ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ 66 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ డాక్టర్ భారతి పవార్
" ఆరోగ్య రంగంలో ఎయిమ్స్, న్యూఢిల్లీ దిక్సూచి "
ప్రధానమంత్రి దూరదృష్టితో దేశంలో ఆరోగ్య వైద్య రంగాల సమ అభివృద్ధి : కేంద్ర ఆరోగ్య మంత్రి
"అంత్యోదయ, సర్వోదయ సూత్రాలు, పేదల అభ్యున్నతి ప్రాతిపదికగా అభివృద్ధి జరగాలి : డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
Posted On:
25 SEP 2021 3:42PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మరియు ఎయిమ్స్ ప్రెసిడెంట్ శ్రీ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీ ఎయిమ్స్ 66 వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి.సమక్షంలో ఈ రోజు జరిగిన ఎయిమ్స్ 66 వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా హాజరయ్యారు. 66 సంవత్సరాల కిందట ఇదే రోజున ఎయిమ్స్లో అండర్ గ్రాడ్యుయేట్ బోధన ప్రారంభమైంది మరియు ఈ తేదీన 1956 లో మొదటి బ్యాచ్ ఎంబీబీస్ తరగతులు ప్రారంభమయ్యాయి.
66 సంవత్సరాల్లో సంస్థ సాధించిన ప్రగతి పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మాండవీయ కాలంతోపాటు అంచనాలు బాధ్యతలు పెరుగుతాయని గుర్తించి పనిచేయాలని సూచించారు. దేశంలో పనిచేస్తున్న 22 ఎయిమ్స్ కు ఢిల్లీ ఎయిమ్స్ దిక్సూచిలా ఉందని ఆయన అన్నారు. ఇక్కడ సాధించిన విజయాలు, ఆర్జించిన అనుభవంతో ఇతర ఎయిమ్స్ ప్రగతికి సహకరించాలని ఆయన ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు.
దేశంలో ఆసుపత్రుల పరిస్థితి పట్ల కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వైద్యం కోసం వచ్చే ఆసుపత్రుల్లో బౌన్సర్లను నియమించడం దేనికని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రికి వచ్చేవారు ఆగ్రహంతో ఘర్షణలకు దిగితే దానికి కారణం అక్కడ లోపాలు ఉన్నాయని గుర్తించాలని శ్రీ మాండవీయ అన్నారు.
రోగులను డాక్టర్లు దేవుళ్లుగా చూడాలని శ్రీ మాండవీయ హితవు పలికారు. డాక్టర్ తమను సరిగ్గా చూస్తారన్న భావన రోగుల్లో కలిగినప్పుడు ఎక్కువ సమయం వేచి ఉండడానికి వారు సందేహించరని అన్నారు. డాక్టర్ల దృక్పధంలో మార్పు వచ్చినప్పుడు రోగులకు ఉత్తమ చికిత్స అందుతుందని అన్నారు.
దేశభక్తి సరిహద్దుల్లో ఉండే సైనికులకు మాత్రమే అన్న భావనను విడనాడాలని మంత్రి అన్నారు. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కూడా దేశ భక్తిగా ఉంటుందని అన్నారు. దేశభక్తితో ఆరోగ్యాన్ని ముడిపెట్టినప్పుడు ప్రతి ఒక్కరిలో సానుకూల దృక్పధం అలవడుతుందని అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధి తో పాటు ప్రజా ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని శ్రీ మాండవీయ పేర్కొన్నారు. ఆరోగ్య రంగ కేటాయింపులు గత ఏడాది 137 శతం మేరకు పెరిగి 2.40 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల ఇదివరకు కొంతమందికి మాత్రమే పరిమితమైన ప్రభుత్వేతర చికిత్స ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం రూపొందించిన పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూసి, ప్రజలందరికి ఆరోగ్య సేవలను అందించడానికి ఆరోగ్య సేవా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అన్నారు.
అయిదు దశాబ్దాలుగా ప్రజలకు వైద్య చికిత్సలను అందిస్తున్న ఎయిమ్స్ ను మంత్రి డాక్టర్ పవార్ అభినందించారు. 1994 ఇక్కడ తొలిసారిగా గుండె మార్పిడి జరిగిందని అన్నారు. 2005 లో తొలిసారిగా రోబోటిక్ సర్జరీని నిర్వహించిన ఢిల్లీ ఎయిమ్స్ 2014 లో టెంపో రోమాండిబ్యులర్ కీలు మార్పిడి శాస్త్ర చికిత్సను నిర్వహించిందని వివరించారు. విద్య, పరిశోధన, సంరక్షణ రంగాల్లో గుర్తింపు పొందిందని ఆమె అన్నారు. ఎయిమ్స్ లో అమలు జరుగుతున్న అంత్యోదయ, సర్వోదయ కార్యక్రమాల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడకి వైద్యం కోసం వచ్చినవారందరికి మొదటి 24 గంటలు ఉచితంగా అత్యవసర కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
కార్యక్రమంలో శ్రీ మాండవీయ, డాక్టర్ పవార్ అధ్యాపక సిబ్బంది, గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 33 అవార్డులు మరియు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ మాండవీయ ఇందిరాగాంధీపై వ్యాసం రాసిన తనను సన్మానించిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సన్మానంతో స్ఫూర్తి పొందిన తాను లక్ష్య సాధన దిశగా పట్టుదలతో పనిచేసి విజయం సాధించానని అన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి 50 ల్యాబొరేటరీ డయాగ్నొస్టిక్ పరీక్షలు నిర్వహించి 2-3 గంటల్లో ఫలితాలు అందించగల ప్రయోగశాలను డిజిటల్గా ప్రారంభించారు.డాక్టర్ పవార్తో కలసి శ్రీ మాండవీయ "డిజిటల్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్" ప్రదర్శనను ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ రణ్ దీప్ గులేరియా, డైరెక్టర్ ఎయిమ్స్, శ్రీ విశాల్ చౌహాన్, సంయక్త కార్యదర్శి (ఆరోగ్య మంత్రిత్వ శాఖ) మరియు డిప్యూటీ డైరెక్టర్, ఎయిమ్స్, డాక్టర్ అనితా సక్సేనా, డీన్ (విద్య), న్యూఢిల్లీ ఎయిమ్స్, డాక్టర్ ప్యూష్ సాహ్ని, సైంటిఫిక్ ఎగ్జిబిషన్ కమిటీ ఛైర్మన్ మరియు ఇతర సీనియర్ వైద్యులు పాల్గొన్నారు.
ఈవెంట్
https://youtu.be/FZ1q1F40LVY ద్వారా వెబ్ క్యాస్ట్ చేయబడింది.
***
(Release ID: 1758172)
Visitor Counter : 146