భారత ఎన్నికల సంఘం
రాజకీయ పక్షాలతో క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించి, సమస్యల్ని చట్ట పరిధిలో పరిష్కరించాలంటూ సీఈఓలు, డీఈఓలు, ఈఆర్ఓలకు ఆదేశాలు
• సమస్యల వారీగా చర్యల నివేదికలను సీఈఓలు మార్చి 31లోగా దాఖలు చేయాలి
• రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఈఓలతో ఈసీఐ సమావేశం; సమావేశంలో పాల్గొన్న 100 మందికి పైగా అధికారులు
Posted On:
04 MAR 2025 3:02PM by PIB Hyderabad
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఈఓలతో రెండు రోజుల సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం ఈరోజు న్యూ ఢిల్లీలోని ఐఐఐడీఈఎంలో ఆరంభించింది. సీఈసీగా శ్రీ జ్ఞానేశ్ కుమార్ పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా సీఈసీతోపాటు ఈసీలు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులను చట్ట పరిధిలో మెరుగుపరచడంలో తోడ్పడే అనేక అంశాలపై సీఈఓలతో మాట్లాడారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీఈఓలు, డీఈఓలు, ఈఆర్ఓలు, బీఎల్ఓలు సహా అధికారులందరూ దాపరికానికి తావులేకుండా పనిచేయడంతోపాటు వారి చట్టబద్ధ విధులను చాలా జాగ్రత్తగా నెరవేర్చాలని సీఈసీ శ్రీ జ్ఞానేశ్ కుమార్ ఉద్బోధించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్పీ యాక్టు 1950, 1951; రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలొక్టొరల్ రూల్స్ 1960; కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్-1961లతోపాటు ఈసీఐ అప్పుడప్పుడూ జారీ చేసే ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలని కూడా సూచించారు.
అధికారులు అందుబాటులో ఉంటూ, రాజకీయపక్షాలు అడిగే అంశాలకు జవాబులు చెబుతూ ఉండాలని సీఈసీ ఆదేశించారు. వివాదాస్పద విషయాలేవైనా ఉంటే ప్రస్తుత చట్టబద్ధ పరిధిలో సంబంధిత ఈఆర్ఓ గాని లేదా డీఈఓ గాని లేదా సీఈఓ ఆధ్వర్యంలో పరిష్కరించడానికి అన్ని స్థాయిలలో అఖిలపక్ష సమావేశాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలని ఆయన అన్నారు. సమస్యల వారీగా చేపట్టిన చర్యల నివేదికను ప్రతి సీఈఓ మార్చి నెల 31కల్లా వారి పరిధికి సంబంధించిన డీఈసీకి సమర్పించాల్సి ఉంటుంది.
సీఈఓలు, డీఈఓలు, ఆర్ఓలు, ఈఆర్ఓలు అందరూ చట్టం, ఈసీఐ ఆదేశాల్లో సుస్పష్టంగా పేర్కొన్న ప్రకారం వారి వారి పాత్రలతోపాటు బాధ్యతలేమిటో పూర్తిగా తెలుసుకొని ఉండాలని సీఈసీ స్పష్టం చేశారు. భారతదేశంలో 18 ఏళ్ల వయస్సు మించిన పౌరులందరూ రాజ్యాంగం 325, 326వ అధికరణాలకు అనుగుణంగా ఓటర్లుగా నమోదు అయ్యేలా అధికారులు చూడాలని అన్నారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా నడుచుకొనేటట్లుగా బీఎల్ఓలందరికీ శిక్షణనివ్వాలని, అలాగే తప్పుడు క్లెయిములతో ఏ వ్యక్తీ కూడా ఎన్నికల సిబ్బందిని గాని లేదా అధికారిని గాని భయపెట్టకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది మొదలు 1200 మంది ఓటర్లు ఉండేటట్టు ప్రయత్నాలు చేయాలని, పోలింగ్ కేంద్రం ప్రతి ఓటరు నివాసం నుంచి 2 కిలోమీటర్ల దూరానికి లోపలే ఉండేటట్టు చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటింగు ప్రక్రియ సులభతరంగా ముగియడానికి తగిన కనీస సదుపాయాలను పోలింగ్ కేంద్రాలలో కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగును పెంచడానికి భవనాలతోపాటు, పేదల బస్తీలలోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
రాజ్యాంగ స్వరూపాన్ని, చట్ట నిబంధనలను విస్తృతంగా అధ్యయనం చేసిన తరువాత ఎన్నికల సంఘం పూర్తి ఎన్నికల ప్రక్రియ లో సీఈఓలు, డీఈఓలు, ఈఆర్ఓలు, రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు మొదలైన వారితో కలిపి 28 మంది వేరువేరు ఆసక్తిదారుల్ని (స్టేక్హోల్డర్స్) గుర్తించింది. ఈ ఆసక్తిదారుల్లో ప్రతి ఒక్కరిలోనూ సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియను బలోపేతం చేయాలనేది సమావేశం లక్ష్యం. ఈ ఆసక్తిదారులను ఎన్నికల సంఘంలో ప్రతి నలుగురు డీఈసీల మార్గదర్శకత్వంలో సీఈఓలందరి మధ్యన- నాలుగు సమూహాలుగా- విభజన చేశారు. ఆ సమూహాల్లో ఒకటో సమూహం: ఎన్నికల జాబితాలు; రెండో సమూహం: ఎన్నికల నిర్వహణ; మూడో సమూహం: పర్యవేక్షణ- ఆచరణ; నాలుగో సమూహం: రాజకీయపక్షం-అభ్యర్థి. సమ్మేళనం ముగిసిన తరువాత రేపటి రోజు ఇదే విషయమై మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.
మొదటిసారిగా ప్రతి రాష్ట్రం నుంచీ, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచీ ఒక డీఈఓ, ఒక ఈఆర్ఓ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
***
(Release ID: 2108321)