఆర్, ప్రథమ చికిత్స, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంశాల్లో అదనపు శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూ), న్యూఢిల్లీ ఎయిమ్స్, ఐగాట్ సహాయంతో శిక్షణాంశాలను రూపొందిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల పరిధిలో తక్షణ స్పందనకు సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకోవడంపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సేవల సంస్థలతో తాను చేపట్టిన వరుస సమావేశాల గురించి ఆరోగ్య కార్యదర్శి వివరించారు.
అన్ని సమయాల్లోనూ అత్యవసర సేవలు అందించేందుకు వైద్య సంస్థలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేలా చూడాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో అత్యవసర ఆరోగ్య సేవలను సమర్థంగా, తక్షణమే అందించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలతోనూ, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలకు చెందిన జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన 24X7 కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ద్వారా ప్రస్తుతం చేపడుతున్న అన్ని ప్రయత్నాలను పర్యవేక్షించడంతోపాటు రాష్ట్రాలకు అవసరమైన మద్దతు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ నిరంతరాయంగా వైద్య సేవలు అందేలా, అత్యవసర స్పందన ఉండేలా చేసేందుకు కట్టుబడి ఉంది.
***
(Release ID: 2128061)