సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఉత్తర భారతదేశంలో మొదటి నది పునరుజ్జీవన ప్రాజెక్టు దేవిక పూర్తి కావస్తోంది, ప్రధాని మోదీ స్వయంగా ఆ ప్రాజెక్టును ప్రారంభించారు: డా.జితేంద్ర సింగ్


దేవిక నది పవిత్రతను కాపాడేందుకు చేపట్టిన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు అమలు తీరును సమీక్షించిన డా.జితేంద్ర సింగ్

Posted On: 06 AUG 2023 4:24PM by PIB Hyderabad

ఉత్తర భారతదేశంలో మొదటి నది పునరుజ్జీవన ప్రాజెక్టు దేవిక పూర్తి కావస్తోందని కేంద్ర శాస్త్ర & సాంకేతికత, పీఎంవో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్ చెప్పారు. ‘నమామి గంగ’ తరహాలో రూ.190 కోట్ల వ్యయంతో రూపొందించిన ఆ ప్రాజెక్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. దేవిక నది పవిత్రతను కాపాడేందుకు జమ్ము&కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో విడిగా చేపట్టిన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు అమలు తీరును డా.జితేంద్ర సింగ్ సమీక్షించారు.

పవిత్ర గంగానదికి సోదరిగా భావించే దేవిక నదికి మతపరంగా చాలా ప్రాముఖ్యత ఉందని సమీక్ష సమావేశంలో డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. అందుకే దేవిక పునరుజ్జీవనం కింద అన్ని ఇళ్లను కలుపుతూ పైపులు, మ్యాన్‌హోల్స్‌తో ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును యూఈఈడీ ద్వారా చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ.190 కోట్ల నిధుల్లో, కేంద్రం & యూటీ 90:10 నిష్పత్తిలో కేటాయిస్తాయని చెప్పారు.

దేవిక నది పవిత్రతను కాపాడేందుకు ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుతో పాటు, కీలకమైన ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేస్తున్నామని డా.జితేంద్ర సింగ్ వివరించారు.

ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుల విజయవంతం కావడానికి, సమాజంలోని క్షేత్ర స్థాయి ప్రతినిధులుగా భావించే పీఆర్‌ఐల పాత్ర చాలా కీలకమని డా.జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. సమావేశానికి హాజరైన పీఆర్‌ఐలు మంత్రి వద్ద వివిధ సమస్యలను ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఆ సమస్యలు పరిష్కరించాలని విభాగాలను మంత్రి ఆదేశించారు.

ఉధంపూర్ డీసీ శ్రీ సచిన్ కుమార్ వైశ్య, ఉత్తర రైల్వే అదనపు డీఆర్ఎం శ్రీ బల్దేవ్ రాజ్, ఉధంపూర్ ఎస్ఎస్పీ డా.వినోద్ కుమార్, డీడీసీ, బీడీసీ సభ్యులు, సర్పంచులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

*****



(Release ID: 1946245) Visitor Counter : 161