సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహమ్మారి సవాళ్ళ మొదలు ఐఎఫ్ఎఫ్ఐ స్పాట్ లైట్ వరకు:
‘డిస్పాచ్’ ప్రయాణాన్ని గురించి వివరించిన శ్రీ మనోజ్ బాజ్పేయి, ఆ చలనచిత్ర సాంకేతిక వర్గం
నేను నా కారు కిటికీకి నల్లతెరను పెట్టుకొంటే ప్రజలను, నా చుట్టూ ఉన్న జీవనాన్ని ఎలా చూడగలను? అని ప్రశ్నించిన శ్రీ మనోజ్ బాజ్పేయి
స్వతంత్ర సినిమాకు మార్గదర్శకత్వాన్ని అందించడం అవసరం; అది చేయలేదూ అంటే, సినిమా అనేది వ్యాపారం తప్ప మరేమీ కాకుండా పోతుంది: శ్రీ మనోజ్ బాజ్పేయి
రంగస్థలం నటుల మాధ్యమం, చలనచిత్రమేమో ప్రాథమికంగా దర్శకుని మాధ్యమం: శ్రీ బాజ్పేయి
ప్రఖ్యాత నటుడు, నాలుగు సార్లు జాతీయ పురస్కార విజేత, పద్మ శ్రీ స్వీకర్త శ్రీ మనోజ్ బాజ్పేయి 55వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో పాలుపంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఆయన నటించిన, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘డిస్పాచ్’ చలనచిత్రాన్ని ఈ చిత్రోత్సవంలో ‘స్పెషల్ ప్రెజెంటేషన్స్’ విభాగంలో ప్రదర్శిస్తున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ 2024 కొనసాగుతున్న నేపథ్యంలో, పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఏర్పాటు చేసిన ఒక పత్రికా విలేకరుల సమావేశంలో శ్రీ బాజ్పేయితోపాటు చిత్ర దర్శకుడు శ్రీ కను బహల్, ఈశానీ బనెర్జీ, నటి శహానా గోస్వామిలు పాల్గొని ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ చిత్రం నిర్మాణాన్ని గురించి, అందులో వారికి ఎదురైన సవాళ్ళను గురించి, పత్రికా రచనలో చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చే కథనాలను గురించి వారు ఈ సందర్భంగా వివరించారు.
‘డిస్పాచ్’ను రూపొందించిన కాలంలో ఆ చిత్ర నిర్మాణంలో ఎదురైన సవాళ్ళను గురించి శ్రీ మనోజ్ బాజ్పేయి ఎంతో ఉద్వేగభరితంగా మాట్లాడారు. దర్శకుడు శ్రీ కను బహల్ చిత్రీకరణ కు అనుసరించిన విధానం వినూత్నంగా ఉందని శ్రీ బాజ్పేయి ప్రశంసిస్తూ, ప్రస్తుతం అత్యంత ఉత్సాహభరితులైన దర్శకులలో ఆయన ఒకరని కితాబిచ్చారు.
‘‘మేం మహమ్మారి కాలంలో చిత్రీకరణను మొదలుపెట్టామంటే.. చూడండి, అదే ఒక పెద్ద సవాలు. డెల్టా విరుచుకుపడినప్పుడు ముంబయిలో మేం షూటింగు చేశాం. మాలో చాలా మంది సంక్రమణ బారిన పడ్డాం. అయినా మేం ఆ తరువాత అనేక అడ్డంకులకు ఎదురీదుతూ, షూటింగును కొనసాగించాం’’ అని శ్రీ బాజ్పేయి వివరించారు. ‘‘ఈశానీ, కను లు రూపొందించిన స్క్రిప్టు నమ్మశక్యం కానంత వాస్తవికత్వంతో కూడుకొని మనోహరంగా ఉంది. ఇది ఒక జర్నలిస్టు కథ. ఆ జర్నలిస్టు ఆకాంక్షలు, వృత్తి పట్ల నిబద్ధత.. ఇవి అతడి వ్యక్తిగత జీవనంపై ప్రభావాన్ని చూపుతాయి’’ అని శ్రీ బాజ్పేయి వెల్లడించారు.
స్క్రిప్టు వేసిన ముద్ర గురించి, పాత్రల స్వభావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి సుదీర్ఘకాలం పాటు నిర్వహించే వర్క్షాప్లు ప్రసరించే ప్రభావాన్ని గురించి కూడా శ్రీ బాజ్పేయి చెప్పుకొచ్చారు. జర్నలిస్టు పాత్ర పోషణ కోసం తీవ్రంగా సన్నద్ధం కావడం తనపై మానసికంగా తీవ్ర ప్రభావాన్ని కలగజేయడాన్ని గురించి ఆయన మాట్లాడారు. అయితే, అది నటుడిగా తాను ఎదగడానికి కూడా సాయపడిందని ఆయన చెప్పారు.
