ప్రధాన మంత్రి కార్యాలయం

2021 ఏప్రిల్ 25 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 76 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 25 APR 2021 11:34AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా. నమస్కారం.  మనందరి ధైర్యాన్ని, దుఃఖాన్ని, సహనాన్ని కరోనా పరీక్షిస్తున్న ఈ సమయంలో నేను ఈ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ద్వారా మీతో మాట్లాడుతున్నాను.  చాలా మంది మనవాళ్లు మనలను అకాలం లో వదలిపెట్టి వెళ్లిపోయారు.  కరోనా తాలూకు ఒకటో వేవ్ ను సఫలతపూర్వకంగా ఎదుర్కొన్న తరువాత దేశం ఆత్మవిశ్వాసం తో తొణికిసలాడింది; కానీ ఈ తుపాను దేశాన్ని విచలితం చేసివేసింది.

 

మిత్రులారా, గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను.  ఔషధ పరిశ్రమ కు చెందిన వారు, టీకా మందు తయారీదారులు, ఆక్సీజన్ ఉత్పత్తి లో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్న వారు వారి వారి ముఖ్యమైన సలహాల ను ప్రభుత్వానికి అందజేశారు.  ఈ సమయం లో- ఈ యుద్ధం లో విజయాన్ని సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది.  రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడం లో భారత ప్రభుత్వం పూర్తి శక్తి ని కూడదీసుకొంది.  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి  బాధ్యతలను నెరవేర్చడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.


మిత్రులారా, కరోనా కు వ్యతిరేకం గా ఈ సమయం లో దేశం లోని వైద్యులు , ఆరోగ్య కార్యకర్త లు అతి పెద్ద పోరాటాన్ని చేస్తున్నారు.  గత సంవత్సర కాలం లో ఈ వ్యాధి కి సంబంధించి వారికి అన్ని రకాల అనుభవాలు కలిగాయి.  మనతో, ఈ వేళ, ముంబయి కి చెందిన ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ శశాంక్ జోశీ గారు కలిశారు.


డాక్టర్ శశాంక్ గారికి కరోనా చికిత్స, కరోనా తో ముడిపడ్డ పరిశోధన లో  చాలా అనుభవం ఉంది.  ఆయన, ఇండియన్ కాలేజి ఆఫ్ ఫిజిశియన్స్ డీన్ గా కూడా పనిచేశారు.  రండి, డాక్టర్ శశాంక్‌ తో మాట్లాడుదాం : -


మోదీ గారు: నమస్కారం డాక్టర్ శశాంక్ గారూ.

డాక్టర్ శశాంక్: నమస్కారం సర్.

మోదీ గారు :  కొద్ది రోజుల క్రితం మీతో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. మీ ఆలోచనలలోని స్పష్టత ను నేను ఇష్టపడ్డాను.  దేశం లోని ప్రజలంతా మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని నేను భావించాను.  మనం వింటున్న విషయాలను నేను మీకు ప్రశ్న గా అందిస్తున్నాను.  డాక్టర్ శశాంక్ గారు.. ప్రాణాలను రక్షించే పనిలో మీరు రాత్రింబగళ్లు నిమగ్నమై ఉన్నారు.  మొదట మీరు కరోనా రెండో వేవ్ ను గురించి ప్రజల కు చెప్పాలనుకుంటున్నాను.  వైద్యం పరంగా ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? ఏయే జాగ్రత్త లు అవసరం?

డాక్టర్ శశాంక్ : ధన్యవాదాలు సర్.  ఇది రెండో వేవ్.  ఇది వేగం గా వచ్చింది.  కాబట్టి ఈ వైరస్ ఒకటో వేవ్ కంటే వేగం గా నడుస్తోంది.  అయితే మంచి విషయం ఏమిటంటే, ఈ దశ లో వేగం గా కోలుకుంటున్నారు.  మరణాల రేటు చాలా తక్కువ గా ఉంది.  ఇందులో రెండు- మూడు తేడా లు ఉన్నాయి.  ఇది యువత లో, పిల్లల లో కూడా కొద్ది గా ప్రభావాన్ని కలిగిస్తోంది.  గతం లో కరోనా లక్షణాలైన శ్వాస తీసుకోలేకపోవడం, పొడి దగ్గు, జ్వరం- ఇవన్నీ ఉన్నాయి.  వాటితో పాటు కొంచెం వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం కూడా ఉన్నాయి.  ప్రజలు కొద్దిగా భయపడుతున్నారు.  భయపడాల్సిన అవసరం లేదు.  80-90 శాతం మందికి ఇందులో ఎలాంటి లక్షణాలు కనిపించవు.  ఈ ఉత్పరివర్తనాలు భయాందోళన కు గురి చేసేవి కాదు.  మనం బట్టలు మార్చినట్టుగానే వైరస్ కూడా దాని రంగు ను మార్చుకొంటుంది.  అందువల్ల భయపడడానికి ఏమీ లేదు.  మనం ఈ దశ ను దాటుతాం.  వేవ్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది.  ఈ వైరస్ వస్తూ పోతూ ఉంటుంది.  ఇవి విభిన్నమైన లక్షణాలు.  వైద్యం పరంగా మనం జాగ్రత్త గా ఉండాలి.  ఇది 14 రోజుల నుంచి 21 రోజుల పాటు పట్టేటటువంటి కోవిడ్  టైమ్ టేబుల్.  ఇందులో వైద్యుల సలహా ను తీసుకోవాలి.

మోదీ గారు:  డాక్టర్ శశాంక్ గారూ, మీరు చెప్పిన విశ్లేషణ చాలా ఆసక్తికరం గా ఉంది.  నాకు చాలా లేఖ లు వచ్చాయి.  వాటి ప్రకారం ప్రజల కు చికిత్స ను గురించిన సందేహాలు చాలా ఉన్నాయి.  కొన్ని ఔషధాల అవసరం చాలా ఉంది.  కాబట్టి కోవిడ్ కు చికిత్స ను గురించి చెప్పండి.

డాక్టర్ శశాంక్:  అవును సర్.  క్లినికల్ ట్రీట్ మెంట్ ను ప్రజలు చాలా ఆలస్యం గా మొదలుపెడతారు.  ఈ వ్యాధి తనంత తాను అణగిపోతుంది అనే భరోసా తో ఉంటారు.  మొబైల్‌ లో వస్తున్న విషయాలను నమ్ముతారు. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని అనుసరించారా అంటే ఈ ఇబ్బంది ఎదురు కాదు.  కోవిడ్ లో క్లినికల్ ట్రీట్ మెంట్ ప్రోటోకాల్‌ లో మూడు రకాల తీవ్రత లు ఉన్నాయి.  వాటిలో ఒకటోది తేలికపాటి కోవిడ్. రెండోది మధ్యస్థంగా ఉండే కోవిడ్. మూడోది తీవ్రమైన కోవిడ్.


