రక్షణ మంత్రిత్వ శాఖ
ఉమ్మడి సైనిక విన్యాసం అల్ నజా-5 కోసం బయల్దేరిన భారత సేన
Posted On:
12 SEP 2024 10:39AM by PIB Hyderabad
భారత్ - ఒమన్ సంయుక్త సైనిక విన్యాసం అల్ నజా అయిదో ఎడిషన్ కోసం భారత ఆర్మీ బృందం గురువారం బయల్దేరింది. ఒమన్లోని సలాలాలో ఉన్న రబ్కూట్ శిక్షణ ప్రాంతంలో ఈ నెల 13 నుంచి 26 వరకు ఈ విన్యాసాలు జరగనున్నాయి. 2015 నుంచి రెండేళ్లకోసారి ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఏటా ఒక్కో దేశం చొప్పున భారత్-ఒమన్ వీటిని నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసం చివరి ఎడిషన్ రాజస్థాన్లోని మహాజన్లో జరిగింది.
60 మందితో కూడిన భారతసేనకు ఇతర సాయుధ, సేవా సిబ్బందితో కలిసి యాంత్రిక పదాతిదళానికి (మెకనైజ్డ్ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్) చెందిన పటాలం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒమన్ రాజసైన్య బృందంలోనూ 60 మంది ఉండగా, సరిహద్దు బలగాలు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఏడో అధ్యాయం పరిధిలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేలా ఇరుపక్షాల సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ విన్యాసాల లక్ష్యం. ఎడారి వాతావరణంలో కార్యకలాపాలపై ఈ విన్యాసం దృష్టిపెడుతుంది.
ఉమ్మడి కార్యాచరణ, భద్రత శోధన వ్యవహారాలు, నిర్మిత ప్రాంతాల్లో పోరాటం, మొబైల్ వాహన చెక్ పోస్టులు, డ్రోన్ ప్రతిఘటన – ఇళ్లలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదులను మట్టుబెట్టగల వ్యూహాలు సహా వ్యూహాత్మక కసరత్తులను ఈ విన్యాసంలో ప్రదర్శిస్తారు. క్షేత్రస్థాయిలో వాస్తవిక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పోలి ఉన్న సంయుక్త విన్యాసాలను కూడా ప్రదర్శిస్తారు.
వ్యూహాలు, నైపుణ్యాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రక్రియల్లో ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి అల్ నజా-5 విన్యాసం మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇది రెండు సైన్యాల మధ్య బంధాన్నీ, సుహృద్భావాన్నీ, స్నేహాన్నీ పెంపొందిస్తుంది. అంతేకాకుండా, రక్షణ సహకారాన్ని బలోపేతం చేసి, రెండు మిత్రదేశాల మధ్య సత్సంబంధాలను ఈ సైనిక విన్యాసం మెరుగుపరుస్తుంది.
****
(Release ID: 2054172)