గనుల మంత్రిత్వ శాఖ
మరిన్ని ప్రైవేటు సంస్థలను ఖనిజ అన్వేషణలోకి ఆకర్షించడం పట్ల ఆసక్తితో ఉన్న ప్రభుత్వం - శ్రీ ప్రహ్లాద్ జోషి
900 మిలియన్ టన్నులను తాకనున్న మొత్తం బొగ్గు ఉత్పత్తి
ఈ ఆర్ధిక సంవత్సరంలో 140 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసిన కాప్టివ్ బొగ్గు గనులు
Posted On:
23 AUG 2022 3:04PM by PIB Hyderabad
ఖనిజాల అన్వేషణకు మరింత మంది ప్రైవేటు వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు కేంద్రం నిరంతర కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ చెప్పారు. డ్రోన్లు, ఇతర ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడాన్ని పెంచడం ద్వారా పర్యావరణంపై దుష్ప్రాభవం పడకుండా ఖనిజాల అన్వేషణ జరుగుతుందని ఆయన అన్నారు.
భారతీయ ఖనిజాలు & లోహాల పరిశ్రమ- 2030 దిశగా పరివర్తన & దార్శనికత 2047 (Indian Minerals & Metals Industry - Transition Towards 2030 & Vision 2047”) అన్న అంశంపై ఎన్ఎండిసి లిమిటెడ్, ఉక్కు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, ఫిక్కి సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మంగళవారం ప్రసంగించారు. వాణిజ్య బొగ్గు గని వేలం ద్వారా గత ఏడాది రూ. 25000 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించారని, ఆదాయ ఉత్పత్తిలో ఒడిషా రాష్ట్రం ముందుందని శ్రీ జోషి తెలిపారు. నూతన యుగ ఖనిజాల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించవలసిందిగా జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ)కి మంత్రి పిలుపిచ్చారు. గనుల రంగంలో ఇటీవలి కాలంలో ప్రారంభించిన సంస్కరణల గురించి మాట్లాడుతూ, కాప్టివ్ మైన్ల (స్వీయ ఉపయోగానికి బొగ్గు గనులు) బొగ్గు ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం 89 మిలియన్ టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 140 మిలియన్ టన్నులుగా ఉందని ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం బొగ్గు ఉత్పత్తి 900 మిలియన్ టన్నులుగా ఉండనుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ఖనిజాల అన్వేషణకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేందుకు, జాతీయ ఖనిజాల అన్వేషణ ట్రస్ట్ (నేషనల్ మినరల్ ఎక్సప్లొరేషన్ ట్రస్ట్ - ఎన్ఎంఇటి)ని స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా మార్చినట్టు మంత్రి చెప్పారు. ఇటీవలే ఆస్ట్రేలియాకు తన విజయవంతమైన పర్యటన గురించి మాట్లాడుతూ, ఆస్ట్రేలియాతో పోలిస్తే మన ఖనిజాల అన్వేషణ పరిమిత ప్రాంతానికే పరిమితమై ఉందని అన్నారు. వినూత్న చొరవలు, చట్టాలు, నిబంధనలలో సవరణ ఫలితంగా, 190 ప్రధాన ఖనిజ బ్లాకులను గత ఏడేళ్ళలో వేలం వేయడం జరిగిందన్నారు. వాణిజ్య బొగ్గు గనుల వేలం భారీ విజయవంతమైందని పట్టి చూపుతూ, త్వరిత గతిన తమకు కేటాయించిన బొగ్గు బ్లాకులలో ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన కోరారు. లేదంటే, వాటిని తిరిగి వేలం వేసేందుకు మంత్రిత్వ శాఖ అప్పగించవలసి వస్తుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1853993)
Visitor Counter : 138