ప్రధాన మంత్రి కార్యాలయం

2023 వ సంవత్సరం మే నెల 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట)  కార్యక్రమం 101 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 28 MAY 2023 11:41AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. మరోసారి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమాని కి మీ అందరికి హృదయపూర్వక స్వాగతం. ఈసారి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ఈ ఎపిసోడ్ 2 వ సెంచరీ కి ప్రారంభం అని చెప్పాలి. గత నెల లో మనమంతా ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేక సెంచరీ ని వేడుక గా జరుపుకొన్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమాని కి అతి పెద్ద బలం వలె ఉంటున్నది. 100 వ భాగం ప్రసారం అయ్యే సమయానికి ఒక విధం గా యావత్తు దేశం ఒక సూత్రం తో ముడిపడిపోయింది. పరిశుభ్రత కార్మికులైన సోదరీమణులు సోదరులు కావచ్చు. లేదా వివిధ రంగాల దిగ్గజాలు కావచ్చు.. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం అందరిని ఒక తాటి మీదకు తీసుకు రావడానికి కృషి చేసింది. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహం లు ఇదివరకు ఎరుగని అటువంటివి. భావోద్వేగానికి గురి చేసేవీనూ. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం ప్రసారమైనప్పుడు ఆ సమయం లో ప్రపంచం లోని వివిధ దేశాల లో, వివిధ టైమ్ జోన్ లలో ఒక చోట సాయంత్రం, మరో చోట అర్థరాత్రి అయినప్పటికీ 100 వ భాగాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు కాలాన్ని కేటాయించారు. వేల మైళ్ల దూరం లో ఉన్న న్యూ జీలండ్ నుండి వచ్చిన ఒక వీడియో ను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశం తో పాటు ఇతర నుండి కూడా ప్రజలు ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం గురించి వారి అభిప్రాయాల ను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ ను కూడా చేశారు. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో దేశం, దేశ ప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదాని కి గాను నేను మీ అందరి కి గౌరవం గా మరోసారి ధన్యవాదాల ను వ్యక్తం చేస్తున్నాను.

 

ప్రియమైన నా దేశ వాసులారా, గతం లో మనం ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో కాశీ-తమిళ సంగమం గురించి, సౌరాష్ట్ర-తమిళ సంగమం గురించి మాట్లాడుకొన్నాం. కాశీ-తెలుగు సంగమం కూడా ఎప్పుడో వారాణసీ లో జరిగింది. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి కి బలం చేకూర్చేందుకు ఒక అపూర్వ ప్రయత్నం దేశం లో జరిగింది. ఇది యువ సంగమం కృషి. ఈ విశిష్ట ప్రయత్నం లో భాగస్వాములు అయిన వ్యక్తుల ను దీని ని గురించి ఎందుకు వివరం గా అడగకూడదు అని నేను అనుకున్నాను. అందుకే ప్రస్తుతం ఇద్దరు యువకులు నాతో ఫోన్‌ లో జత పడ్డారు. ఒకరు అరుణాచల్ ప్రదేశ్‌ కు చెందిన గ్యామర్ న్యోకుమ్ గారు, మరొకరు బిహార్‌ కు చెందిన అమ్మాయి విశాఖ సింహ్ గారూ ను. మనం ముందు శ్రీ గ్యామర్ న్యోకుమ్‌ తో మాట్లాడుదాం.

 

ప్రధాన మంత్రి గారు: గ్యామర్ గారు.. నమస్కారం.

 

గ్యామర్ గారు: నమస్కారం మోదీ గారు.

 

ప్రధాన మంత్రి గారు: గ్యామర్ గారు.. ముందు గా మీ గురించి తెలుసుకోవాలని నేను కోరుకొంటున్నాను.

గ్యామర్ గారు : మోదీ గారు.. మొదట నేను మీకు మరియు భారత ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా విలువైన కాలాన్ని వెచ్చించి నాతో మాట్లాడేందుకు అవకాశాన్ని కల్పించారు. నేను అరుణాచల్ ప్రదేశ్‌ లో నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మెకానికల్ ఇంజీనియరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను.

ప్రధాన మంత్రి గారు: మీ నాన్న గారు, ఇంకా మీ కుటుంబం లోని వారు ఏం చేస్తారు?

 

గ్యామర్ గారు: మా నాన్న చిన్న వ్యాపారం చేస్తారు. మా కుటుంబసభ్యులందరూ వ్యవసాయం చేస్తారు.

 

ప్రధాన మంత్రి గారు: యువ సంగమం గురించి మీకు ఎలా తెలుసు? యువ సంగమానికి ఎక్కడికి వెళ్ళారు? ఎలా వెళ్ళారు, ఏమైంది?

గ్యామర్ గారు: మోదీ గారూ.. నాకు యువ సంగమం అంటే ఇష్టం.

యువ సంగమం లో పాల్గొనవచ్చని మా విద్యాసంస్థ ఎన్‌ఐటి లో చెప్పారు. నేను మళ్ళీ ఇంటర్ నెట్‌ లో వెదకాను. ఇది చాలా మంచి కార్యక్రమం అని నేను తెలుసుకొన్నాను. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌లో ఈ కార్యక్రమం చాలా దోహద పడుతున్నది. నాకు కొత్త విషయాలు నేర్చొకొనే అవకాశం లభిస్తుంది. కాబట్టి వెంటనే నేను వెబ్‌సైట్‌ ను చూసి అందులో పేరు ను నమోదు చేసుకొన్నాను. నా అనుభవం చాలా సరదా గా ఉంది; చాలా బాగుంది అది.