‘‘ఈశానీ, కను లు రాసిన స్క్రిప్ట్లో ప్రతి చిన్న వివరాన్ని పూస గుచ్చినట్టుగా ఎంతలా అక్షరబద్ధం చేశారంటే అది వాస్తవికతకు అద్దం పట్టింది. ఈ చిత్రానికి పనిచేయడానికి నటీనటులంతా మానసికంగా ఎంతో శ్రమ పడవలసి వచ్చింది, అయినా చివరికి, చేసిన ప్రతి ప్రయత్నానికీ తగిన విలువ లభించిందనుకోండి’’ అని శ్రీ బాజ్పేయి అన్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశానికి శ్రీ ధర్మేంద్ర తివారీ సమన్వయకర్తగా వ్యవహరించారు
చలనచిత్రాన్ని గురించి
‘డిస్పాచ్’ చిత్ర కథ ఒక క్రైం ఎడిటర్ జాయ్ను గురించి చెబుతుంది. అతడు గ్యాంగ్ వార్లతో ముడిపడిన భారీ అవినీతిని బయటపెట్టే, వృత్తిలో గొప్ప మలుపును తీసుకు వచ్చే పరిశోధనతో నిండా కూరుకుపోతాడు. ఒక వైపు జాయ్ తన వృత్తిపరమైన అలజడిని, మరో వైపు వివాహ బంధం చెదరిపోవడాన్ని, అంతేకాక తనకు సన్నిహితులైన వారే తనను దగా చేయడాన్ని భరించి, చివరికి విషాద పర్యవసానం దారిన నడుస్తాడు. పెద్ద పేరును తెచ్చుకోవాలనే తపన, దురాశ, అది ఒక వ్యక్తి జీవనం పైన, అతడి వృత్తి జీవనం పైన ఎంతటి నష్టాన్ని కలగజేస్తుందో ఈ చిత్రం ఆద్యంతాలు వివరిస్తాయి. ఈ చిత్రాన్ని ఆధికారికంగా ఈ ఏడాదిలో డిసెంబరు 13న విడుదల చేయనున్నారు.
మాటామంతీ (ఇన్- కాన్ వర్సేషన్) కార్యక్రమం
పత్రికా విలేకరుల సమావేశం ఒక్కటే కాకుండా, శ్రీ మనోజ్ బాజ్పేయి ఐఎఫ్ఎఫ్ఐ నేపథ్యంలో నిర్వహించిన ఒక సంభాషణ (ఇన్-కాన్వర్సేషన్) కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మన దేశంలో అత్యంత ఆదరణను చూరగొన్న నటీనటులలో ఒకరైన వ్యక్తి మేధ లోతుపాతులను తెలుసుకొనే అవకాశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
‘‘నేను నా కారు కిటికీకి నల్లటి తెరను పెట్టుకొన్నానంటే ప్రజలను ఎలా చూడగలుగుతాను?, వారి బాధలను, వారి ఆనందాలను, నా చుట్టుపక్కల ఉన్న జీవన స్థితిగతులను ఎలా పరిశీలించగలుగుతానంటారు? ఒక నటుడిగా నేను సమూహంలో నన్నెవరూ చూడకూడదు అనుకుంటాను, నేను మాత్రం వారిని పరిశీలిస్తూ, వారికి సన్నిహితంగా ఉండాలని కోరుకుంటుంటాను. మీరు ప్రజలకు దూరంగా ఉండిపోయారా అంటే, మీరు ఒక మంచి పాత్రను ఎన్నటికీ పోషించ జాలరు’’ అని సుప్రసిద్ధ నటుడైన శ్రీ బాజ్పేయి అన్నారు. ప్రపంచంలో అత్యంత కష్టమైనటువంటి పని ఏదయ్యా అంటే అది వేరొక వ్యక్తిలా నడుచుకోవడమనే పనే అని శ్రీ బాజ్పేయి చెప్పారు.
