ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ‌ల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద‌ జీ 125వ జ‌యంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం పాఠం

Posted On: 01 SEP 2021 6:47PM by PIB Hyderabad

హరే కృష్ణ‌. ఈ రోజు మ‌న‌ తో ఉన్న‌  కేంద్ర సంస్కృతి శాఖ  మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి, ఐఎస్ సికెఒఎన్ (‘ఇస్కాన్’) బ్యూరో అధ్య‌క్షుడు శ్రీ గోపాల కృష్ణ గోస్వామి గారు, ప్ర‌పంచం లోని భిన్న దేశాల నుంచి వ‌చ్చిన తోటి కృష్ణ భ‌క్తులారా.

మొన్న శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి ని, నేడు శ్రీ‌ల ప్ర‌భుపాద 125వ జ‌యంతి వేడుక‌ల ను మ‌నం జరుపుకొంటున్నాం.  ఆనందం, సాధ‌న‌ లో ప‌రిపూర్ణ‌త రెండూ క‌లసి వ‌చ్చిన సంద‌ర్భం ఇది.  ప్ర‌పంచం లోని శ్రీ‌ల ప్ర‌భుపాద స్వామి అనుచ‌రులు, కృష్ణ భ‌క్తులు ఈ రోజు న ఈ స్ఫూర్తి ని అనుభ‌విస్తున్నారు.  వివిధ దేశాల నుంచి వ‌చ్చిన సాధువుల ను, సంతుల ను అందరి ని నేను ఈ తెర మీద చూస్తూ ఉన్నాను.  ల‌క్ష‌ల కొద్దీ మ‌నుసు ల భావోద్వేగం, ల‌క్ష‌ల కొద్దీ శ‌రీరాల లో చైత‌న్యం ఇక్క‌డ జతపడ్డాయన్న భావ‌న క‌లుగుతోంది.  ప్ర‌భుపాద స్వామి గారు యావత్తు ప్ర‌పంచానికి వ్యాప్తి చేసినటువంటి కృష్ణ చైత‌న్యం ఇది అని చెప్పాలి.

మిత్రులారా,

ప్ర‌భుపాద స్వామి శ్రీ కృష్ణుని లోకాతీత‌ భ‌క్తుడే కాదు, భార‌తదేశం ప‌ట్ల అమితమైన భ‌క్తి భావాన్ని క‌లిగినటువంటి వాడు కూడాను.  దేశాని కి స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం లో ప్ర‌భుపాద స్వామి పాల్గొన్నారు.  స‌హాయ నిరాక‌ర‌ణ ఉద్య‌మాని కి సమర్థన గా ప్ర‌భుపాద స్వామి స్కాటిష్ కాలేజి నుంచి డిప్లొమా ను స్వీక‌రించేందుకు కూడా నిరాక‌రించారు.  భారతదేశం స్వాతంత్ర్యం తాలూకు 75 సంవ‌త్స‌రాల వేడుక‌ల ను.. అదే, ‘అమృత్ మ‌హోత్స‌వ్’ ను.. జరుపుకొంటూ ఉన్న‌టువంటి సంద‌ర్భం లోనే అంతటి ఒక గొప్ప దేశ‌భ‌క్తుని 125వ జ‌యంతి వేడుక‌ల ను కూడా ఈ నాడే జరుపుకోవడం అనేది ఒక సంతోషదాయకమైనటువంటి యాదృచ్ఛిక‌ ఘటనగా ఉంది.  భార‌త‌దేశాని కి చెందిన అత్యంత అమూల్యం అయినటువంటి ఖజానా ను గురించి ప్ర‌పంచాని కి తెలియ‌జేయాలనే ఉద్దేశ్యం తో తాను వివిధ దేశాల కు ప‌ర్య‌టిస్తున్నట్లు శ్రీ‌ల ప్ర‌భుపాద స్వామి గారు ఎప్పుడూ అంటూ ఉండే వారు.  భార‌త‌దేశం యొక్క జ్ఞ‌ాన భావన, భారతదేశం యొక్క విజ్ఞ‌ానశాస్త్రం, మనకు ఉన్నటువంటి జీవ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు ‘అథ్- భూత్ దయామ్ ప్రతి’.. అంటే, ప్రాణి కోటి సంక్షేమం కోస‌మే.. అని చెప్పుకోవాలి.  ‘ఇదం న మ‌మ‌మ్’ (అంటే.. ఇది నాది కాదు.. అని భావం) అనేది మ‌న ఆచారాల లో, క‌ర్మ‌కాండ‌ లో చివ‌రి మంత్రం గా ఉంది.  అది యావత్తు విశ్వం కోసం, అది మొత్తం ప్రాణికోటి ప్రయోజనాని కి అన్న మాట.  అందుకే స్వామి గారి యొక్క పూజ్య గురు శ్రీ‌ల భ‌క్తిసిద్ధాంత స‌ర‌స్వ‌తి గారు ఆయ‌న‌ లోని సామ‌ర్థ్యాన్ని గమనించి భార‌తదేశం భావజాలాన్ని, భారతదేశం తత్వశాస్త్రాన్ని విశ్వ‌వ్యాప్తం చేయవలసిందంటూ ఆదేశించారు.  శ్రీ‌ల ప్ర‌భుపాద గారు తన గురువు ఆదేశాన్ని శిర‌సావ‌హించారు; మరి ఆయన ప్రయాసల ఫ‌లితం ప్రస్తుతం ప్ర‌పంచం లోని ప్ర‌తి మూల‌ లోను కంటి కి క‌నుపిస్తున్నది.

