ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19ని ఎదుర్కోవడానికి టీకా బలమైన ఆయుధం గా పనిచేస్తుంది - డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
టీకా కార్యక్రమం పరిధిని పెంచి మరింత వేగంగా అమలు చేయాలని కోరిన మంత్రి
స్వచ్చంధ సంస్థలు, గుర్తింపు పొందిన సంస్థలు, మత పెద్దలు, ప్రజలను ప్రభావితం చేయగల వారి సహకారంతో ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా చర్యలు అమలు చేయాలని రాష్ట్రాలను కోరిన శ్రీ మాండవీయ
Posted On:
22 NOV 2021 12:35PM by PIB Hyderabad
' టీకా కార్యక్రమం చివరి దశలో మనం ఉన్నాం. టీకా కార్యక్రమం పరిధిని, వేగాన్ని పెంచి అందరికి టీకాలు వేయడానికి మరింత పటిష్టంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిద్దాం' అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. టీకాల కార్యక్రమం అమలు జరుగుతున్న తీరుపై మంత్రి ఈ రోజు మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. 'హర్ ఘర్ దస్తక్' కార్యక్రమం అమలులో ఈ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. దేశంలో టీకా మొదటి డోసు తీసుకున్న వారి శాతం 82 గా రెండవ డోసు తీసుకున్న వారి శాతం 43 గా ఉంది. అయితే, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో టీకాలు తీసుకున్న వారి సంఖ్య జాతీయ సరాసరి తో పోల్చి చూస్తే తక్కువగా ఉంది. టీకాలు తీసుకున్న వారి శాతం పుదుచ్చేరి లో 66%,39%గా, నాగాలాండ్ లో 49%,36% గా, మేఘాలయాలో 57%,38% గా, మణిపూర్ లో 54%,36%గా ఉంది.
ఈ రాష్ట్రాల్లో పరిస్థితిని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించిన శ్రీ మాండవీయ అన్ని వర్గాల సహకారంతో టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం స్వచ్చంధ సంస్థలు, గుర్తింపు పొందిన సంస్థలు, మత పెద్దలు, ప్రజలను ప్రభావితం చేయగల వారి సహకారం తీసుకోవాలని ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు మంత్రి సూచించారు. టీకాలు తీసుకోవడానికి ప్రజల్లో చైతన్యం వచ్చేలా కార్యక్రమాలు అమలు జరగాలని అన్నారు. జనాభాలో అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకునేలా చూడాలని పేర్కొన్నారు. ' కోవిడ్-19 కి సురక్ష కవచంగా టీకా పనిచేస్తుంది. దీనిని గుర్తించి ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా చూద్దాం. టీకా తీసుకోవడానికి సందేహిస్తున్న వారిని చైతన్యం చేద్దాం. అపోహలు, భయాలు తొలగించడానికి సంఘటితంగా చర్యలు అమలు చేద్దాం.' అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.
వారంలో ఒక రోజు ప్రతి ఇంటికి వెళ్లి టీకా తీసుకోవడానికి అర్హత ఉన్న వారిని గుర్తించడానికి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్రాల ఉన్నతాధికారులను శ్రీ మాండవీయ కోరారు. టీకాలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని అన్నారు. దీనికోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన విధంగా 'హర్ ఘర్దస్తక్' ప్రచార కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. 'హర్ ఘర్దస్తక్' కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ముందుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని శ్రీ మాండవీయ అన్నారు. దీనిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి టీకా తీసుకోవడానికి అర్హులైన వారిని సిద్ధం చేయాలని శ్రీ మాండవీయ అన్నారు. దీని తరువాత టీకా కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. దీనిలో అర్హులైన ప్రతి ఒక్కరూ మొదటి, రెండవ డోసు టీకా తీసుకునేలా చూడాలని మంత్రి అన్నారు. పెద్దలు, సమాజంలో ప్రతి ఒక్కరూ టీకా పట్ల అవగాహన కలిగి ఉండేలా చూడడానికి విద్యార్థులు, పిల్లలను కోవిడ్ 19 టీకా అంబాసిడర్లుగా తయారు చేయాలని మంత్రి సూచించారు.
జిల్లాల వారీగా సూక్ష్మ ప్రణాళిక రూపొందించి, అవసరమైన సంఖ్యలో టీకా బృందాలను నియమించాలని శ్రీ మాండవీయ అన్నారు. ప్రగతిలో వెనుకబడి ఉన్న జిల్లాలను రోజువారీ సమీక్షలో గుర్తించి తగిన చర్యలు అమలు చేయాలని అన్నారు. టీకా తీసుకోవడానికి సందేహిస్తున్న వర్గాలను చైతన్యవంతులను చేయడానికి చిన్న వీడియోలను రూపొందించి సామాజిక, సంప్రదాయ మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించడం లాంటి చర్యలను అమలు చేయాలని అన్నారు.
టీకా కార్యక్రమంలో వెనుకబడి ఉండటానికి గల కారణాలు తెలుసుకోవాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీ మాండవీయ అన్నారు. దీనికోసం 'హర్ ఘర్దస్తక్' వినియోగించి టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన కోరారు. టీకా డోసుల సంఖ్యని ఎక్కువ చేయడానికి అమలు చేస్తున్న చర్యలను కేంద్ర మంత్రికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు వివరించారు.
దేశంలో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 82%గా ఉంది. పుదుచ్చేరి మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఈ సంఖ్య 60% కంటే తక్కువగా ఉంది. మేఘాలయాలో 20 లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉంది. రాష్ట్రంలో తాజా లెక్కల ప్రకారం 8 లక్షల మంది మొదటి డోసును, 2.5 లక్షల మంది రెండవ డోసును తీసుకోవాల్సి ఉంది. మణిపూర్ లో 14.7 లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉంది. తాజా లెక్కల ప్రకారం 10 లక్షల మంది వరకు మొదటి డోసును,3.7 లక్షల మంది వరకు రెండవ డోసును తీసుకోవాల్సి ఉంది. పుదుచ్చేరి లో 11.3 లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉంది. తాజా లెక్కల ప్రకారం 3.88 లక్షల మంది వరకు మొదటి డోసును 1. 91 లక్షల మంది వరకు రెండవ డోసును తీసుకోవాల్సి ఉంది.
సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్నాని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీల్ కుమార్, కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఇంద్రాణి కౌశల్, కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి శ్రీ అశోక్ బాబు. ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు
***
(Release ID: 1774089)
Visitor Counter : 127