తేలికపాటి కోవిడ్ విషయం లో ఆక్సీజన్ ను, పల్స్ ను, జ్వరాన్ని పరిశీలిస్తూ ఉంటాం.  జ్వరం పెరుగుతున్నప్పుడు కొన్ని సార్లు పారాసెటమాల్ వంటి మందులను వాడతాం.  కోవిడ్ మధ్యస్థంగా గాని, లేదా తీవ్రంగగా గాని ఉంటే వైద్యుడి ని సంప్రదించడం తప్పనిసరి.  సరైన, చౌకైన మందులు అందుబాటు లో ఉన్నాయి. ఈ ఔషధాల్లో ఉండే స్టిరాయిడ్లులు ఇన్ హేలర్ ల లాగా ప్రాణాలను కాపాడతాయి.  మందులతో పాటు ఆక్సీజన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.  దీనికి చిన్న చిన్న చికిత్సలు ఉన్నాయి.  రెమ్‌డెసివిర్ అని ఒక కొత్త ప్రయోగాత్మక ఔషధం ఉంది.  ఈ ఔషధం తో ఉపయోగం ఏమిటంటే దీనివల్ల ఆసుపత్రి లో రెండు, మూడు రోజులు తక్కువ కాలం ఉండవచ్చు.  క్లినికల్ రికవరీ లో ఈ ఔషధం కొద్దిగా ఉపయోగపడుతుంది.  మొదటి 9-10 రోజులలో ఇచ్చినప్పుడు ఈ ఔషధం పనిచేస్తుంది.  దీనిని ఐదు రోజులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది.  రెమ్‌డెసివిర్ వెనుక పరుగెత్తడం ఉండకూడదు.  ఈ ఔషధం ఆక్సీజన్ అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే- అది కూడా ఆసుపత్రి లో చేరిన తరువాత డాక్టర్ చెప్పినప్పుడే తీసుకోవాలి.  ప్రజలందరినీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  మనం ప్రాణాయామం చేస్తాం.  మన ఊపిరితిత్తులను కొద్దిగా విస్తరిస్తాం.  రక్తాన్ని పల్చగా చేసే హెపారిన్ అనే ఇంజెక్షన్ మొదలైన చిన్న చిన్న మందులు ఇస్తే 98 శాతం మంది ప్రజల్లో తగ్గిపోతుంది.  ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.  వైద్యుడి సలహా తో చికిత్స ను పొందడం మరీ ముఖ్యం.  ఖరీదైన ఔషధాల వెంట పడవలసిన అవసరం లేదు సర్.  మన దగ్గర మంచి చికిత్స ఉంది.  ప్రాణవాయువు ఉంది. వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉంది.  ప్రతిదీ ఉంది.  ఈ ఔ షధాలను నిజం గా అవసరమైన వారికి మాత్రమే ఇవ్వాలి.  ప్రపంచంలోనే ఉత్తమమైన చికిత్స మనకు అందుబాటులో ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను సర్.  భారతదేశం లో రికవరీ రేటు కూడా ఎక్కువ గా ఉంది.  యూరోప్ తో, అమెరికా తో పోలిస్తే మన చికిత్స పద్ధతులు బాగున్నాయి సర్.

మోదీ గారు: చాలా ధన్యవాదాలు డాక్టర్ శశాంక్ గారు.  మనకు డాక్టర్ శశాంక్ గారు ఇచ్చిన సమాచారం చాలా ముఖ్యమైంది.  మనందరికీ ఉపయోగపడుతుంది.

మిత్రులారా, మీకు ఏదైనా సమాచారం కావాలి అంటే, మీకు ఏవైనా సందేహాలు ఉంటే, అధీకృత సమాచారాన్ని పొందండి.  సమీపం లోని వైద్యులను గాని, మీ కుటుంబ వైద్యుడి ని గాని సంప్రదించండి.  ఫోన్ ద్వారా వారిని సంప్రదించి, సలహా తీసుకోండి.  మన వైద్యులు చాలా మంది ఈ బాధ్యత ను స్వయం గా తీసుకుంటున్న విషయం నేను గమనిస్తున్నాను.  చాలా మంది వైద్యులు సోశల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు.  ఫోన్ ద్వారాను, వాట్సాప్ ద్వారా కూడాను కౌన్సెలింగ్ చేస్తున్నారు.  చాలా ఆసుపత్రుల వెబ్‌సైట్ లలో సైతం సమాచారం అందుబాటు లో ఉంది.  ఆ వెబ్ సైట్ ల ద్వారా మీరు వైద్యుల ను సంప్రదించవచ్చు.  ఇది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం.

శ్రీనగర్ కు చెందిన వైద్యులు డాక్టర్ నావీద్ నజీర్ శాహ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు.  డాక్టర్ నావీద్ శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.  ఆయన తన పర్యవేక్షణ లో చాలా మంది కరోనా రోగులకు వ్యాధి ని నయం చేశారు.  డాక్టర్ నావీద్ ఈ పవిత్ర రంజాన్ మాసం లో కూడా తన పని ని చేస్తున్నారు.  ఆయన మనతో మాట్లాడటానికి కూడా వీలు చేసుకున్నారు.  వారితో మాట్లాడుదాం.

మోదీ గారు: నావీద్ గారూ, నమస్కారం.

డాక్టర్ నావీద్ – నమస్కారం సర్.

మోదీ గారు: డాక్టర్ నావీద్ గారూ. ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోత లు ఈ క్లిష్ట సమయం లో పానిక్ మేనేజ్ మెంట్ ప్రశ్నను లేవనెత్తారు.  ఆందోళన ను, భయాన్ని దూరం చేసుకునే విషయం లో మీరు మీ అనుభవాన్నుంచి వారికి ఏమని జవాబిస్తారు?

