సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహాకుంభ్ 2025.
24 గంటలూ యాత్రికుల సురక్ష, భద్రతలకు
మాదే పూచీ అంటున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది..
ఏ అత్యవసర స్థితినైనా చక్కదిద్దడానికి సిద్దం
Posted On:
17 FEB 2025 4:49PM by PIB Hyderabad
వైభవోపేతంగా మహాకుంభ్ 2025 కొనసాగుతోంది.. ఈ శోభ నడుమ కేంద్ర రిజర్వు పోలీస్ బలగం (సీఆర్పీఎఫ్) భక్తకోటిని కంటికి రెప్పలా కాపాడటానికి, వారికి కావలసిన సేవలను చేయడానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. సీఆర్పీఎఫ్ బలగం ప్రదర్శిస్తున్న దేశభక్తి, అంకిత భావం ఈ మహా ఆధ్యాత్మిక సందోహంలో ఒక అసాధారణ ఉదాహరణను కళ్లెదుట నిలుపుతోంది.
స్నానఘట్టాల వద్ద, మేలా మైదానాల్లో, కీలక దోవలలో సీఆర్పీఎఫ్ సిబ్బంది అనుక్షణం భద్రతను సమకూరుస్తున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొంటూ, నిఘా ఉంచుతున్నారు. ఎలాంటి అత్యవసర స్థితి ఎదురైనా చక్కదిద్దడానికి సర్వసన్నద్ధులుగా ఉంటున్నారు.

సమూహాల నిర్వహణలోను, మార్గదర్శకత్వంలోను కీలక పాత్ర
జనసందోహం మధ్య సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎంతో చురుకుగా వ్యవహరిస్తూ, భక్తావళికి మార్గదర్శనం చేయడంతోపాటు అవసరపడ్డ సహాయ, సహకారాల్ని అందిస్తున్నారు. వారి మర్యాదపూర్వక నడవడి, సర్వసన్నద్ధతలు సందర్శకులకు తమ యాత్రను సుగమం చేసుకోవడంలో తోడ్పడుతున్నాయి. ఎలాంటి సంకట స్థితి తలెత్తినా సరే, తక్షణం రంగంలో దిగి కావలసిన సాయాన్ని అందించడానికి సీఆర్పీఎఫ్ విపత్తు నిర్వహణ బృందం అతి అప్రమత్తంగా ఉంటోంది. దీనికి తోడు, ఈ బలగం తప్పిపోయిన పిల్లలను, పెద్దలను తిరిగి వారి కుటుంబాల చెంతకు చేర్చడంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది.

దేశ ప్రజలకే ప్రాధాన్యం: సేవకు, అంకిత భావానికి నిదర్శనం
సీఆర్పీఎఫ్లో ఉద్యోగులంతా ‘దేశ ప్రజలకే ప్రాధాన్యం’ అనే భావనతో మహా కుంభ్లో తమ విధులను నిర్వర్తిస్తున్నారు. వారి అచంచల నిబద్ధత, అంకితభావం ఈ మహా కార్యక్రమ ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఈ సంవత్సరం మహాకుంభ్లో సీఆర్పీఎఫ్ చాటిచెబుతున్న నిస్వార్థ సేవ, భక్తిభావం భద్రత కట్టుదిట్టంగా ఉందన్న అభిప్రాయాన్ని పాదుగొల్పడంతోపాటు యావత్తు దేశ ప్రజానీకానికి ఒక ప్రేరణగా కూడా ఉంటోంది.

****
(Release ID: 2104251)
Visitor Counter : 48