ప్రధాన మంత్రి గారు: మీరు ఏదైనా ఎంపిక చేసుకోవలసి వచ్చిందా?

గ్యామర్ గారు: మోదీ గారూ.. వెబ్‌సైట్‌ లో అరుణాచల్ ప్రజల కోసం రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటిది ఐఐటి తిరుపతి ఉన్న ఆంధ్ర ప్రదేశ్. రెండో ది సెంట్రల్ యూనివర్సిటీ, రాజస్థాన్. నేను నా మొదటి ప్రాధాన్యాన్ని రాజస్థాన్‌ కు ఇచ్చాను. రెండో ప్రాధాన్యాన్ని ఐఐటి తిరుపతి కి ఇచ్చాను. అలా రాజస్థాన్‌ కు ఎంపికయ్యాను. అందుకే రాజస్థాన్ కు వెళ్లాను.

ప్రధాన మంత్రి గారు: మీ రాజస్థాన్ పర్యటన ఎలా ఉంది? మీరు మొదటిసారి

రాజస్థాన్ వెళ్లారా?

గ్యామర్ గారు: అవును సర్. నేను మొదటిసారి అరుణాచల్ ప్రదేశ్ నుండి బయటకు వెళ్ళాను. నేను ఈ రాజస్థాన్ లోని కోటలూ ఇవన్నీ సినిమాల్లో, ఫోన్‌లో మాత్రమే చూశాను. కాబట్టి నేను మొదటిసారి వెళ్ళినప్పుడు నా అనుభవం చాలా బాగుంది. అక్కడి ప్రజలు చాలా మంచివారు. మాతో వారు వ్యవహరించిన తీరు కూడా చాలా బాగుంది. అక్కడ నేర్చుకొనేందుకు కొత్త కొత్త విషయాలు ఉన్నాయి. రాజస్థాన్‌ లోని పెద్ద సరస్సుల ను గురించి, అక్కడి ప్రజల ను గురించి తెలుసుకొన్నాను. నాకు అసలే తెలియని వర్షపు నీటి సంరక్షణ వంటి అనేక కొత్త విషయాల ను నేర్చుకొన్నాను. కాబట్టి ఈ కార్యక్రమం- రాజస్థాన్ సందర్శన- నాకు చాలా బాగుంది.

ప్రధాన మంత్రి గారు: చూడండి. మీకు లభించిన అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే-

అరుణాచల్ ప్రదేశ్ వీరభూమి. రాజస్థాన్ కూడా వీర భూమే. సైన్యం లో రాజస్థాన్ నుండి చాలా మంది ఉన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్ లోని సరిహద్దు లో ఉన్న సైనికుల మధ్య మీరు రాజస్థాన్ జవానుల ను కలసినప్పుడు మీరు ఖచ్చితం గా వారితో మాట్లాడుతారు. మీరు రాజస్థాన్ వెళ్ళినట్టుగా, రాజస్థాన్ లో కొన్ని అనుభవాలు కలిగినట్టుగా వారికి చెప్తే మీ సాన్నిహిత్యం వెంటనే పెరుగుతుంది. సరే.. మీరు అక్కడ కూడా అరుణాచల్‌ ప్రదేశ్ లో ఉండేటటువంటి కొన్ని సారూప్యతల ను గమనించి ఉంటారు.

గ్యామర్ గారు: మోదీ గారు.. నాకు కనిపించిన ఒకే ఒక్క సారూప్యత దేశం పైన ప్రేమ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దృక్పథం, అనుభూతి. ఎందుకంటే అరుణాచల్‌ ప్రదేశ్ లో కూడా ప్రజలు వారు భారతీయులం అని చాలా గర్వం గా భావిస్తారు. రాజస్థాన్‌ లోని ప్రజలు కూడా వారి మాతృభూమి ని ప్రేమిస్తారు. ఇదే అక్కడ- ముఖ్యం గా యువ తరం లో కనబడింది. ఎందుకంటే నేను అక్కడ చాలా మంది యువకుల తో మాట్లాడాను. వారి మధ్య చాలా సారూప్యతను నేను గమనించాను. వారు భారతదేశం కోసం ఏం చేయాలి అని అనుకొంటున్నారు, దేశం పైన వారికి గల ప్రేమ- ఈ రెండు విషయాల లో నాకు చాలా పోలికలు కనబడ్డాయి.

ప్రధాన మంత్రి గారు: అక్కడ పరిచయమైన స్నేహితుల తో పరిచయం పెంచుకున్నారా? లేదా వచ్చిన తరువాత ఆ సంగతి ని మరచిపోయారా?

గ్యామర్ గారు: లేదు సర్. మేం పరిచయాన్ని పెంచుకొన్నాం.

ప్రధాన మంత్రి గారు: అవునా...! మీరు సామాజిక మాధ్యాల్లో క్రియాశీలం గా ఉన్నారా?

గ్యామర్ గారు: అవును మోదీ గారు. నేను సోశల్ మీడియా లో చురుకు గా ఉన్నాను.

ప్రధాన మంత్రి గారు: అలాంటప్పుడు మీరు బ్లాగ్ లో వ్రాయాలి. యువ సంగమం అనుభవాన్ని, అందులో మీరు ఎలా నమోదు చేసుకున్నారు?, రాజస్థాన్‌ లో మీ అనుభవం ఎలా ఉంది ? అనే విషయాల ను వ్రాయాలి. దేశం లోని యువతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గొప్పతనం, ఈ పథకం వివరాలు తెలిసేలా వ్రాయాలి. యువత దీని ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీ అనుభవాల తో బ్లాగ్ వ్రాయాలి. అప్పుడు చాలా మంది కి ఉపయోగపడుతుంది.