డాక్టర్ నావీద్:  కరోనా ప్రారంభమైనప్పుడు మా సిటీ హాస్పిటల్ ‘కోవిడ్ హాస్పిటల్’ గా ప్రత్యేక హోదా ను పొందింది.  ఈ వైద్యశాల మెడికల్ కాలేజీ కి అనుబంధం గా ఉంది.  ఆ సమయం లో భయానక వాతావరణం నెలకొంది.  ఎవరికైనా కోవిడ్ సంక్రమిస్తే దాన్ని మరణశిక్ష గా భావించే వారు.  అటువంటి స్థితి లో మా ఆసుపత్రి లో వైద్యులు, పారా-మెడికల్ స్టాఫ్ లో కూడా ఒక భయంకర వాతావరణం ఉండింది.  ఈ రోగుల కు ఎలా చికిత్స చేయగలం?  మాకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదమైతే లేదు కదా? వంటి ప్రశ్న లు వచ్చాయి.  అయితే సరైన రక్షణ పద్ధతులను పాటించామా అంటే గనక మనకు సంక్రమణ సోకే ప్రమాదం లేదు.  కానీ సరైన రక్షణ పద్ధతులను పాటిస్తే మేము, మాతో పాటు మిగతా సిబ్బంది కూడా సురక్షితంగా ఉండవచ్చని కాలం గడుస్తున్న కొద్దీ మేము చూశాం. చాలా మంది రోగుల లో వ్యాధి లక్షణాలు కూడా లేవు.  90- 95 శాతం కంటే ఎక్కువ మంది రోగుల లో చికిత్స లేకుండానే వ్యాధి నయం అవుతోంది. కాలం గడిచే కొద్దీ కరోనా అంటే భయం తగ్గింది.

ఈ సమయం లో వచ్చిన ఈ రెండో వేవ్ కరోనా విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు.  మాస్క్ ధరించడం, హ్యాండ్ శానిటైజర్ ను ఉపయోగించడం, ఒక మనిషి కి మరొక మనిషికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించడం, గుంపులు గా చేరకుండా ఉండడం మొదలైన రక్షణ చర్యల ను పాటిస్తే మనం రోజువారీ పనుల ను చక్కగా చేసుకోవచ్చు.  వ్యాధి నుంచి రక్షణ ను పొందవచ్చు.

మోదీ గారు: డాక్టర్ నావీద్ గారు, టీకా మందు తో సహా చాలా విషయాల్లో ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయి. టీకా నుంచి ఎంతమేరకు రక్షణ లభిస్తుంది? టీకా తరువాత ఎంత భరోసా గా ఉండవచ్చు? దీనిని గురించి మీరు చెప్తే శ్రోత ల కు చాలా లాభం కలుగుతుంది.

 

డాక్టర్ నావీద్:  కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మనకు కోవిడ్ 19 కి ఎటువంటి సమర్థవంతమైన చికిత్స అందుబాటు లో లేదు.  అప్పుడు మనం వ్యాధి తో కేవలం రెండు విధాలు గా పోరాడవచ్చును. వాటిలో ఒకటి- రక్షణ ను పొందడం.  ఏదైనా సమర్థవంతమైన వ్యాక్సీన్ ఉంటే, వ్యాధి నుంచి బయటపడవచ్చని మనం మొదటి నుంచి అనుకుంటున్నాం.  ఈ సమయంలో రెండు టీకా మందు లు మన దేశంలో అందుబాటు లో ఉన్నాయి.  కోవాక్సిన్, కోవిశీల్డ్ – రెండూ ఇక్కడే తయారయ్యాయి.  కంపెనీ లు నిర్వహించిన ట్రయల్స్ లో వాటి సామర్థ్యం 60 శాతం కంటే ఎక్కువ గా ఉందని తెలిసింది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం లో ఇప్పటి వరకు 15 నుండి 16 లక్షల మంది టీకా తీసుకున్నారు.  అవును.. సోశల్ మీడియా లో చాలా అపోహలు ఉన్నాయి.  దుష్ప్రభావాలు ఉన్నాయన్న భ్రమ లు ఉన్నాయి. కానీ ఇక్కడ టీకా లు వేసిన వారి లో ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. జ్వరం, మొత్తం శరీరం లో నొప్పి లేదా ఇంజెక్షన్ ఉన్న చోట మాత్రమే నొప్పి మొదలైనవి ఇతర టీకాల మాదిరిగానే ఈ టీకా తీసుకున్న వారిలో కూడా కనబడుతున్నాయి.  ఈ లక్షణాలన్నీ ప్రతి వ్యాక్సీన్‌ తో సాధారణ సంబంధం కలిగి ఉంటాయి.  అంతే తప్ప టీకా వేసుకున్న ఎవరిలోనూ ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూడలేదు.  అవును.. టీకా లు వేసిన తరువాత కొంత మంది పాజిటివ్ అయ్యారని ప్రజలలో ఒక భయం కూడా ఉంది.  ఈ విషయం లో కంపెనీ ల నుండి మార్గదర్శకాలు ఉన్నాయి.  ఆ తరువాత ఇన్ఫెక్షన్ ఉండవచ్చు.  వారు పాజిటివ్ కావచ్చు.  కానీ వ్యాధి తీవ్రత ఎక్కువ గా ఉండదు.  అంటే కోవిడ్ పాజిటివ్ ఉన్నా ప్రాణాంతకం అయ్యేటంత ప్రమాదకరం గా నిరూపణ కాజాలదు.  ఈ కారణం గా, ఈ వ్యాక్సీన్ ను గురించి అపోహ లు ఏవైనా ఉంటే వాటిని మన మెదడు లో నుంచి తొలగించాలి.  మరి మే 1వ తేదీ నుంచి మన యావత్తు దేశం లో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి టీకా మందు ను వేయించే కార్యక్రమం మొదలవుతుందో, అప్పుడు మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అందరూ వారి వారి వంతు వచ్చిన ప్రకారం టీకా మందు ను తీసుకోవాలి.  దాని ద్వారా ఎవరిని వారు రక్షించుకోవడంతో పాటు మొత్తం సమాజాన్ని రక్షించుకోవచ్చు.  అందరూ టీకా తీసుకుంటే కోవిడ్ 19 సంక్రమణ నుండి సమాజానికి రక్షణ లభిస్తుంది.

మోదీ గారు:  డాక్టర్ నావీద్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు.  మీకు పవిత్ర రంజాన్ నెల తాలూకు అనేకానేక శుభాకాంక్షలు.

డాక్టర్ నావీద్ - బహుత్ బహుత్ శుక్రియా.

మోదీ గారు:  మిత్రులారా, ఈ కరోనా సంక్షోభ కాలం లో టీకా ప్రాముఖ్యం అందరికీ తెలుసు.  అందువల్ల టీకా ను గురించి ఎటువంటి వదంతులను  నమ్మకండి అంటూ మిమ్మల్ని నేను కోరుతున్నాను.  ఉచిత వ్యాక్సీన్‌ ను భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది.  45 ఏళ్లు పైబడిన వారు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు.  దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ మే 1 నుంచి అందుబాటు లో ఉంటుంది. ఇప్పుడు దేశం లోని కార్పొరేట్ రంగం, కంపెనీ లు తమ ఉద్యోగులకు వ్యాక్సీన్ వేసే ఉద్యమంలో పాల్గొంటాయి. భారత ప్రభుత్వం నుండి ఉచిత వ్యాక్సీన్ అందజేసే కార్యక్రమం ఇకపై కూడా కొనసాగుతుంది.  భారత ప్రభుత్వ ఈ ఉచిత వ్యాక్సీన్ ప్రయోజనాలను వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని  రాష్ట్రాల ను నేను కోరుతున్నాను.

మిత్రులారా, అనారోగ్యంలో ఉన్న మనల్ని, మన కుటుంబాలను చూసుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు.  మన ఆసుపత్రు ల నర్సింగ్ సిబ్బంది ఒకే సారి చాలా మంది రోగులకు సేవ చేస్తారు.  ఈ సేవ మన సమాజానికి గొప్ప బలం.  నర్సింగ్ సిబ్బంది కృషి ని గురించి చెప్పగలిగే వారు నర్సులు.  అందుకే రాయ్‌ పుర్ లోని డాక్టర్ బి.ఆర్.  అమ్బే డ్ కర్ మెడికల్ కాలేజి హాస్పిటల్ లో తన సేవలను అందిస్తున్న సిస్టర్ భావనా ధ్రువ్ గారి ని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమానికి)  ఆహ్వానించాం.  ఆమె చాలా మంది కరోనా రోగుల పట్ల శ్రద్ధ వహిస్తున్నారు.  రండి, ఆమెతో మాట్లాడుదాం.

మోదీ గారు:  నమస్కారం భావన గారు.

భావన:  గౌరవనీయ ప్రధానమంత్రి గారూ, నమస్కారమండి.

మోదీ గారు:  భావన గారు.

భావన:  యస్ సర్.

మోదీ గారు: ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) వినే వారికి మీరు తప్పక చెప్పాలి.  మీ కుటుంబం లో మీకు చాలా బాధ్యత లు ఉన్నాయని; ఎన్నో పనులు ఉన్నాయని.  అయినప్పటికీ మీరు కరోనా రోగుల కోసం సేవలను అందిస్తున్నారు.  కరోనా రోగుల తో మీ అనుభవాలను గురించి తెలుసుకోవాలి అని దేశవాసులు ఖచ్చితం గా కోరుకుంటారు.  ఎందుకంటే రోగి కి దగ్గరగా, ఎక్కువ కాలం ఉండే వారు సిస్టర్లు, నర్సులే.  అందువల్ల వారు ప్రతి విషయాన్నీ చాలా సూక్ష్మం గా అర్థం చేసుకోగలరు.

భావన:  సర్.. కోవిడ్ లో నా మొత్తం అనుభవం 2 నెలలు సర్.  మేము 14 రోజుల డ్యూటీ చేస్తాం. 14 రోజుల తరువాత మాకు విశ్రాంతి లభిస్తుంది.  2 నెలల తరువాత మా కోవిడ్ విధులు రిపీట్ అవుతాయి సర్.  నేను మొదటి సారి కోవిడ్ డ్యూటీ చేసినప్పుడు ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు చెప్పాను. ఇది మే నెల లో జరిగిన విషయం. నేను ఈ విషయాన్ని పంచుకున్నానో లేదో  ఒక్కసారి గా వారంతా భయపడ్డారు.  నేనంటే గాభరా కలిగింది.  అమ్మా, సరిగ్గా పని చేయి తల్లీ అని నాతో అన్నారు.  అది ఒక భావోద్వేగ పరిస్థితి సర్.  కోవిడ్ డ్యూటీ చేసే సందర్భం లో నా కుమార్తె నన్ను అడిగింది “అమ్మా! కోవిడ్ డ్యూటీ కి వెళుతున్నావా” అని.  అది నాకు చాలా భావోద్వేగ క్షణం.  కానీ నేను కోవిడ్ రోగి వద్దకు వెళ్ళినప్పుడు నేను ఇంటి బాధ్యతలను విడచిపెట్టాను.  నేను కోవిడ్ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మరింత భయపడ్డాడు.  రోగులందరూ కోవిడ్ అంటే చాలా భయపడ్డారు సర్.  వారికి ఏం జరుగుతుందో, తరువాత మనం ఏం చేస్తామో వారికి అర్థం కాలేదు.  వారి భయాన్ని అధిగమించడానికి వారికి చాలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చాం సర్.  ఈ కోవిడ్ డ్యూటీ చేయమని అడిగినప్పుడు ముందుగా పిపిఇ కిట్ వేసుకొమ్మని చెప్పారు.  ఇది చాలా కష్టం సార్.  పిపిఇ కిట్ వేసుకుని డ్యూటీ చేయడం చాలా కష్టం.  ఇది మాకు చాలా కఠినమైన పని.  నేను 2 నెలల పాటు పద్నాలుగు, పద్నాలుగేసి రోజులు డ్యూటీ వార్డు లో, ఐసియు లో, ఐసలేశన్‌ లో ఉన్నాను సర్.

మోదీ గారు:  అంటే, మీరు మొత్తం కలుపుకొంటే ఒక సంవత్సరం నుంచి ఈ పని ని చేస్తున్నారన్న మాట.

 

భావన:  అవును సర్. అక్కడికి వెళ్ళే ముందు నా సహోద్యోగులు ఎవరో నాకు తెలియదు. మేము ఒక జట్టు సభ్యుల మాదిరిగా వ్యవహరించాం సర్.  వారికి ఉన్న సమస్యల ను గురించి వారికి వివరించాం.  వారి  గురించి తెలుసుకొని వారి అపవాదు ను దూరం చేశాం సర్.. కోవిడ్ అంటేనే భయపడే చాలా మంది ఉన్నారు.  మేం వారి నుండి క్లినికల్ హిస్టరీ ని తీసుకునేటప్పుడు ఆ లక్షణాలన్నీ వాటిలో వస్తాయి.  కానీ భయం కారణం గా వారు ఆ పరీక్షల ను చేయించుకోవడానికి సిద్ధంగా లేరు.  మేము వారికి వివరించే వాళ్ళం సర్.  తీవ్రత పెరిగినప్పుడు అప్పటికే వారి ఊపిరితిత్తుల లోకి ఇన్ఫెక్షన్ వచ్చేది.  అప్పుడు వారికి ఐసియు అవసరం ఏర్పడేది.  అప్పుడు అతను వచ్చే వాడు. అతని కుటుంబ సభ్యులందరితో కలసి వస్తాడు. మేము అలాంటి 1-2 కేసుల ను చూశాం సర్.  మేము ప్రతి వయస్సు వారి తో కలసి పనిచేశాం సర్.  వారిలో చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, వృద్ధులు ఉన్నారు.  అన్ని రకాల రోగులు ఉన్నారు.  మేము వారందరితో మాట్లాడినప్పుడు, భయం వల్ల రాలేదు  అని చెప్పే వారు.  అందరి నుంచి ఇదే సమాధానం వచ్చింది సర్.  అప్పుడు మేము వారికి సర్దిచెప్పాము, ఏమని అంటే, భయపడటానికి ఏమీ లేదు, మీరు మాకు సహకరించండి, మేము మీకు తోడు గా ఉంటాం. మీరు ఏవయితే ప్రోటోకాల్స్ ఉన్నాయో వాటిని అనుసరించండి, అంతే మేము వాళ్లతో ఈ మాత్రం చెప్పగలిగాము సర్.

మోదీ గారు:  భావన గారు, మీతో మాట్లాడి నాకు చాలా బాగా అనిపించింది.  మీరు ఎంతో మంచి సమాచారాన్ని ఇచ్చారు.  మీరు మీ స్వీయ అనుభవం నుంచి ఇచ్చిన సమాచారం.  మరి ఇది తప్పక దేశవాసులకు ఓ సానుకూల సందేశాన్ని ఇవ్వగలుగుతుంది.  మీకు చాలా చాలా ధన్యవాదాలు భావన గారూ.

భావన గారు:  థాంక్యూ సో మచ్ సర్.. థాంక్యూ సో మచ్... జయ్ హింద్ సర్.

మోదీ గారు: జయ్ హింద్.

భావన గారి లాంటి నర్సింగ్ స్టాఫ్ లక్షల కొద్దీ సోదరీమణులు, సోదరులు వారి విధులను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు.  ఇది మనందరికీ పెద్ద ప్రేరణగా ఉంది.  మీరు ఆరోగ్యం పైన కూడా చాలా శ్రద్ధ తీసుకోండి.  మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్త గా చూసుకోండి.

మిత్రులారా, బెంగళూరు నుంచి ఈ సమయం లో మనతో సిస్టర్ సురేఖ గారు కూడా జతయ్యారు. సురేఖ గారు కె.సి. జనరల్ హాస్పిటల్‌ లో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. రండి! ఆమె అనుభవాలను కూడా తెలుసుకుందాం.

మోదీ గారు: నమస్తే సురేఖ గారూ.

సురేఖ గారు:  మన దేశ ప్రధాన మంత్రి గారితో మాట్లాడడం అంటే అది నాకు నిజం గా గర్వంగాను, గౌరవంగాను ఉంది సర్.

మోదీ గారు: సురేఖ గారు.. మీతో పాటు తోటి నర్సులు, హాస్పిటల్ సిబ్బంది అంతా శ్రేష్ఠమైన పని ని చేస్తున్నారు.  మీ అందరికీ భారతదేశం ధన్యవాదాలు పలుకుతోంది.  కోవిడ్-19 కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధం లో మీరు పౌరులకు ఇచ్చే సందేశం ఏమిటి?

సురేఖ:  అవును సర్.  బాధ్యతాయుతమైన పౌరురాలు గా కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను.  దయచేసి మీ పొరుగువారితో వినయంగా ఉండండి.  ముందస్తు పరీక్ష లు, సరైన ట్రాకింగ్ మరణాల రేటు ను తగ్గించడానికి మనకు సహాయపడతాయి.  అంతేకాకుండా ఏవైనా లక్షణాలు కనిపిస్తే మీ అంతట మీరు గా ఐసలేశన్ లో ఉండండి.  సమీపం లోని వైద్యులను సంప్రదించి, వీలైనంత త్వరగా చికిత్స ను పొందండి.  మరి, సమాజం ఈ వ్యాధి ని గురించి తెలుసుకోవాలి.  సానుకూలంగా ఉండాలి.  భయాందోళనలకు గురి కావద్దు, తెగేవరకు కొనితెచ్చుకోకండి. అది రోగి స్థితి ని దిగజార్చుతుంది.  మనం మన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.  టీకా మందు కూడా వచ్చినందుకు గర్వంగా ఉంది.  ఇప్పటికే నేను టీకా తీసుకున్నాను.  నా స్వీయ అనుభవం తో భారత పౌరులకు నేను చెప్పాలనుకుంటున్నాను- ఏ వ్యాక్సీన్ కూడా తక్షణం 100 శాతం రక్షణ ను అందించదు. వ్యాధి నిరోధక శక్తి ని పెంపొందించాలి అంటే అందుకు సమయం పడుతుంది. టీకా తీసుకోవడానికి భయపడకండి.  దయచేసి టీకా ను వేయించుకోండి. దుష్ప్రభావాలు చాలా తక్కువ గా ఉన్నాయి.  ఇంట్లో ఉండండి. ఆరోగ్యం గా ఉండండి.  అనారోగ్యం గా ఉన్న వ్యక్తులకు దూరం గా ఉండండి.  అనవసరం గా ముక్కు ను, కళ్ళ ను, నోటి ని తాకకుండా ఉండండి.  దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి.  మాస్క్ ను సరిగ్గా తొడుక్కోండి.  మీ చేతులను క్రమం తప్పకుండా కడుక్కుంటూ ఉండండి.  మీరు ఇంట్లో పాటించే చిట్కాల ను పాటించండి. దయచేసి ఆయుర్వేద కషాయాలను తాగండి.  ప్రతి రోజూ ఆవిరి పీల్చడం, పుక్కిలించడం చేయండి.  శ్వాస పీల్చే వ్యాయామాన్ని కూడాను మీరు చేయవచ్చు.  ఇంకొక విషయం- ఫ్రంట్ లైన్ వర్కర్ లు, వృత్తినిపుణుల పట్ల సానుభూతి తో ఉండండి.  మాకు మీ సహకారం అవసరం.  మనందరం కలసి పోరాడుదాం.  కరోనా మహమ్మారి నుంచి తప్పక బయటపడతాం.  ప్రజలకు నా సందేశం ఇదే సర్.

మోదీ గారు:  ధన్యవాదాలు సురేఖ గారూ.

సురేఖ:  ధన్యవాదాలు సర్.

మోదీ గారు:  సురేఖ గారూ.. నిజానికి, మీరు చాలా కష్టమైన కాలం లో ఉద్యమాన్ని సంబాళిస్తున్నారు.  మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబానికి కూడా నా తరఫు న అనేకానేక శుభాకాంక్షలు.  భావన గారు, సురేఖ గారు వారి అనుభవాల నుంచి చెప్పినట్లు నేను దేశ ప్రజలను కూడా కోరుతున్నాను.  కరోనా తో పోరాడడానికి పాజిటివ్ స్పిరిట్ చాలా ముఖ్యం. దేశవాసులు ఈ వైఖరి తో ఉండాలి.

