రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

దేశంలోని అన్ని జిల్లాలలో 02.08.2021 నాటికి 8,001 జన ఔషధి కేంద్రాల ఏర్పాటు


యజమానులకు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని 2.50 లక్షల రూపాయల నుంచి ఐదు లక్షలకు పెంచిన ప్రభుత్వం

Posted On: 06 AUG 2021 12:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రాజెక్టు కింద 02,08.2021 నాటికి 8,001 ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి  కేంద్రాలను ప్రభుత్వం దేశంలోని అన్ని జిల్లాలలో ప్రారంభించింది. 2025 మార్చి నాటికి దాదాపు 10,500  జన ఔషధి  కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో సహా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు)/కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు (సిహెచ్‌సిలు)/ఆసుపత్రుల ప్రాంగణాల్లో  జన ఔషధి  కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అద్దె లేకుండా స్థలాన్ని కేటాయించి తగిన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది.  2.82021 నాటికి  ప్రభుత్వ ఆవరణలో దాదాపు 1,012 కేంద్రాలు పనిచేస్తున్నాయి.

పథకాన్ని కొనసాగించే అంశంలో నిర్ణయం తీసుకోవడానికి దీనిపై సమగ్ర అధ్యయనం చేయడం జరిగింది. స్వతంత్రంగా అధ్యయనం నిర్వహించిన సంస్థ అందించిన సిఫార్సులకు అనుగుణంగా పథకం లో అవసరమైన మార్పులు చేసి దీనిని కొనసాగించడానికి స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం పొందడం జరిగింది. ఇంతేకాకుండా జన ఔషధి  కేంద్రాల పనితీరును ఫార్మాస్యూటికల్ అండ్  మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా సీఈఓ  స్థాయి అధికారి, గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా సమీక్షించడం జరుగుతున్నది. 

జన ఔషధి  కేంద్రాలకు అవసరమైన మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ-గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (డబ్ల్యూహెచ్‌ఓ-జిఎమ్‌పి) సర్టిఫైడ్ సదుపాయాలు కలిగిన దేశీయ ఔషధ తయారీ కంపెనీల నుంచి సేకరించడం జరుగుతున్నది. ఈ మందులను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ ఆమోదించిన ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఆ తరువాత వీటిని  గురుగ్రామ్, చెన్నై మరియు గువాహటిలోని పిఎమ్‌బిఐ గిడ్డంగులకు పంపి అక్కడ నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న విక్రేతలకు సరఫరా చేస్తున్నారు. జన ఔషధి  కేంద్రాలకు మందులను సరఫరా చేయడానికి 37 మంది పంపిణీదారులను నియమించడం జరిగింది. 

దుకాణదారులకు అందిస్తున్న  ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం  2.50 లక్షల రూపాయల  నుంచి  ఐదు లక్షల రూపాయలకు పెంచింది. నెలకు 15,000 రూపాయలు మించకుండా  నెలవారీ కొనుగోళ్లలో 15% ని అందించడం జరుగుతున్నది.  ఆశాజనక జిల్లాలు, హిమాలయ, ద్వీప భూభాగాలు, ఈశాన్య రాష్ట్రాలలో నెలకొల్పే పిఎమ్‌బిజెకెలకు  మరియు మహిళా పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులు, ఎస్సీలు మరియు ఎస్టీలు నెలకొల్పే పిఎమ్‌బిజెకెలకు ఫర్నిచర్ మరియు ఫిక్చర్‌ల కొనుగోలు కోసం ఒక సారి అదనపు ప్రోత్సాహకంగా రెండు లక్షల రూపాయలను అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.  

 ఈ సమాచారాన్ని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, రసాయనాలు , ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో ఈరోజు ఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అందించారు. 

***



(Release ID: 1743232) Visitor Counter : 175