గ్యామర్ గారు: సరే సర్. నేను ఖచ్చితం గా వ్రాస్తాను.

ప్రధాన మంత్రి గారు: గ్యామర్ గారు, మీతో మాట్లాడినుందకు చాలా ఆనందం గా ఉంది. ఈ 25 సంవత్సరాలు మీ జీవితాని కి, అలాగే దేశ భవిష్యత్తు కు చాలా ముఖ్యమైనవి. అందుకే యువత దేశం కోసం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలి. నేను మీకు చాలా చాలా శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు.

గ్యామర్ గారు: మోదీ గారు.. మీకు కూడా ను ధన్యవాదాలు.

ప్రధాన మంత్రి గారు: నమస్కారం, సోదరా.

మిత్రులారా, అరుణాచల్ ప్రజలు చాలా ఆత్మీయంగా ఉంటారు. వారితో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం గా ఉంటుంది. యువ సంగమం లో గ్యామర్ గారి అనుభవం అద్భుతం. రండి ఇప్పుడు బిహార్ అమ్మాయి విశాఖ సింహ్ గారితో మాట్లాడుదాం.

ప్రధాన మంత్రి గారు: విశాఖ గారు, నమస్కారం.

విశాఖ గారు: ముందుగా, గౌరవనీయులైన భారతదేశం ప్రధాన మంత్రి గారి కి నా వందనాలు. నాతో పాటు ప్రతినిధులందరి తరపున మీకు ప్రణామాలు.

ప్రధాన మంత్రి గారు: సరే విశాఖ గారు, ముందుగా మీ గురించి చెప్పండి. యువ సంగమం గురించి కూడా తెలుసుకోవాలని ఉంది.

విశాఖ గారు: నేను బిహార్‌ లో సాసారామ్ అనే పేరు గల పట్టణం నివాసి ని. యువ సంగమాన్ని గురించి మా కాలేజీ వాట్సాప్ గ్రూపు సందేశం ద్వారా మొదట నేను తెలుసుకొన్నాను. ఆ తరువాత నేను దానిని గురించి మరిన్ని వివరాల ను తెలుసుకొన్నాను. ప్రధాన మంత్రి పథకాల లో ఒకటైన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ లో భాగమే యువ సంగమం అని తెలుసుకొన్నాను. అలా ఆ తరువాత అందులో చేరాలి అని ఉత్సాహం తో దరఖాస్తు చేశాను. అక్కడి నుండి తమిళ నాడు ప్రయాణం చేసి తిరిగి వచ్చాను. అలా నేను పొందిన అవగాహన తరువాత ఈ కార్యక్రమం లో భాగం అయినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఆ కార్యక్రమం లో పాల్గొన్నందుకు చాలా సంతోషం గా ఉంది. భారతదేశం లోని వివిధ ప్రాంతాల సంస్కృతి కి అనుగుణం గా మా వంటి యువత కు ఈ తరహా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినందుకు మీకు నా హృదయపూర్వకం గా కృతజ్ఞతల ను తెలియజేసుకొంటున్నాను.

ప్రధాన మంత్రి గారు: విశాఖ గారు, మీరు ఏం చదువుతున్నారు?

విశాఖ గారు: నేను కంప్యూటర్ సైన్స్ ఇంజీనియరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాను సర్ .

ప్రధాన మంత్రి గారు: సరే విశాఖ గారు మీరు ఏ రాష్ట్రాని కి వెళ్లాలి, ఎక్కడ చేరాలి? అనే నిర్ణయాన్ని ఎలా తీసుకొన్నారు?

విశాఖ గారు: నేను ఈ యువ సంగమాన్ని గురించి గూగల్‌ లో వెదకడం మొదలుపెట్టినప్పుడు బిహార్‌ కు చెందిన ప్రతినిధులు తమిళ నాడు నుండి వచ్చిన ప్రతినిధుల తో పరస్పర మార్పిడి చేసుకుంటున్నారని నాకు తెలిసింది. తమిళ నాడు మన దేశం లో చాలా గొప్ప సాంస్కృతిక రాష్ట్రం. కాబట్టి బిహార్ నుండి తమిళ నాడు కు ప్రతినిధుల ను పంపడం చూసినప్పుడు దరఖాస్తు పత్రాన్ని నింపాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా అనే విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి ఇది నాకు చాలా సహాయ పడింది. నేను అందులో పాల్గొన్నందుకు ఈ రోజు న చాలా గర్వపడుతున్నాను. నాకు చాలా సంతోషం గా ఉంది.

ప్రధాన మంత్రి గారు: తమిళ నాడు కు మీరు వెళ్లడం ఇదే తొలి సారా?

విశాఖ గారు: అవును సర్. నేను మొదటి సారి అక్కడ కు వెళ్ళాను.

ప్రధాన మంత్రి గారు: సరే, మీరు ప్రత్యేకం గా గుర్తుంచుకోదగింది ఏదైనా చెప్పాలనుకొటే ఏం చెప్తారు? మీ మాటల ను దేశం యువత వింటున్నది.