మిత్రులారా, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తో పాటు ల్యాబ్-టెక్నీషియన్ లు , ఏమ్ బ్యులన్స్ డ్రైవర్లు వంటి ఫ్రంట్‌ లైన్ వర్కర్ లు కూడా దేవుని లాగే పనిచేస్తున్నారు.  ఏమ్ బ్యులన్స్ ఏ రోగి వద్దకు అయినా చేరుకున్నప్పుడు వారు రోగి ని  డ్రైవర్ ను దేవదూత లా భావిస్తారు.  ఈ సేవల ను గురించి, వారి అనుభవాన్ని గురించి దేశం తెలుసుకోవాలి.  ప్రస్తుతం మనతో పాటు అలాంటి ఒక మంచి వ్యక్తి ఉన్నారు.  ఆయనే శ్రీమాన్ ప్రేమ్ వర్మ గారు.  ఆయన ఒక ఏమ్ బ్యులన్స్ డ్రైవర్. ఆయన పేరు సూచించినట్లు ఆయన చాలా మంచివారు.  ప్రేమ్ వర్మ గారు తన పని ని, కర్తవ్యాన్ని పూర్తి ప్రేమ తో, అంకితభావం తో చేస్తారు. రండి ఆయన తో మాట్లాడుదాం..

మోదీ గారు:  నమస్తే ప్రేమ్ గారూ.

ప్రేమ్ గారు:  నమస్తే సర్ జీ.

మోదీ గారు:  సోదరా, ప్రేమ్.

ప్రేమ్ గారు:  అవునండి సర్.

మోదీ గారు:  మీరు పని ని గురించి చెప్పండి.

ప్రేమ్ గారు:  అలాగేనండి.

మోదీ గారు: కాస్త వివరంగా తెలియజేయండి.  మీ అనుభవాలు ఏవయితే ఉన్నాయో, వాటిని గురించి కూడా చెప్పండి.

ప్రేమ్ గారు:  నేను క్యాట్స్ ఏమ్ బ్యులన్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను.  కంట్రోల్ నుంచి మాకు టాబ్‌ లో కాల్ వస్తుంది.  102 నుండి కాల్ వచ్చిన వెంటనే మేం రోగి దగ్గరకు వెళ్తాం.  రెండు సంవత్సరాలు గా మేము ఈ పని ని చేస్తున్నాం.  మా కిట్ వేసుకుని, చేతి తొడుగులను, మాస్కులను ధరించి, వారు ఎక్కడ డ్రాప్ చేయమని అడిగినా, ఏ ఆసుపత్రిలో అయినా, మేము వీలైనంత త్వరగా వారిని అక్కడికి చేరుస్తాం.

 

మోదీ గారు:  మీకు ఇప్పటికే రెండు వ్యాక్సీన్ డోసులు అంది ఉండాలి కదా.

ప్రేమ్ గారు:  ఖచ్చితంగా సర్.

మోదీ గారు:  ఇప్పుడు ఇతరులకు టీకా మందు ఇప్పించండి.  ఈ విషయం లో మీ సందేశం ఏమిటంటారు?

ప్రేమ్ గారు:  సర్.  తప్పక చెప్తాను.  ప్రతి ఒక్కరికి ఈ టీకా డోసు ను ఇప్పించాలి మరి ఇది కుటుంబానికి కూడాను మంచిదే.  మా అమ్మ గారు నాతో అంటారు, ఈ ఉద్యోగం మానివేయమని. నేనన్నాను, అమ్మా, ఒకవేళ నేను కూడా నౌకరీ ని వదలివేసి కూర్చుండిపోతే, అప్పుడు మిగతా రోగులందరినీ ఎవరు తీసుకువెళ్తారు అని.  ఎందుకంటే అందరూ ఈ కరోనా కాలం లో పరారవుతున్నారు.  అంతా ఉద్యోగాలు వదలివేసి పోతున్నారు.  మా అమ్మ కూడా నాతో అంటోంది, ఏమని అంటే అబ్బాయీ, కొలువు ను వదలిపెట్టేసెయ్ అని. నేను అన్నాను ఉహు, అమ్మా నేను ఉద్యోగాన్ని వదలిపెట్టను అని.

మోదీ గారు:  ప్రేమ్ గారు, అమ్మ కు దు:ఖం కలిగేటట్టు నడుచుకోవద్దు.  అమ్మ కు అర్థమయ్యేటట్టు చెప్పండి.

ప్రేమ్ గారు:  సరేనండి.

మోదీ గారు:  కానీ మీరు మీ అమ్మ గురించి చెప్పిన విషయం.

ప్రేమ్ గారు:  సర్.

మోదీ గారు:  అయితే మీరు మీ అమ్మ గారి విషయం చెప్పారు చూడండి.

ప్రేమ్ గారు:  అవునండి.

మోదీ గారు:  ఆ సంగతి మనస్సు కు ఎంతో హత్తుకుంటున్నది.

ప్రేమ్ గారు:  మరేనండి.

మోదీ గారు:  నా ప్రణామాలు చెప్పండి.

ప్రేమ్ గారు:  తప్పకుండానండి.

మోదీ గారు:  ఆఁ.

ప్రేమ్ గారు:  అలాగేనండి.


మోదీ గారు:  మరి ప్రేమ్ గారూ నేను మీ ద్వారా..


ప్రేమ్ గారు:  అవునండి.

మోదీ గారు:  ఈ ఏమ్ బ్యులన్స్ లను నడుపుతున్న మన డ్రైవర్ లు కూడా.

ప్రేమ్ గారు:  అవునండి.

మోదీ గారు:  ఎంత పెద్ద రిస్క్ తీసుకొని, ఈ పని ని చేస్తున్నారో కదా.

ప్రేమ్ గారు: అవును సర్

మోదీ గారు:  వీరిలో ప్రతి ఒక్కరి అమ్మ గారు ఏం ఆలోచిస్తుంటారు?

ప్రేమ్ గారు:  నిజమే సర్.

మోదీ గారు:  ఈ విషయం శ్రోత ల వరకు చేరితేనో.

ప్రేమ్ గారు:  మరేనండి.

మోదీ గారు:  నేను తప్పక అనుకుంటాను ఏమని అంటే ఈ విషయం శ్రోత ల
 మనస్సు కు కూడా హత్తుకుంటుంది అని.

ప్రేమ్ గారు:  అవును సర్.

మోదీ గారు:  ప్రేమ్ గారు చాలా చాలా ధన్యవాదాలు.  మీరు ఒక విధం గా ప్రేమ తాలూకు గంగ ను ప్రవహింప జేస్తున్నారు.

