ప్రధాన మంత్రి కార్యాలయం

భార‌తదేశం ప్ర‌ధాన‌ మంత్రి బాంగ్లాదేశ్ సందర్శన సంద‌ర్భం లో జారీ అయిన సంయుక్త  ప్ర‌క‌ట‌న‌

Posted On: 27 MAR 2021 9:45PM by PIB Hyderabad

1.  బాంగ్లాదేశ్ ప్రజా గణతంత్రం ప్ర‌ధాని శేఖ్  హ‌సీనా గారు ఆహ్వానించిన మీదట బాంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వ‌ర్ణోత్స‌వం; బంగ‌బంధు, జాతిపిత‌ శేఖ్ ముజీబుర్ రహమాన్ శ‌త‌ జ‌యంత్యుత్స‌వంలోను, భార‌తదేశానికి, బాంగ్లాదేశ్ కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు అయిన వేడుక‌ లోను స్వ‌యంగా పాల్గొనేందుకు  భార‌తదేశ గణతంత్రం ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 మార్చి 26వ, 27వ తేదీల లో బాంగ్లాదేశ్ లో ఆధికారికం గా ప‌ర్య‌టించారు.  ప్రాంతీయం గా శ‌క్తివంత‌మైన‌, ప‌రిణ‌తి చెందిన ద్వైపాక్షిక సంబంధాల‌కు ఒక న‌మూనా గా నిలచే భార‌తదేశం, బాంగ్లాదేశ్ ల సంబంధాల అర్ధ శ‌తాబ్ది భాగ‌స్వామ్యానికి ఈ యాత్ర ఒక సంకేతం గా ఉంది.

2.  ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భం లో భార‌త‌దేశం ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 మార్చి 27వ తేదీ న బాంగ్లాదేశ్ గౌర‌వ అధ్య‌క్షుడు శ్రీ మొహ‌మ్మ‌ద్ అబ్దుల్ హామిద్ తో సమావేశమయ్యారు.  2021 మార్చి 26వ తేదీ న నేశన‌ల్ పరేడ్ గ్రౌండ్ లో జ‌రిగిన జాతీయ దిన ఉత్సవాలు, బాంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వ‌ర్ణోత్స‌వం వేడుక‌, ముజిబ్ బోర్షో వేడుక‌ల లో ముఖ్య అతిథి గా భార‌త‌దేశం ప్ర‌ధాన‌ మంత్రి పాల్గొన్నారు.  2021 మార్చి 26వ తేదీ న బాంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి డాక్ట‌ర్ ఎ.కె.అబ్దుల్ మోమెన్ భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి తో సమావేశమయ్యారు.

3.  బాంగ్లాదేశ్ స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల ను స్మరించుకొనేందుకు, వారి తోడ్పాటు ను స్మరించుకొనేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సావర్ లో గౌర‌వ‌పూర్వ‌కంగా  స‌వ‌ర్ లోని అమ‌రవీరుల జాతీయ స్మార‌కం వ‌ద్ద పూలహారాన్ని సమర్పించారు.  గోపాల్ గంజ్ లోని తుంగీపారా లో గల బంగ‌బంధు సమాధి స్థలం లో ఆయన బంగ‌బంధు శేఖ్ ముజీబుర్ ర‌హమాన్ స్మృతి కి తన గౌరవాన్ని, ఘన నివాళి ని అర్పించారు.

భార‌త‌దేశం-బాంగ్లాదేశ్ భాగ‌స్వామ్యం


4.  ఉభ‌య దేశాల ప్ర‌ధాన‌మంత్రులు 2021 మార్చి 27వ తేదీ న ముఖాముఖి చ‌ర్చ‌ లు జ‌రిపారు.  ఆ త‌రువాత ప్ర‌తినిధివ‌ర్గం స్థాయి చ‌ర్చ‌ లు జ‌రిగాయి.  రెండు సంద‌ర్భాలలోనూ చ‌ర్చ‌ లు సుహృద్భావ వాతావ‌ర‌ణం లో జ‌రిగాయి.  ఉభ‌య దేశాల మ‌ధ్య లోతు గా పాతుకున్న చారిత్ర‌క‌, స‌హోద‌ర భావం తో కూడిన అద్భుత‌ ద్వైపాక్షిక సంబంధాల ప‌ట్ల ఉభ‌య నేత లు సంతృప్తి ని ప్ర‌క‌టించారు.  స‌మాన‌త్వాన్ని, విశ్వాసాన్ని, అవ‌గాహ‌న‌ ను ప్ర‌తిబింబిస్తున్న ఆ ప‌టిష్ఠ బంధం వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాని కి కూడా పునాదిగా నిలచింద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

5.  కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యం లో జ‌రిగిన తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌ గా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త‌దేశం-బాంగ్లాదేశ్ ఉమ్మ‌డి వేడుక‌లలో పాల్గొనేందుకు బాంగ్లాదేశ్ కు విచ్చేసినందుకు ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు శ్రీ మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.  బాంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం ముమ్మరం గా సాగిన క్లిష్ట కాలం లో భార‌తదేశం ప్ర‌భుత్వం, భార‌తదేశం ప్ర‌జ‌లు అందించిన హృద‌య‌పూర్వ‌క‌మైన మ‌ద్ద‌తు ప‌ట్ల ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు హృద‌యాంత‌రాళం లో నుంచి ప్ర‌శంసిస్తూ కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తం చేశారు.  అత్యున్న‌త‌మైన ఆ విముక్తి పోరాటం అందించిన చారిత్ర‌క వార‌స‌త్వాన్ని, గుర్తుల‌ ను ప‌దిలంగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రులు ఉభ‌యులూ నొక్కి వ‌క్కాణించారు. 1971వ సంవత్సరం లో జ‌రిగిన బాంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం స‌మ‌యం లో సాహ‌సిక భార‌తదేశ సాయుధ ద‌ళాలు అందించిన సేవ‌ల‌కు, వారు ప్ర‌ద‌ర్శించిన‌ అనిత‌ర త్యాగాని కి గుర్తుగా అశూగంజ్ లో ఒక స్మార‌క మందిరాన్ని నిర్మించాల‌ని బాంగ్లాదేశ్ నిర్ణ‌యించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

6.  ముజీబ్ బోర్షో, బాంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వ‌ర్ణోత్స‌వం, బాంగ్లాదేశ్-భార‌త‌దేశం ద్వైపాక్షిక సంబంధాల 50వ వార్షికోత్స‌వ వేడుక‌ ల సంద‌ర్భం లో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బాంగ్లాదేశ్ ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు. మాన‌వాభివృద్ధి, పేద‌రిక నిర్మూల‌న‌, ఉగ్ర‌వాద వ్య‌తిరేక పోరాటం అంశాల లో బాంగ్లాదేశ్ అద్భుత విజ‌యాలను సాధించ‌డం, ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారి ప్ర‌గ‌తిశీల నాయ‌క‌త్వం లో బాంగ్లాదేశ్ సాధించిన చిర‌స్మ‌ర‌ణీయ‌మైన ఆర్థిక పురోగ‌తి ని ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌శంసించారు.  విభిన్న రంగాల లో భార‌త‌దేశం ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని కొనసాగిస్తున్నందుకు గాను ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు అభినందన లు తెలిపారు.

7.  ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు 2019 అక్టోబ‌రు లో దిల్లీ ని సంద‌ర్శించిన సంద‌ర్భంలోను, 2020 డిసెంబ‌రు 17వ తేదీ న వ‌ర్చువ‌ల్ మాధ్యమం ద్వారా నిర్వ‌హించిన శిఖ‌ర సమ్మేళనం లోను తీసుకున్న నిర్ణ‌యాల అమ‌లు లో పురోగ‌తి ప‌ట్ల ఉభ‌య నాయ‌కులు సంతృప్తి ని ప్ర‌క‌టించారు.  2020 సెప్టెంబ‌రు లో జాయింట్ క‌న్స‌ల్టేటివ్ క‌మిశన్ ఆరో స‌మావేశాన్ని విజ‌యంతం గా నిర్వ‌హించ‌డాన్ని, 2021 మార్చి 4వ తేదీ న భార‌త విదేశాంగ మంత్రి డాక్ట‌ర్ ఎస్‌.జయ్ శంక‌ర్ ఢాకా సందర్శన ను కూడా ఉభ‌యులు గుర్తు చేసుకున్నారు.