విశాఖ గారు: సర్. మొత్తం ప్రయాణాన్ని పరిశీలిస్తే అది నాకు చాలా అద్భుతం గా ఉంది. ఒక్కో దశ లో చాలా మంచి విషయాల ను నేర్చుకొన్నాం. తమిళ నాడు వెళ్ళి అక్కడ మంచి స్నేహితుల ను పొందాను. అక్కడి సంస్కృతి ని అలవరచుకొన్నాను. అక్కడి ప్రజల ను కలుసుకొన్నాను. కానీ అక్కడ నేను అనుభవించిన గొప్ప విషయం ఏమిటంటే ఇస్ రో కు వెళ్లే అవకాశం ఎవరికీ ఉండదు. మేం ప్రతినిధులం కాబట్టి ఇస్ రో కు వెళ్లే అవకాశం మాకు లభించింది. రెండోది మేం రాజ్‌ భవన్‌ కు వెళ్లినప్పుడు తమిళ నాడు గవర్నర్ గారి తో భేటీ అయ్యాం. కాబట్టి ఆ రెండు క్షణాలు నాకు చాలా గొప్పవి. యువత గా మాకు లభించని అవకాశాలు యువ సంగమం ద్వారా దొరికాయి. కాబట్టి ఇది నాకు పరిపూర్ణమైన, మరపురాని అటువంటి ఘడియ.

ప్రధాన మంత్రి గారు: బిహార్‌ లో తినే విధానం వేరు, తమిళ నాడు లో తినే విధానం వేరు.

విశాఖ గారు: అవును సర్.

ప్రధాన మంత్రి గారు: అంటే పూర్తి గా అన్ని విధాలు గా సెట్ చేశారా?

విశాఖ గారు: మేము అక్కడ కు వెళ్లినప్పుడు, తమిళ నాడు లో దక్షిణ భారత వంటకాలు ఉన్నాయి. అందుకే అక్కడ కు వెళ్లగానే దోశ, ఇడ్లీ, సాంబార్, ఊతప్పం, వడ, ఉప్మా లు వడ్డించారు. మేం మొదట ప్రయత్నించినప్పుడుఅది చాలా బాగుంది. అక్కడి ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. చాలా రుచి గా ఉంటుంది. ఉత్తరాది ఆహారాని కి చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి నాకు అక్కడి ఆహారం నచ్చింది. అక్కడి ప్రజలు కూడా చాలా మంచివారు.

ప్రధాన మంత్రి గారు: అంటే ఇప్పుడు మీకు తమిళ నాడు లో కూడా కొత్త గా స్నేహితులయ్యారు కదా?

విశాఖ గారు: సర్. అవును, మేం అక్కడ ఎన్ఐటి తిరుచ్చి లో ఉన్నాం. ఆ తరువాత ఐఐటి మద్రాస్‌ లో ఉన్నాం. ఆ రెండు ప్రాంతాల విద్యార్థుల తో నేను స్నేహం చేశాను. దానికి తోడు మధ్యలో సిఐఐ స్వాగతోత్సవం ఉండడంతో దగ్గర లోని కళాశాల ల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు అక్కడ కు వచ్చారు. అక్కడ మేం ఆ విద్యార్థుల తో కూడా మాట్లాడాం. వారి ని కలుసుకోవడం నాకు చాలా సంతోషం గా అనిపించింది. వారిలో చాలా మంది నా స్నేహితులు కూడా. తమిళ నాడు నుండి బిహార్ కు వస్తున్న కొంతమంది ప్రతినిధులను కూడా కలుసుకొన్నాం. కాబట్టి మేం వారితో కూడా మాట్లాడాం. మేం ఇప్పటికీ ఒకరితో ఒకరం మాట్లాడుకొంటున్నాం.. నేను చాలా ఆనందం గా ఉన్నాను.

ప్రధాన మంత్రి గారు: అయితే విశాఖ గారు, మీరు ఈ అనుభవాన్ని బ్లాగ్ లో వ్రాయండి. సోశల్ మీడియా లో శేర్ చేయండి. ముందుగా ఈ యువ సంగమం ను గురించి, ఆ తరువాత 'ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్' ను గురించి వ్రాయండి. ఆపై తమిళ నాడు లో మీకు లభించిన పరిచయం, స్వాగతం, మీరు పొందినటువంటి ఆతిథ్యం, తమిళ ప్రజల ప్రేమ- ఈ విషయాలన్నీ దేశాని కి చాటిచెప్పండి. అయితే వ్రాస్తారు కదూ మీరు.

విశాఖ గారు: అవును, తప్పకుండా.

ప్రధాన మంత్రి గారు: నేను మీకు చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు.

విశాఖ గారు: థాంక్ యు సో మచ్ సర్. నమస్కారం.

గ్యామర్ గారికి , విశాఖ గారికి చాలా చాలా శుభాకాంక్షలు. యువ సంగమం లో మీరు నేర్చుకున్నవి జీవితాంతం మీతో ఉండనివ్వండి. మీ అందరికీ ఇవే నా శుభాకాంక్షలు.

