రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి భారతదేశం ఆఫ్రికన్ దేశాలతో కలిసి పని చేస్తూనే ఉంటుందని పూణేలో జరిగిన 1వ భారత్-ఆఫ్రికా సైనిక దళాధిపతుల సదస్సులో పేర్కొన్న - రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్


రక్షణ-సంబంధిత విషయాలన్నింటిలో భాగస్వామ్య దేశాలకు మద్దతును పునరుద్ఘాటించిన - భారతదేశం


తమ భద్రతా అవసరాలను తీర్చడానికి భారత రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించాలని ఆఫ్రికా కంపెనీలను ఆహ్వానించిన - శ్రీ రాజ్‌నాథ్ సింగ్


"భారత్-ఆఫ్రికా సంబంధాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు మరింత ప్రతిస్పందించే బహుళ-ధ్రువ ప్రపంచ క్రమాన్ని నిర్మించడానికి సౌత్-సౌత్ సహకారాన్ని నడిపిస్తాయి"

Posted On: 28 MAR 2023 1:53PM by PIB Hyderabad

ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి, కలిసి రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి భారతదేశం ఆఫ్రికన్ దేశాలతో కలిసి పని చేయడం కొనసాగిస్తుంది.  2023 మార్చి, 28వ తేదీన మహారాష్ట్రలోని పూణే లో 2వ ఆఫ్రికా-భారత్ సంయుక్త విన్యాసాల ప్రదర్శన ‘అఫిన్డెక్స్’ సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్-ఆఫ్రికా  సైనిక దళాధిపతుల మొదటి సదస్సు సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు.  ఈ సదస్సులో భారత సైనిక దళాధిపతి జనరల్ మనోజ్ పాండేతో పాటు 31 ఆఫ్రికా దేశాల  సైనిక దళాధిపతులు, ప్రతినిధులు, ఇతర పౌర, రక్షణ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

ఆఫ్రికా భాగస్వామ్య దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధిని నిర్ధారించడానికి వారి సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించడంతో సహా అన్ని రక్షణ సంబంధిత విషయాలలో మద్దతు అందించడానికి భారతదేశ నిబద్ధతను శ్రీ రాజ్‌ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.  దేశానికి భద్రత కల్పించినప్పుడే ఆ దేశ ప్రగతికి పూర్తి సామర్థ్యం లభిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. 

 

 

అదే విధంగా, ప్రజల అవసరాలు, ఆకాంక్షలను తీర్చగల బలమైన రాజ్య వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరం గురించి రక్షణ మంత్రి వివరిస్తూ,  “జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఉపాధి హక్కు, జీవనోపాధి హక్కు వంటి వ్యక్తిగత మానవ హక్కుల పరిరక్షణ అనేది చట్టబద్ధమైన పాలనను నిర్ధారించడంతోపాటు ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించగల బలమైన, సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగంపై ఆధారపడి ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము.  సురక్షితంగా మరియు భద్రత తో కూడిన వాతావరణంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది.  మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనలో చాలా మంది చాలా అభివృద్ధి చెందినప్పటికీ, అనేక ఆఫ్రికా దేశాల్లో, అక్కడి రాజ్య వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం ఇంకా పురోగతిలో ఉంది.” అని నొక్కి చెప్పారు. 

 

 

21వ శతాబ్దపు భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఆఫ్రికా దేశాల సాయుధ దళాలకు శిక్షణ అందించడం, వారికి అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడంలో భారతదేశం ముందంజలో ఉంది.  శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతి-తిరుగుబాటు కార్యకలాపాలు, శాంతి పరిరక్షణ, సముద్ర భద్రతతో పాటు, సైబర్ వార్‌ఫేర్, డ్రోన్ కార్యకలాపాల వంటి కొత్త డొమైన్‌ లలో ప్రత్యేక శిక్షణ తో సహా అనేక ఇతర రంగాల్లో శిక్షణ ఉంటుంది.  ఇది విపత్తు నిర్వహణ, మానవతా సహాయం, వైద్య సహాయం వంటి రంగాల్లో పౌరులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.   ఆఫ్రికా దేశాలకు చెందిన సాయుధ దళాల సిబ్బంది పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల్లో శిక్షణ కోసం భారతదేశాన్ని సందర్శిస్తూనే ఉన్నారు.

 

 

భారత్, ఆఫ్రికా దేశాల మధ్య ఉమ్మడి కార్యక్రమాలు, సాయుధ దళాలు పరస్పరం నేర్చుకోవడానికి, పరస్పర కార్యక్రమాలు ప్రోత్సహించడానికి, అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తాయని రక్షణ మంత్రి తెలియజేశారు.   సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, పరస్పర సామర్థ్యాలను పెంపొందించడానికి ఆఫ్రికా దేశాలపై భారతదేశ నిరంతర దృష్టికి ఈ ‘అఫిన్డెక్స్’ ను  ఒక ప్రతిబింబంగా ఆయన అభివర్ణించారు.  "హిందూ మహాసముద్రంతో ముడిపడి ఉన్న ఇరుగు పొరుగు దేశాలకు చెందిన వారిగా, సముద్ర భద్రత, సముద్రాల గురించి అధ్యయనం, ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మన సహకారం ప్రాంతీయ శాంతి, శ్రేయస్సు కోసం చాలా అవసరం" అని ఆయన పేర్కొన్నారు. 