8.  ఉభ‌య‌ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న అత్యున్న‌త స్థాయి ఆధికారిక సందర్శన లు ఇరు దేశాల మ‌ధ్య భిన్న రంగాల లో విస్త‌రించిన స‌హ‌కారం పై మ‌రింత అవ‌గాహ‌న ఏర్ప‌డ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయ‌ని ఉభ‌య ప్ర‌ధాన‌మంత్రులు సంతృప్తి ని వ్యక్తం చేశారు.  ఉభ‌య‌ దేశాల మ‌ధ్య క్ర‌మం త‌ప్ప‌కుండా వ్య‌వ‌స్థాత్మ‌క‌మైన స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌త్యేకించి కోవిడ్ స‌మ‌యం లో స‌మావేశం నిర్వహించ‌డాన్ని ఉభ‌యులు ప్ర‌శంసించారు.

చారిత్ర‌క బంధాల తాలూకు ఉమ్మ‌డి వేడుక‌ లు


9.   బంగ‌బంధు శేఖ్ ముజీబుర్ రహమాన్ ఆధునిక కాలంలో అత్యున్నత నాయ‌కుల్లో ఒక‌ర‌ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌శంసిస్తూ బాంగ్లాదేశ్ ను సార్వ‌భౌమ దేశం గా నిలిపేందుకు ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన సాహ‌సం, ఆయ‌న చేసిన చిర‌స్మ‌ర‌ణీయ సేవ‌ లు క‌ల‌కాలం గుర్తుండిపోతాయ‌న్నారు.  ప్రాంతీయ శాంతి కి, భ‌ద్ర‌త‌ కు, అభివృద్ధి కి బంగ‌బంధు అందించిన సేవ‌ల‌ ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు.  గాంధీ విధానాలు అనుస‌రిస్తూ అహింసా మార్గం లో బాంగ్లాదేశ్ ను రాజ‌కీయ ప‌రివ‌ర్త‌న బాట‌ లో న‌డ‌ప‌డ‌మే కాకుండా  సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ రంగాల‌ కు అందించిన అసాధార‌‌ణ సేవ‌ల‌ కు గుర్తు గా బంగ‌బంధు శేఖ్ ముజీబుర్ రహమాన్ కు 2020 సంవ‌త్స‌రానికి గాంధీ శాంతి బ‌హుమ‌తి ని అందించినందుకు ప్ర‌ధాని శేఖ్ హసీనా గారు భార‌త‌దేశానికి ధన్యవాదాలు తెలిపారు.

10.  ఉభయ దేశాల‌కు చెందిన చిర‌స్మ‌ర‌ణీయ నాయ‌కుల జీవితం, వారందించిన వార‌స‌త్వానికి చిహ్నం గా ఢాకా లో ఏర్పాటు చేసిన బంగ‌బంధు-బాపూ డిజిట‌ల్ ఎగ్జిబిశన్ ను ప్ర‌ధాన‌ మంత్రులు ఇరువురూ సంయుక్తం గా ప్రారంభించారు.  అత్యున్న‌త వ్య‌క్తిత్వం గ‌ల ఆ ఇద్ద‌రు నాయ‌కులు పాటించిన ఆద‌ర్శాలు, అందించిన వార‌స‌త్వం ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌త్యేకించి అణ‌చివేత విధానాల‌కు వ్య‌తిరేకం గా పోరాడుతున్న‌ యువ‌త‌ కు స్ఫూర్తిదాయ‌కంగా ఉంటాయ‌ని ఉభ‌య దేశాల ప్ర‌ధాన‌మంత్రులు ఉద్ఘాటించారు.

11.  భార‌త‌దేశం-బాంగ్లాదేశ్ మైత్రి బంధం 50వ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఉభ‌య దేశాలు స్మార‌క త‌పాలా బిళ్ల‌ల ను విడుద‌ల చేశాయి.  1971వ సంవత్సరం లో బాంగ్లాదేశ్ ను భార‌త్ ఆధికారికం గా గుర్తించిన డిసెంబ‌ర్ 6వ తేదీ ని మైత్రీ దివ‌స్ గా పాటించాల‌ని నిర్ణ‌యించారు.  ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం లో  బంగ‌బంధు చైర్ ఒక‌టి ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు  భార‌త ప్ర‌తినిధివ‌ర్గం ప్ర‌క‌టించింది.  అలాగే బాంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వ‌ర్ణోత్స‌వం, దౌత్య సంబంధాల స్థాపన కు గుర్తు గా ఎంపిక చేసిన 19 దేశాల లో ఉమ్మ‌డిగా స్మార‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని ఉభ‌య వ‌ర్గాలు అంగీకారానికి వ‌చ్చాయి.

12.  భార‌తదేశం లో చలనచిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ శ్యాం బెనెగ‌ల్ ద‌ర్శ‌క‌త్వం లో బంగ‌బంధు శేఖ్ ముజీబుర్ రహమాన్ బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ చురుగ్గా సాగుతుండ‌డం ప‌ట్ల ఉభ‌య వ‌ర్గాలు సంతృప్తి ని ప్ర‌క‌టిస్తూ ఆ చిత్రం నిర్ణ‌యించిన స‌మ‌యానికి  పూర్తి కాగ‌ల‌ద‌ని భావిస్తున్న‌ట్టు పేర్కొన్నాయి.  వీలైనంత త్వ‌ర‌లో విముక్తి పోరాటం డాక్యుమెంట‌రీ చిత్రం నిర్మాణం కూడా చేప‌ట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉన్న‌ద‌న్న విష‌యాన్ని ఉభ‌య వ‌ర్గాలు బ‌లం గా ఉద్ఘాటించాయి.

13.  బాంగ్లాదేశ్ సాయుధ ద‌ళాల‌కు చెందిన 122 మంది స‌భ్యులతో కూడిన త్రివిధ ద‌ళాల సేనాదళం భార‌తదేశం 2020 గణతంత్ర దిన వేడుక‌ల క‌వాతు లో పాల్గొన‌డాన్ని ఉభ‌య వ‌ర్గాలు ప్ర‌శంసించాయి.

14.  ఉభ‌య దేశాల దౌత్య‌ సంబంధాల స్వ‌ర్ణోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని 2022వ సంవత్సరం లో భార‌తదేశాన్ని సంద‌ర్శించవలసిందిగా బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్  హ‌సీనా గారి కి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.

15.  బాంగ్లాదేశ్ ఆహ్వానం మేర‌కు భార‌త నౌకాద‌ళాని కి చెందిన నౌక‌లు సుమేధ‌, కులిశ్ 2021 మార్చి 8-10 తేదీ ల మ‌ధ్య మోంగ్ లా పోర్టు కు రావ‌డాన్ని ఉభ‌య వ‌ర్గాలు ఆహ్వానించాయి.  భార‌త నౌకాద‌ళానికి చెందిన ఒక నౌక మోంగ్ లా పోర్టు కు రావ‌డం అదే మొదటి సారి.  ఉమ్మ‌డి వేడుక‌ల లో భాగం గా బాంగ్లాదేశ్ నౌకాద‌ళానికి చెందిన నౌక ఒక‌టి విశాఖ‌ప‌ట్ట‌ణం పోర్టు ను కూడా సంద‌ర్శించ‌నుంది.

16.  భార‌త‌దేశం లో విద్యాభ్యాసానికి వ‌చ్చే బాంగ్లాదేశ్ విద్యార్థుల కోసం వెయ్యి శుబర్నౌ జ‌యంతి ఉపకార వేతనాలు ఏర్పాటు చేయాల‌న్న భార‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని బాంగ్లాదేశ్ స్వాగ‌తించింది.