 

మిత్రులారా, భారతదేశం బలం వైవిధ్యం లో ఉంది. మన దేశం లో చూడవలసినవి చాలా ఉన్నాయి. దీనిని దృష్టి లో పెట్టుకొని విద్య మంత్రిత్వ శాఖ 'యువ సంగమం' పేరు తో అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచడం తో పాటు గా దేశం లోని యువత ఒకరి తో మరొకరు కలివిడిగా ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యంగా ఉంది. వివిధ రాష్ట్రాల ఉన్నత విద్య సంస్థల ను దీనికి జోడించడమైంది. ‘యువ సంగమం’ లో యువతీయువకులు ఇతర రాష్ట్రాల నగరాల ను, గ్రామాల ను సందర్శిస్తారు. వివిధ రకాల వ్యక్తుల తో భేటీ అయ్యే అవకాశం వారికి లభిస్తుంది. యువ సంగమం తొలి దశ లో దేశం లోని 22 రాష్ట్రాల లో సుమారు 1200 మంది యువత పర్యటించింది. అందులో భాగమైన వారందరూ జీవితాంతం గుండెల్లో చిరస్థాయి గా నిలచిపోయే ఇటువంటి జ్ఞాపకాల తో తిరిగి వస్తున్నారు. చాలా పెద్ద కంపెనీ ల సిఇఒ లు, బిజినెస్ లీడర్ లు భారతదేశం లో యాత్రికులుగా గడిపినట్టు మనం చూశాం. నేను ఇతర దేశాల నాయకుల ను కలుసుకొన్నప్పుడు వారు తమ యవ్వనం లో భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినట్టు చాలా సారు లు చెప్పారు. చూసిన ప్రతి సారీ మన ఉత్సాహం పెంచేలా మన భారతదేశం లో తెలుసుకోవలసినవి, చూడవలసినవి చాలా ఉన్నాయి. ఈ ఉత్తేజకరమైన అనుభవాల ను గడించిన తరువాత మీరు కూడా దేశం లో వివిధ ప్రాంతాల కు వెళ్లడానికి ఖచ్చితం గా స్ఫూర్తి ని పొందుతారన్న నమ్మకం నాలో ఉంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, కొద్ది రోజుల క్రితం నేను జపాన్‌ లోని హిరోశిమా కు వెళ్ళాను. అక్కడ నాకు హిరోశిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించే అవకాశం వచ్చింది. అది ఒక భావోద్వేగ అనుభవం. మనం చరిత్ర జ్ఞాపకాల ను స్మరించుకొంటే అది రాబోయే తరాల కు ఎంతగానో ఉపకరిస్తుంది. కొన్నిసార్లు మనం మ్యూజియం లో కొత్త పాఠాల ను నేర్చుకొంటాం. కొన్నిసార్లు మనం నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. కొద్ది రోజుల కిందట భారతదేశం లో ఇంటర్ నేశనల్ మ్యూజియం ఎక్స్‌పో జరిగింది. ఇది ప్రపంచం లోని 1200 కు పైగా మ్యూజియాల ప్రత్యేకతల ను ప్రదర్శించింది. భారతదేశం లో మనకు అనేక రకాలైన ప్రదర్శనశాల లు ఉన్నాయి. అవి మన గతాని కి సంబంధించిన అనేక అంశాల ను ప్రదర్శిస్తాయి. గురుగ్రామ్‌ లో మ్యూజియో కామెరా అనే ఒక ప్రత్యేకమైన మ్యూజియమ్ ఉంది. 1860 వ సంవత్సరం తరువాత వచ్చిన 8 వేల కు పైగా కామెరా ల సంచయం ఈ మ్యూజియం లో ఉంది. తమిళ నాడు లో మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ ను దివ్యాంగుల ను దృష్టి లో పెట్టుకొని రూపొందించారు. ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయం లో 70 వేలకు పైగా వస్తువుల ను భద్రపరచారు. 2010 వ సంవత్సరం లో స్థాపించిన ఇండియన్ మెమరీ ప్రాజెక్ట్ ఒక రకమైన ఆన్‌లైన్ మ్యూజియమ్. ప్రపంచం నలుమూలల నుండి పంపిన చిత్రాల ద్వారా, కథ ల ద్వారా భారతదేశం అద్భుతమైన చరిత్ర లింక్‌ల ను కలపడం లో ఇది నిమగ్నమై ఉంది. విభజన భయాందోళనలతో ముడిపడి ఉన్న జ్ఞాపకాల ను ముందుకు తెచ్చే ప్రయత్నం కూడా జరిగింది. గత సంవత్సరాల లో కూడా భారతదేశం లో కొత్త రకాల మ్యూజియాలు, స్మారక చిహ్నాల ను నిర్మించడం మనం చూశాం. స్వాతంత్య్ర పోరాటం లో ఆదివాసి సోదరీమణులు, సోదరుల కృషి కి అంకితమిచ్చిన పది కొత్త మ్యూజియాలు ఏర్పాటవుతున్నాయి. కోల్‌కాతా లోని విక్టోరియా మెమోరియల్‌ లో బిప్లోబీ భారత్ గ్యాలరీ అయినా, జలియాఁవాలా బాగ్ మెమోరియల్ పునరుద్ధరణ అయినా దేశం లోని పూర్వ ప్రధానులు అందరికి అంకితం చేసిన పిఎమ్ మ్యూజియం కూడా ప్రస్తుతం దిల్లీ కీర్తి ని పెంచుతున్నాయి. దిల్లీ లోని జాతీయ యుద్ధ స్మారకం, పోలీస్ మెమోరియల్ ల వద్ద అమరవీరుల కు నివాళులను అర్పించేందుకు ప్రతి రోజూ చాలా మంది వస్తుంటారు. చరిత్రాత్మక దాండి మార్చ్ కు అంకితమిచ్చిన దాండి స్మారక చిహ్నం కావచ్చు. లేదా స్టాట్యూ ఆఫ్ యూనిటీ మ్యూజియం కావచ్చు. సరే. నేను ఇక్కడి తో ఆగాలి. ఎందుకంటే దేశవ్యాప్తం గా ఉన్న మ్యూజియాల జాబితా చాలా పెద్ద ది. దేశం లోని అన్ని మ్యూజియాల గురించి అవసరమైన సమాచారం కూడా సంకలనం చేశారు. మ్యూజియం ఏ ఇతివృత్తం ఆధారం గా ఉంది, అక్కడ ఎటువంటి వస్తువులు ఉన్నాయి, అక్కడి వారి ని సంప్రదించేందుకు వివరాలు - ఇవన్నీ ఆన్‌లైన్ డైరెక్టరీ లో ఉంటాయి. మీకు అవకాశం దొరికినప్పుడల్లా దేశం లోని ఈ మ్యూజియాల ను తప్పక సందర్శించండి అంటూ మిమ్మల్ని నేను కోరుతున్నాను. అక్కడ ఉన్న ఆకర్షణీయమైన చిత్రాలను #(Hashtag)Museum Memories లో శేర్ చేయడం మరచిపోవద్దు. ఇది మన అద్భుతమైన సంస్కృతి తో భారతీయుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