అమృత్ మ‌హోత్స‌వ్ లో కూడా ‘స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్’ మంత్రాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగాలి అనేదే భార‌త‌దేశం సంక‌ల్పం గా ఉంది.  ఈ సంక‌ల్పాని కి మూలం ప్ర‌పంచ సంక్షేమ‌మే.  మ‌న ప్ర‌ధాన ల‌క్ష్యాల లో అది కీల‌కంగా ఉంది.  ఈ సంక‌ల్పం  నెర‌వేరాలి అంటే ప్ర‌తి ఒక్క‌ వ్యక్తి ప్ర‌య‌త్నం ఎంత అవ‌స‌రమో మీకు అంద‌రికి తెలుసును.  ప్ర‌భుపాద‌ జీ ఒక్క‌రే ప్ర‌పంచానికి ఇంత మేలు ను చేసిన‌ప్పుడు ఆయ‌న ఆశీస్సుల‌ తో మ‌నం అంద‌రం క‌లసి ప‌ని చేస్తే దాని ఫ‌లితం ఎలా ఉంటుందో ఊహించండి.  ఆ మాన‌వ చైత‌న్య శిఖ‌రాని కి మ‌నం త‌ప్ప‌క చేరుకోగ‌లుగుతాం.  అక్క‌డ మ‌నం మ‌రింత పెద్దదైన పాత్ర ను పోషించి ప్రేమ సందేశాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తం చేయ‌గ‌లుగుతాం.

