ఆర్థిక మంత్రిత్వ శాఖ
నాలుగో దశలో 26 ఆర్ఆర్బీల విలీనం: ప్రకటించిన ఆర్థిక సేవల విభాగం
Posted On:
08 APR 2025 2:31PM by PIB Hyderabad
“వన్ స్టేట్, వన్ ఆర్ఆర్బీ” విధానం కింద 26 గ్రామీణ బ్యాంకులను (ఆర్ ఆర్ బీ) విలీనం చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ప్రకటన జారీ చేసింది. ఆర్ఆర్బీల విలీనంలో ఇది నాలుగో దశ.
గత విలీనాల వల్ల పనితీరు మెరుగైనట్లు గుర్తించడంతో 2024 నవంబరులో తాజా విలీన ప్రణాళికను ప్రకటించిన ఆర్థిక మంత్రిత్వశాఖ, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులను ఏర్పాటు చేసింది. సంప్రదింపుల అనంతరం పది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 26 ఆర్ఆర్బీల విలీన ప్రక్రియను పూర్తి చేశారు. సామర్థ్య పెంపు, ఖర్చు హేతుబద్ధీకరణ ఈ విలీనాల ప్రధాన లక్ష్యం.
ప్రస్తుతం 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 43 ఆర్ఆర్బీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విలీన ప్రక్రియ తుది దశ పూర్తయితే 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 700 జిల్లాల్లో 22,000 శాఖలతో మొత్తం 28 ఆర్ఆర్బీలు పనిచేస్తాయి. ప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఈ బ్యాంకులు, గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో 92 శాతం శాఖలను కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం చేపట్టిన విలీనాలు నాలుగో దశకి చెందినవి. తొలి దశలో (2006-2010 ఆర్థిక సంవత్సరాల కాలం) ఆర్ఆర్బీల సంఖ్య 196 నుంచు 82కు, మలి దశలో (2013-2015 ఆర్థిక సంవత్సరాల కాలం) 82 నుంచి 56కు, మూడో దశలో (2019-2021 ఆర్థిక సంవత్సరాల కాలం) 56 నుంచి 43కు వీటి సంఖ్యను కుదించారు.
గెజెట్ ప్రకటన ఇక్కడ.
***
(Release ID: 2120053)
Visitor Counter : 57