 

ప్రియమైన నా దేశ వాసులారా, మనమందరం ఒక లోకోక్తి ని చాలాసార్లు విని ఉంటాం. పదే పదే విని ఉంటాం. అది నీళ్లు లేకుంటే జీవం లేదు అనేదే. జలం లేకుంటే జీవితం లో ఎప్పుడూ సంక్షోభం ఉంటుంది. వ్యక్తి వికాసం, దేశాభివృద్ధి కూడా నిలచిపోతాయి. ఈ భవిష్యత్ సవాలు ను దృష్టి లో పెట్టుకొని నేడు దేశం లో ప్రతి జిల్లా లో 75 అమృత సరోవరాల ను నిర్మిస్తున్నారు. మన అమృత సరోవరాలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి స్వాతంత్ర్యం వచ్చిన అమృత కాలం లో నిర్మితమవుతున్నాయి కాబట్టి. ఇందులో ప్రజల అమృత కృషి కూడా ఇమిడివుంది కాబట్టి. ఇప్పటి వరకు 50 వేల కు పైగా అమృత సరోవరాల ను నిర్మించారని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. నీటి సంరక్షణ దిశ లో ఇది ఒక పెద్ద ముందడుగు.

 

మిత్రులారా, ప్రతి వేసవి లో నీటి కి సంబంధించిన సవాళ్ల ను గురించి మనం ఇదే విధం గా మాట్లాడుకొంటూ ఉంటాం. ఈసారి కూడా మనం ఈ అంశాన్ని తీసుకొంటాం. అయితే ఈసారి మనం నీటి సంరక్షణ కు సంబంధించిన స్టార్ట్ అప్స్ ను గురించి చర్చిస్తాం. ఫ్లక్స్‌జెన్ (FluxGen) అనే స్టార్ట్-అప్ ఐఒటి ఇనేబల్డ్ టెక్నాలజీ ద్వారా నీటి నిర్వహణ కోసం ఎంపికల ను అందిస్తుంది. ఈ సాంకేతికత నీటి వినియోగం నమూనాల ను తెలియజేస్తుంది. నీటి ని సమర్థం గా ఉపయోగించడం లో సాయపడుతుంది. మరో స్టార్ట్ అప్ లివ్ఎన్ సెన్స్ (LivNSense). ఇది కృత్రిమ మేధ, మశీన్ లర్నింగ్ ల ఆధారం గా రూపొందించినటువంటి ప్లాట్ ఫార్మ్. దీని సహాయంతో నీటి పంపిణీ ని సమర్థం గా పర్యవేక్షించవచ్చును. దీనిని బట్టి ఎక్కడెక్కడ ఎంత నీరు వృథా అవుతుందో కూడా తెలిసిపోతుంది. మరో స్టార్ట్ అప్ పేరు కుంభీ కాగజ్ (KumbhiKagaz). ఈ కుంభీ కాగజ్ మీకు కూడా చాలా నచ్చుతుంది అని నేను ఖచ్చితం గా అనుకుంటున్నాను. కుంభీ కాగజ్ స్టార్ట్-అప్ ఒక ప్రత్యేక కార్యాన్ని మొదలుపెట్టింది. ఒకప్పుడు నీటి వనరుల కు ఇబ్బందిగా భావించిన గుర్రం డెక్క తో కాగితాన్ని తయారు చేసే పని ని చేస్తున్నది.

మిత్రులారా, చాలా మంది యువకులు నూతన ఆవిష్కరణ, సాంకేతికత ల ద్వారా పని చేస్తుంటే, ఛత్తీస్‌ గఢ్‌ లోని బాలోద్ జిల్లా యువత లా సమాజానికి అవగాహన ను కల్పించే లక్ష్యం లో తలమునకలుగా ఉన్న యువకులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడి యువకులు నీటి ని పొదుపు చేసేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి నీటి సంరక్షణ ను గురించిన అవగాహన ను ప్రజల కు కల్పిస్తున్నారు. ఎక్కడైనా పెళ్లి వంటి కార్యక్రమం జరిగితే, అక్కడ కు పోయి నీటి దుర్వినియోగాన్ని ఎలా అరికట్టవచ్చో తెలియజేస్తున్నారు. ఝార్ ఖండ్‌ లోని ఖూంటి జిల్లా లో నీటి సమర్ధవంతమైన వినియోగానికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం జరుగుతోంది. నీటి సంక్షోభం నుండి బయటపడేందుకు ఖూంటీ లోని ప్రజలు బోరీ ఆనకట్ట మార్గాన్ని కనుగొన్నారు. బోరీ ఆనకట్ట వల్ల నీరు చేరి అక్కడ ఆకుకూరలు , కూరగాయలు పెరగడం ప్రారంభించాయి. దీని వల్ల ప్రజల ఆదాయం పెరుగుతోంది. ఆ ప్రాంతం యొక్క అవసరాలు కూడా నెరవేరుతున్నాయి. ఏ ప్రజా భాగస్వామ్య ప్రయత్నం అయినా దానితో పాటు అనేక మార్పుల ను ఎలా తీసుకు వస్తుంది అనేందుకు ఖూంటీ ఒక ఆకర్షణీయమైన ఉదాహరణ గా మారిపోయింది. ఈ కృషి కి అక్కడి ప్రజల ను అభినందిస్తున్నాను.