అనేక పురస్కారాలను గెలుచుకొన్న ఈ నటుడు అరమరికలకు తావు లేకుండానూ, చేసిన పనులను ఒక సారి మననం చేసుకొనే రీతి లోనూ సాగిన ఈ సంభాషణలో, నటన విషయంలో తాను పాటించే పద్ధతిలోని సూక్ష్మాలను వెల్లడిస్తూ, ఒక నటుడిగా తన పాత్ర కేవలం ప్రేక్షక లోకాన్ని ఆనందింప చేయడమో, వారిని విచలితులను చేయడమో కాదని, అచ్చంగా వారికి ఒక ప్రతినిధిగా నిలవాలనేదేనన్నారు. ‘‘ఒక నటుడి అభినయం ప్రజలకు వినోదాన్ని అందించడమో లేదా వారిని కదలించివేయడమో కాదు, ప్రజలకు ప్రతినిధిత్వాన్ని వహిస్తూ వారి గుండె లోతులను తడమాల’’ని ఆయన అన్నారు. ఈ కళతో తనకు ఉన్న వ్యామోహాన్ని గురించి ఆయన ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ, నటన అనేది ముగింపు అంటూ ఉండని ప్రక్రియ. అది నన్ను ఎప్పటికీ సమ్మోహితుడిని చేస్తూ ముందుకు తీసుకు పోతూ ఉంటుంది అని ఆయన అన్నారు. రంగస్థలానికి, చలనచిత్రాలకు మధ్య ఉన్న ప్రత్యేకతను గురించి కూడా శ్రీ బాజ్పేయి మాట్లాడారు.
రంగస్థలం అనేది ఒక నటి లేదా నటుడి మాధ్యమం అనీ, చలనచిత్రమేమో ప్రాథమికంగా ఒక డైరెక్టరు మాధ్యమమనీ ఆయన ప్రధానంగా చెప్పారు. ‘‘చలనచిత్రంలో ఎన్నో ఇతర అంశాలు, కోణాలు ఆవిష్కారమవుతూ ఉంటాయి, అవి అంతిమంగా కథనానికి ఒక రూపును సంతరిస్తాయి, ఇదంతా ఒక సమన్వయ భరిత ప్రక్రియ’’ అని ఆయన వివరించారు.
‘‘బహుముఖ ప్రజ్ఞావంతునిగా పేరు తెచ్చుకొన్న శ్రీ బాజ్పేయి రక రకాల పాత్రలు, వేరు వేరు జోనర్లతో ముందుకు సాగిపోతూ, తాను ఫలానా రకం చలనచిత్రాలలో నటించడానికే పరిమితం కావాలనుకోవడం లేదు. ‘‘నేను ప్రధాన స్రవంతి సినిమాకు మాత్రమే నన్ను పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు. నా వద్దకు వచ్చే ప్రతి ఒక్క కొత్త సినిమాలోను నా పాత్రల స్వభావాన్ని లోతుగా అవగాహన పరచుకొని, వాటిని తెర మీదకు ఆవిష్కరించాలనే నేను ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఏదైనా విశిష్టంగా ఉండే అభినయాన్ని అందించాలనే దృష్టితోనే ఎల్లప్పటికీ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని ఆయన అన్నారు.
సమాజంలో, చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఉన్న స్థితిగతుల విషయంలో ఆయన తన మనసులోని ఆందోళనను వ్యక్తం చేశారు. ఇది చాలా గడ్డు కాలం. సమాజంలో, పరిశ్రమలో పూర్తిగా అనిశ్చితి, సంఘర్షణ, ఇంకా అయోమయం నెలకొన్నాయి. స్వతంత్ర సినిమా అనే ఒక్క జోనర్యే చలనచిత్ర కళకు వాస్తవ దర్పణంగా ఉంటుంది. ‘‘స్వతంత్ర సినిమాకు మార్గదర్శకత్వాన్ని అందించవలసిన తరుణమిది. ఇది ఒక్కటే భారతీయ చలనచిత్ర రంగం వృద్ధికి హామీ పడ గలిగేది. దీనికి స్థానం లేదు అంటే గనక సినిమా ఒక్క వ్యాపారంగానే తప్ప, మరేదీ కాకుండా మిగులుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
నటనను, భారతీయ చలనచిత్ర రంగ భవిష్యత్తును గురించిన అంతరంగ ఆవిష్కరణలతో నిండిపోయిన ఈ సంభాషణ శ్రీ బాజ్పేయికి తాను ప్రదర్శించే కళకు, సమాజానికి అద్దంపడుతూ సమాజాన్ని తీర్చిదిద్దే తరహా కథా సంవిధానానికి ఉన్న శక్తి పట్ల తనకున్న నమ్మకానికి ప్రమాణంగా నిలిచింది. లీనమైపోయి వినేట్టు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు శ్రీ సుధీర్ శ్రీనివాసన్ సంధానకర్తగా వ్యవహరించారు.

(Release ID: 2076924)