ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం సమావేశం


భార‌త్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియలు సహా.. ఎన్నికల
పరిమాణం.. నిష్పాక్షికత.. పారదర్శకతలపై ప్రశంస;

భారత-అమెరికా సంబంధాల విస్త‌ర‌ణ‌లో అమెరికా కాంగ్రెస్
సుస్థిర.. ద్వైపాక్షిక మద్దతు ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన ప్రధాని;

నిరుడు అమెరికాలో తన అధికార పర్యటన.. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను
ఉద్దేశించి రెండోసారి చారిత్రక ప్రసంగాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ

Posted On: 20 JUN 2024 5:10PM by PIB Hyderabad

   మెరికా కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల సభా సంఘం చైర్మన్ మైకేల్ మెకాల్ నేతృత్వంలోని చట్టసభ ప్రతినిధుల బృందం ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైంది. వీరిలో నాన్సీ పెలోసి, గ్రెగొరీ మీక్స్, మరియాన్నెట్ మిల్లర్-మీక్స్, నికోల్ మలియోటాకిస్, అమెరిష్ బాబులాల్ (అమి బెరా), జిమ్ మెగవర్న్ ఉన్నారు.

   ప్రధానమంత్రి చారిత్రక రీతిలో వరుసగా మూడోసారి ఎన్నిక కావడంపై ప్రతినిధి బృందం తొలుత అభినందనలు తెలిపింది. ఇటీవల భార‌త్‌లో ముగిసిన ప్రపంచంలోనే భారీ ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియ పరిమాణం, నిష్పాక్షికత, పారదర్శకతలను వారెంత‌గానో ప్రశంసించారు.

   భారత-అమెరికా సంబంధాలను అత్యంత ప్రాధాన్యంగలవిగా ప్రతినిధి బృందం అభివర్ణించింది. ఆ మేరకు వాణిజ్యం, వర్ధమాన సాంకేతికతలు, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలుసహా అన్ని రంగాల్లోనూ సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు గట్టి మద్దతు ప్రకటించింది.

   రెండు దేశాల స్నేహం పరిఢవిల్లడంలో అమెరికా కాంగ్రెస్ సుస్థిర, ద్వైపాక్షిక మద్దతుకుగల కీలక పాత్రను ప్రధాని నొక్కిచెప్పారు. ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, చట్ట ప్రక్రియలపై గౌరవం, ప్రజల మధ్య ప్రగాఢ-సౌహార్ద సంబంధాలు దీనికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ప్రపంచ శ్రేయస్సు లక్ష్యంగా ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై నిబద్ధతను పునరుద్ఘాటించారు. నిరుడు జూన్‌లో తన అమెరికా పర్యటనను, కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో రెండోసారి చారిత్రక ప్రసంగం చేసే అవకాశం లభించడాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

***



(Release ID: 2027265) Visitor Counter : 30