17.  బాంగ్లాదేశ్ విముక్తి పోరాటం స‌మ‌యం లో కీల‌కంగా నిలచిన చారిత్ర‌క ప్రాధాన్య‌ానికి గుర్తు గా బాంగ్లాదేశ్‌-‌భార‌తదేశం స‌రిహ‌ద్దు లో ముజీబ్ న‌గ‌ర్‌- నాదియా మ‌ధ్య ఉన్న రోడ్డు కు “శాదినోతా శొరోక్” గా నామ‌క‌ర‌ణం చేయాల‌న్న బాంగ్లాదేశ్ ప్ర‌తిపాద‌న‌ ను ప‌రిశీల‌న‌ లోకి తీసుకున్నందుకు భార‌త ప్ర‌తినిధివ‌ర్గానికి బాంగ్లాదేశ్ ప్ర‌ధాని ధన్యవాదాలు తెలిపారు.  ఉమ్మ‌డి వేడుక‌ల్లో భాగంగా ఆ రోడ్డు ను త్వ‌ర‌గా ప్రారంభించే వేడుక కోసం ఎదురు చూస్తున్న‌ట్టు ఉభ‌యవ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

జ‌ల‌వ‌న‌రుల స‌హ‌కారం


18.   తీస్తా న‌దీ జ‌లాల్లో వాటా ఇవ్వ‌డం పై గ‌తం లో జ‌రిగిన చ‌ర్చ‌ల‌ ను గుర్తు చేయ‌డం తో పాటు మ‌ధ్యంత‌ర ఒప్పందం త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్న బాంగ్లాదేశ్ చిర‌కాల కోరిక ను ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు పున‌రుద్ఘాటించారు.  తీస్తా న‌ది పైనే ఆధార‌ప‌డిన ల‌క్ష‌ల మంది జీవ‌నోపాధి ని ప‌రిర‌క్షించ‌డం కోసం తీస్తా జ‌లాల్లో న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటా బాంగ్లాదేశ్ కు అందవలసిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె వివ‌రించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా ఒప్పందాన్ని 2011 జ‌న‌వ‌రి లోనే ఉభ‌య దేశాల ప్ర‌భుత్వాలు అంగీక‌రించాయి.  అంద‌రి తోనూ చ‌ర్చించి  ఆ ఒప్పందం వీలైనంత త్వ‌ర‌లో పూర్తి చేయాల‌న్న భార‌తదేశం చిత్త‌శుద్ధి ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పున‌రుద్ఘాటించారు.  అలాగే ఉభ‌య దేశాల మ‌ధ్య 2011 సంవ‌త్స‌రంలోనే అంగీకారం కుదిరిన మేర‌కు ఫేనీ న‌దీజ‌లాల్లో వాటా ఇచ్చే విష‌యం లో మ‌ధ్యంత‌ర ఒప్పందం ముసాయిదా కు వీలైనంత త్వ‌ర‌లో తుదిరూపాన్ని ఇవ్వాల‌ని భార‌తదేశం ప్ర‌తినిధివ‌ర్గం కోరింది.

19.  ఉభ‌య దేశాల మ‌ధ్య మ‌ను, ముహురి, ఖోవై, గుమ్ టీ, ధార్ లా, దూధ్ కుమార్ అనే ఆరు జ‌లాల వాటాల‌ పై మ‌ధ్యంత‌ర ఒప్పందాల‌ను త్వ‌ర‌గా సిద్ధం చేయాల‌ని ఉభ‌య దేశాల నాయ‌కులు త‌మ తమ జ‌ల‌ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌ల‌ను ఆదేశించారు.

20.   అప్ప‌ర్ సుర్మా కుషియారా ప్రాజెక్టు ద్వారా ఇరిగేష‌న్ వ‌స‌తులు క‌ల్పించ‌డం బాంగ్లాదేశ్ ఆహార భ‌ద్ర‌త రీత్యా ఎంతో అవ‌స‌రం అన్న విష‌యం గుర్తు చేస్తూ ఇందుకోసం కుషియారా న‌దీ జ‌లాల వినియోగానికి మార్గం సుగ‌మం చేసే ర‌హీంపూర్ ఖల్ త‌వ్వ‌కం మిగ‌తా భాగాన్ని పూర్తి చేసేందుకు అనుమ‌తించాల‌ని బాంగ్లాదేశ్ పున‌రుద్ఘాటించింది.  ఉభ‌య దేశాలు న‌దీ జ‌లాల వినియోగ ఒప్పందం ఎంతో కాలం గా పెండింగు లో ఉన్న కార‌ణంగా ఈ ఎంఓయు పై వీలైనంత త్వ‌ర‌గా సంత‌కాలు చేసేందుకు చొర‌వ తీసుకొని అనుమ‌తుల ను మంజూరు చేయాల‌ని కోరారు.  సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వం తో సంప్ర‌దింపుల ద్వారా ఈ ఎంఓయు త్వ‌ర‌గా పూర్తి చేసే విష‌యం ప‌రిశీల‌న‌ లో ఉంద‌ని భార‌తదేశం ప్ర‌తినిధివ‌ర్గం తెలియ‌చేసింది.

21.  ఫేనీ న‌ది నుంచి 1.82 క్యూసెక్కుల జ‌లాల వినియోగం పై  2019 అక్టోబ‌ర్ లో ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారి భార‌తదేశం సందర్శన కాలంలోనే ఎంఓయు కుదిరిన విష‌యాన్ని భార‌తదేశం ప్ర‌తినిధివ‌ర్గం గుర్తు చేస్తూ, దాని స‌త్వ‌ర అమ‌లు కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బంగ్లా ప్ర‌తినిధివ‌ర్గాన్ని కోరారు.

22.   గంగా న‌దీ జ‌లాల వాటా ఒప్పందం 1996 ప్ర‌కారం బాంగ్లాదేశ్ అందుకొనే జ‌లాల‌ ను పూర్తి స్థాయి లో వినియోగించుకొనేందుకు వీలు గా గంగా-ప‌ద్మ బ్యారేజి నిర్మాణానికి, ఇత‌ర ప్ర‌త్యామ్నాయాల‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్య‌య‌నం త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఇద్ద‌రు ప్ర‌ధాన‌మంత్రులు త‌మ దేశాల జాయింట్ టెక్నిక‌ల్ క‌మిటీల‌ ను ఆదేశించారు.

23.  జాయింట్ రివ‌ర్స్ క‌మిశన్ సాధించిన సానుకూల ఫ‌లితాల‌ను ఉభ‌య నాయ‌కులు గుర్తు చేసుకుంటూ ఇటీవ‌ల ఉభ‌య దేశాల జ‌ల వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌ల కార్య‌ద‌ర్శుల స్థాయి స‌మావేశాల ప‌ట్ల సంతృప్తి ని ప్ర‌క‌టించారు.

వృద్ధి కోసం వ్యాపారం

24.  ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యాపారాన్ని పెంచుకోవ‌డానికి నాన్- టారిఫ్ అవ‌రోధాల‌ ను తొల‌గించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఇద్ద‌రు ప్ర‌ధాన‌మంత్రులు ఉద్ఘాటించారు.  భార‌తదేశం క‌స్ట‌మ్స్ కొత్త విధానం లో నిర్దేశించిన మేర‌కు బాంగ్లాదేశ్ నుంచి వ‌చ్చే వ‌స్తువుల‌ ఆరిజిన్ స‌ర్టిఫికెట్ త‌నిఖీ నిబంధ‌న ను ఎత్తివేయాల‌ని బాంగ్లాదేశ్ ప్ర‌తినిధివ‌ర్గం కోరింది.  కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆరిజిన్ వాణిజ్య ఒప్పందానికి, ఈ నిబంధ‌న‌ల‌కు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఏర్ప‌డిన‌ట్ట‌యితే వాణిజ్య ఒప్పందం లోని ఆరిజిన్ నిబంధ‌న‌లే వ‌ర్తిస్తాయ‌ని భార‌తదేశం అధికారులు వివ‌రించారు. ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యాపారం విల‌సిల్లాలంటే వ్యాపార విధానాలు, నిబంధ‌న‌ లు, విధివిధానాలు అన్నీ అంచనా వేసేందుకు వీలు కల్పించేవి గా ఉండాల‌ని ఇద్ద‌రు నాయ‌కులు నొక్కి వ‌క్కాణించారు.

25.  ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించ‌డానికి వీలుగా భూ ఉప‌రిత‌ల‌ క‌స్ట‌మ్స్ స్టేశన్ లు (ఎల్ సి స్)/  లాండ్ పోర్టు లలో మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌న్వ‌య‌పూర్వ‌కంగా న‌వీక‌రించవలసిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఇద్ద‌రు ప్ర‌ధాన‌మంత్రులు నొక్కి చెప్పారు.

26.   తేలికగా బజారు అందుబాటు లో ఉంచ‌డానికి వీలుగా ఈశాన్య భార‌త‌దేశం స‌రిహ‌ద్దు లో క‌నీసం ఒక ప్ర‌ధాన పోర్టు ను పోర్టు కు సంబంధించిన నియంత్ర‌ణ‌లు లేదా నియంత్ర‌ణ‌ల నెగిటివ్ లిస్ట్ లేకుండా స్వేచ్ఛాయుతం చేయాల‌న్న అభ్య‌ర్థ‌న‌ ను భార‌తదేశం ప్ర‌తినిధివ‌ర్గం పున‌రుద్ఘాటించింది.  ఐసిపి అగ‌ర్ తలా- అఖౌరా తో ఇది ప్రారంభం కావాల‌ని ప్ర‌తిపాదించింది.

