ప్రధాన మంత్రి కార్యాలయం

‘పరీక్షలపై ఇష్టాగోష్ఠి (పరీక్షా పే చర్చ)-2022’ లో విద్యార్థులు.. తల్లిదండ్రులతో ప్రధాని మాటామంతీ


“పండుగ ఆనందోత్సాహాల నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడీలేకుండా పరీక్షలకు హాజరుకండి”

“సాంకేతిక పరిజ్ఞానాన్ని సవాలుగా కాకుండా అవకాశంగా భావించండి”

“జాతీయ విద్యావిధానంపై సమగ్ర సంప్రదింపులు సాగాయి… ఈ విషయంలో దేశవ్యాప్తంగా ప్రజలతో చర్చ నిర్వహించబడింది”

“20వ శతాబ్దపు విద్యా విధానం.. నాటి ఆలోచనలు 21వ శతాబ్దంలో మన ప్రగతి పథాన్ని నిర్ణయించలేవు; కాలంతోపాటుమనమూ మారాలి”

“తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు నెరవేరని తమ కలలను విద్యార్థులపైరుద్దకూడదు; పిల్లలకు తమ సొంత కలల సాకారంపై శ్రద్ధ ప్రధానం”

“ప్రేరణ పొందడానికి ఎలాంటి ఇంజక్షన్‌ లేదా సూత్రం ఉండవు; మిమ్మల్ని మీరు మెరుగ్గా ఆవిష్కరించుకుని.. మీకేది ఇష్టమో గుర్తించిదానికోసం కృషి చేయండి”

“మీకు నచ్చే పనులు చేసినపుడు మాత్రమే మీరు గరిష్ఠ ఫలితం పొందగలరు”

“మీదొక ప్రత్యేక తరం- అవును.. మీకు పోటీ అధికమేగానీ, అవకాశాలూ ఎక్కువే”

“కూతురే కుటుంబానికి బలం… మన నారీశక్తి వివిధరంగాల్లో రాణించడాన్ని చూడటంకన్నా సంతోషకరమైంది మరేముంటుంది!”

“ఇతరుల సామర్థ్యాన్ని.. ఉత్తమ లక్షణాలనుమెచ్చుకోవడానికి... అంతేగాక వాటిని అలవరచుకోవడానికి ప్రయత్నించండి”

“మీతో ముచ్చటిస్తున్న సందర్భంగా మీ ఆశలు.. ఆకాంక్షలను గ్రహిస్తూ ఆ మేరకు నా జీవితాన్ని మలచుకునే ప్రయత్నం చేస్తాను.. ఆ రూపంలో ఈ కార్యక్రమం నా ఎదుగుదలకూ తోడ్పడుతోంది”

Posted On: 01 APR 2022 1:56PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పక్షలపై ఇష్టాగోష్ఠి-2022” (పరీక్షా పే చర్చ-పీపీసీ) 5వ సంచికలో భాగంగా న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించారు. ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమానికి ముందు వేదిక వద్ద విద్యార్థులు రూపొందించిన వస్తుప్రదర్శనను ఆయన తిలకించారు. కేంద్ర మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీమతి అన్నపూర్ణా దేవి, డాక్టర్ సుభాస్ సర్కార్, డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్‌లతోపాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులుసహా వారి తల్లిదండ్రులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం ఆసాంతం ప్ర‌ధానమంత్రి వారితో మమేకమవుతూ ఉల్లాసంగా, సంభాషణ రూపాన్ని కొనసాగించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- నిరుడు ఇదే కార్యక్రమంలో యువమిత్రులను కలుసుకున్న తర్వాత మళ్లీ ఇవాళ వారితో సమావేశం కావడం ఎంతో ఆనందం కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తనకెంతో ఇష్టమైనదని ప్రధాని అన్నారు. రేపు విక్రమనామ సంవత్సరారంభం (ఉగాది) కావడంతోపాటు రాబోయే మరిన్ని పండుగలను పురస్కరించుకుని విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పీపీసీ’ 5వ సంచికలో కొత్త సంప్రదాయానికి ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సమయాభావం వల్ల తాను స్వీకరించలేని ప్రశ్నలకు నమోయాప్‌ద్వారా వీడియో, ఆడియో లేదా వచన సందేశాల రూపంలో జవాబిస్తానని ఆయన ప్రకటించారు.