మిత్రులారా,

మాన‌వాళి ప్ర‌యోజ‌నాని కి మ‌న మేధస్సు ను, సంప్ర‌దాయాన్ని ఎలా వ్యాపింప‌చేయ‌వ‌చ్చు అనేందుకు యోగ ఒక నిద‌ర్శ‌నం.  భార‌త‌దేశం స్థిర‌మైన జీవ‌న విధానం, ఆయుర్వేదం వంటి శాస్త్రాల నుంచి ప్ర‌పంచం యావ‌త్తు ప్ర‌యోజ‌నం పొందాలి అన్న‌ది మ‌న సంక‌ల్పం.  శ్రీ‌ల ప్ర‌భుపాద త‌ర‌చు గా మాట్లాగే మాట‌ల లోని స్వ‌యం సంవృద్ధి మంత్రాన్ని భార‌త‌దేశం స్వీక‌రించి ప్రస్తుతం ఆ దిశ‌ లో ముందుకు సాగిపోతోంది.  నేను ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌’, ‘మేక్ ఇన్ ఇండియా’ లను గురించి మాట్లాడిన‌పుడ‌ల్లా అధికారులు, వ్యాపార‌వేత్త‌ల‌ కు హ‌రే కృష్ణ ఉద్య‌మం వ్యాపింప‌చేయ‌డం లో ఇస్కాన్ విజ‌యాన్ని ఉదాహ‌ర‌ణ‌ గా చూపుతూ ఉంటాను.  ప్ర‌పంచం లో ఏ దేశాన్ని అయినా మనం సంద‌ర్శించిన‌ప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు ‘‘హ‌రే కృష్ణ’’ అని సంబోధిస్తే ఎంతో ఆద‌రం గా, గ‌ర్వం గా భావిస్తాం.  మేక్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తుల‌ కు కూడా అదే త‌ర‌హా గుర్తింపు ల‌భిస్తే మ‌న ఆనందం ఎలా ఉంటుందో ఊహించండి.  ఇస్కాన్ బోధ‌న‌ ల నుంచి నేర్చుకోవ‌డం ద్వారా మ‌నం ఈ ల‌క్ష్యాల‌ ను సాధించ‌గ‌లుగుతాం.

మిత్రులారా,

అర్జునుని కి భ‌గ‌వాన్ శ్రీ కృష్ణుడు ‘న హి జ్ఞ‌ానేన సదృశమ్ పవిత్ర మహి విద్యతే’ (జ్ఞానం క‌న్నా ప‌విత్ర‌మైంది మ‌రొక‌టి లేదు) అని బోధించాడు.  జ్ఞానం గొప్ప‌త‌నాన్ని గురించి తెలియ‌చేసిన త‌రువాత, ఆయన మరొక్క విషయాన్ని గురించి కూడా చెప్పారు. అదే ‘మయ్యేవ మన్ ఆధత్స్వ మయి బుద్ధిమ్ నివేశయ’ అని. ఈ మాటల కు.. ఒక‌సారి జ్ఞాన శాస్త్రాన్ని పొందిన అనంతరం, నీ యొక్క మ‌న‌స్సును, మేధస్సు ను కృష్ణుని కి సమర్పణం చేయవలసింది.. అని భావం.  ఈ నమ్మకం, ఈ శక్తి కూడా ఒక యోగమే. దీనినే గీత లోని 12వ అధ్యాయం లో గల భ‌క్తి యోగ‌ం గా వ్య‌వ‌హ‌రించారు.  భ‌క్తి యోగం తాలూకు శ‌క్తి అపారం.  దీనికి భార‌తదేశం యొక్క చరిత్ర కూడా ఒక సాక్షి గా ఉన్నది.  భార‌త‌దేశం దాస్యం తాలూకు లోతైన అఖాతం లో చిక్కుకొని బందీ అయిపోయి, అన్యాయం, అణ‌చివేత‌, దోపిడి ల కార‌ణం గా తన జ్ఞానం మీద, అధికారం మీద ధ్యాస ను పెట్టలేక నిస్సహాయురాలు గా మిగిలిన వేళ భార‌త‌దేశం చైత‌న్యాన్ని స‌జీవం గాను, భారతదేశం గుర్తింపు ను చెక్కు చెద‌ర‌కుండా ను ఉంచింది భక్తి మాత్రమే.  భ‌క్తి మార్గం విస్తరించిన కాలం లో ఏర్ప‌డ్డ సామాజిక విప్ల‌వ‌మే గనక లేక‌పోయి ఉంటే ఇప్పుడు భార‌త‌దేశం ఏ స్థితి లో ఉండేదో, ఎలాగ ఉండేదో ఊహించ‌డం క‌ష్ట‌ం అని పండితులు అంటూ ఉంటారు.  అయితే, ఆనాటి క‌ష్ట కాలం లో, చైత‌న్య మ‌హాప్ర‌భు వంటి సాధువులు మన సమాజాన్ని భ‌క్తి భావం తో  ఒక్క‌టిగా నిలిపి, ‘ధర్మం నుంచే ఆత్మ‌విశ్వాసం’ అనే మంత్రాన్ని ఉప‌దేశించారు.  ధర్మం లో వివక్ష, సమాజం లో ఎక్కువ- తక్కువ లు, త‌ప్పు- ఒప్పు ల వివక్ష ను భ‌క్తి అనేది అంతం చేసి,  శివుని కి మరియు జీవితాని కి మ‌ధ్య ఒక ప్ర‌త్య‌క్ష‌ బంధాన్నంటూ ఏర్ప‌ర‌చింది.

