పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ పై పోరుకు కేంద్ర పంచాతీరాజ్ శాఖ సిద్ధం!


పంచాయతీలకు మార్గదర్శక సూచనలు జారీ
వైరస్.పై గ్రామ ప్రజల్లో అవగాహన పెంచేందుకు సలహాలు
అవగాహనా కార్యక్రమ సారథ్యంకోసం స్థానిక ప్రజా ప్రతినిధుల
సేవలను వినియోగించుకోవాలని రాష్ట్రాలకు నిర్దేశం


పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సిఫార్సుపై 25 రాష్ట్రాలకు
రూ. 8,923.8కోట్లు విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లకోసం కేటాయింపు

Posted On: 18 MAY 2021 5:28PM by PIB Hyderabad

  దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్-19 మహమ్మారి వైరస్ ఇటీవల  పెనుసమస్యగా పరిణమించింది. వైరస్ వ్యాప్తితో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ స్థాయిలో నష్టపోయే ముప్పు తలెత్తింది. దీనితో ఈ సమస్యను ప్రత్యేకంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వైరస్ వ్యాప్తిపై గ్రామీణ ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటంతో ఈ సమస్యను పరిష్కరించడంలో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖకు అనుబంధించిన గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఆయా సంస్థలు వైరస్ సవాళ్లను ఎదుర్కొనేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత సంవత్సరంలాగే ఇపుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తగిన నాయకత్వం వహించాల్సి ఉంది. గత సంవత్సరం ఈ విషయంలో పంచాయతీలు, గ్రామీణ స్థానిక సంస్థలు తీసుకున్న చర్యలకు అత్యున్నత స్థాయినుంచి ప్రశంసలు లభించాయి.

   పై విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సిఫార్సులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని వ్యయ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటుగా అందించేందుకు 25 రాష్ట్రాలకు రూ. 8,923.8 కోట్లను విడుదల చేసింది. మౌలిక గ్రాంట్ల మొత్తంలో తొలి విడత కింద ఈ సొమ్మును విడుదల చేశారు. కోవిడ్ వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు, కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేసేందుకు, ఇతర సంబంధిత కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది. కోవిడ్ పై పోరాటంలో పంచాయతీలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్దేశిస్తూ, అవసరమైన సూచనలను కూడా మంత్రిత్వ శాఖ పంపించింది. మార్గదర్శక సూత్రాలతో కూడిన సూచనలను ఈ కింద చూడవచ్చు.:

 

  1. కోవిడ్ ఇన్ఫెక్షన్ స్వభావం, కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయన్న అంశాలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉధృత స్థాయిలో ప్రచారం నిర్వహించడం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వైద్యులు, వైద్య సిబ్బంది అందించే సూచనలకు అనుగుణంగా ముందస్తు నిరోధక చర్యలు తీసుకోవడం, వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది. కోవిడ్ వైరస్ పై అపోహలను, తప్పుడు వార్తలను నిరోధించాల్సి ఉంటుంది. కోవిడ్ నేపథ్యం గురించి వివరించే సమాచారాన్ని, వైరస్.పై అవగాహనకు పనికివచ్చే సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ రిపాజిటరీనుంచి తీసుకోవచ్చు. (https://drive.google.com/folderview?id=1bXkzSNRKF8-4KTAkYXA0J7sfVUR1eFm). “పెద్దలైన కోవిడ్-19 బాధితులకు చికిత్సలో  మార్గదర్శకత్వం” అందించే కరపత్రం ఈ వెబ్ పోర్టల్ లింకులో  లభిస్తుంది. : https://www.mohfw.gov.in/pdf/COVID19ManagementAlgorithm22042021v1.pdf, కోవిడ్ పై అవగాహన కల్పించేందుకు ఈ కరపత్రం అందరికీ కరతలామలకంగా ఉంటుంది. 

