మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8 నుంచి 22 వరకూ 7వ పోషణ్ పక్షోత్సవాలు
* నాలుగు కీలక ఇతివృత్తాలపై దృష్టి సారించనున్న 2025 పోషన్ పఖ్వాడా
* పోషన్ పఖ్వాడా తొలి వారంలో అరుణాచల్ ప్రదేశ్ లో అమలవుతున్న పథకాలను పరిశీలించనున్న కేంద్రమంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి
* పోషన్ పఖ్వాడా తొలిరోజున 18 సహ మంత్రిత్వశాఖల అధికారులు, రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ అధికారులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అంగన్వాడీ కార్యకర్తలనుద్దేశించి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ప్రసంగం
Posted On:
07 APR 2025 3:18PM by PIB Hyderabad
పోషకాహార లోపాన్ని సరిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ నెల 8 నుంచి 22 వరకూ 7వ పోషణ్ పఖ్వాడాను నిర్వహిస్తున్నారు. పసికందుల తొలి 1000 రోజులపై ప్రత్యేక శ్రద్ధ, పోషణ్ ట్రాకర్ లోని లబ్ధిదారు లేదా పౌరుల సౌలభ్యాన్ని గురించి అవగాహన పెంపు, సీఎంఏఎం ద్వారా పోషకాహార లోపాల నివారణ, బాలల్లో ఊబకాయాన్ని నివారించేందుకు ఆరోగ్యకర జీవనశైలి పరిచయం – అనే నాలుగు ఇతివృత్తాలపై పోషణ్ పఖ్వాడా దృష్టి సారిస్తోంది.
ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక పోషణ్ అభియాన్ కార్యక్రమం పోషకాహార లోపాలని సవరించే లక్ష్యంతో పనిచేస్తూ, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కిశోర బాలికలు, 6 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారికి పౌష్టికాహారం అందించడం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని సాకారం చేస్తోంది. ఇక ఈ యేటి పోషణ్ పఖ్వాడా మూల వనరులు, పంపిణీ, అనుసంధానం, ఫలితాలను బలోపేతం చేస్తుంది. విస్తృత మిషన్ సక్షమ్, పోషణ్ 2.0 ల్లో భాగంగా ఈ యేటి కార్యక్రమం ఆరోగ్యం మెరుగుదల, శ్రేయస్సు, రోగాలు, పోషకాహార లోపాలను తట్టుకునే సామర్థ్యాల పెంపుపై దృష్టి కేంద్రీకరిస్తుంది.
పోషన్ పఖ్వాడా తొలిరోజున (ఏప్రిల్ 8 న) 18 సహ మంత్రిత్వశాఖల అధికారులు, రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ అధికారులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అంగన్వాడీ కార్యకర్తలనుద్దేశించి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ మధ్యాహ్నం 12 గంటలకు అంతర్జాలం ద్వారా ప్రసంగిస్తారు. వెబ్ లింక్: https://webcast.gov.in/mwcd
అరుణాచల్ ప్రదేశ్ లో మహిళలు, బాలలకు పౌష్టికాహార పరమైన మద్దతును బలోపేతం చేసే ఉద్దేశంతో అమలవుతున్న పథకాలను పరిశీలించేందుకు పోషన్ పఖ్వాడా తొలి వారంలో కేంద్రమంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి ఆ రాష్ట్రంలో పర్యటిస్తారు. సంక్షేమ సేవల మెరుగుదల ద్వారా నిస్సహాయ సమూహాలకు రక్షణ కల్పించి వారి క్షేమానికై పాటుపడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మంత్రి పర్యటన ఏర్పాటయ్యింది.
ఈ పోషణ్ పఖ్వాడా సంచిక కచ్చితమైన సత్ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో అమలవుతోంది. గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయుల్లో ఇంటింటి ప్రచారం, సామాజిక కార్యక్రమాలు, లబ్ధిదారుల గుర్తింపు వంటి కార్యక్రమాల ద్వారా వివిధ భాగస్వామ్య పక్షాలను ఒక దగ్గరికి ఛేర్చి, క్షేత్ర స్థాయిలో మెరుగైన పౌష్టికాహార ఫలితాలను సాధించాలని పథకం తలపెట్టింది. సమగ్ర పోషకాహారం, పసి కందులకు తల్లులు చనుబాలు అందించడం, పసిపిల్లలకు ఇతర ఆహారం అందజేత, పోషణ్ ట్రాకర్ లోని సౌలభ్యాలను లబ్ధిదారులు, లేదా పౌరులకు పరిచయం చేయడం, తద్వారా వారికి సాధికారత కల్పించి కార్యక్రమంలో భాగస్వాములను చేయడం అనే లక్ష్యాలను కలిగి ఉంది.
పోషణ్ అభియాన్ ప్రారంభించాక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ఆరు పోషణ్ పఖ్వాడా సంచికలు విజయవంతంగా అమలయ్యాయి. పోషణ్ పఖ్వాడా సందర్భంలో ఏర్పాటు చేసే జన్ ఆందోళన్ (ప్రజా భాగస్వామ్య) కార్యకలాపాలు కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖకే పరిమితమవడం లేదు. గ్రామీణాభివృద్ధి శాఖ, కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ, జలశక్తి శాఖ, పంచాయితీ రాజ్, విద్యాశాఖ వంటి శాఖలు కూడా పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటిగా మారింది. పోషణ్ పఖ్ వాడా-2025లో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తున్నాయి.
కార్యక్రమంలో సమాజాన్ని విస్తృత స్థాయిలో భాగస్వామిని చేయడం ద్వారా పోషణ్ పఖ్ వాడా- వ్యక్తుల, సమాజ, జాతీయ స్థాయిలో పోషకాహార ప్రాముఖ్యాన్ని గురించి అవగాహన పెంచాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి ఆశయాలకి అనుగుణంగా సుపోషిత్ భారత్ సాధనకై కృషి చేస్తోంది.
****
(Release ID: 2119959)