ప్రధాన మంత్రి కార్యాలయం
యూరోపియన్ కమిషన్ అధ్యక్షునితో ప్లీనరీ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం
Posted On:
28 FEB 2025 5:39PM by PIB Hyderabad
గౌరవనీయులారా,
భారత్ మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది. ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ ఈ స్థాయిలో ఒక దేశంతో కలిసి పనిచేయడం నిజంగా అపూర్వం.
ద్వైపాక్షిక చర్చల కోసం మా మంత్రులు ఇంతమంది కలిసి చర్చలో పాల్గొనడం ఇదే మొదటిసారి. 2022లో రైసినా చర్చల సందర్భంలో భారత్, ఈయూలను సహజ భాగస్వాములుగా మీరు అబివర్ణించడం, అలాగే రాబోయే దశాబ్దంలో భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు భారత్ కు ప్రాధాన్యత ఉంటుందని మీరు పేర్కొనడం నాకు ఇప్పటికీ గుర్తుంది.
ఇప్పుడు, మీ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే మీరు భారత్లో పర్యటించడం భారత్, ఈయూ సంబంధాల్లో సరికొత్త మైలురాయిగా నిలుస్తుంది.
గౌరవనీయులారా,
ప్రపంచంలో నేడు అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐ, ఆధునిక సాంకేతికతలు సామాజిక-ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చేస్తున్నాయి.
భౌగోళిక-ఆర్థిక, రాజకీయ సమీకరణాలు సైతం వేగంగా మారుతున్నాయి. పాత సమీకరణాలు నిరుపయోగం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, ఈయూ భాగస్వామ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రజాస్వామిక విలువలు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, నియమ-ఆధారిత ప్రపంచ వ్యవస్థ వంటి పరస్పర విశ్వాసాలు భారత్, ఈయూల మైత్రికి ప్రధాన ఆధారంగా ఉన్నాయి. ఇరుదేశాలు వైవిధ్యమైన మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి. అంటే ఒకవిధంగా మన ఇరు దేశాలు సహజ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి.
గౌరవనీయులారా,
భారత్, ఈయూల వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. మీ పర్యటన ద్వారా మరో దశాబ్దానికి పునాది పడింది.
ఈ విషయంలో ఇరుపక్షాలు చూపిన నిబద్ధత ప్రశంసనీయం. ఈ రెండు రోజుల్లోనే ఇరవైకి పైగా మంత్రిత్వ శాఖల స్థాయి సమావేశాలు జరగడం నిజంగా గొప్ప విషయం.
ఈ రోజు ఉదయం వాణిజ్య, సాంకేతిక మండలి సమావేశం విజయంతమైంది. చర్చల సందర్భంగా రూపొందించిన ఆలోచనలు, ఇప్పటివరకు సాధించిన పురోగతితో ఇరు బృందాలు నివేదికను అందిస్తాయి.
గౌరవనీయులారా,
మన సహకారానికి సంబంధించిన కొన్ని ప్రాధాన్య అంశాలను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను.
మొదటిది వర్తకం, పెట్టుబడి. పరస్పర లాభదాయకంగా ఎఫ్టీఏ, పెట్టుబడి భద్రత ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవడం చాలా కీలకమైనది.
రెండోది అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని సుస్థిరంగా ఉండేలా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, టెలికాం, ఇంజనీరింగ్, రక్షణ, ఫార్మా వంటి రంగాల్లో మన సామర్థ్యాలు పరస్పరం పరిపూర్ణమైనవి. ఇది వైవిధ్యాన్ని, నష్టాన్ని తగ్గించే చర్యలను బలోపేతం చేయడం ద్వారా సురక్షితమైన, విశ్వసనీయమైన, నమ్మకమైన సరఫరా వ్యవస్థ రూపకల్పనకు తోడ్పడుతుంది.
మూడోది అనుసంధానం. జీ20 సదస్సు సమయంలో ప్రారంభించిన ఐఎమ్ఈసీ కారిడార్ గణనీయమైన మార్పులకు తోడ్పడింది. ఇరు పక్షాలు పూర్తి నిబద్ధతతో ఈ విషయంలో కృషిని కొనసాగించాల్సి ఉంది.
నాల్గోది సాంకేతికత, ఆవిష్కరణలు. సాంకేతికతలో తిరుగులేని ఆధిక్యం పొందాలనే మన ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడం కోసం మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. డీపీఐ, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్షం, 6జీ వంటి రంగాల్లో మనం మన పరిశ్రమలు, ఆవిష్కర్తలు, యువ ప్రతిభను అనుసంధానించుకుంటూ కలిసి పనిచేయాల్సి ఉంది.
ఐదోది, వాతావరణపరమైన చర్యలు, హరిత ఇంధన ఆవిష్కరణ. భారత్, ఈయూలు పర్యావరణహితమైన ప్రపంచం కోసం అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. సుస్థిర పట్టణీకరణ, నీరు, శుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారం ద్వారా మనం పర్యావరణ హితమైన ప్రపంచ సాధనలో చోదకశక్తిగా మారవచ్చు.
ఆరోది రక్షణ రంగం. సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి ద్వారా మనం పరస్పరం మన అవసరాలను తీర్చుకోగలం. ఎగుమతి నియంత్రణ చట్టాల్లో మనం పరస్పర ప్రాధాన్యమిచ్చే దిశగా కృషి చేయాలి.
ఆరోది భద్రత. ఉగ్రవాదం, తీవ్రవాదం, సముద్రమార్గ భద్రత, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష భద్రత పరంగా తలెత్తుతున్న సవాళ్ల విషయంలో పరస్పర సహకారం అత్యంత అవసరం.
ఎనిమిదోది ఇరు దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు. వలసలు, రాకపోకలు, షెంగెన్ వీసాలు, ఈయూ బ్లూ కార్డుల ప్రక్రియను మరింత సరళంగా, సజావుగా ఉండేలా చేయడం కోసం ఇరుపక్షాలు ప్రాధాన్యమివ్వాలి. ఈయూ అవసరాలకు ఇది మరింత ఊతమిస్తుంది. దీని వల్ల యూరప్ వృద్ధి, శ్రేయస్సు కోసం భారత యువ శ్రామికులు మరింత తోడ్పాటునందించడం సాధ్యపడుతుంది.
గౌరవనీయులారా,
తదుపరి భారత్-ఈయూ సదస్సు కోసం, ఆశయం, కార్యాచరణ, నిబద్ధతతో మనం ముందుకు సాగాల్సి ఉంది. నేటి ఏఐ యుగంలో దార్శనికతను, వేగాన్ని కలిగిన వారిదే భవిష్యత్తు.
గౌరవనీయా...
ఇప్పుడు మీ ఆలోచనలు పంచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
***
(Release ID: 2107280)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam