ప్రధాన మంత్రి కార్యాలయం

‘తౌఁటే’ తుపాను సంసిద్ధతపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష


ప్రజల సురక్షిత తరలింపునకు సాధ్యమైన అన్ని చర్యలూ

తీసుకోవాలని సీనియర్ అధికారులకు ప్రధాని ఆదేశం;

విద్యుత్.. టెలిఫోన్.. ఆరోగ్యం.. తాగునీరు తదితర
నిత్యావసరాల లభ్యతకు భరోసా కల్పించాలి: ప్రధానమంత్రి;

తుపాను ముప్పున్న ప్రదేశాల్లోని ఆస్పత్రుల్లో కోవిడ్ నిర్వహణ..

టీకాల శీతల భద్రత... విద్యుత్ సౌకర్యం... అత్యవసర ఔషధ నిల్వ
తదితరాలపై ప్రత్యేక సంసిద్ధత అవసరం: ప్రధానమంత్రి

Posted On: 15 MAY 2021 6:51PM by PIB Hyderabad

   ‘తౌఁటే’ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంపై సంబంధిత రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘తౌఁటే’ తుపాను 18వ తేదీ మధ్యాహ్నం  లేదా సాయంత్రం పోర్‌బంద‌ర్‌-నాలియాల మధ్య గుజరాత్ తీరాన్ని దాట‌వ‌చ్చున‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆ స‌మ‌యంలో సుమారు 175 కిలోమీటర్ల భీక‌ర వేగంతో పెనుగాలులు వీస్తాయ‌ని హెచ్చరించింది. అలాగే తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కాగలదని అంచనా వేసింది. ఈ మేరకు జునాగఢ్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో అత్యంత భారీగా; సౌరాష్ట్ర కచ్, డయ్యూ జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీగా; ముఖ్యంగా గిర్ సోమనాథ్, డయ్యూ, జునాగఢ్, పోర్‌బంద‌ర్‌, దేవభూమి ద్వారక, అమ్రేలి, రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

   ఈ నెల 18వ తేదీన తుపాను తీరందాటే సమయంలో సముద్రంలో అలలు సాధారణంకన్నా 2 నుంచి 3 మీటర్ల మేర ఎక్కువగా ఎగసిపడి మోర్బి, కచ్, దేవ్‌భూమి ద్వారక, జామ్‌నగర్ జిల్లాల తీర ప్రాంతాలను ముంచెత్తవచ్చునని ‘ఐఎండీ’ పేర్కొంది. అలాగే పోర్‌బంద‌ర్‌, జునాగఢ్, డయ్యూ, గిర్ సోమనాథ్, అమ్రేలి, భావ్‌నగర్ తీరాల్లో సాధారణంకన్నా 1 నుంచి 2 మీటర్లు; మిగిలిన తీరప్రాంత జిల్లాల్లో సాధారణం కన్నా 0.5 నుంచి 1 మీటరు ఎక్కువగా ఎగసిపడే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13 నుంచే సంబంధిత రాష్ట్రాలకు ‘ఐఎండీ’ ప్రతి 3 గంటలకొకసారి తాజా ముందస్తు అంచనాలతో సమాచార నివేదికలను జారీ చేస్తోంది.

   తుపానుకు సంబంధించి కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి అన్ని తీరప్రాంత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాలతో నిరంతరం సంప్రదింపులు సాగించడంపై సమావేశం చర్చించింది. అలాగే దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) పరిస్థితిని 24 గంటలూ సమీక్షించడంతోపాటు సంబంధిత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలుసహా, కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు కొనసాగిస్తుంది. కాగా, తొలి విడత ‘ఎస్‌డిఆర్‌ఎఫ్‌’ నిధులను ‘ఎమ్‌హెచ్‌ఏ’ అన్ని రాష్ట్రాలకూ ముందుగానే విడుదల చేసింది. మరోవైపు ఆరు రాష్ట్రాల్లో పడవలు, టెలికాం పరికరాలు తదితరాలుసహా కూలిన చెట్లను తొలగించేవారు తదితర రక్షణ-సహాయ కార్యక్రమాల కోసం 42 బృందాలను మోహరించడంతోపాటు మరో 26 బృందాలను ఎప్పుడైనా రంగంలోకి దించడానికి సిద్ధంగా ఉంచింది.