 

  1. కోవిడ్ పై అవగాహనా కార్యక్రమం కోసం వైరస్ యుద్ధంలో ముందువరుసలో నిలిచిన  ఫ్రంట్ లైన్ వారియర్స్. సేవలను తీసుకోవడం. అలాగే, స్థానిక ప్రజా సమూహంనుంచి ఎన్నికైన పంచాయతీ ప్రజా ప్రతినిధులను, ఉపాధ్యాయులను, ఆశావర్కర్లు తదితరుల సేవలను అవగాహనా కార్యక్రమంలో వినియోగించుకోవడం..

 

  1. కోవిడ్ పై పోరాటంలో అవసరమైన వస్తువులను, పరికరాలను అందించడం.  ఆక్సీ మీటర్లు, ఎన్-95 మాస్కులు, ఇన్ఫ్రా రెడ్ థర్మల్ స్కానింగ్ పరికరాలు, శానిటైజర్లు వంటివి అవసరానికి తగినట్టుగా ఏర్పాటు చేయడం.

 

  1. పరీక్షల నిర్వహణా సదుపాయం, వ్యాక్సినేషన్ కేంద్రాలు, డాక్టర్లు, ఆసుపత్రుల్లో పడకల లభ్యత తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని వాస్తవ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు కచ్చితమైన లెక్కలతో ప్రదర్శించడం. తద్వారా, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను గ్రామీణ పౌరులు పటిష్టంగా వినియోగించుకునే అవకాశం కల్పించడం.

 

  1. పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, కామన్ సర్వీస్ కేంద్రాలు వంటి స్థలాల్లో అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదుపాయాలను సాధ్యమైనంత మేర గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడం. కోవిడ్ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించేందుకు ఈ సదుపాయాలను వినియోగించుకోవడం.

 

  1. పంచాయతీలు తమ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తగిన సంస్ధాగత మద్దతు లభించేందుకు వీలుగా ఆయా పంచాయతీలను క్రియాశీలం చేయడం. వీలైన చోట్ల ఇళ్లను హోమ్ క్వారంటైన్ సదుపాయాలుగా మెరుగుపరిచేందుకు, లక్షణాల్లేని కోవిడ్ పాజిటివ్ రోగులను గరిష్ట సంఖ్యలో ఉంచేందుకు, చికిత్స నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం. అవసరమైన గ్రామీణులకు, తమ పని ప్రదేశాలనుంచి తిరిగి వచ్చిన వలస కూలీలకు అదనంగా ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం. ఆరోగ్య శాఖను సంప్రదించి, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించేలా పంచాయతీలకు తగిన బాధ్యతలు అప్పగించడం. తద్వారా అర్హులైన ప్రజలందరికీ గరిష్ట స్థాయిలో వ్యాక్సినేషన్ అందేలా చూడటం.

 

  1. కోవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా,  ప్రజల జీవనోపాధికి ఏర్పడే అడ్డంకులను, సమస్యలను దృష్టిలో పెట్టుకొని, వారికోసం సహాయ, పునరావాస చర్యలు చేపట్టడం. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలను సానుకూలంగా వినియోగించుకోవడం. రేషన్ సరకులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.) వంటి కార్యక్రమాలు చేపట్టడం. వాటి ఫలాలన్నీ సిసలైన లబ్ధిదారులకు చేరేలా తగిన చర్యలు తీసుకోవడం. ఇలాంటి సహాయ కార్యక్రమాల అమలులో పంచాయతీలకు తప్పనిసరిగా ప్రత్యక్ష ప్రమేయం కల్పించడం. కోవిడ్ వైరస్ బారిన పడేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్న వయో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విభిన్న సామర్థ్యాలు కలిగిన వర్గాలతో సహా సిసలైన లబ్ధిదారులకే పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవడం.

 

  1. సమీపంలోని జిల్లా, ఉపజిల్లా కేంద్రాలవద్ద ఉండే వైద్యపరమైన మౌలిక సదుపాయాలతో అనుసంధానంకోసం తగిన ఏర్పాట్లు చేసుకోవడం. దీనివల్ల అంబులెన్సులు, అధునాతన టెస్టింగ్ సదుపాయాలు, చికిత్స వంటి అత్యవసర సేవలు, మల్టీ స్పెషాలటీ స్థాయి ఆరోగ్య రక్షణ వంటి సదుపాయాలను అవసరమైన వారికి కాలహరణం లేకుండా ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది.