 

 

రక్షణ పరికరాలు, వేదికల పరంగా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అనేది, ఆఫ్రికా భాగస్వాములతో భారతదేశ సైనిక సహకారంలో మరొక కీలకమైన అంశంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.  తమ భద్రతా అవసరాలను తీర్చుకునేందుకు వీలుగా భారత రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించాలని ఆఫ్రికన్ దేశాలను ఆయన ఆహ్వానించారు.  ''ఇటీవలి సంవత్సరాలలో రక్షణ రంగ ఎగుమతిదారుల్లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది.  సమృద్ధిగా సాంకేతిక మానవ వనరుల ప్రయోజనాన్ని కలిగి ఉన్న రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థ ఇక్కడ సృష్టించబడింది.   మీ రక్షణ అవసరాలను తీర్చడానికి భారత రక్షణ పరిశ్రమ మీతో కలిసి పని చేస్తుంది.  మన ఆఫ్రికా స్నేహితులకు వారి రక్షణ అవసరాలను స్వదేశీయంగా తీర్చడానికి సాధికారత కల్పించే లక్ష్యంతో, రక్షణ తయారీ, పరిశోధన, అభివృద్ధిలో మా నైపుణ్యం, పరిజ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము,” అని హామీ ఇచ్చారు. 

 

 

భారత్, ఆఫ్రికా దేశాల సంబంధాల గురించి రక్షణ మంత్రి మరింతగా వివరిస్తూ, "పేదరికాన్ని నిర్మూలించడం, స్థిరమైన అభివృద్ధి సాధించడం, శాంతి, సామరస్యాలను ప్రోత్సహించడం, ప్రజల జీవన నాణ్యతను మెరుగు పరచడం అనే ఉమ్మడి లక్ష్యాల ద్వారా మనం ఐక్యంగా ఉన్నాం. " అని పేర్కొన్నారు.  అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు మరింత ప్రతిస్పందించే నిజమైన బహుళ-ధ్రువ ప్రపంచ క్రమాన్ని నిర్మించడానికి ఈ భాగస్వామ్యం సౌత్-సౌత్ సహకారాన్ని నడిపిస్తుందని ఆయన అన్నారు.

 

 

భారత్, ఆఫ్రికా దేశాల ప్రజలు మొత్తం మానవాళిలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొంటూ, ఈ జనాభా ప్రయోజనాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి.  ఈ భారీ మానవ వనరులను పెరుగుదల, అభివృద్ధికి ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  "చాలా ఆఫ్రికా దేశాలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జనాభా వృద్ధి రేటును కలిగి ఉన్నాయి.  కొన్ని అంచనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు ఆఫ్రికా దేశాలకు చెందిన వారై ఉంటారు.  అందువల్ల, మానవత్వం అభివృద్ధి చెందాలంటే, ఆఫ్రికా అభివృద్ధి చెందాలి.  నేడు, ఆఫ్రికా ఒక బిలియన్ కంటే ఎక్కువ శక్తివంతమైన వ్యక్తులకు నిలయంగా ఉంది, వారిలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వయసు వారు ఉన్నారు.  ఈ మానవ మూలధనానికి సరైన అవకాశాలతో మద్దతు లభిస్తే, అది ఆఫ్రికాకే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా వృద్ధి కారకం అవుతుంది.” అని ఆయన తెలియజేశారు. 

 

 

అధిక ఆర్థిక వృద్ధి రేట్ల నుండి అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని పట్టుకోవడానికి చాలా ముఖ్యమైన కారణాల్లో సాపేక్ష సాంకేతిక వెనుకబాటుతనం ఒకటని, రక్షణ మంత్రి పేర్కొన్నారు.  ఈ అంతరాన్ని అధిగమించడానికి అవసరమైన అవకాశాన్ని నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు కల్పిస్తాయని ఆయన పేర్కొంటూ, ఆఫ్రికా దేశాల ప్రయోజనాల కోసం డిజిటల్, క్లీన్ & గ్రీన్ టెక్నాలజీలలో భారతదేశ నైపుణ్యాలను వివరించారు.  యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యు.పి.ఐ) ద్వారా మొత్తం పౌరులను ఆర్థికంగా బలోపేతం భారతదేశం సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, దీనిని ఆర్థిక విప్లవంగా ఆయన అభివర్ణించారు.  ఆలోచనలు, అభ్యాసాల మార్పిడి రెండు విధాలుగా ఉంటుందనీ, భారతదేశం తన ఆఫ్రికా స్నేహితుల అనుభవాల నుండి నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతోందని కూడా ఆయన నొక్కి చెప్పారు.

 

 

'ప్రాంతీయ ఐక్యత కోసం ఆఫ్రికా-ఇండియా సైన్యాలు - అమృత్' అనే ప్రధాన ఇతివృత్తంతో భారత్-ఆఫ్రికా సైనిక దళాధిపతుల సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రాంతీయ సహకార యంత్రాంగంలో భాగంగా భారత, ఆఫ్రికా దేశాలకు చెందిన సైనికుల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం, మెరుగుపరచడం దీని లక్ష్యం.

 

 

భారత రక్షణ పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు, ఉమ్మడి సైనిక శిక్షణ, శాంతి పరిరక్షణ కార్యకలాపాల అమలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి, సంస్థాగతమైన వ్యవస్థను రూపొందించడానికి, దేశాల మధ్య ఉమ్మడి శిక్షణ, రక్షణ సహకారంపై ఈ సదస్సు దృష్టి సారించింది.  భారత, ఆఫ్రికా దేశాల మధ్య లోతుగా పాతుకుపోయిన రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి కాగా, ఇది ప్రాంతీయ సహకారాన్ని మెరుగుపరుస్తుంది.

 

 

****



(Release ID: 1911874) Visitor Counter : 142