 

ఈ కార్యక్రమంలో ముందుగా పరీక్షలకు సంబంధించి ఆందోళన, ఒత్తిడులపై ఢిల్లీ నగర విద్యార్థి ఖుషీ జైన్‌ నుంచి తొలి ప్రశ్నరాగా- ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌నుంచి వడోదరకు చెందిన కినీ పటేల్‌ కూడా అదే ప్రశ్న వేశారు. అయితే, ఇలాంటి పరీక్షలు రాయడం వారికిది తొలిసారి కాదు కాబట్టి ఒకవిధంగా మీరు పరీక్షాతీతులుఅంటూ- ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదని ప్రధాని వారికి సూచించారు. మునుపటి పరీక్షల అనుభవం రాబోయే పరీక్షల ఒత్తిడిని అధిగమించడంలో తోడ్పడగలదని చెప్పారు. కొంత భాగం చదవలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ దానిపై ఆందోళన చెందవద్దని చెప్పారు. తమ సంసిద్ధత బలంపై విశ్వాసంతో నింపాదిగా, రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నం కావాల్సిందిగా సలహా ఇచ్చారు. ఇతరులను అనుకరించడం వంటి ప్రయత్నాలు చేయకుండా తమ దైనందిన కార్యక్రమాలు, చదువు సంగతి చూసుకుంటూనే పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు.

 

కర్ణాటకలోని మైసూరు విద్యార్థి తరుణ్ రెండో ప్రశ్నను సంధించాడు. యూట్యూబ్వంటి అనేక ఆకర్షణల నడుమ ఆన్‌లైన్‌లో అధ్యయనం ఎలాగని అతను అడిగాడు. అలాగే ఢిల్లీ నుంచి షాహిద్‌ అలీ, కేరళలోని తిరువనంతపురం నుంచి కీర్తన, తమిళనాడులోని కృష్ణగిరి నుంచి ఉపాధ్యాయుడు చంద్రచూడేశ్వరన్‌ కూడా ఇదే ప్రశ్న సంధించారు. చదువు విషయంలో ఈ సమస్య ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులకు సంబంధించినది కాదని, ఆఫ్‌లైన్‌ చదువు విధానంలోనూ మనను పక్కకులాగే అంశాలుంటాయని ప్రధాని పేర్కొన్నారు. సమస్య విధానంలో లేదుమనసులోనే ఉంటుందిఅన్నారు. ఆన్‌లైన్‌లోనైనా, ఆఫ్‌లైన్‌ పద్ధతిలోనైనా మన ఏకాగ్రత చదువుపై ఉన్నపుడు ఇతరత్రా ఆటంకాలు దాన్ని చెదరగొట్టలేవని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం నిత్యం అభివృద్ధి చెందుతున్నదని, ఆ మేరకు విద్యాసంబంధిత కొత్త సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. కొత్త అభ్యసన పద్ధతులను ఒక సవాలుగా కాకుండా అవకాశంగా పరిగణించాలని సూచించారు. విద్యార్థుల ఆఫ్‌లైన్‌ అధ్యయనానికి ఆన్‌లైన్‌ మరింత తోడ్పాటునిస్తుందన్నారు. ఆన్‌లైన్‌ అన్నది సమీకరణకు దోహదం చేస్తే, ఆఫ్‌లైన్‌ దాన్ని సమృద్ధం చేసి, కార్యసిద్ధికి తోడ్పడుతుందన్నారు. దీనికి సంబంధించి దోసె తయారీని ఆయన ఉదాహరిస్తూ- ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో ఎవరైనా నేర్చుకోవచ్చుకానీ, ప్రత్యక్షంగా చేస్తేనే అది కార్యరూపం దాలుస్తుందని వివరించారు. ఆన్‌లైన్‌ ప్రపంచ ఊహల్లో విహరించడం కాకుండా తమగురించి తాము ఆలోచిస్తూ తదనుగుణంగా నడచుకోవాలని సూచించారు.