ప్రేమ్ గారు:  ధన్యవాదాలు సర్ గారు.

మోదీ గారు:  ధన్యవాదాలు సోదరా.

ప్రేమ్ గారు:  ధన్యవాదాలు.

    మిత్రులారా, ప్రేమ్ వర్మ గారి లాంటి వేల కొద్దీ మంది ఈ రోజు న వారి జీవితాలను పణం గా పెట్టి మరీ ప్రజలకు సేవ చేస్తున్నారు.  కరోనా కు వ్యతిరేకం గా ఈ పోరాటం లో ఎన్నో జీవితాల రక్షణ లో ఏమ్ బ్యులన్స్ డ్రైవర్ లు కూడా చాలా సహకరించారు. ప్రేమ్‌గారూ.. మీకు, దేశవ్యాప్తంగా మీ సహోద్యోగులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీరు సమయాన్ని చేరుకుంటూ ఉండండి. జీవితాలను కాపాడుతూ ఉండండి.

         ప్రియమైన నా దేశవాసులారా, చాలా మంది కరోనా బారి న పడుతున్నారన్నది నిజం.  అయితే, కరోనా నుంచి నయమవుతున్న వారి సంఖ్య కూడా అంతే ఎక్కువ గా ఉంది.  గురుగ్రామ్‌ కు చెందిన ప్రీతి చతుర్వేది గారు కూడా ఇటీవల కరోనా ను ఓడించారు.  ప్రీతి గారు ఈరోజు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో మన తో మాట్లాడడానికి జత కలిశారు.  వారి అనుభవాలు మనందరికీ చాలా ఉపయోగపడుతాయి.

మోదీ గారు:  ప్రీతి గారు, నమస్కారం.

ప్రీతి గారు:  నమస్తే సర్.  ఎలా ఉన్నారు మీరు?

మోదీ గారు:  నేను బాగున్నానండి.  అన్నిటికంటే ముందు గా నేను మీ కోవిడ్ -19 తో

ప్రీతి గారు:  మరేనండి.

మోదీ గారు: పోరాడడం లో సఫలం అయినందుకు గాను

ప్రీతి గారు: సర్.

మోదీ గారు:  కొనియాడాలనుకొంటున్నాను.

ప్రీతి గారు:  చాలా ధన్యవాదాలు సర్.

మోదీ గారు:  మీరు మరింత త్వరగా పూర్తి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను.

ప్రీతి గారు:  థేంక్ యు సో మచ్ సర్.

మోదీ గారు:  నేను కోరుకొనేది ఏమిటి అంటే, మీ ఆరోగ్యం మరింత త్వరగా మెరుగుపడాలి అని.

ప్రీతి గారు:  ధన్యవాదాలు సర్.

మోదీ గారు:  ప్రీతి గారు


ప్రీతి గారు:  సర్.

మోదీ గారు:  ఈ  వేవ్ లో కేవలం మీకు ఒక్కరికే కరోనా వచ్చిందా, లేక కుటుంబం లోని ఇతర సభ్యులు కూడా ఇందులో చిక్కుకున్నారా?

ప్రీతి గారు:  లేదు.. లేదు సర్. నేను ఒక్కదానినే దీని బారిన పడ్డాను.

మోదీ గారు:  సరే లెండి. భగవంతుడి కృప. సరే, నేను అనుకోవడం.

ప్రీతి గారు:  సర్ చెప్పండి.

మోదీ గారు:  ఏమిటంటే, మీరు ఈ వేదనాభరిత స్థితి తాలూకు కొన్ని అనుభవాలను ఒకవేళ వెల్లడించారా అంటే అప్పుడు వినే శ్రోతలకు కూడాను ఇలాంటి వేళ లో ఎలా వారిని వారు సంబాళించుకోవాలో అనే విషయంలో మార్గదర్శకత్వం లభిస్తుంది.

ప్రీతి గారు:  సర్.. తప్పకుండా.  ప్రారంభిక దశ లో నాకు చాలా బద్ధకం వచ్చింది.  అంటే చాలా నీరసం గా ఉన్నాను.  మరి ఆ తరువాత నా గొంతు లో కొంచెం నొప్పి గా అనిపించింది.  కాబట్టి ఆ తరువాత ఈ లక్షణాలున్నాయి కాబట్టి పరీక్ష చేయించుకున్నా.  రెండో రోజు రిపోర్ట్ వచ్చిన వెంటనే నాకు ఎప్పుడయితే పాజిటివ్ అని తెలిసిందో, నన్ను నేను క్వారంటైన్ చేసేసుకున్నాను.  ఒక గది లో ఏకాంతం గా ఉంటూ, వైద్యులను సంప్రదించాను.  వారు ఇచ్చిన మందులను వేసుకోవడం మొదలుపెట్టేశాను.

మోదీ గారు:  అంటే మీ కుటుంబ సభ్యులు బయటపడ్డారన్న మాట మీరు సత్వర చర్య తీసుకున్నందువల్ల.

ప్రీతి గారు:  సర్.  మా కుటుంబం లో మిగతా వారికి కూడా తరువాత పరీక్ష చేయించడం జరిగింది.  మిగతా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. నాకొక్కరికే పాజిటివ్‌ వచ్చింది.  అంతకు ముందు నా అంతట నేను ఒక గది లోపల ఐసలేశన్ లో ఉండిపోయాను.  నాకు అవసరమైన అన్ని వస్తువులను అట్టిపెట్టుకొని తరువాత నా అంతట నేను గది లో ఉండిపోయాను.  మరి నేను డాక్టర్ సలహా తో మందులు తీసుకోవడం ప్రారంభించాను. సర్.. మందులతో పాటు నేను యోగ, ఆయుర్వేదిక ఔషధాలు అవీ తీసుకోవడం మొదలుపెట్టాను.  నేను కషాయాన్ని సేవించడం కూడా చేశాను.  వ్యాధి నిరోధక శక్తి ని పెంచడానికి పగటి పూట భోజనం లో మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు, వాటిని తీసుకున్నాను.  నేను ద్రవాలను చాలా ఎక్కువ గా తాగాను.  నీటి ఆవిరి ని తీసుకున్నాను.  వేడి నీటి ని తీసుకుని పుక్కిలించాను.  నేను రోజంతా ఇవే చేస్తూ వచ్చాను.  సర్.. అన్నింటి కంటే నేను చెప్పదలుస్తున్న అతి ప్రధానమైన విషయం ఏమిటి అంటే అస్సలు గాభరాపడలేదు.  మానసికం గా చాలా దృఢం గా ఉండాలి.  దీని కోసం నేను చాలాసేపు యోగా ను, శ్వాసను పీల్చే కసరత్తు ను చేసేదాన్ని. అలా చేయడం వల్ల బాగా అనిపించేది.