మిత్రులారా,

మీరు భార‌త‌దేశం చ‌రిత్ర‌ ను చూసిన‌ట్ట‌యితే విభిన్న కాలాల్లో సాధు సంతులు స‌మాజం లో ముందువ‌రుస‌ లో నిలబడి భ‌క్తి భావం అనే ఒక‌ తాడు తో స‌మాజాన్ని ముందుకు న‌డిపిన విష‌యం అవ‌గ‌త‌ం అవుతుంది.  స్వామి వివేకానందుల వారు వేదాల ను, వేదాంతాన్ని పాశ్చ‌త్య ప్ర‌పంచం లో ప్ర‌చారం చేస్తే శ్రీ‌ల ప్ర‌భుపాద‌ గారు, ఇస్కాన్ భ‌క్తి యోగ‌ ను ప్ర‌పంచం లో వ్యాపింప‌చేసే గురుత‌ర బాధ్య‌త ను స్వీక‌రించారు.  భ‌క్తి వేదాంతాన్ని ప్ర‌పంచ చైత‌న్యం తో సంధానం చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. సాధార‌ణం గా ప్ర‌జ‌లంతా చైత‌న్య ర‌హితులుగా మారే సుమారు 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు లో ఆయ‌న ఇస్కాన్ పేరిట ఒక అంత‌ర్జాతీయ సంస్థ‌ ను స్థాపించారు.  అది స‌మాజానికి, స‌మాజం లో ప్ర‌తి ఒక్క వ్య‌క్తి కి పెద్ద‌ స్ఫూర్తి గా నిలచింది.  వ‌య‌సు పెరిగిపోయింది, లేక‌పోయి ఉంటే నేను ఎంతో చేసే వాడి ని లేదా ఈ ప‌నుల‌న్నీ చేయ‌డానికి ఇది స‌రైన వ‌య‌సు కాదు అనే మాటలు ప‌లువురి నోటి వెంట త‌ర‌చు వింటూ ఉంటాం.  కానీ ప్ర‌భుపాద స్వామి గారు బాల్యం నుంచి జీవిత ప‌ర్యంతం చురుగ్గానే ఉన్నారు.  ప్ర‌భుపాద‌ జీ స‌ముద్ర మార్గం లో అమెరికా కు వెళ్లిన‌ప్పుడు ఆయన జేబు లో ఏమీ లేదు, అది ఖాళీ గా ఉంది.  ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దల్లా గీత‌.. శ్రీ‌మ‌ద్ భగ‌వ‌ద్ గీత‌.  ప్ర‌యాణం లో ఆయ‌న కు రెండు సార్లు గుండెపోటు వ‌చ్చింది.  ఆయ‌న న్యూ యార్క్ కు చేరే స‌మ‌యాని కి ఆహారానికి గాని, బ‌స‌ కు గాని ఎలాంటి ఏర్పాటు లు చేసుకోలేదు.  కానీ ఆ త‌రువాత 11 సంవ‌త్స‌రాలు ప్ర‌పంచం చూసింది ఒక పెద్ద అద్భుత‌మే అని అంటారు అట‌ల్ గారు.