27.  ద్వైపాక్షిక వాణిజ్యం విస్త‌రించేందుకు ప్ర‌మాణాల హేతుబ‌ద్ధ‌త‌, ఒప్పందాలు, స‌ర్టిఫికెట్ ల ప‌ర‌స్ప‌ర గుర్తింపు అవ‌స‌ర‌ం అని ఇద్ద‌రు ప్ర‌ధాన‌ మంత్రులు స్పష్టంచేశారు.  ఉభ‌య‌ దేశాల వాణిజ్యాన్ని స‌ర‌ళీక‌రించే స్ఫూర్తి తో సామ‌ర్థ్యాల నిర్మాణం, టెస్టింగ్‌/  లాబ్ స‌దుపాయాల అభివృద్ధి పై బాంగ్లాదేశ్ స్టాండ‌ర్డ్స్ అండ్ టెస్టింగ్ ఇన్స్ టిట్యూట్ (బిటిఎస్ఐ), బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ స్ (బిఐఎస్‌) లు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని సూచించారు.

28.  ఎల్ డిసి హోదా నుంచి గ్రాడ్యుయేష‌న్ హోదా స్థాయి కి ఎదుగుతున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని బాంగ్లాదేశ్ ను భార‌త‌దేశం అభినందించింది.  ఉభయ దేశాల మ‌ధ్య‌ గ‌ల‌ ద్వై పాక్షిక ఆర్ధిక‌, వాణిజ్య సంబంధాల సామ‌ర్థ్యాన్ని ఇరు పక్షాలు గుర్తించాయి.  ఈ నేప‌థ్యం లో స‌మ‌గ్ర‌మైన ఆర్ధిక భాగ‌స్వామ్య ఒప్పందం ( సిఇపిఎ) పై ఉమ్మ‌డి గా కొన‌సాగుతున్న అధ్య‌యనాన్ని త్వ‌ర‌గా ముగించవలసిన అవసరాన్ని ఇరు దేశాలు గ‌ట్టి గా ప్ర‌స్తావించాయి.

29.  బాంగ్లాదేశ్ ఆర్ధిక వ్య‌వస్థ‌ లో జ‌న‌ప‌నార ప‌రిశ్ర‌మ పోషిస్తున్న ప్ర‌ధాన పాత్ర‌ ను ఇరు దేశాలు ప్ర‌త్యేకం గా ప్ర‌స్తావించాయి.  త‌మ దేశ జూట్ మిల్లుల ప‌రిశ్ర‌మ‌ లో ప‌బ్లిక్- ప్రైవేట్ భాగ‌స్వామ్యం కింద పెట్టుబ‌డులు పెట్టాల‌ని భార‌త‌దేశాని కి బాంగ్లాదేశ్ ఆహ్వానం ప‌లికింది.  బాంగ్లాదేశ్ ప్ర‌భుత్వ విధానం లో భాగం గా ఈ జ‌న‌ప‌నార‌ ప‌రిశ్ర‌మ‌ ను ఆధునీకరించ‌డానికి నిశ్చ‌యించారు.  వివిధ ర‌కాల జూట్ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసి ఈ రంగాన్ని ప్రోత్సాహించాల‌నేది ప్ర‌భుత్వ నిర్ణ‌యం.  ఈ నేప‌థ్యం లో ఈ రంగం లో ఇరు దేశాల మ‌ధ్య‌ మ‌రింత అర్థ‌వంత‌మైన స‌హ‌కారం ఉండాల‌ని బాంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్య‌ర్థించింది.  బాంగ్లాదేశ్ జూట్ ఉత్పత్తుల‌ పై 2017వ సంవత్సరం నుంచి భార‌త‌దేశం విధించిన ఎగుమ‌తి సుంకాల‌ ను ఎత్తివేయాలని కోరింది.  జూట్ ప‌రిశ్ర‌మ రంగం లో స‌హ‌కారాన్ని భార‌త‌దేశం స్వాగ‌తించింది.  యాంటీ డంపింగ్ డ్యూటీ కి సంబంధించిన విజ్ఞ‌ప్తి ని ప‌రిశీలిస్తామ‌ని అంగీక‌రించింది.

30.  బాంగ్లాదేశ్ ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌లు మంత్రిత్వ‌ శాఖ‌ల టెండ‌ర్ ల లో భార‌త‌దేశ కంపెనీ లు పాల్గొన‌కుండా బాంగ్లా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న నియ‌మ నిబంధ‌న‌లను ఎత్తివేయాల‌ని భార‌త‌దేశం కోరింది.  ఈ విధానం పై ప్ర‌త్యేకంగా ఫ‌లానా దేశాన్ని అడ్డుకోవాల‌నే నిబంధ‌న‌లు ఏవీ లేవు అని బాంగ్లాదేశ్ తెలిపింది.

31.  ఇరు‌ దేశాల మ‌ధ్య‌ స‌రిహ‌ద్దులలో కొత్త గా ప్రారంభించిన హాట్ లను ఇరు దేశాల ప్ర‌ధానులు ఆహ్వానించారు.  ఇరు దేశాల స‌రిహ‌ద్దు ల లోని మారుమూల ప్రాంతాలలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల ఆర్ధికాభివృద్ధి కి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని, ప‌రస్ప‌రం ల‌బ్ధి ని చేకూర్చగలవని ప్ర‌ధానులు భావించారు.

విద్యుత్, శ‌క్తి రంగాల లో ఇరు దేశాల మ‌ధ్య‌ భాగ‌స్వామ్యం, స‌హ‌కారం

32.  ఉభయ దేశాల‌ కు చెందిన ఉన్న‌త‌ స్థాయి ప‌ర్య‌వేక్ష‌ణ సంఘం ఒకటో స‌మావేశం వివ‌రాల‌ను ఇరు పక్షాలు తెలుసుకున్నాయి.  లైన్ ఆఫ్ క్రెడిట్ కింద చేప‌ట్టే ప్రాజెక్టుల‌ ను త్వ‌రిత‌ గ‌తి న చేప‌ట్ట‌డానికి గాను త‌గిన సిఫారసుల‌ ను చేయాల‌ని సంఘాని కి ఇరు దేశాల‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
 
33.  ఇరు దేశాల మ‌ధ్య విద్యుత్ రంగం, శ‌క్తి రంగం లలో దృఢ‌మైన రీతి లో కొన‌సాగుతున్న స‌హ‌కారం ప‌ట్ల‌, ప్రైవేటు రంగం లో కూడా కొన‌సాగుతున్న స‌హ‌కారం ప‌ట్ల ఇరు పక్షాలు సంతృప్తి ని వ్య‌క్తం చేశాయి.  నేపాల్‌, భూటాన్ ల‌తో స‌హ స‌బ్ రీజ‌న‌ల్ స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌డంప‌ట్ల ఇరు దేశాలు అంగీక‌రించాయి. విద్యుత్ రంగం లో వాణిజ్యానికి సంబంధించి స‌రిహ‌ద్దుల మ‌ధ్య‌ ఉండవలసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు సంబంధించి నిబంధ‌న‌ ల రూప‌క‌ల్ప‌న త్వ‌రిత‌ గ‌తి న జ‌రిగితే ఉప ప్రాంతీయ‌ స‌హ‌కారం పెరుగుతుంద‌ని భార‌తదేశం స్ప‌ష్టం చేసింది. కటిహార్‌- ప‌ర్ బతీపుర్‌-బోర్నగర్ స‌రిహ‌ద్దు విద్యుత్ ఇంట‌ర్ కనెక్ష‌న్ కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త్వ‌ర‌గా రూపొందించాల‌ని భార‌త‌దేశం విజ్ఞ‌ప్తి చేసింది.  ఈ విష‌యం లో అధ్య‌య‌న బృందాన్ని ఏర్పాటు చేయాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి.  భారతదేశం, బాంగ్లాదేశ్ ల స్నేహానికి గుర్తు గా ఏర్పాటు చేస్తున్న గొట్టపు మార్గం, మైత్రి సూప‌ర్ థర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ యూనిట్ 1 అమ‌లు కు సంబంధించి ప‌నుల ప్ర‌గ‌తి ని ఇరు దేశాలు స‌మీక్షించాయి.  ఈ ప్రాజెక్టు లు త్వ‌ర‌లోనే అందుబాటు లోకి రావాల‌ని ఇరు దేశాలు అభిల‌షించాయి.
 
34.  హైడ్రోకార్బ‌న్ రంగం లో స‌హ‌కారానికి సంబంధించి ఇరు దేశాల మ‌ధ్య‌ ఉండవలసిన అవ‌గాహ‌న నిర్మాణం పై 2020 వ సంవత్సరం డిసెంబ‌ర్ నెల‌ లో సంత‌కాలు జ‌రిగిన విష‌యాన్ని ఇరు దేశాలు ప్ర‌స్తావించాయి.  దీనికి సంబంధించి సంస్థాగ‌త ఏర్పాటులను వీలైనంత త్వర‌గా చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఇరు దేశాలు సూచించాయి.  త‌ద్వారా ఈ ముఖ్య‌ రంగం లో ఇరు దేశాల మ‌ధ్య‌ ద్వైపాక్షిక్ష స‌హ‌కారం మ‌రింత‌ గా అభివృద్ధి చెందుతుంది.

