రైల్వే మంత్రిత్వ శాఖ

డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లను కొనసాగిస్తున్న రైల్వేలు


ప్రస్తుతం, రోజుకు సరాసరి 1402 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వేలు

5381 సబ్‌ అర్బన్, 830 పాసింజర్‌ రైళ్లను కూడా నడుపుతున్న రైల్వేలు

2020-21లో రికార్డు స్థాయిలో 1232.64 మి.ట. సరకు రవాణా

Posted On: 09 APR 2021 3:41PM by PIB Hyderabad

ప్రయాణీకులు, సరకు రవాణాదారుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా రైళ్ల సేవలను రైల్వేలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం, రోజుకు సరాసరి 1402 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. 5381 సబ్‌ అర్బన్, 830 పాసింజర్‌ రైళ్లను కూడా కొనసాగిస్తున్నాయి. ఇవికాక, 28 ప్రత్యేక సర్వీసులను కూడా పరుగులు పెట్టిస్తున్నాయి.
    
    ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి, కేంద్ర రైల్వే జోన్‌లో 58 రైళ్లు (29 జతలు), పశ్చిమ రైల్వే జోన్‌లో 60 రైళ్లను (30 జతలు) ఈ ఏప్రిల్-మే నెలల్లో అదనంగా నడుపుతున్నాయి. అత్యధిక డిమాండ్‌ ఉన్న గమ్యస్థానాలైన గోరఖ్‌పుర్‌, పట్నా, దర్బంగ, వారణాసి, గువాహటి, బరౌణి, ప్రయాగ్‌రాజ్‌, బొరాకో, రాంచీ, లఖ్‌నవూ వంటి నగరాలకు ఈ రైళ్లు నడుస్తున్నాయి.

    2020-21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1232.64 మి.ట. సరకును రైల్వేలు రవాణా చేశాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా ద్వారా దాదాపు రూ.1,17,386 కోట్లను ఆర్జించాయి. 2019-20లో ఈ ఆదాయం రూ.1,13,897 కోట్లుగా ఉంది. అంతేగాక, గతేడాది సరకు రవాణా రైళ్ల వేగాన్ని గంటకు 24 కి.మీ. నుంచి 44 కి.మీ.కు రైల్వేలు పెంచాయి. అంటే దాదాపు రెట్టింపు చేశాయి.

    గతేడాది ఆగస్టు నుంచి 450 కిసాన్‌ రైళ్లు 1.45 లక్షల టన్నులకు పైగా వ్యవసాయ ఉత్పత్తులను కూడా రవాణా చేశాయి.

***



(Release ID: 1710753) Visitor Counter : 240