హోం మంత్రిత్వ శాఖ

ఈశాన్య భారతావనిలో శాంతి నెలకొని, అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ( ఏ ఎస్ ఎస్ పీఏ) కింద సమస్యాత్మక ప్రాంతాల సంఖ్య తగ్గింపు.. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఈశాన్య భారతదేశంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడటంతో సమస్యాత్మక ప్రాంతాల సంఖ్య తగ్గింపు..శ్రీ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదటిసారిగా ఈశాన్య రాష్ట్రాల భద్రత, శాంతి, అభివృద్ధికి పటిష్ట చర్యలు.. శ్రీ షా

ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో శాంతి నెలకొనడంతో అభివృద్ధి పధంలో ఈశాన్య భారతావని పరుగులు.. శ్రీ షా

ఈశాన్య భారతదేశ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చి,ఈశాన్య భారతదేశాన్ని దేశం అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేసిన ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు. శ్రీ షా

Posted On: 25 MAR 2023 2:21PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల ఈశాన్య భారతదేశంలో శాంతిభద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈశాన్య భారతదేశ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చి,ఈశాన్య భారతదేశాన్ని దేశం అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ప్రాంత ప్రజల తరపున  శ్రీ షా కృతజ్ఞతలు తెలిపారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్ట చర్యల వల్ల ఈశాన్య రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఈశాన్య భారతదేశం వేగంగా అభివృద్ధి పధంలో పయనిస్తోంది. 2014 సంవత్సరం తో పోల్చి చూస్తే 2022 లో ఈశాన్య ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు 76% వరకు తగ్గాయి. హింసాత్మక ఘటనల వల్ల ప్రాణాలు కోల్పోయిన సాధారణ పౌరులు, భద్రతా సిబ్బంది సంఖ్య కూడా తగ్గింది. ప్రాణాలు కోల్పోయిన సాధారణ పౌరులు, భద్రతా సిబ్బంది సంఖ్య 2014లో 90%వరకు, 2022లో 97% వరకు తగ్గింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్ట చర్యలు ఈశాన్య భారతదేశంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడేలా చూసేందుకు సహకరించాయి. కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుని ఈశాన్య భారతదేశంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ( ఏ ఎస్ ఎస్ పీఏ) కింద నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలలో  సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాల సంఖ్య ని మొదటిసారిగా 2022 ఏప్రిల్ నెల నుంచి తగ్గించింది. 2023 ఏప్రిల్ నుంచి సమస్యాత్మక ప్రాంతాల సంఖ్య ని కేంద్రం మరింత తగ్గించింది.  శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడటంతో సమస్యాత్మక ప్రాంతాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించామని కేంద్ర హోంశాఖ మంత్రి వెల్లడించారు. 

ఈశాన్య భారతదేశంలో శాంతి, అభివృద్ధి, భద్రతా అంశాలకు మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వడంతో ఈశాన్య భారతదేశం అభివృద్ధి పధంలో వేగంగా అడుగులు వేస్తోంది. 

ఈశాన్య భారతదేశం శాంతి నెలకొని ఈ ప్రాంతం అభివృద్ధి పధంలో పయనించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్ష కార్యరూపం దాల్చేలా చూసేందుకు హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో గత నాలుగు సంవత్సరాల కాలంలో ఈశాన్య భారతదేశంలో అనేక శాంతి ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన చర్యలు, కుదుర్చుకున్న శాంతి ఒప్పందాల వల్ల ఈశాన్య భారతదేశంలో అనేక తీవ్రవాద సంస్థలు ఆయుధాలు విడిచిపెట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ జన జీవన స్రవంతిలో కలిసి అభివృద్ధి, శాంతి కోసం తమ సహకారం అందిస్తున్నాయి. 2014 నుంచి ఇంతవరకు దాదాపు 7000 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు. 

ఈశాన్య భారతదేశంలో శాంతి నెలకొని ఈ ప్రాంతం అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశలను సాకారం చేయడానికి గత నాలుగు సంవత్సరాల కాలంలో శ్రీ అమిత్ షా నాయకత్వంలో కేంద్ర హోంశాఖ పలు చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటివల్ల దశాబ్దాల తరబడి పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలు పరిష్కారం అయ్యాయి. 

* తీవ్రవాదులను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి 2019 ఆగష్టు నెలలో కేంద్ర ప్రభుత్వం త్రిపుర ఎన్ఎల్ఎఫ్టీ (ఎస్డీ) తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. 