ఈ రోజు న మ‌నం ప్ర‌పంచం లోని విభిన్న‌దేశాల లో ఇస్కాన్ ఆల‌యాల ను చూస్తున్నాం.  ఎన్నో గురుకులాలు భార‌తదేశం సంస్కృతి ని స‌జీవం గా నిలుపుతున్నాయి.  భార‌త‌దేశం మీద న‌మ్మ‌కం అంటే ఉత్సాహం, ఉత్సుక‌త‌, మాన‌వ‌త‌ లపై న‌మ్మ‌కం అని ప్ర‌పంచానికి ఇస్కాన్ చెబుతుంది.  ఈ రోజు న భిన్న దేశాల ప్ర‌జ‌లు భార‌తీయ దుస్తుల ను ధ‌రించి కీర్త‌న‌ లు ఆలాపిస్తూ ఉంటారు.  ఆ దుస్తులు కూడా చాలా నిరాడంబ‌రం గా ఉంటాయి.  చేతుల లో ఢోల‌క్‌ తో, మంజిరా తో వారు ఆధ్యాత్మిక శాంతి లో ఓల‌లాడుతూ హ‌రే కృష్ణ అని నినదిస్తూ ఉంటారు.  వారి ని ప్ర‌జ‌లు చూసిన‌ప్పుడు ఏదో పండుగ లేదా కార్య‌క్ర‌మం ఉంద‌ని భావిస్తారు.  కారీ ఇదే కీర్త‌న మ‌న దేశం లో ప్ర‌జ‌ల జీవ‌న విధానం.  ఈ ఆనంద‌క‌ర‌మైన విశ్వాస‌మే ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ ను ఆక‌ర్షిస్తూ ఉంటుంది.  ఒత్తిడి తో కూడిన నేటి ప్ర‌పంచాని కి కొత్త ఆశ ను ప్రసాదిస్తుంది.

మిత్రులారా,

‘‘అద్వేష్టా సర్వ భూతానాం మైత్ర: కరుణ ఏవ చ
నిర్మమోనిరహంకార: సమ దు:ఖ సుఖ: క్షమీ..’’ అని భగవాన్ శ్రీ ‌కృష్ణ ప్ర‌పంచానికి చాటాడు.  ఈ మాటల కు.. జీవ‌జాలాన్ని ప్రేమించే వాడికే క‌రుణ‌, ప్రేమ ఉంటాయి.  వారు ఎవ‌రిని కూడాను అస‌హ్యించుకోరు, అటువంటి వ్య‌క్తి భ‌గ‌వంతుని కి చేరువ‌ అవుతాడు అని భావం.  వేల కొద్దీ సంవ‌త్స‌రాల తరబడి భార‌త త‌త్వానికి మూలం ఈ మంత్ర‌మే.  ఈ త‌ర‌హా సేవా సంప్ర‌దాయాని కి ఆధునిక కేంద్రాలు గా ఇస్కాన్ దేవాల‌యాలు వ‌ర్థిల్లాయి.  క‌చ్ఛ్ లో భూకంపం వ‌చ్చిన‌ప్పుడు ఇస్కాన్ ఏ విధం గా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ముంద‌డుగు వేసిందో నాకు గుర్తుంది.  దేశం లో ఏదైనా క‌ల్లోలం చెల‌రేగినా, ఉత్త‌రాఖండ్ లో విషాదం సంభ‌వించినా, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల‌ ను తుపాను లు క‌ల్లోలితం చేసినా.. అన్ని సంద‌ర్భాల లో స‌మాజానికి సేవ‌లను అందించేందుకు ఇస్కాన్ ఎప్పుడూ ముందువ‌రుస‌ లో ఉంది.  చివ‌ర కు ప్ర‌స్తుత క‌రోనా క‌ష్ట‌కాలం లో సైతం ల‌క్ష‌ల కొద్దీ రోగులకు, ఆ రోగుల కుటుంబాల కు, ప్రవాసి జీవుల‌ కు ఆహారాన్ని, ఇత‌ర నిత్యావ‌స‌రాలను మీరు నిరంత‌రం గా  అందించారు.  ఈ మ‌హ‌మ్మారి లేని స‌మ‌యం లో కూడా ల‌క్ష‌లాది పేద‌ల‌ కు ఆహారాన్ని ఉచితం గా అందించి, నిర్విరామం గా సేవ‌లను చేశారు.  కోవిడ్ రోగుల కోసం ఆసుపత్రుల ను ఇస్కాన్ నిర్మించిన విష‌యం, టీకామందు ప్ర‌చారం లో కూడా చురుకైన భాగ‌స్వామ్యం వహించిన విష‌యం నాకు తెలుసును.  మీరు మ‌రింత ఉత్త‌మం గా సేవ‌లను అందించాలి అని ఇస్కాన్‌ కు, ఆ సంస్థ భ‌క్తుల‌ కు శుభాభినంద‌న‌ లు చెబుతున్నాను.