సమృద్ధి కోసం కనెక్టివిటీ

35.  భాగ‌స్వాములంద‌రికీ మేలు జ‌రిగేలా ప్రాంతీయ ఆర్ధిక శ‌క్తుల క‌ల‌యిక సిద్ధించేలా క‌నెక్టివిటీ ని పెంచవలసిన ప్రాధాన్య‌ంపై ఇరు దేశాల ప్ర‌ధానులు ప్ర‌త్యేకంగా మాట్లాడారు.  రైలు, ర‌హ‌దారులు, జ‌ల ర‌వాణా మాధ్యమాల ద్వారా కనెక్టివిటీ కి సంబంధించి ప‌లు నిర్ణ‌యాల‌ను తీసుకున్నందుకు గాను, 1965వ సంవత్సరం కంటే ముందు ఉన్న రైలు మార్గాన్ని పున‌రుద్ద‌రించాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డంప‌ట్ల భార‌త‌దేశం త‌న కృత‌జ్ఞ‌త‌లను ప్ర‌ధాని హసీనా గారికి తెలియ‌జేసింది.  బాంగ్లాదేశ్ కూడా ఇదే ర‌క‌మైన సంతోషాన్ని క‌న‌బ‌రుస్తూ, భారతదేశం-మ్యాంమార్- థాయీ లాండ్ ల‌కు సంబంధించిన త్రైపాక్షిక హైవే ప్రాజెక్టు లో భాగం కావాల‌నే ఆస‌క్తి ని వ్య‌క్తం చేసింది.  ఇరు దేశాల‌కు మ‌ధ్య‌ ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడ‌డానికి, వ‌స్తు ర‌వాణా సులువుగా సాగ‌డానికి గాను మెరుగైన క‌నెక్టివిటీ ని ఏర్పాటు చేసుకోవ‌డానికి గాను ఇరు దేశాలు అంగీక‌రించాయి.  ఇందుకోసం బిబిఐ ఎన్ మోటర్ వెహిక‌ల్స్ అగ్రిమెంట్ త్వ‌రిత‌ గ‌తి న అమ‌ల‌య్యేలా చూడాల‌ని నిర్ణ‌యించాయి. ఇందుకోసం బాంగ్లాదేశ్‌, ఇండియా, నేపాల్ ల మ‌ధ్య‌ అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రం పై సంత‌కాలు త్వ‌ర‌లోనే జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకున్నాయి.  దీనికి సంబంధించి మ‌రికొంత‌ కాలం త‌ర్వాత భూటాన్ కూడా  భాగ‌మ‌వుతుంది.
 
36.  బాంగ్లాదేశ్ ప్ర‌తిపాదించిన నూత‌న ర‌వాణా మార్గాల‌కు సంబంధించి భార‌త‌దేశం సుముఖ‌త ను వ్య‌క్తం చేయాల‌ని కోరుతూ బాంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసింది.  భ‌ద్రపుర్ -బైరాగి గ‌ల్ గలియా, బిరాట్ నగ‌ర్-జోగ్ మ‌నీ, బీర్ గంజ్‌-ర‌క్సౌల్ ల‌కు సంబంధించిన అద‌న‌పు లాండ్ పోర్టుల‌ను అనుమ‌తించాల‌ని, వాటిని ప్ర‌త్యామ్నాయ ర‌వాణా మార్గాలుగా చేయాల‌ని కోరింది.  రైలు మార్గానికి సంబంధించి భార‌త‌దేశం ఇచ్చే రూట్ ల అనుమతుల కార‌ణంగా బాంగ్లాదేశ్ నుంచి నేపాల్ కు ర‌వాణా ఖ‌ర్చులు తగ్గుతాయ‌ని బాంగ్లాదేశ్ తెలిపింది.  వాటి వివ‌రాల‌ను భార‌తదేశానికి తెలిపింది.  అలాగే భూటాన్ కు రైలు క‌నెక్టివిటీ కి సంబంధించి భార‌త‌దేశం త‌ర‌ఫు నుంచి స‌హ‌కారాన్ని కోరింది.  

గువాహాటీ, చట్టగ్రామ్ , మేఘాల‌య‌ లోని మ‌హేంద్ర‌గంజ్‌నుంచి ప‌శ్చిమ బంగాల్ లోని హిలీ కి క‌నెక్టివిటీ కి సంబంధించి బాంగ్లాదేశ్ స‌హ‌కారాన్ని భార‌త‌దేశం కోరింది.  దాంతో వీటికి సంబంధించిన వివ‌రణా‌త్మ‌క‌మైన ప్ర‌తిపాద‌న ఇవ్వాల‌ని భార‌త‌దేశాన్ని బాంగ్లాదేశ్ కోరింది.
 
37.  ఇరు దేశాల మ‌ధ్య‌ జ‌ల‌ ర‌వాణా ద్వారా వ‌స్తు స‌ర‌ఫ‌రా కు సంబంధించిన క‌నెక్టివిటీ కి సంబంధించి చేకూరే ప్ర‌యోజ‌నాల గురించి ఇరు దేశాలు ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నాయి.  దీనికి సంబంధించిన ఒప్పందాలు త్వ‌ర‌గా అమ‌లు కావ‌డానికి వీలుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి.

38.  ఆశూగంజ్ కంటేన‌ర్ టర్మిన‌ల్ అభివృద్ధి కి సంబంధించిన ద్వైపాక్షిక ప్రాజెక్టు పూర్త‌ి అయ్యేటంత‌ వ‌ర‌కు ప్రోటోకాల్ ఆన్ ఇన్ ల్యాండ్ వాట‌ర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్ లో భాగంగా ముంశీగంజ్, పన్ గాఁవ్ ల‌లో ట్రాన్స్ శిప్ మెంట్ ఏర్పాటు ల కోసం భార‌త‌దేశం అభ్య‌ర్థించింది.  దీనికి సంబంధించిన ప్రాథమిక సౌక‌ర్యాల ప‌రిమితులను బాంగ్లాదేశ్ వివ‌రించింది.  సౌక‌ర్యాల‌ను మెరుగు చేయ‌డానికిగాను చేప‌ట్టిన ప‌నుల గురించి తెలిపింది.

39. ఫేనీ న‌ది మీద మైత్రి సేతు ప్రారంభం గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు చేశారు.  ఈ ముఖ్య‌మైన క‌నెక్టివిటీ ప్రాజెక్టు కార్య‌రూపం దాల్చ‌డానికి గాను బాంగ్లాదేశ్ అందించిన స‌హ‌కారాన్ని ఆయన ప్ర‌శంసించారు.  ఈ సంద‌ర్భంగా మాట్లాడిన బాంగ్లాదేశ్ ప్ర‌ధాని ఫేనీ న‌ది మీద నిర్మించిన వంతెన బాంగ్లాదేశ్ నిబ‌ద్ద‌త‌ ను చాటుతోంద‌ని, క‌నెక్టివిటీ సాధ‌న‌ కోసం త‌మ దేశం కృషి చేస్తుంటుంద‌ని, ఈ ప్రాంతం లో ఆర్ధిక స‌మైక్య‌త‌ కు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కి త‌మ దేశం కృషి చేస్తుంటుంద‌ని అన్నారు.  ఈ నూత‌న వంతెన‌ ను పూర్తి స్థాయి లో ఉప‌యోగించుకోవ‌డానికి గాను ఇరు దేశాల మ‌ధ్య‌ మిగిలిపోయిన‌ వాణిజ్య‌, ప‌ర్యాట‌క ప్రాథమిక సౌక‌ర్యాల‌ను వెంట‌నే అభివృద్ధి చేసుకోవాల‌ని ఇరు దేశాలు నిశ్చ‌యించాయి.
 
40.  ఈశాన్య భార‌త‌దేశ రాష్ట్రాలు ముఖ్యంగా త్రిపుర రాష్ట్రం త‌మ దేశంలోని చట్టగ్రామ్‌, సిల్ హట్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చంటూ బాంగ్లాదేశ్ ప్ర‌తిపాదించింది.  ఈ ప్రాంతం లోని ప్ర‌జ‌ల ఉప‌యోగంకోసం సైద్ పుర్ విమానాశ్ర‌యాన్ని ప్రాంతీయ విమానాశ్ర‌యం గా అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతుంద‌ని బాంగ్లాదేశ్ తెలిపింది.