 

ప్రియమైన నా దేశ వాసులారా, 1965 యుద్ధం కాలం లో మన పూర్వ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జయ్ జవాన్- జయ్ కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. తరువాత అటల్ గారు జయ్ విజ్ఞాన్‌ ను జోడించారు. కొన్నేళ్ల క్రితం దేశం లోని శాస్త్రవేత్తల తో మాట్లాడుతున్నప్పుడు జయ్ అనుసంధాన్ ను గురించి ప్రస్తావించాను. జయ్ జవాన్, జయ్ కిసాన్, జయ్ విజ్ఞాన్, జయ్ అనుసంధాన్.. ఈ నాలుగింటి కి అద్దం పట్టే ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ఈ రోజు న చర్చ అటువంటి వ్యక్తి గురించే, అటువంటి సంస్థ గురించే. ఆ సత్పురుషులు మహారాష్ట్ర కు చెందిన శివాజీ శ్యామ్ రావ్ డోలే గారు. శ్రీ శివాజీ డోలే నాసిక్ జిల్లా లో ఒక చిన్న గ్రామాని కి చెందిన వారు. ఆయన పేద ఆదివాసి రైతు కుటుంబం నుండి వచ్చారు. సైనికుడు గా కూడా పనిచేశారు. సైన్యం లో ఉంటూ దేశం కోసం కృషి చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం క్రొత్త గా ఏదైనా నేర్చుకోవాలి అని నిర్ణయించుకొని ఎగ్రీకల్చర్ డిప్లొమా చేశారు. అంటే జయ్ జవాన్ నుండి జయ్ కిసాన్ వైపు మళ్లారు. ఇప్పుడు ప్రతి క్షణం ఆయన ప్రయత్నం ఏమిటంటే వ్యవసాయ రంగం లో తాను గరిష్ఠం గా ఎటువంటి తోడ్పాటు ను అందించాలా అనేదే. శివాజీ డోలే గారు తన ఈ ఉద్యమం లో 20 మంది తో ఒక చిన్న జట్టు ను తయారు చేశారు. అందులో కొంతమంది మాజీ సైనికుల ను చేర్చుకొన్నారు. ఆ తరువాత ఆయన బృందం వెంకటేశ్వర కో-ఆపరేటివ్ పవర్ & ఎగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ అనే సహకార సంఘం నిర్వహణ ను చేపట్టింది. ఈ సహకార సంస్థ గతం లో నిష్క్రియం గా ఉండేది. ఆయన దానిని పునరుద్ధరించేందుకు చొరవ తీసుకున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర కో-ఆపరేటివ్ కొద్దికాలం లోనే అనేక జిల్లాల కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బృందం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల లో పని చేస్తోంది. దాదాపు 18 వేల మంది దీనితో అనుసంధానమై ఉన్నారు. ఇందులో పెద్ద సంఖ్య లో మాజీ సైనికులు కూడా ఉన్నారు. ఈ బృందం లోని సభ్యులు నాసిక్‌ లోని మాలేగాఁవ్‌ లో 500 ఎకరాల కు పైగా భూమి లో ఆగ్రో ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ బృందం నీటి సంరక్షణ కోసం అనేక చెరువుల ను నిర్మించడంలో నిమగ్నమై ఉంది. విశేషమేమిటంటే వారు ఆర్గానిక్ ఫార్మింగ్ ను, డెయిరీ ని కూడా ప్రారంభించారు. ఇప్పుడు వారు పండించిన ద్రాక్ష ను యూరోప్‌ కు కూడా ఎగుమతి చేస్తున్నారు. నా దృష్టి ని ఆకర్షించిన ఈ టీమ్‌ లోని రెండు గొప్ప లక్షణాలు జయ్ విజ్ఞాన్, జయ్ అనుసంధాన్. దీని సభ్యులు సాంకేతికత ను, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ను వీలైనంత అధికం గా ఉపయోగిస్తున్నారు. ఎగుమతుల కు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలపై కూడా దృష్టి పెట్టడం రెండో విశేషం. 'సహకారం తో సమృద్ధి’ అనే స్ఫూర్తి తో పని చేస్తున్న ఈ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం పెద్ద సంఖ్య లో ప్రజలను శక్తిమంతం చేయడమే కాకుండాఅనేక జీవనోపాధి మార్గాల ను కూడా సృష్టించింది. ఈ ప్రయత్నం ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం వింటున్న ప్రతి శ్రోత కు స్ఫూర్తి ని ఇస్తుంది అని ఆశపడుతున్నాను.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈరోజు మే 28 వ తేదీ న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్ కర్ జయంతి. ఆయన త్యాగం, ధైర్యం, సంకల్ప శక్తి కి సంబంధించిన కథ లు నేటికీ మనందరికీ ప్రేరణ ను ఇస్తాయి. అండమాన్‌ లో వీర సావర్ కర్‌ కాలాపానీ శిక్ష అనుభవించిన గది కి వెళ్లిన రోజు ను నేను మరచిపోలేను. వీర సావర్ కర్ వ్యక్తిత్వం దృఢత్వం, గొప్పతనాలతో కూడి ఉంది. ఆయన నిర్భయ, ఆత్మగౌరవ స్వభావాని కి బానిస మనస్తత్వం ఎంతమాత్రం నచ్చలేదు. స్వాతంత్య్ర ఉద్యమం కోసం మాత్రమే కాదు- సామాజిక సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం వీర్ సావర్ కర్ చేసిన కృషి ఆయన ను ఇప్పటికీ గుర్తుంచుకొనేటట్టు చేస్తుంది.