 

హర్యానాలోని పానిపట్‌ నగర ఉపాధ్యాయిని సుమన్‌ రాణి మాట్లాడుతూ- కొత్త విద్యా విధానంలోని అంశాలు ప్రధానంగా విద్యార్థుల జీవితాలకుమొత్తంగా సమాజానికి ఎలాంటి సాధికారతనిస్తాయినవ భారతానికి అవి బాటలు వేస్తాయా? అని ప్రశ్నించారు. అలాగే మేఘాలయలోని ఈస్ట్‌ కైలాస్‌ హిల్స్‌కు చెందిన శైలా కూడా ఇదే తరహా ప్రశ్నవేశారు. దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ- ఇది జాతీయ విద్యావిధానమే తప్ప కొత్తవిద్యావిధానం కాదని బదులిచ్చారు. దేశంలోని వివిధ భాగస్వాములతో రికార్డు స్థాయిమేథోమథనం అనంతరం ఈ విధానం రూపుదిద్దుకున్నదని చెప్పారు. జాతీయ విద్యావిధానంపై సమగ్ర సంప్రదింపులు సాగాయిఈ విషయంలో దేశవ్యాప్తంగా ప్రజలతో చర్చ నిర్వహించబడిందిఅని వివరించారు. ఇది ప్రభుత్వం రూపుదిద్దిన విధానం కాదని, పౌరులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశ ప్రగతి దిశగా దీనికి రూపమిచ్చారని పేర్కొన్నారు. లోగడ వ్యాయామ విద్య, శిక్షణ అదనపు పాఠ్యాంశాలుగా ఉండేవని గుర్తుచేశారు. అయితే, నేడు వాటిని విద్యలో భాగం చేసిన నేపథ్యంలో వాటికి ప్రాముఖ్యం మరింత పెరిగిందని చెప్పారు. మన 20వ శతాబ్దపు విద్యా విధానం, సంబంధిత ఆలోచనలు ప్రస్తుత 21వ శతాబ్దంలో దేశ ప్రగతి పథాన్ని నిర్ణయించలేవని ఆయన చెప్పారు. ఆ మేరకు కాలమాన పరిస్థితుల్లో మారుతున్న వ్యవస్థలతోపాటు మనమూ మారకపోతే పూర్తిగా వెనుకబడి, తిరోగమన పథంలోకి వెళ్లిపోతామని హెచ్చరించారు. విద్యార్థులు తమ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి జాతీయ విద్యావిధానం అవకాశం కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విజ్ఞానంతోపాటు నైపుణ్యానికిగల ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. అందుకే జాతీయ విద్యావిధానంలో నైపుణ్యాలు ఒక భాగంగా చేర్చబడ్డాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంపిక చేసుకోవడంలో జాతీయ విద్యావిధానం ఎంతో వెసులుబాటు ఇస్తుందని వివరించారు. ఈ విధానాన్ని సవ్యంగా అమలు చేయగలిగితే కొత్త మార్గాలు తెరుచుకుంటాయని చెప్పారు. విద్యార్థులు ఆవిష్కరించిన సాంకేతికతలను ఉపయోగంలోకి తెచ్చేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని దేశంలోని పాఠశాలలన్నిటికీ ప్రధాని పిలుపునిచ్చారు.



ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఘ‌జియాబాద్ కు చెందిన రోషిని, త‌మ కుటుంబ ఆకాంక్ష‌ల‌ను నేర‌వేర్చ‌డం గురించి, ప‌రీక్షా ఫ‌లితాల గురించి, త‌ల్లిదండ్రులు కోరుతున్న‌ట్టు విద్య‌ను సీరియ‌స్ గా తీసుకోవాలా లేక దీనిని ఒక పండుగ లా ఆనందించాలా అని ప్ర‌శ్నించింది. పంజాబ్ లోని భ‌టిండాకు చెందిన కిర‌ణ్ ప్రీత్ కౌర్ ఇలాంటి ప్ర‌శ్న‌నేవేశారు. తమ క‌ల‌ల‌ను విద్యార్థుల‌పై రుద్ద‌వ‌ద్ద‌నిత‌ల్లిదండ్రులు , ఉపాధ్యాయుల‌కు ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. తాము సాకారం చేసుకోలేక పోయిన క‌ల‌ల‌ను త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల‌పై రుద్ద రాద‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. ప్ర‌తి విద్యార్థికి కొన్ని ప్ర‌త్యేక సామ‌ర్ధ్యాలు ఉంటాయ‌ని, వాటిని గుర్తించాల‌ని త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల‌కు ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. విద్యార్థులు త‌మ‌బ‌ల‌మేమిటో గుర్తించి విశ్వాసంతో ముందుకు సాగిపోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి వారికి తెలియ‌జేశారు.

 

మ‌న‌కు మ‌రిన్ని బ్యాక్‌లాగ్‌లు ఉన్న‌ప్పుడు , ప్రేర‌ణ‌తో విజ‌యం సాధించ‌డం ఎలా అని ఢిల్లీకి చెందిన వైభ‌వ్ క‌న్నౌజియా అడిగారు. ఒడిషాకు చెందిన ఒక విద్యార్ధి తండ్రి సుజిత్ కుమార్ ప్ర‌ధాన్ , జైపూర్ కు చెందిన కోమ‌ల్‌శ‌ర్మ‌, తోహాకు చెందిన ఆరోన్ ఎబెన్‌లు ఇదే త‌ర‌హాలో ప్ర‌శ్న‌లు వేశారు. ఇందుకు బ‌దులిస్తూ ప్ర‌ధాన‌మంత్రి , “ప్రేర‌ణ పొంద‌డానికి ఫార్ములా కానీ ఇంజెక్ష‌న్ కానీ ఏదీ లేద‌ని అంటూ, మీ గురించి మీరు మ‌రింత‌గా తెలుసుకోండి, మిమ్మ‌ల్ని ఏది సంతోషంగా ఉంచుతుందో గ‌మ‌నించండి. దానిపై కృషి చేయండి” అని సూచించారు. త‌మ‌కు స‌హ‌జంగా ప్రేర‌ణ‌నిచ్చే వాటిని గుర్తించాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి విద్యార్థుల‌కుసూచించారు. ఇందులో ఎవ‌రికి వారు స్వ‌తంత్రంగా ఆలోచించాల‌ని , త‌మ బాధ‌ల‌కు ఇత‌రుల‌నుంచి సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నించ‌రాద‌ని అన్నారు.త‌మ చుట్టూ ఉన్న వారిని , దివ్యాంగుల‌ను గ‌మనించి వారు త‌మ ల‌క్ష్యాన్ని సాధించేందుకు సాగిస్తున్న కృషిని గ‌మ‌నించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి విద్యార్దుల‌ను కోరారు. “ మ‌న చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను గ‌మ‌నించి అందులోని బ‌లాల‌ను, చుట్టుప‌క్క‌ల వారి కృషిని గుర్తించి ప్రేర‌ణ పొందాల‌”ని అన్నారు. త‌ను రాసిన ఎగ్జామ్ వారియ‌ర్ పుస్త‌కాన్ని గుర్తుచేస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ప‌రీక్ష‌కే లేఖ రాయ‌డం ద్వారా , త‌మ కున్న బ‌లం, ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌త‌తో ప‌రీక్ష‌నే స‌వాలు చేయ‌డంద్వారా ఎవ‌రికి వారు ప్రేర‌ణ పొందిన‌ట్టు ఎలా భావించ‌వ‌చ్చో ఆయ‌న తెలియ‌జేశారు.