41.  రెండు దేశాలలో టీకా ల కార్య‌క్ర‌మం విస్తృతం గా సాగుతున్నందున ఇరు దేశాల మ‌ధ్య‌ విమాన‌, రైలు, రోడ్డు ర‌వాణాలకు సంబంధించిన నిబంధ‌న‌లను క్ర‌మంగా తొల‌గించ‌డానికి ఏం చేయాల‌నే దానిపై ఆలోచించాల‌ని ఇరు దేశాలు అంగీక‌రించాయి.  ఇరు దేశాల మ‌ధ్య‌ పూర్తి స్థాయి లో ప‌ర్య‌ట‌న‌, ర‌వాణా పున‌రుద్ధ‌రణ జరగాలంటే అది కోవిడ్ ప‌రిస్థితి మీద ఆధార‌ప‌డి ఉంటుంది అని ఇరు దేశాలు గుర్తించాయి.  త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని భార‌త‌దేశం ఆకాంక్షించింది.
 
42.  విద్య రంగం లో ఇరు దేశాల మ‌ధ్య‌ కొన‌సాగుతున్న స‌హ‌కారాన్ని గుర్తించాయి. ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల‌ కోసం విద్య రంగం లోని స‌హ‌కారాన్ని మ‌రింత మెరుగుప‌ర‌చాలని ప్ర‌ధానులు ఇద్ద‌రూ నిశ్చ‌యించారు.  ఇరు దేశాల‌కు చెందిన విశ్వ‌విద్యాల‌యాలు, విద్య సంస్థ‌ ల మ‌ధ్య‌ ఏర్ప‌డిన స‌హ‌కార పూర్వ‌క ఒప్పందాల‌ను రెండు దేశాలు అభినందించాయి. విద్యార్హ‌త‌ల‌ను రెండు దేశాలు ప‌ర‌స్ప‌రం గుర్తించడానికి సంబంధించిన ఎమ్ఒయు ను త్వ‌ర‌లోనే చేసుకోవాల‌ని ఇరు దేశాల అధికారుల‌కు ప్ర‌ధానులు ఇద్ద‌రూ ఆదేశాలిచ్చారు.  చేప‌ల పెంప‌కం, వ్య‌వ‌సాయం, విప‌త్తు నిర్వ‌హ‌ణ‌, ఎస్ ఎం ఇ లు, మ‌హిళా సాధికారిత రంగాల లో బాంగ్లాదేశ్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలలో పాల్గొన‌డానికి ఉత్సుక‌త చూపే భార‌తీయ యువ‌త‌ కు బాంగ్లాదేశ్ ఆహ్వానం ప‌లికింది.  రెండు దేశాల మ‌ధ్య‌ సంస్కృతి, విద్య‌, సాంకేతిక‌, శాస్త్ర విజ్ఞాన రంగాలు, యువ‌త‌, క్రీడ‌లు, మాస్ మీడియా రంగాలలో ఇచ్చి పుచ్చుకొనేందుకు వీలు గా ఏర్పాటు చేసే కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించాల‌ని ఇరు దేశాలు నిశ్చ‌యించాయి.

ప్ర‌జారోగ్య రంగం లో స‌హ‌కారం

43.  కోవిడ్- 19 మ‌హ‌మ్మారి కి సంబంధించి ఇరు దేశాల‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను ఇరు దేశాల ప్ర‌ధానులు తెలుసుకున్నారు.  దీనికి సంబంధించి ఈ సంక్షోభ కాలం లో రెండు దేశాలు స్థిర‌మైన స‌హ‌కార ప్ర‌క్రియ‌ ను కొన‌సాగించ‌డం ప‌ట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు. భార‌త‌దేశం లో త‌యారైన ఆక్స్ ఫోర్డ్ ఎస్ట్రా జెనెకా కోవిషీల్డ్ టీకా కు సంబంధించి 3.2 మిలియ‌న్ డోసుల‌ ను భార‌త‌దేశం బ‌హుమ‌తి గా ఇచ్చినందుకు భారత  ప్రభుత్వానికి బాంగ్లాదేశ్ పక్షం ధన్యవాదాలు తెలిపింది.  మొద‌టి బ్యాచు కు సంబంధించి 5 మిలియ‌న్ డోసుల‌ను స‌మ‌యానికి స‌ర‌ఫ‌రా చేసినందుకు భార‌త‌దేశాన్ని బాంగ్లాదేశ్ అభినందించింది.  భార‌తదేశానికి చెందిన సీరమ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి బాంగ్లాదేశ్ కొనుగోలు చేసిన మిగిలిన టీకాల‌ ను క్ర‌మం త‌ప్ప‌కుండా పంపాల‌ని బాంగ్లాదేశ్ అభ్య‌ర్థించింది.  దేశీయ అవ‌స‌రాల‌ను, అంత‌ర్జాతీయం గా చేసుకున్న ఒప్పందాలను దృష్టి లో పెట్టుకుంటూనే బాంగ్లాకు వీలైనంత సాయం చేయ‌డానికి భార‌త‌దేశం సిద్ధంగా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
 
44.  కోవిడ్- 19 మ‌హ‌మ్మారి నేప‌థ్యం లో ఇరు దేశాల మ‌ధ్య‌ మ‌రింత బ‌ల‌మైన స‌హ‌కారం ఉండాలని ఉభయ దేశాలు భావించాయి.  ఆరోగ్య భ‌ద్ర‌త సేవ‌ లు, ప‌రిశోధ‌న రంగాల‌ లో ఈ స‌హ‌కారం బ‌లంగా కొన‌సాగాల‌ని రెండు దేశాలు నిశ్చ‌యించాయి.  ఈ నేప‌థ్యం లో శిక్ష‌ణ‌‌, సామ‌ర్థ్యాల నిర్మాణం, సాంకేతిక‌త బ‌దిలీ అంశాల‌ పై ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం బ‌లంగా ఉండాల‌ని బాంగ్లాదేశ్ అభ్య‌ర్థించింది.  కోవిడ్-  19 నేప‌థ్యంలో బ‌యో సెక్యూరిటీ ప్రాధాన్య‌ాన్ని బాంగ్లాదేశ్ ప్ర‌త్యేకం గా ప్ర‌స్తావించింది. జీవ‌భ‌ద్ర‌త‌కు సంబంధంచిన అర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు లేక‌పోతే ఆర్ధిక భ‌ద్ర‌త ప్ర‌మాదం లో ప‌డుతుంద‌ని బాంగ్లాదేశ్ పేర్కొంది.  ఇరు దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల వ‌ద్ద వాణిజ్య వ్య‌వ‌హ‌రాలు, ప్ర‌జ‌ల రాక‌పోక‌ లు ఉన్న నేప‌థ్యం లో ఈ అంశానికి మ‌రింత ప్రాధాన్య‌త ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యం లో ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసర్చ్‌ కు, బాంగ్లాదేశ్ మెడిక‌ల్ రిసర్చ్ కౌన్సిల్ కు మ‌ధ్య‌ అనేక అంశాల‌ వారీగా ఉన్న స‌హ‌కారాన్ని ఇరు దేశాలు ప్ర‌శంసించ‌డం జ‌రిగింది.

స‌రి‌హద్దు నిర్వ‌హ‌ణ‌, భ‌ద్ర‌త ప‌ర‌మైన స‌హ‌కారం

45.  ఇరు దేశాల మ‌ధ్య‌ స‌రిహ‌ద్దు నిర్వ‌హ‌ణ ప్రాధాన్య‌ాన్ని గురించి ఇరు దేశాల నేత‌ లు ప్ర‌త్యేకం గా మాట్లాడారు.  స‌రిహ‌ద్దుల లో శాంతియుత‌ ప‌రిస్థితులు, స్థిర‌మైన‌, నేర ర‌హిత‌ ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డానికి గాను స‌రిహ‌ద్దు నిర్వ‌హ‌ణ ముఖ్య‌మ‌ని నేత‌లు అన్నారు.  స‌రిహ‌ద్దు ల వ‌ద్ద‌ ఇరు దేశాల‌ కు సంబంధించిన పౌరుల మ‌ర‌ణాలనేవి లేకుండా చూడాల‌ని ఇరు దేశాలు అంగీక‌రించాయి.  దీని కోసం స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త ద‌ళాలు చ‌ర్య‌లను తీసుకోవాల‌ని నేత‌ లు ఆదేశాలు జారీ చేశారు. రాజ్ శాహీ జిల్లా లో ప‌ద్మా న‌ది ప్రాంతం లో 1.3 కిలోమీట‌ర్ల పొడవున జల మార్గానికి  అనుమ‌తించాల‌ని బాంగ్లాదేశ్ అబ్య‌ర్థించింది.  మాన‌వ‌తా దృక్ప‌థంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరింది.  ఈ అభ్య‌ర్థ‌న ను ప‌రిశీలిస్తామ‌ని భారతదేశం పేర్కొంది.  అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు కు సంబంధించిన చోట్ల పెండింగు లో ఉన్న ప్రాంతాల లో వెంట‌నే కంచె నిర్మాణం పూర్తి చేయాల‌ని భారతదేశం కోరింది.  దీనిపై బాంగ్లాదేశ్ సానుకూలంగా స్పందించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

