రాష్ట్రపతి సచివాలయం
ఎనిమిదో ‘ఇండియా వాటర్ వీక్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2024 3:21PM by PIB Hyderabad
ఎనిమిదో ‘ఇండియా వాటర్ వీక్’ కార్యక్రమాన్ని ఈ రోజు (సెప్టెంబర్ 17) న్యూడిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నవారి సంఖ్యను తగ్గించాలనే లక్ష్యం మానవాళికి అవసరమన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకారం నీరు, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమంలో స్థానిక సంఘాలను భాగస్వాములను చేసి, వాటి సాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రతి ఒక్కరికీ నీటిని అందించే ఏర్పాటు చేయడం ప్రాచీన కాలం నుంచి మన దేశ ప్రాధాన్యంగా ఉంది. లదాఖ్ నుంచి కేరళ వరకు నీటి సంరక్షణ, నిర్వహణకు సమర్థమైన వ్యవస్థలు మన దేశంలో ఉండేవి. బ్రిటిష్ పాలనలో ఇవన్నీ క్రమంగా కనుమరుగైపోయాయి. ప్రకృతితో స్నేహం అనే భావన ఆధారంగా మన వ్యవస్థలను నిర్మించారు. ఈ తరహా వ్యవస్థలను తిరిగి అభివృద్ధి చేసేందుకు నేటి ప్రపంచం ఆలోచిస్తోంది. ప్రస్తుత కాలానికి తగినట్లు ఉండే వివిధ రకాల నీటి వనరుల నిర్వహణకు సంబంధించిన అనేక పురాతన ఉదాహరణలు దేశవ్యాప్తంగా నేటికీ దర్శనమిస్తున్నాయి. మన ప్రాచీన నీటి నిర్వహణ వ్యవస్థలను పరిశోధించి ఆధునిక కాలానికి తగినట్లు ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి అన్నారు.
బావులు, చెరువులు లాంటి నీటి వనరులు మన సమాజంలో శతాబ్దాలుగా నీటి బ్యాంకులుగా ఉన్నాయని రాష్ట్రపతి తెలిపారు. మనం బ్యాంకులో ముందుగా డబ్బు డిపాజిట్ చేసి, ఆ తర్వాతే విత్ డ్రా చేసుకుని ఉపయోగిస్తాం. ఇదే సూత్రం నీటికీ వర్తిస్తుంది. ముందు ప్రజలు నీటిని నిల్వ చేసి, ఆ తర్వాతే వినియోగించుకోవాలి. డబ్బు వృధా చేసిన వారు ఐశ్వర్యం నుంచి పేదరికంలోకి వెళతారు. అలాగే, ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ నీటి కొరత కనిపిస్తుంది. పరిమిత ఆదాయాన్ని తెలివిగా ఉపయోగించుకునే వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. ఈ విధంగా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నీటిని నిల్వ చేయడం ద్వారా గ్రామాలు నీటి ఎద్దడి నుంచి సురక్షితంగా ఉంటాయి. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గ్రామీణులు సమర్థమైన నీటి నిల్వ పద్ధతులు అవలంబించడం ద్వారా నీటి కొరత నుంచి బయటపడ్డారని రాష్ట్రపతి తెలిపారు.
భూమి మీద లభిస్తున్న నీటిలో 2.5 శాతం మాత్రమే తాగడానికి అనువైనదని రాష్ట్రపతి వివరించారు. అందులో కేవలం ఒక శాతమే మానవులు వినియోగించుకునేందుకు అందుబాటులో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరుల్లో భారత్ వాటా నాలుగు శాతం. మనదేశంలో అందుబాటులో ఉన్న నీటిలో సుమారుగా 80 శాతం వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నాం. సాగుతో పాటు విద్యుదుత్పత్తి, పరిశ్రమలు, గృహావసరాలకు నీటి లభ్యత అవసరం. నీటి వనరులు పరిమితంగా ఉన్నాయి. వాటిని సమర్థంగా వినియోగించడం ద్వారా మాత్రమే అందరికీ నీటి సరఫరా చేయడం సాధ్యమవుతుందని రాష్ట్రపతి అన్నారు.
‘క్యాచ్ ద రెయిన్ – వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్’ (వర్షపు నీటిని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు నిల్వ చేసుకోవడం) అనే సందేశంతో 2021లో ప్రభుత్వం ప్రచారాన్ని ప్రారంభించిందని రాష్ట్రపతి తెలిపారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, ఇతర నీటి నిర్వహణ లక్ష్యాలను సాధించడమే ఈ ప్రచార ముఖ్యోద్దేశం. అటవీ సంపదను వృద్ధి చేయడం కూడా నీటి సంరక్షణకు దోహదపడుతుంది. నీటి సంరక్షణ, నిర్వహణలో చిన్నారులు సైతం కీలక పాత్ర పోషిస్తారు. వారు తమ కుటుంబం, పొరుగువారికి అవగాహన కల్పించి నీటిని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. జలశక్తి చేస్తున్న ప్రయత్నాలు ప్రజా ఉద్యమాలుగా మారాలి. ప్రజలందరూ జల యోధులుగా తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.
సంఘటిత నీటి అభివృద్ధి, నిర్వహణే ‘ఇండియా వాటర్ వీక్ -2024’ లక్ష్యమని రాష్ట్రపతి తెలిపారు. దానిని సాధించేందుకు భాగస్వామ్యం, సహకారమనే మాధ్యమాన్ని ఎంచుకున్న జలశక్తి మంత్రిత్వ శాఖను ఆమె అభినందించారు.
***
(రిలీజ్ ఐడి: 2055854)
సందర్శకుల సూచీ సంఖ్య : : 125