పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

ఉరుగ్వేలో పర్యటించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం

Posted On: 17 JUN 2023 9:09AM by PIB Hyderabad

ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పార్లమెంట్ ప్రతినిధుల సభాధ్యక్షుడి (దిగువ సభ) ఆహ్వానం మేరకు, భారత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో, 10 మంది పార్లమెంట్‌ సభ్యులతో కూడిన భారత బృందం ఈ నెల 14-17 తేదీల్లో ఉరుగ్వేలో పర్యటించింది. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.

భారత బృందంలో, పార్లమెంటు ఉభయ సభల నుంచి వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వారిలో, లోక్‌సభ నుంచి శ్రీ సంజయ్ సేథ్, శ్రీ గోమతి సాయి, శ్రీ హేమంత్ పాటిల్, శ్రీ సీఎన్ అన్నాదురై, శ్రీ డా.గురుమూర్తి మద్దిల, శ్రీ చంద్రాణి ముర్ము; రాజ్యసభ నుంచి శ్రీ ఇందు బాల గోస్వామి, శ్రీ దినేష్ చంద్ర అనవాడియా, నీరజ్ దాంగి ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ జి.శ్రీనివాస్ కూడా ఈ బృందంలో ఉన్నారు. ప్రతినిధి బృందానికి జూన్ 14న అర్జెంటీనా & ఉరుగ్వేలో భారత రాయబారి శ్రీ దినేష్ భాటియా స్వాగతం పలికారు. ఉరుగ్వే గురించి, భారతదేశంతో దాని ద్వైపాక్షిక సంబంధాల్లో పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి ప్రతినిధి బృందానికి వివరించారు.

ఈ ఏడాది మార్చిలో, న్యూదిల్లీలో జరిగిన రెండు దేశాల మధ్య విదేశీ వ్యవహారాల కార్యాలయాల సంప్రదింపుల నేపథ్యంలో ఈ పర్యటన సాగింది. చివరిసారి, 2012లో, అప్పటి లోక్‌సభ సభాపతి నేతృత్వంలో లోక్‌సభ సభ్యుల బృందం ఉరుగ్వేను సందర్శించింది.

ఈ నెల 15న, భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఉరుగ్వే రాజధాని మాంటెవీడెయోలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పర్యటన అధికారికంగా ప్రారంభమైంది. రాజధాని నగరంలోని ఈ తీర ప్రాంత రహదారి మహాత్మాగాంధీ పేరుతో ప్రసిద్ధి చెందింది.

భారత ప్రతినిధి బృందానికి ఉరుగ్వే ప్రతినిధుల సభ అధ్యక్షుడు సెబాస్టియన్ అందుజార్ స్వాగతం పలికారు. ఉరుగ్వే పార్లమెంట్‌లోని ఉభయ సభల సభ్యులతో కూడిన బృందంతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, అందుజార్ ఉరుగ్వే పార్లమెంట్‌లో 'ఇండియా-ఉరుగ్వే పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌'ను ప్రారంభించారు. పార్లమెంటరీ దౌత్యం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైనే ప్రధానంగా ఈ చర్చలు సాగాయి.

ఉరుగ్వే పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో కలిసి భారతదేశాన్ని సందర్శించాలని మంత్రి శ్రీ జోషి అందుజార్‌ను ఆహ్వానించారు, దానిని ఆయన అంగీకరించారు. ఉరుగ్వే పార్లమెంటరీ ప్రతినిధి బృందం పర్యటన ఈ ఏడాది చివరిలోగా జరపాలని, పరస్పర సంప్రదింపుల ద్వారా తేదీలు ఖరారు చేయాలని నిర్ణయించారు.

భారత రాయబారి భాటియాతో కలిసి భారత బృందం ఉరుగ్వే ఉపాధ్యక్షురాలు, సెనేట్ (ఎగువ సభ) అధ్యక్షురాలు బీట్రిజ్ అర్గిమోన్‌తో సమావేశం అయ్యారు. ఉరుగ్వేలో ఆ స్థానానికి ఎన్నికైన మొట్టమొదటి మహిళ బీట్రిజ్ అర్గిమోన్‌. దేశాధ్యక్షుడు లూయిస్ లకాల్లె పౌ విదేశీ పర్యటనలో ఉండడంతో, ఉరుగ్వే తాత్కాలిక అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు చూస్తున్నారు. ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం పలికిన బీట్రిజ్ అర్గిమోన్‌, కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో సాగిన తన పర్యటనను గుర్తు చేసుకున్నారు. రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలను విస్తృతం చేయాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు.

భారతదేశంలో వేగవంతమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధి గురించి మంత్రి జోషి రెండు సమావేశాల్లోనూ ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ప్రభుత్వం తీసుకున్న వివిధ విధాన కార్యక్రమాల తర్వాత భారతదేశం ఏ విధంగా వృద్ధి చెందిందో వివరించారు.

ఉరుగ్వేలో నివసిస్తున్న భారతీయుల సంఘం 'ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ ఉరుగ్వే' నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొంది. ఉరుగ్వేకు చెందిన యోగా గురువు సన్నిధిలో ధ్యానం, స్థానిక కళాకారుడు ఇచ్చిన ఒడిస్సీ నృత్య ప్రదర్శన ఈ వేడుకల్లో భాగమయ్యాయి.

భారత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి & ప్రతినిధి బృందం, మాంటెవీడెయోలో ప్రవాస భారతీయులతో సంభాషించారు. ఉరుగ్వేలో 800 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు.

ఉరుగ్వే ఎగుమతులు, పెట్టుబడులు & దేశ ప్రతిష్టను ప్రోత్సహించే బాధ్యతతో పనిచేసే సంస్థ అయిన ఉరుగ్వే XXI, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నెల 16న ప్రతినిధి బృందానికి ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఉరుగ్వేలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) కార్యాలయాన్ని కూడా భారత పార్లమెంట్‌ ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ కార్యాలయం, 2022తో 20 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం, ఉరుగ్వేలో ఎక్కువ సంఖ్యలో మానవ వనరులు కలిగిన అతి పెద్ద ప్రైవేట్ రంగం కంపెనీగా టీసీఎస్‌ నిలిచింది.

2020లో, భారతదేశం-ఉరుగ్వే 60 సంవత్సరాల దౌత్య సంబంధాలు జరుపుకున్నాయి. అదే సమయంలో, ద్వైపాక్షిక వాణిజ్యం గత కొన్ని సంవత్సరాలుగా బలంగా వృద్ధి చెందింది, 2022-23లో 350 మిలియన్‌ డాలర్లను చేరింది.

భారత్‌కు సుదూరంగా ఉన్నప్పటికీ, ఈ మిత్రదేశంలో ఆర్థిక బలంతో పాటు భారతీయ వైవిధ్యం, గొప్ప సంస్కృతి కారణంగా పర్యటన విజయవంతంగా సాగిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి స్వయంగా నాయకత్వం వహించిన ప్రతినిధి బృందం పర్యటన ఉరుగ్వేకి సాధారణ వ్యవహారం కాదని భారత రాయబారి భాటియా పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మరిన్ని పర్యటనల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

****


(Release ID: 1933132)