 

తెలంగాణా రాష్ట్రంలోని ఖ‌మ్మం నుంచి అనూష మాట్లాడుతూ, ఉపాధ్యాయులు పాఠాలు బోధించేట‌పుడు ఆయా అంశాలు త‌న‌కు అర్థ‌మ‌వుతాయ‌ని ,అయితే కాసేపు అయ్యాక వాటిని తాను మ‌ర‌చిపోతాన‌ని , ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డ‌మెలా అని అడిగారు. న‌మో యాప్‌ద్వారా గాయ‌త్రి స‌క్సేనా త‌న జ్ఞాప‌క‌శ‌క్తి, అవ‌గాహ‌న పై ప్ర‌శ్న‌వేశారు. ఇందుకు బ‌దులిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఏకాగ్ర‌త‌తో నేర్చుకుంటే ఏదీ మ‌రిచిపోమ‌ని అన్నారు. విద్యార్థులు వ‌ర్త‌మానంలో పూర్తిస్థాయి ఎరుక‌తో ఉండాల‌ని, వ‌ర్త‌మానం గురించిన ఎరుక‌వారికి మ‌రింత నేర్చుకోవ‌డానికి , గుర్తుంచుకోవడానికి ఉప‌క‌రిస్తుంద‌న్నారు. వ‌ర్త‌మానమే అతిపెద్ద వ‌ర్త‌మాన‌మ‌ని, వ‌ర్త‌మానంలో జీవిస్తూ ,దానిని పూర్తిగా అర్ధం చేసుకున్న‌వారు జీవితం నుంచి గ‌రిష్ఠ‌స్థాయిలో ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌ర‌ని అన్న‌రాఉ. జ్ఞాప‌క‌శ‌క్తిని నిధిగాచేసుకోవ‌డ‌మే కాదు, దానిని మ‌రింత విస్తృత‌ప‌రుచుకోవాల‌ని అన్నారు. స్థిర‌మైన మ‌న‌స్సు విష‌యాల‌ను బాగా జ్ఞాప‌కం పెట్టుకోవ‌డానికి అనువైన‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.


జార్ఖండ్ కు చెందిన శ్వేతా కుమారి మాట్లాడుతూ, తాను రాత్రి పూట చద‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని అయితే ప‌గ‌టిపూట చ‌ద‌వాల్సిందిగా చెబుతుంటార‌ని అన్నారు. న‌మో యాప్ నుంచి రాఘ‌వ్ జోషి, చ‌దువుకునేందుకు త‌గిన కాల‌ప‌ట్టిక గురించి అడిగారు. ప్ర‌ధాన‌మంత్రి వీటికి బ‌దులిస్తూ, ఎవ‌రికి వారు త‌మ కృషికి వ‌చ్చిన ఫ‌లితాన్ని అంచ‌నా వేసుకోవాల‌ని, స‌మ‌యం ఎ విధంగా వినియోగించామో గ‌మ‌నించాల‌ని అన్నారు. ఇలా మ‌న కృషి దాని ఫ‌లితాన్ని అంచ‌నా వేయ‌డం విద్య‌లో ముఖ్య‌మైన అంశమ‌ని ఆయ‌న అన్నారు.మ‌నం చాలావ‌ర‌కు మ‌న‌కు సుల‌భ‌మైన‌, ఆస‌క్తి క‌లిగించే స‌బ్జెక్టుల‌పై ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తామ‌ని అన్నారు.


'మనస్సు, హృదయం ,శరీరాన్ని మోసం చేయ‌డాన్ని' అధిగమించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం అవసరం అని ఆయన అన్నారు. "మీరు ఆనందించే పనులు చేయండి ,గరిష్ఠ‌ఫలితాన్ని పొందుతారు", అన్నారాయన.