46.  ఇరు దేశాల మ‌ధ్య‌ రక్ష‌ణ రంగ స‌హ‌కారం ప‌ట్ల రెండు దేశాలు సంతృప్తి ని వ్య‌క్తం చేశాయి. దీనికి సంబంధించి ఇచ్చి పుచ్చుకొనే కార్య‌క్ర‌మాలను తరచు నిర్వ‌హించాల‌ని శిక్ష‌ణ‌, సామ‌ర్థ్యం నిర్మాణ అంశాలలో స‌హ‌కారాన్ని పెంచుకోవాల‌ని రెండు దేశాలు నిర్ణ‌యించాయి. డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ అమ‌లు ను త్వ‌రిత‌ గ‌తి న చేపట్టాల‌ని భార‌త‌దేశం అభ్య‌ర్థించింది.

47.  విప‌త్తు నిర్వ‌హ‌ణ‌ కు సంబంధించిన ఎమ్ఒయు పై సంత‌కాల‌ను ఇరు దేశాలు ఆహ్వానించాయి.  ప్ర‌కృతి విప‌త్తుల‌కు సంబంధించి ఉభయ దేశాల మ‌ధ్య సంస్థ‌ ల స‌హ‌కారాన్ని ఇది బ‌లోపేతం చేస్తుంద‌ని రెండు దేశాలు పేర్కొన్నాయి.

48.  ఉగ్ర‌వాదం ప్ర‌పంచ‌ శాంతి కి, సురక్ష కు అపాయం గా పరిణమించింద‌నే విష‌యాన్ని ఇరు దేశాలు స్ప‌ష్టం చేశాయి.  ఉగ్ర‌వాదం ఎలాంటి రూపాల లో ఉన్నా స‌రే వాటిని అంత‌మొందించాల‌ని, ఇందుకోసం బ‌ల‌మైన నిబ‌ద్ద‌త‌ తో ప‌ని చేయాని నిర్ణ‌యించాయి. భ‌ద్ర‌త ప‌ర‌మైన అంశాలలో బాంగ్లాదేశ్ త‌న స‌హ‌కారాన్ని విస్త‌రించ‌డం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ అభినంద‌న‌ లు తెలిపారు.

స‌హ‌కారానికి సంబంధించి నూత‌న రంగాలు

49.  ఉప‌గ్ర‌హ త‌యారీ రంగం లో బాంగ్లాదేశ్ సాధిస్తున్న విజ‌యాల‌ను ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా ప్ర‌స్తావించారు.  2017వ సంవత్సరం లో త‌మ దేశ మొద‌టి ఉప‌గ్ర‌హం ‘బంగ‌బంధు’ (బిఎస్- 1) ని అంత‌రిక్షం లో ప్ర‌వేశ‌పెట్టామ‌ని, త్వ‌ర‌లోనే రెండో ఉప‌గ్రహాన్ని ప్ర‌యోగిస్తామ‌ని ఆమె అన్నారు.  అంత‌రిక్షం, ఉప‌గ్ర‌హ ప‌రిశోధ‌న‌ల‌ కు సంబంధించి మ‌రింత స‌హ‌కారం, సాంకేతిక‌త బ‌దిలీ కి ఇరు దేశాల ప్ర‌ధానులు అంగీక‌రించారు.
 
50.  ద్వైపాక్షిక స‌హ‌కారానికి సంబంధించి నూత‌న అంశాలు, రంగాలను ఇరు దేశాలు ప్ర‌స్తావించాయి.  దీనికి సంబంధించి శాస్త్ర విజ్ఞానం, కృత్రిమ మేధ‌స్సు, రేడియో ధార్మిక సాంకేతిక‌త‌, వైద్యం, విద్య రంగాల లో సాంకేతిక‌త‌ తో కూడిన సేవ‌ లు మొద‌లైన రంగాల లో స‌హ‌కారం పై ఇరు దేశాల అధికారులు దృష్టి పెట్టాల‌ని ప్ర‌ధానులు ఆదేశాలు జారీ చేశారు. ఇరు దేశాల మ‌ధ్య‌ యూత్ ఎక్ఛేంజ్ కార్య‌క్ర‌మాల‌ను విస్త‌రించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బాంగ్లాదేశ్ యువ‌త‌ కు ఆహ్వానం ప‌లికారు.  ఆ దేశానికి చెందిన 50 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు భార‌తదేశాన్ని సందర్శించాల‌ని ఆహ్వానించారు.  భార‌త‌దేశం లోని వెంచ‌ర్ కేపిట‌లిస్టుల కు త‌మ ఆలోచ‌న‌లను తెల‌పాల‌ని సూచించారు.

51.  యాత్ర క్రమం లో భాగం గా  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మార్చి 27, 2021న బాంగ్లాదేశ్ లోని జెశోరేశ్వ‌రి దేవి ఆలయాన్ని, గోపాల్ గంజ్ లో ఓరాకాందీ ఆల‌యాన్ని సంద‌ర్శించారు.  ఈ సంద‌ర్భం లో ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ లో నెల‌కొన్న ధార్మిక సద్భావ సంప్రదాయాన్ని ప్రశంసించారు.

మ్యాంమార్ లోని ర‌ఖాయిన్ ప్రాంతం నుంచి శ‌ర‌ణార్థులు

52.  మ్యాంమార్ లోని ర‌ఖాయిన్ ప్రాంతానికి చెందిన 1.1 మిలియ‌న్ మంది శ‌ర‌ణార్థుల‌కు బాంగ్లాదేశ్ ఆశ్ర‌యం క‌ల్పించడం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. అక్క‌డ‌నుంచి బ‌లవంతంగా నెట్టివేయ‌బ‌డిన ల‌క్ష‌ల మంది ని బాంగ్లాదేశ్ ఆదుకొంద‌ని మానవ‌త దృక్ప‌థం తో బాంగ్లా వ్య‌వ‌హ‌రించింద‌ని ఈ సంద‌ర్భం గా ఆయన కొనియాడారు.  వారి భద్రత‌ కు, త్వ‌ర‌లో వారిని వారి స్వంత ప్రాంతానికి పంపే కార్య‌క్ర‌మానికి ఉన్న ప్రాధాన్య‌ాన్ని ఇరువురు ప్ర‌ధానులు ఈ సంద‌ర్భం లో ప్ర‌స్తావించారు.  రోహింగ్యాల‌ను మ్యాంమార్ కు పంపించే విష‌యం లో ఐక్య‌ రాజ్య‌ స‌మితి లో త‌న ప‌లుకుబ‌డి ని భార‌త‌దేశం ఉప‌యోగించాల‌ని ఈ సంద‌ర్భంలో ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు కోరారు.  ఈ విష‌యం లో త‌న స‌హ‌కారం కొన‌సాగుతుంద‌ని భార‌త‌దేశం హామీ ని ఇచ్చింది.  

ప్రాంతీయంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా భాగ‌స్వామ్య దేశాలు

53.  ఐక్య‌ రాజ్య‌ స‌మితి లోను, ఇత‌ర బ‌హుళ పాక్షిక వేదిక ల‌ లోను ఉమ్మ‌డి ల‌క్ష్యాల సాధ‌న‌ కోసం ఇరు దేశాలు క‌లసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించాయి.