* 2020 జనవరి నెలలో కుదిరిన బోడో ఒప్పందం అస్సాంలో దశాబ్దాల తరబడి ఉన్న బోడో సమస్యను పరిష్కరించింది.  

* 2020 జనవరి లో దశాబ్దాల తరబడి ఎదురవుతున్న  బ్రూ-రియాంగ్ శరణార్థుల సంక్షోభాన్ని పరిష్కరించడానికి చారిత్రాత్మక ఒప్పందం సంతకం చేయబడింది, దీని కింద 37,000 మంది అంతర్గతంగా నిర్వాసితులైన త్రిపురలో పునరావాసం పొందుతున్నారు.

* 2021 సెప్టెంబరు నాటి కర్బీ-అంగ్లాంగ్ ఒప్పందం అస్సాంలోని కర్బీ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న వివాదాన్ని పరిష్కరించింది.

*  2022 సెప్టెంబర్ నెలలో అస్సాం గిరిజన సంస్థతో కేంద్రం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

చొరబాట్లకు తావు లేని ప్రాంతంగా ఈశాన్య భారతదేశాన్ని మార్చాలన్న కృతనిశ్చయంతో   ప్రధాని మోదీ ఉన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో కేంద్ర ప్రభుత్వం  నిరంతరం చర్చలు జరుపుతోంది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల వల్ల  భద్రతా పరిస్థితి మెరుగుపడటంతో  2015లో త్రిపుర , 2018లో మేఘాలయ రాష్ట్రాలను కల్లోల ప్రాంతాలుగా ప్రకటిస్తూ  సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం  కింద జారీ చేసిన  నోటిఫికేషన్ పూర్తిగా రద్దయింది. 

1990 నుంచి అస్సాం రాష్ట్రం పూర్తిగా కల్లోల ప్రాంత నోటిఫికేషన్ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడింది. పరిస్థితి మెరుగుపడటంతో 9 జిల్లాలు, ఒక జిల్లాలోని ఒక సబ్ డివిజన్ మినహా అస్సాం రాష్ట్రంలో 01.0.4.22  కల్లోల ప్రాంత నోటిఫికేషన్ రద్దయింది. 01.0.4.23 నుంచి 8 జిల్లాల్లో మాత్రమే కల్లోల ప్రాంత నోటిఫికేషన్ అమలులో ఉంది. 

మణిపూర్‌లో (ఇంఫాల్ మునిసిపాలిటీ ప్రాంతం మినహా)  సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద  కల్లోల ప్రాంత నోటిఫికేషన్  2004 నుంచి అమలులో ఉంది. నోటిఫికేషన్  పరిధి నుంచి 6 జిల్లాలకు చెందిన 15 పోలీసు స్టేషన్లను ఉపసంహరిస్తూ 01.0.4.22 న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 01.0.4.23 నుంచి మరో 4 పోలీస్ స్టేషన్ ప్రాంతాలు కల్లోల  ప్రాంతం పరిధి నుంచి బయటపడ్డాయి. మణిపూర్ రాష్ట్రంలో 7 జిల్లాల పరిధిలో 19 పోలీస్ స్టేషన్ ప్రాంతాలు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద  కల్లోల ప్రాంత నోటిఫికేషన్ పరిధి నుంచి తొలగించబడ్డాయి.

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద  కల్లోల ప్రాంత నోటిఫికేషన్ 1995 నుంచి నాగాలాండ్ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తోంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద  కల్లోల ప్రాంత నోటిఫికేషన్ అమలుపై ఏర్పాటైన కమిటీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దశలవారీగా చట్టాన్ని ఉపసంహరించాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 7 జిల్లాల్లో 15 పోలీస్ స్టేషన్ ప్రాంతాల పరిధిలో 01.0.4.22 నుంచి చట్టం అమలును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 01.0.4.23 నుంచి మరో 3 మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్టం అమలు కాదు. ప్రస్తుతం నాగాలాండ్ రాష్ట్రంలో 8 జిల్లాల్లో పనిచేస్తున్న 18 పోలీస్ స్టేషన్ ప్రాంతాల పరిధిలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద  కల్లోల ప్రాంత నోటిఫికేషన్ రద్దయింది. 

చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ నరేంద్ర మోదీ పాలనలో ఈశాన్య భారతావనిలో జీవిస్తున్న ప్రజల జీవన స్థితిగతులు మారాయని శ్రీ షా అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న చర్యల వల్ల దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని శ్రీ షా అన్నారు.   

***

 



(Release ID: 1910918) Visitor Counter : 209