 

జ‌మ్ముకాశ్మీర్ లోని ఉధంపూర్‌కుచెందిన ఎరికా జార్జ్ మాట్లాడుతూ, బాగా విజ్ఞాన‌వంతులైన వారు ఏవో కార‌ణాల వ‌ల్ల త‌గిన ప‌రిక్ష‌ల‌కు హాజ‌రుకాలేక‌పోవ‌డం గురించి ప్ర‌స్తావించారు. గౌత‌మ్ బుద్ధ న‌గ‌ర్‌కుచెందిన హ‌రి ఓం మిశ్ర‌. పోటీ ప‌రీక్ష‌ల ను ఎదుర్కోవ‌డం గురించి, బోర్డు పరీక్ష‌ల‌కు సిద్ధం కావ‌డం గురించి అడిగారు. ప్ర‌ధాన‌మంత్రి ఇందుకు బ‌దులిస్తూ ప‌రీక్ష‌ల కోస‌మే చ‌ద‌వ‌డం స‌రైన‌ది కాద‌ని అన్నారు. మ‌న‌సుపెట్టి సిల‌బ‌స్ ప్ర‌కారం చ‌దివితే ఏ ర‌క‌మైన ప‌రీక్ష అయినా క‌ష్టం కాద‌ని అన్నారు. ప‌రీక్ష‌ల‌లో పాస్‌కావ‌డంపై దృష్టితో కాకుండా ఆయా స‌బ్జెక్టుల‌పై ప‌ట్టు పెంచుకునేందుకు కృషి చేయాల‌ని సూచించారు. క్రీడాకారులను ఆయా క్రీడ‌ల‌కు సిద్ధం చేస్తారు కాని పోటీ కోసం కాద‌ని అన్నారు. “మీరు ఒక ప్ర‌త్యేక త‌రం. నిజ‌మే, పోటీ ఎక్కువ ఉంది. కానీ అవ‌కాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి” అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. పోటీ అనేది త‌మ కాల‌పు అద్భుత వ‌రంగా భావించాల‌ని ఆయ‌న విద్యార్థుల‌కు సూచించారు.
గుజ‌రాత్ లోని న‌వ్‌స‌రాయ్‌కు చెందిన ఒక పేరెంట్ సీమా చేత‌న్ దేశాయ్ మాట్లాడుతూ, గ్రామీణ బాలిక‌ల‌ను ఉన్న‌త స్థాయికి తీసుకువ‌చ్చేందుకు స‌మాజం ఏ ర‌కంగా కృషిచేయ‌వ‌చ్చ‌ని అడిడారు. ఇందుకు బ‌దులిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, గ‌త కొన్నేళ్లుగా ప‌రిస్థితులు మారాయ‌ని ఆయ‌న అన్నారు. బాలికా విద్య‌ను ప‌ట్టించుకోని కాలం నుంచి ప‌రిస్థితిలో ఎంతో మార్పు వ‌చ్చింద‌ని అన్నారు. బాలిక‌ల‌కు స‌రైన విద్య లేకుండా ఏ స‌మాజ‌మూ మెరుగుప‌డ‌లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు. బాలిక‌ల సాధికార‌త‌, వారికి అవ‌కాశాలు సంస్థాగ‌తం చేయాల‌ని అన్నారు. బాలిక‌లను ఎంతో విలువైన ఆస్థిగా మారుతున్నారు. ఈ మార్పు స్వాగ‌తించ‌ద‌గిన‌దని అన్నారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ సంవ‌త్స‌రంలో , స్వ‌తంత్ర భార‌త దేశ చ‌రిత్ర‌లోనే గ‌రిష్ఠ స్థాయిలో మ‌హిళా స‌భ్యులు ఉన్నార‌న్నారు. “కుమార్తె కుటుంబానికి బ‌లం. వివిధ జీవ‌న రంగాల‌లో అద్భుత నారీశ‌క్తిని చూడ‌డం కంటే మించిన‌ది ఏముంటుంది?” అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

 