 

  గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కట్టడికి సేవలందించడంలో ఎన్నికైన పంచాయతీ ప్రతినిధులు ముందువరుసలో ఉండాలని, నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇందుకోసం వారు తమతమ ప్రాంతాల్లోని వివిధ రకాల వలంటీర్ల సేవలను, సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి గ్రామస్థాయి, వార్డుల స్థాయి కమిటీలు, నిగ్రాణీ సమితులను ఏర్పాటు చేయడమో, లేదా ఉన్న కమిటీలను క్రియాశీలం చేయడమో తప్పనిసరి అని కూడా కేంద్రం సూచించింది. ఇప్పటి వరకూ జరగనిచోట్ల ఈ కార్యక్రమం ఇకనైనా నిర్వహించాలని సూచించారు. మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా 14వ/15వ ఆర్థిక సంఘం గ్రాంట్లను వినియోగించుకోవాలని పంచాయతీలకు సూచించారు. అలాగే, సాధ్యమైనంతవరకూ ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్. నుంచి అదనపు నిధులను అందించే విషయాన్ని పరిశీలించాలని కూడా సూచించారు.

   ఇందుకు ఎంతో ఉత్సాహంగా ప్రతిస్పందించిన రాష్ట్రాలు, ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాయి. ప్రతి పంచాయతీలోనూ ఆరోగ్య వ్యవస్థకు సహాయంగా ఉండేలా అంబులెన్స్ రవాణా వ్యవస్థను అందించేందుకు తగిన ప్రణాళిక రూపొందించడం, అవసరమైన వారికోసం రెండు విడి చేంబర్ల ఏర్పాటు ఉన్న కార్లు, ఆటో రిక్షాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలను రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలు సొంతంగా లాక్ డౌన్ ఆంక్షలు విధించుకోవడం, పని ప్రదేశాలనుంచి తిరిగి వచ్చిన వలస కూలీలను నమోదు చేసేందుకు అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం,  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇ-సంజీవని ఒ.పి.డి., ఉచితం ఆన్ లైన్ వైద్య సలహా సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి ప్రసంసనీయమైన చర్యలను ఇక్కడ ప్రస్తావించవచ్చు. కోవిడ్ వైరస్ వ్యాప్తి రెండవ ఉధృతిని ఎదుర్కొనేందుకు 19 రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నాయి. ఇందుకు సంబంధించి ఈనెల 13వ తేదీవరకూ అందిన సమాచారం ప్రకారం కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు అందించిన వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.

   కోవిడ్ వైరస్ కట్టడి పోరాటంలో వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలు తీసుకున్నచర్యలను కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ వెంటనే సమీక్షించింది. వైరస్ ను మరింత పటిష్టంగా కట్టడి చేసేందుకు తీసుకోవలసిన మరిన్ని చర్యలను పేర్కొంటూ కేంద్రం ఈ నెల 12వ తేదీన ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది.

   ఇక పట్టణ, నగర శివార్లలోని ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి కట్టడి, చికిత్సా నిర్వహణకోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనావళిన ఈ కింది వెబ్ సైట్ లింకులో అందుబాటులో ఉంటుంది. : https://www.mohfw.gov.in/pdf/SOPonCOVID19Containment&ManagementinPeriurbanRural&ribalareas.pdf,  ఇదే నిబంధనావళిని వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించారు. ఈ నియమ నిబంధనలను ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయించాలని, కోవిడ్  పోరుతో ప్రమేయం ఉన్న సంబంధిత భాగస్వామ్య వర్గాలకు పంపిణీ చేసి, అట్టడుగున ఉన్న గ్రామస్థాయికి నిబంధనలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. 

 

****



(Release ID: 1719791) Visitor Counter : 216