మిత్రులారా, కొన్ని రోజుల తరువాత జూన్ 4వ తేదీ న సంత్ కబీర్‌దాస్ గారి జయంతి. కబీర్‌దాస్ జీ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికత ను కలిగివుంది.

 

“కబీరా కువాఁ ఏక్ హై, పానీ భరే అనేక్

బర్తన్ మే హీ భేద్ హై, పానీ సబ్ మే ఏక్”

అని కబీర్‌దాస్‌ చెప్పే వారు. అంటే బావి దగ్గరకు రకరకాల వ్యక్తులు నీళ్లు తోడుకోవడానికి వచ్చినా ఆ బావి ఎవరికీ తేడా లేకుండా అన్ని పాత్రల్లోనూ నీరు ఒకేలా ఉంటుంది. సమాజాన్ని విభజించేందుకు యత్నించే ప్రతి చెడు ఆచారాన్ని సంత్ కబీర్ వ్యతిరేకించారు. సమాజాన్ని మేల్కొల్పడానికి కృషి చేశారు. ప్రస్తుతం దేశం అభివృద్ధి చెందాలనే సంకల్పం తో ముందుకు సాగుతున్నప్పుడు సంత్ కబీర్‌ ను స్ఫూర్తి గా తీసుకొని సమాజాన్ని శక్తిమంతం చేయడానికి మన ప్రయత్నాల ను పెంచాలి.

 

ప్రియమైన నా దేశప్రజలారా, రాజకీయాల లో, చలనచిత్ర పరిశ్రమ లో తన అద్భుతమైన ప్రతిభ తో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి ని గురించి ఇప్పుడు మీతో నేను చర్చించబోతున్నాను. ఆ మహనీయుని పేరు ఎన్.టి. రామారావు. ఆయన మనందరికీ ఎన్ టి ఆర్ అనే పేరు తో కూడా తెలుసును. ఈ రోజు న ఎన్ టిఆర్ 100 వ జయంతి. ఆయన తన బహుముఖ ప్రజ్ఞ తో తెలుగు చలన చిత్ర సీమ లో సూపర్‌స్టార్‌ గా నిలవడమే కాకుండా కోట్లాది ప్రజల హృదయాల ను కూడా గెలుచుకొన్నారు. ఆయన 300 కు పైగా సినిమాల లో నటించిన సంగతి మీకు తెలుసా? ఆయన తన నటన ప్రతిభ తో అనేక చరిత్రాత్మక పాత్రల కు జీవం పోశారు. భగవాన్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి అనేక పాత్రల లో ఎన్ టిఆర్ నటన ను ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారు. ప్రజలు ఇప్పటికీ ఆయన ను గుర్తుంచుకుంటారు. ఎన్ టిఆర్ సినీరంగం తో పాటు రాజకీయాల లోనూ తనకంటూ ఓ గుర్తింపు ను తెచ్చుకొన్నారు. ఇక్కడ కూడా ఆయన ప్రజల నుండి చాలా ప్రేమ ను, ఆశీర్వాదాల ను పొందారు. దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజల హృదయాల ను ఏలిన ఎన్. టి. రామారావు గారికి నా వినమ్రపూర్వకమైనటువంటి నివాళుల ను అర్పిస్తున్నాను.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈసారి 'మన్ కీ బాత్' (మనసు లో మాట) కార్యక్రమం లో ఇంతే. వచ్చేసారి మరికొన్ని కొత్త అంశాల తో మీ మధ్య కు వస్తాను. అప్పటి కి కొన్ని ప్రాంతాల లో ఉష్ణోగ్రత మరింత పెరగవచ్చు. కొన్ని చోట్ల వర్షాలు కూడా మొదలవుతాయి. ప్రతి వాతావరణ స్థితి లో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత గా చూసుకోవాలి. జూన్ 21వ తేదీ ని మనం 'ప్రపంచ యోగ దినం' గా కూడా జరుపుకొంటాం. దేశ విదేశాల లో అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సన్నాహాల ను గురించి కూడా మీరు మీ 'మన్ కీ బాత్' (మనసు లో మాట) ను నాకు వ్రాస్తూ ఉండండి. మీ దగ్గర మరేదైనా అంశం పై మరింత సమాచారం ఉంటే, అది కూడా నాకు చెప్పండి. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో అత్యధికం గా సూచనలు తీసుకొనేందుకే నేను ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ మరోసారి చాలా చాలా ధన్యవాదాలు. వచ్చే నెల మళ్ళీ కలుసుకొందాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి.

 

నమస్కారం.

 

***

 



(Release ID: 1927837) Visitor Counter : 267