ఢిల్లీకి చెందిన ప‌విత్ర రావు, మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌కు కొత్త‌త‌రం ఏం చేయాల‌ని అడిగారు. త‌న క్లాస్, ప‌ర్యావ‌ర‌ణం ప‌రిశుభ్రంగా హ‌రిత‌మ‌యం కావాలంటే ఏం చేయాల‌ని చైత‌న్య అడిగారు. విద్యార్థుల‌ను అభినందిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, దేశం ప‌రిశుభ్రంగా, హ‌రిత‌మ‌యం చేసేందుకు విద్యార్థుల కృషిని అభినందించారు. చిన్నారులు స్వ‌చ్ఛ‌తా ప్ర‌తిజ్ఞ‌ను అర్థం చేసుకున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. మ‌న పూర్వీకుల కృషి కార‌ణంగా మ‌నం ఈ ప‌ర్యావ‌ర‌ణాన్ని అనుభ‌విస్తున్నామ‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, భ‌విష్య‌త్‌త‌రాల‌కు మ‌నం అలాగే మెరుగైన ప‌ర్యావ‌ర‌ణాన్ని అందించాల‌ని అన్నారు. పౌరుల భాగ‌స్వామ్యంతోనే ఇది సాధ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఇందుకు మూడు -పి (P3 ) ల ఉద్య‌మం ప్రాధాన్య‌త గురించి ప్ర‌స్తావించారు. ప్రా ప్లానెట్ పీపుల్‌, లైఫ్ స్ట‌యిల్ ఫ‌ర్ ఎన్విరాన్‌మెంట్ (LIFE) గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఉప‌యోగించి ప‌క్క‌న ప‌డేసే సంస్కృతి నుంచి మ‌నం బ‌య‌ట‌ప‌డాల‌ని, చ‌క్రీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌తోకూడిన జీవ‌న విధానం దిశ‌డా ముందుకు పోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. అమృత్ కాల్ ప్రాధాన్య‌త గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి ,దేశ అభివృద్ధిలో విద్యార్థి అత్యుత్తమ సంవత్సరాలకు అనుగుణంగా ఉండే అమృత్ కాల్ ప్రాముఖ్యతను ప్ర‌స్తావించారు. ఎవ‌రికి వారు త‌మ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చాల్సిన దాని ప్రాధాన్య‌త‌ను నొక్కి చెప్పారు.


వాక్సిన్ వేయించుకోవ‌డంలో విద్యార్తులు త‌మ బాధ్య‌త‌ను నెర‌వేర్చినందుకు వారిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు.

 

చివ‌ర‌గా ప్ర‌ధాన‌మంత్రి, ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన విద్యార్థుల‌ను, వారి నైపుణ్యాల‌ను, వారి ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌శంసించారు. ఇత‌రుల‌లోని మంచి ల‌క్ష‌ణాల‌ను అభినందించి వారినుంచి నేర్చుకునే త‌త్వాన్ని అల‌వ‌ర‌చుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. ఇత‌రుల‌ను చూసి అసూయ‌ప‌డ‌డం మాని వారి నుంచి నేర్చుకునేత‌త్వం ఉండాల‌ని ఆయ‌న అన్నారు. జీవితంలో విజ‌యం సాధించ‌డానికి ఈ సామ‌ర్ధ్యం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.

 

పిపిసి ప్రాధాన్య‌త త‌న‌కు ఎంత ముఖ్య‌మో త‌న వ్య‌క్తిగ‌త అనుభ‌వాన్ని ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించారు. యువ‌కుల‌తో మాట్లాడుతున్న‌ప్పుడు తాను 50 సంవ‌త్స‌రాల చిన్న వ్య‌క్తిగా భావిస్తాన‌న్నారు. నేను మీ త‌రం వారిని క‌లిసిన‌పుడు మీ నుంచి నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. నేను మిమ్మ‌ల్ని క‌లిసిన‌పుడు మీ ఆకాంక్ష‌లు, మీ క‌ల‌ల గురించి తెలుసుకోగ‌లుగుతాను. అందుకు అనుగుణంగా నేను నా జీవితాన్ని మ‌లుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. ఆ ర‌కంగా ఈ కార్య‌క్ర‌మం నేను ఎదిగేందుకు ఎంతో స‌హాయ‌ప‌డుతోంది. నాకు తోడ్ప‌డేందుకు , నేను ఎదిగేందుకు నాకు స‌మ‌యం ఇచ్చినందుకు మీ అంద‌రికీ నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ ప్ర‌సంగాన్ని ముగించారు.

 

 

 

 

 



(Release ID: 1812566) Visitor Counter : 263