   రక్షణ-సహాయ-అన్వేషణ చర్యల్లో పాల్గొనేందుకు వీలుగా భారత తీరరక్షక దళం, నావికాదళం తమతమ నౌకలు, హెలికాప్టర్లను ఇప్పటికే మోహరించాయి. వాయుసేనతోపాటు భారత సైన్యంలోని ఇంజనీరింగ్ టాస్క్‌ఫోర్స్‌ యూనిట్లు కూడా పడవలు, రక్షణ పరికరాలతో సంసిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా పశ్చిమ తీరంలో మానవతా సహాయం, విపత్తు సహాయక యూనిట్లతో ఏడు నౌకలు కూడా ఏ క్షణంలోనైనా కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక పశ్చిమ తీరం వెంబడి నిఘా విమానాలు-హెలికాప్టర్లు వరుస నిఘా చర్యలు చేపట్టాయి. త్రివేండ్రం, కన్నూర్ సహా పశ్చిమ తీరంలోని ఇతర ప్రదేశాల్లో విపత్తు సహాయక బృందాలు (డీఆర్‌టీ), వైద్య బృందాలు (ఎమ్‌టీ) సిద్ధంగా ఉన్నాయి.

   విద్యుత్ మంత్రిత్వశాఖ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలన్నిటినీ అప్రమత్తంగా ఉంచింది. అలాగే విద్యుత్తు తక్షణ పునరుద్ధరణ కోసం ట్రాన్స్‌ఫార్మ‌ర్లు, డి.జి.సెట్లు, ఇతర పరికరాలు  వగైరాలను సిద్ధం చేసింది. అదేవిధంగా టెలికాం మంత్రిత్వశాఖ కూడా అన్ని టెలికాం టవర్లు, ఎక్స్ఛేంజీలపై నిరంతరం పరిశీలనతోపాటు టెలికాం నెట్‌వర్క్‌ సత్వర పునరుద్ధరణకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. తుపానువల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో  ఆరోగ్య రంగ సంసిద్ధత, ప్రభావిత ప్రాంతాల్లో కోవిడ్ ప్రతిస్పందన చర్యలకు సంబంధించి ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచనాపత్రం జారీచేసింది. అంతేకాకుండా అత్యవసర మందులతో 10 సత్వర ప్రతిస్పందన వైద్య బృందాలు, మరో 5 ప్రజారోగ్య ప్రతిస్పందన బృందాలను కూడా సిద్ధంగా ఉంచింది. ఇక రేవులు-నౌకాయాన-జలరవాణా మంత్రిత్వశాఖ నౌకాయాన ఓడల సమీకరణతోపాటు అత్యవసర పడవ (టగ్)లను ఇప్పటికే మోహరించింది.

   ఆయా రాష్ట్రాల్లో ముప్పు వాటిల్లగల ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించడానికి రాష్ట్రాల సన్నద్ధత దిశగా ‘ఎన్‌డీఆర్ఎఫ్‌’ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ విభాగాలకు చేయూతనిస్తోంది. అంతేకాకుండా తుపాను పరిస్థితులను ఎదుర్కొనడంపై నిరంతర సామాజిక అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది.

   తుపాను సంబంధిత సన్నద్ధత పరిస్థితిపై సమీక్ష అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ- ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలను సురక్షితంగా తరలించేలా అన్నిరకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా విద్యుత్, టెలిఫోన్, ఆరోగ్యం,  తాగునీరు తదితర నిత్యావసర సేవల లభ్యత, నిర్వహణకు భరోసా కల్పించేలా చూడాలని సూచించారు. ఆయా సదుపాయాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వాటి తక్షణ పునరుద్ధరణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. తుపాను ముప్పున్న ప్రదేశాల్లోని ఆస్పత్రుల్లో కోవిడ్ నిర్వహణసహా టీకాల శీతల భద్రత, అత్యవసర వైద్య పరికరాలు, ఔషధాల నిల్వకు విఘాతం కలగకుండా నిరంతర విద్యుత్ సౌకర్యం వగైరాలకు ప్రత్యేక సన్నద్ధత ఉండాలని ఆదేశించారు. అలాగే ఆక్సిజన్ ట్యాంకర్ల రాకపోకలకు అవరోధాలు లేకుండా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. కంట్రోల్ రూములు 24 గంటలూ పనిచేయాలని కూడా ప్రధాని ఆదేశించారు.  జామ్‌నగర్ నుంచి ఆక్సిజన్ సరఫరా ఏమాత్రం ఆగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. స్థానిక సామాజిక సంస్థలు ప్రజలకు సకాలంలో అవగాహన కల్పించడంతోపాటు సహాయక చర్యల్లో పాలుపంచుకునేలా చూడాల్సిన అవసరం గురించి ఆయన గుర్తుచేశారు.

   ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి, సహాయ మంత్రితోపాటు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి, ఆయా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు/హోం, పౌర విమానయానం, విద్యుత్, టెలికాం, నౌకాయానం, మత్స్యశాఖలు/విభాగాల కార్యదర్శులు సహా ఎన్డీఎంఏ సభ్యులు-కార్యదర్శి, రైల్వే బోర్డు చైర్మన్, ఎన్డీఆర్ఎ/ఐఎండీ డైరెక్టర్ జనరళ్లతోపాటు  పీఎంవో, ఎంహెచ్ఏ, ఐఎండీల సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 

***



(Release ID: 1719012) Visitor Counter : 170