ఉప రాష్ట్రపతి సచివాలయం
మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు శతజయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి
శ్రీ పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు
శ్రీ పీవీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించి, మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి
శ్రీ నరసింహారావు సేవలకు తగిన గౌరవం లభించలేదు
ఏ దేశం అయినా సంస్కృతి, వారసత్వం, గొప్ప నాయకుల సేవలను మరచిపోయి ముందుకు సాగలేదని ఉద్ఘాటన
Posted On:
28 JUN 2021 2:08PM by PIB Hyderabad
భారతదేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు శతజయంతి సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా శ్రీ పీవీని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారి నాయకత్వం మరియు దూరదృష్టి ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలోకి మరలించారని తెలిపారు. శ్రీ పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అని తెలిపిన ఉపరాష్ట్రపతి వారి మాటల్లో చమత్కారం, చేతల్లో నిర్వహణా సామర్థ్యం మరువలేనివని తెలిపారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి, ఈ ఉదయం సర్క్యూట్ హౌస్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీ పీవీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
శ్రీ పీవీ నరసింహారావు ప్రారంభించిన విప్లవాత్మక సంస్కరణలు గత మూడు దశాబ్ధాలుగా దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు దోహదపడ్డాయన్న ఉపరాష్ట్రపతి, వారి సంస్కరణలను మాజీ ప్రధాని శ్రీ వాజ్ పేయి అదే స్ఫూర్తితో అమలు చేయగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మరింత వేగవంతం చేశారని తెలిపారు. సంస్కరణల అమలు తక్షణ అవసరమన్న ఉపరాష్ట్రపతి, ఉత్తమమైన పద్ధతులు అవలంబిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
దేశంలో లైసెన్స్ రాజ్ ను రద్దు చేసిన ఘనత శ్రీ పీవీ నరసింహారావుదన్న ఉపరాష్ట్రపతి, భారత ఆర్థిక సరళీకరణల నిర్మాతగా వారిని అభివర్ణించారు. ముఖ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.వో)లోకి భారతదేశ ప్రవేశానికి వీలు కల్పించినది వారేనని తెలిపారు. ప్రపంచ యవనికపై దేశ ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించిన శ్రీ పీవీ, ఎంతో క్లిష్టమైన సమయంలో దేశ పాలనా పగ్గాలను చేపట్టి, వ్యూహాత్మకంగా దేశాభివృద్ధిని గాడిలో పెట్టారని తెలిపారు.
శ్రీ పీవీ నరసింహారావు భాషాభిమానాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, శ్రీ విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫాణ్’ గా హిందీలోకి అనువదించిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేగాక ప్రసిద్ధ మరాఠీ నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేతో’ని ‘అబల జీవితం’ పేరిట తెలుగులోకి అనువదించారని తెలిపారు. బహుభాషా కోవిదుడైన శ్రీ పీవీ మాతృభాషలో ప్రాథమిక విద్య సాగాలని ఆకాంక్షించారన్న ఉపరాష్ట్రపతి, హైస్కూల్ స్థాయి వరకూ బోధనా మాధ్యమం మాతృభాషగా ఉండాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
‘రాజకీయ వ్యవస్థ కంటే దేశమే ఉన్నతమైనదని నమ్మిన దేశభక్తుడైన రాజనీతిజ్ఞుడు’ అంటూ శ్రీ పీవీ గురించి మాజీ రాష్ట్రపతి శ్రీ కలాం పలుకులను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆయన ఈ నేలపై ఘనమైన వారసత్వాన్ని విడిచి వెళ్ళారని, యువతరం వారి నుంచి ప్రేరణ పొంది, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
శ్రీ పీవీ నరసింహారావు లాంటి గొప్ప నాయకుడి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న ఉపరాష్ట్రపతి, ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశనిర్మాణంలో శ్రీ పీవీ కృషిని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏ దేశం కూడా తన సంస్కృతి, వారసత్వం మరియు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల అపారమైన సేవలను మరచి ముందుకు సాగలేదన్న ఆయన, శ్రీ నరసింహారావు లాంటి మహనీయుల జీవితాలను, బోధనలను యువతరానికి తెలియజేయాలని పేర్కొన్నారు.
(Release ID: 1730921)