మోదీ గారు:  అవును.  సరే, ప్రీతి గారు, ఇక మీ ప్రక్రియ ముగిసిపోయిది; మీరు గండం నుంచి బయటపడిపోయారు.

ప్రీతి గారు:  అవునండి.


మోదీ గారు:  ఇప్పుడు మీ టెస్ట్ లో కూడాను నెగిటివ్‌ అని వచ్చింది.

ప్రీతి గారు:  అవును సర్.

మోదీ గారు:  మరి మీరు మీ ఆరోగ్యం గురించి, దీని సంరక్షణ గురించి ఇప్పుడు ఏమి చేస్తున్నారు?

ప్రీతి గారు:  సర్.. ఒకటి, నేను యోగ ను ఆపివేయనేలేదు.

మోదీ గారు: అవునా..

ప్రీతి గారు:  అవును సర్.  నేను ఇప్పటికీ కషాయాన్ని తీసుకుంటున్నాను.  నా వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవడానికి నేను ఇప్పుడు మంచి ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకుంటున్నాను.

మోదీ గారు:  ఓ, అలాగా.

ప్రీతి గారు:  నేను చాలా నిర్లక్ష్యం గా ఉండేదానిని.  ఆ విషయం లో నేను చాలా శ్రద్ధ తీసుకొంటున్నాను.

మోదీ గారు:  ధన్యవాదాలు ప్రీతి గారు.

ప్రీతి గారు:  థేంక్ యు సోమచ్ సర్.

మోదీ గారు:  మీరు అందజేసిన సమాచారం నాకనిపిస్తోంది, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అని.  మీరు ఆరోగ్యం గా ఉండాలి. మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం గా ఉండాలి.  మీకు నా తరఫున చాలా చాలా శుభాకాంక్షలు.

 
ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు మన వైద్య రంగం లోని వారు, ఫ్రంట్‌ లైన్ వర్కర్ లు రాత్రనక పగలనక సేవా కార్యాల లో తలమునకలు అయి ఉన్నారు.  అదే విధం గా, సమాజం లోని ఇతర వ్యక్తులు కూడా ఈ సమయం లో వెనుకబడి లేరు.  దేశం మరో సారి ఒక్కటై కరోనా కు వ్యతిరేకం గా పోరాడుతోంది.  ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను, కొందరు క్వారంటైన్ లో ఉన్న కుటుంబాలకు మందులను చేరవేస్తున్నారు, మరి కొందరేమో కాయగూరలు, పాలు, పండ్లు మొదలైనవి అందిస్తున్నారు.  కొంత మంది రోగుల కు ఉచితం గా ఏమ్ బ్యులన్స్ సేవల ను సమకూర్చుతున్నారు.  దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ సవాలు నిండిన సమయం లోనూ స్వయం సేవ సంస్థ లు ముందుకు వచ్చి ఇతరులకు సహాయం గా అవి ఏమి చేయగలవో ఆ పనులన్నీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.  ఈసారి గ్రామాలలో కూడా కొత్త అవగాహన కనిపిస్తోంది.  కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రజలు తమ గ్రామాన్ని కరోనా నుంచి రక్షించుకొంటున్నారు.  బయటి నుండి వస్తున్న వారికి సరైన ఏర్పాటులను కూడా చేస్తున్నారు.  తమ ప్రాంతం లో కరోనా కేసులు పెరగకుండా ఉండడానికి నగరాలలో కూడా స్థానిక ప్రజలతో కలసి పనిచేయడానికి చాలా మంది యువకులు ముందుకు వచ్చారు.  అంటే ఒకవైపు  దేశం రాత్రింబగళ్లు ఆసుపత్రులు, వెంటిలేటర్ లు, మందుల కోసం పని చేస్తుంటే మరో వైపు దేశవాసులు కూడా మనస్పూర్తి గా కరోనా ను ఎదుర్కొంటున్నారు.  ఈ భావన మనకు ఎంతటి బలాన్ని, ఎంతటి విశ్వాసాన్ని ఇస్తుందో కదా.  ఈ ప్రయాసలు ఏవయితే జరుగుతున్నాయో, ఇవన్నీ సమాజానికి గొప్ప సేవ ను చేయడమే అవుతాయి.  ఇవి సమాజం తాలూకు శక్తి ని పెంచుతాయి.

ప్రియమైన నా దేశవాసులారా,  ఈ రోజు మనం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) మొత్తం చర్చ ను కరోనా మహమ్మారి పై చేశాం.  ఎందుకంటే ఈ రోజు ఈ వ్యాధి ని ఓడించడమే మన పెద్ద ప్రాధాన్యం.  ఈ రోజు భగవాన్ మహావీర్ జయంతి.  ఈ సందర్భం లో దేశవాసులందరినీ అభినందిస్తున్నాను.  మహావీరుని సందేశం మనకు స్వీయ నిగ్రహం విషయం లో స్ఫూర్తిని ఇస్తుంది.  ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కూడా జరుగుతోంది.  ఇకపై బుద్ధ పూర్ణిమ రానుంది.  గురు తేగ్ బహాదుర్ జీ 400 వ ప్రకాశ్ పర్వ్ కూడా ఉంది. ఒక ముఖ్యమైన పోచిశే బోయిశాఖ్ -టాగోర్ జయంతి అది. ఇవి అన్నీ మన కర్తవ్యాలను నిర్వర్తించడానికి మనకు ప్రేరణ ను అందిస్తాయి. ఒక పౌరుని గా మనం మన జీవనం లో ఎంతటి కుశలత తో మన విధులను నిర్వర్తిస్తామో. సంక్షోభం నుంచి బయటపడి భవిష్యత్తు మార్గం లో అంతే వేగం గా ముందంజ వేయగలం.  ఈ ఆకాంక్ష తో నేను మీ అందరికీ మరొక్క మారు చేసే విజ్ఞ‌ప్తి ఏమిటి అంటే అది- మనందరమూ వ్యాక్సీన్ ను వేయించుకోవాలి, దాంతో పాటు పూర్తి జాగ్రత తో ఉండాలి- అనేదే.  ‘దవాయీ భీ కడాయీ భీ’ (మందుల తో పాటు కఠిన నియమాల పాలన కూడాను).  ఈ మంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు.  మనం త్వరలోనే కలిసికట్టు గా ఈ ఆపద నుంచి బయటపడతాం.  ఈ విశ్వాసం తో, మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.




 

***
 



(Release ID: 1713929) Visitor Counter : 695