54.  సార్క్‌, బిమ్స్ టెక్ ల వంటి ప్రాంతీయ సంస్థ‌ లు కీల‌క పాత్ర ను పోషించాల‌ని, కోవిడ్- 19 నేప‌థ్యం లో ఇది మ‌రింత‌గా ఉండాల‌ని ఇరువురు నేత‌ లు ప్ర‌త్యేకం గా పేర్కొన్నారు.  2020వ సంవత్సరం మార్చి నెల‌ లో సార్క్ దేశాల నేత‌ల‌ తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించినందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు అభినందించారు.  ఈ సంద‌ర్భం లో సార్క్ అత్యవసర ప్రతిస్పందన నిధి ని ఏర్పాటు చేసుకోవాల‌ని, కోవిడ్- 19 పై పోరాటానికి గాను ఆ నిధి ని ద‌క్షిణ ఆసియా ప్రాంతం లో ఉప‌యోగించుకోవాల‌నే ప్ర‌తిపాద‌న ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుంచి రావ‌డం ప‌ట్ల బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

55.  ప్రాధాన్య‌ాల ప్ర‌కారం ప్రాంతీయ‌ వేదికల పై, ఉప ప్రాంతీయ వేదిక‌ల‌పై మ‌రింత స‌హ‌కారాన్ని తీసుకోవాల‌ని ఇరు దేశాల నేత‌లు అంగీక‌రించారు.  ఇందుకోసం బిమ్స్ టెక్ వేదిక‌ ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతం గా ఉప‌యోగించుకోవాల‌ని, అంత‌ర్ ప్రాంతీయ స‌హ‌కారాన్ని పెంపొందించుకోవాల‌ని, స‌భ్య‌దేశాల‌న్నీ ల‌బ్ధి పొందాల‌ని ఇరువురు నేత‌ లు ఆకాంక్షించారు.

56.  ఈ ఏడాది అక్టోబ‌రు లో మొదటిసారిగా ఐఎఆర్ఎ అధ్యక్ష పదవి ని చేప‌ట్టనున్నట్టు బాంగ్లాదేశ్  తెలియ‌జేసింది.  హిందూ మ‌హాస‌ముద్రం లో భ‌ద్ర‌త క‌ల్పించ‌డం లో భార‌త‌దేశం త‌న స‌హకారాన్ని అందించాల‌ని బాంగ్లాదేశ్‌ కోరింది.  బాంగ్లాదేశ్‌ కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ విష‌యం లో భార‌త‌దేశం స‌హ‌కారం ఎల్ల‌వేళ‌లా ఉంటుంద‌ంటూ హామీ ని ఇచ్చారు.

57.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ కు చెందిన సౌత్ ఈస్ట్ ఏశియాన్ రీజ‌న‌ల్ ఆఫీసు డైరెక్ట‌ర్‌ గా  2023 సంవ‌త్స‌రంనుంచి ప‌నిచేయ‌డానికిగాను బాంగ్లాదేశ్ అభ్య‌ర్థి కి అవ‌కాశం ల‌భించేలా భార‌త‌దేశం స‌హ‌క‌రించింది.  ఈ స‌హ‌కారం ప‌ట్ల బాంగ్లాదేశ్ కృత‌జ్ఞ‌త‌లను వ్యక్తం చేసింది.

58.  కోయ‌లిష‌న్ ఫార్ డిజాస్ట‌ర్ రెజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ( సిడిఆర్ ఐ) లో బాంగ్లాదేశ్ చేరుతుంద‌నే ఆశాభావాన్ని భార‌తదేశం వ్య‌క్తం చేసింది.  మౌలిక స‌దుపాయాల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌మాదాల‌ నుంచి ర‌క్ష‌ణ‌, ప్ర‌మాణాలు, ఆర్ధిక చే‌యూత‌, రిక‌వ‌రీ మెకానిజమ్ త‌దిత‌ర అంశాల‌పై స‌భ్య‌త్వ దేశాల‌తో త‌న అనుభ‌వాల‌ను బాంగ్లాదేశ్ పంచుకుంటుంద‌నేది భార‌త‌దేశ ఆకాంక్ష‌గా ఉంది.
 
59.  న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు లో చేరాల‌ని బాంగ్లాదేశ్ తీసుకొన్న నిర్ణ‌యాన్ని భార‌త‌దేశం స్వాగతించింది.

ద్వైపాక్షిక‌ ప‌త్రాల పై సంత‌కాలు, ప్రాజెక్టు ల ప్రారంభం

60.  యాత్ర క్రమం లో ఈ దిగువన ప్రస్తావించిన  ద్వైపాక్షిక ప‌త్రాల మీద సంత‌కాలు అయ్యాయి. వాటి ని పరస్పరం ఇచ్చి, పుచ్చుకోవడం జరిగింది:
 
1. విప‌త్తు నిర్వ‌హ‌ణ, పునర్ నిర్మాణం రంగం లో స‌హ‌కారం పై ఎమ్ఒయు.

2.  బాంగ్లాదేశ్ జాతీయ కేడెట్ కోర్ (బిఎన్ సిసి), భార‌త‌దేశ జాతీయ కేడెట్ కోర్ ( ఐఎన్ సిసి) ల మ‌ధ్య‌ ఎమ్ఒయు.

3. బాంగ్లాదేశ్‌, భారతదేశం ల మ‌ధ్య‌ వాణిజ్య ప‌ర‌మైన న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు సంబంధించిన విధి విధానాల ఏర్పాటుపై ఎమ్ఒయు.

4.  ఐసిటి సామ‌గ్రి, పుస్త‌కాలు, ఇత‌ర వ‌స్తువుల స‌ర‌ఫ‌రా కు, బాంగ్లాదేశ్- భార‌త్ డిజిట‌ల్ స‌ర్వీస్ ఎండ్ ఎంప్లాయ్ మెంట్ ట్రేనింగ్ (బిడిఎస్ ఇటి) కేంద్రం కోసం త్రైపాక్షిక ఎమ్ఒయు.  

5. రాజ్ శాహీ కాలేజీ, ప‌రిస‌ర‌ ప్రాంతాల లో క్రీడా స‌దుపాయాల ఏర్పాటు కు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందంపై ఎమ్ఒయు.


61.  ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం లో ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మం లో ఇరువురు ప్ర‌ధానులు ఈ కింద తెలిపిన ప్ర‌క‌టనలు/ ఆవిష్కరణలు/ ప్రారంభాలు చేశారు:  

1.  ద్వైపాక్షిక దౌత్య సంబంధాలు నెల‌కొని యాభై సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భం లో భారతదేశం- బాంగ్లాదేశ్ మైత్రి త‌పాలా బిళ్ల లను విడుద‌ల‌ చేయడమైంది.
 
2.  బాంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటం చేసి అమ‌రులైన భార‌త‌దేశ సాయుధ బలగాలకు చెందిన అమరవీరుల గౌరవార్థం ఆశూగంజ్, బ్రాహ్మణవారియా లో ఒక స్మార‌కాన్ని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడమైంది.

3.  ఐదు ప్యాకేజీలతో కూడిన (అమీన్ బాజార్- కాలియాకోర్, రూప్ పుర్ -ఢాకా, రూప్ పుర్- గోపాల్ గంజ్, రూప్ పుర్- ధామ్ రాయీ, రూప్ పుర్-బోగ్ రా) రూప్ పుర్ ప‌వ‌ర్ ఇవేక్యుయేష‌న్ ప్రాజెక్టు కు సంబంధించి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం నిర్వహించడమైంది.

4.  మూడు స‌రిహ‌ద్దు హాట్ ల ప్రారంభోత్స‌వం- అవి నలీకాటా (భారతదేశం), సాయ్ దాబాద్ (బాంగ్లాదేశ్), రిన్ గకు (భారతదేశం), బాగాన్ బారీ (బాంగ్లాదేశ్) మరియు భోలాగుంజ్ (బాంగ్లాదేశ్).

5.  కుథీబారీ లో ర‌బీంద్ర భ‌వ‌న్ ప్రారంభోత్స‌వం.

6.  ‘మితాలీ ఎక్స్ ప్రెస్’ ప్రారంభోత్సవం- చిల్హాటీ, హల్దీబాడీ రైల్ లింకు మాధ్యమం ద్వారా ఢాకా- న్యూ జల్ పాయీగుడీ-ఢాకా మార్గం లో ప్ర‌యాణికుల‌ కు ఉద్దేశించిన రైలు సేవ ఇది.
7.  ముజీబ్ న‌గ‌ర్‌, నాదియా ల మ‌ధ్య‌ చరిత్రాత్మ‌క ర‌హ‌దారి ని కలపడం తో పాటు దీని కి ‘శాదినోతా శెరోక్’ అనే పేరు ను పెట్టాలనే ప్ర‌క‌ట‌న‌.


62.  బాంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భం లో ప్ర‌ధాని శేఖ్ హసీనా గారు చాటిన ఆత్మీయత, బాంగ్లాదేశ్ లో ఉన్నప్పుడు ఆమె తో పాటు ఆమె ప్రతినిధివర్గం సభ్యులు అంద‌జేసిన అద్భుతమైన ఆతిథ్యానికి గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.



 

***



(Release ID: 1708700) Visitor Counter : 769