మిత్రులారా,

స‌త్య‌, సేవ‌, సాధ‌న మంత్రం తో మీరు ఈ రోజు న శ్రీ‌కృష్ణుని కి సేవ చేయ‌డ‌మే కాదు, ప్ర‌పంచం లో అన్ని ప్రాంతాలలోనూ భార‌త సిద్ధాంతాలు, విలువ‌ల బ్రాండ్ ప్ర‌చార‌క‌ర్త‌లు గా కీల‌క పాత్ర ను పోషిస్తున్నారు.  స‌ర్వే భ‌వన్తు సుఖినః, స‌ర్వే సంతు నిరామ‌య: (అంద‌రూ సంవృద్ధం గాను, ఆనందం గాను ఉండాలి; అందరూ ఎటువంటి జబ్బు ల బారి న ప‌డ‌కుండా ఉండాలి) అనేదే భార‌త‌దేశ శాశ్వ‌త నైతిక విలువ‌.  ఈ రోజు న ఇస్కాన్ ద్వారా ల‌క్ష‌ల కొద్దీ మంది ప్ర‌జ‌ల సిద్ధాంతం, సంకల్పం గా కూడా అది మారింది.  భ‌గవంతుని ప‌ట్ల ప్రేమ భావాన్ని క‌లిగి ఉండ‌డం, జీవ‌రాశుల‌ పై భ‌గ‌వంతుని దృష్టి ప్ర‌స‌రింప‌చేయ‌డం ద్వారా మాత్ర‌మే ఈ సంక‌ల్పం నెర‌వేరుతుంది.  విభూతి యోగ అధ్యాయం లో మ‌న‌కు భ‌గ‌వంతుడు చూపించిన మార్గం కూడా అదే.  ‘వాసుదేవః స‌ర్వమ్’ (దైవం సర్వ వ్యాప్తం) అనే మంత్రాన్ని మ‌న నిత్య జీవనం లో ఆచ‌రిస్తూ మాన‌వులంద‌రూ సామ‌ర‌స్యం తో జీవించేలా చూడ‌డం అంద‌రి బాధ్య‌త‌.  ఈ భావన తో మీ అంద‌రికి చాలా ధ‌న్య‌వాదాలు.

హ‌రే కృష్ణ‌.

అస్వీకరణ:  ప్ర‌ధాన‌ మంత్రి  ప్ర‌సంగానికి రమారమి అనువాదం ఇది.  అస‌లు ఉప‌న్యాసం హిందీ భాష లో సాగింది.



 

***



(Release ID: 1752871) Visitor Counter : 209