ప్రధాన మంత్రి కార్యాలయం

మేరీటైమ్ ఇండియా సమిట్- 2021 ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

Posted On: 02 MAR 2021 1:10PM by PIB Hyderabad

మంత్రిమండలి లో నా సహచరులు శ్రీయుతులు మన్‌సుఖ్‌ మాండవీయ,  ధర్మేంద్ర ప్రధాన్‌, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, విశిష్ట అతిథులు,

ప్రియ మిత్రులారా,

మేరీటైమ్ ఇండియా సమిట్- 2021 కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ సమ్మేళనం ఈ రంగం లోని అనేక మంది భాగస్వాముల ను ఒక చోటు కు చేర్చింది.  ఈ నేపథ్యం లో సాగర ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇచ్చే దిశ లో మనం సమష్టి కృషి తో గొప్ప సాఫల్యాన్ని సాధించగలం అని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

ఈ రంగం లో భారతదేశం సహజంగానే అగ్రగామి.  మా దేశానికి సుసంపన్న సముద్ర చరిత్ర ఉంది.  మా తీరాలలో అనేక నాగరకత లు పుష్పిపంచి ఫలించాయి. వేల సంవత్సరాలు గా మా ఓడరేవు లు ప్రముఖ వాణిజ్య కేంద్రాలు గా ఉంటూ వస్తున్నాయి.  మా తీరాలు మమ్ములను ప్రపంచం తో జోడించాయి.

మిత్రులారా,

మా ప్రగతి పయనం లో భాగస్వామ్యం కోసం భారతదేశానికి రావలసింది గా ప్రపంచ దేశాలను ఈ మేరీటైమ్ ఇండియా సమిట్ మాధ్యమం ద్వారా ఆహ్వానిస్తున్నాను.  సముద్ర రంగం లో ఎదిగే దిశ లో భారతదేశం ఎంతో శ్రద్ధ తో ముందంజవేస్తోంది.  ఆ క్రమం లో అంతర్జాతీయ నీలి ఆర్థిక వ్యవస్థ గా ఆవిర్భావానికి ఉరకలు వేస్తోంది.  మేం ప్రధానం గా దృష్టి సారించిన అంశాలలో ప్రస్తుత మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ మొట్టమొదటిది.  ఇందులో భాగం గా భవిష్యత్తు తరం మౌలిక వసతులను సమకూర్చడానికి, దాని ద్వారా సంస్కరణల కార్యక్రమానికి ఉత్తేజం కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాం.  ఈ చర్యల తో  మా స్వయం సమృద్ధియుత భారతదేశం స్వప్నాన్ని మేం మరింత గా బలోపేతం చేసుకోగలుగుతాం.

మిత్రులారా,

నేను వర్తమాన మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ ను గురించి ప్రస్తావిస్తున్నప్పుడు- నేను సామర్థ్యం మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తాను.  విడివిడి గా కాకుండా కలివిడి గా ఈ రంగం మొత్తం మీద దృష్టి సారించడమే మా విధానం.  దీని ఫలితాలు కూడా ప్రస్ఫుటం అవుతున్నాయి. మా ప్రధాన రేవు ల వార్షిక సామర్థ్యం 2014వ సంవత్సరం లో సుమారు 870 మిలియన్‌ టన్నులు ఉంటే ప్రస్తుత సంవత్సరం లో అది దాదాపు 1550 మిలియన్‌ టన్నులకు పెరిగింది.  ఈ ఉత్పాదకత లబ్ధి మా రేవుల కు తోడ్పడటం మాత్రమే కాక మా ఉత్పత్తులకు స్పర్ధాత్మకత ను సంతరించి మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని అందించింది.  ఇవాళ భారతదేశం రేవు ల సామర్థ్యం- నేరు గా రేవులకు చేరవేత, నేరు గా ప్రవేశం, సమాచార ప్రవాహ సౌలభ్యం దిశ గా ఉన్నతీకరించినటువంటి రేవు ల సమాచార వ్యవస్థలతో మరింత పరిపుష్టం అయింది.  మా రేవుల లోకి సరకుల రాక పోకల లో వేచి ఉండవలసిన కాలం తగ్గింది.  రేవుల లో నిలవ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రేవుల తీర భూముల వైపు పరిశ్రమలను ఆకర్షించగల తక్షణ వినియోగ మౌలిక వసతుల కల్పన పై మేం భారీగా పెట్టుబడులను కూడా పెడుతున్నాం.  సుస్థిర పూడికతీత, దేశీయ నౌకా పునరుపయోగ పరిశ్రమల ద్వారా ‘వ్యర్థం నుంచి సంపద’ సృష్టికీ మా రేవు లు తోడ్పడుతాయి.

మిత్రులారా,

సామర్థ్యాన్ని పెంచడం సహా సంధానాన్ని ఇనుమడింపజేసే దిశ లో ఎంతో కృషి సాగుతోంది.  ఆ మేరకు తీరప్రాంత ఆర్థిక మండళ్లు, రేవు ఆధారిత అత్యాధునిక నగరాలు, పారిశ్రామిక పార్కుల ను మేము రేవులతో మమేకం చేస్తున్నాం.  దీని వల్ల పారిశ్రామిక పెట్టుడులకు ఊతం లభించడమే కాకుండా రేవుల వద్ద అంతర్జాతీయ తయారీ కార్యకలాపాలకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది.

మిత్రులారా,

సరికొత్త మౌలిక సదుపాయాల కల్పన కు సంబంధించి వధావన్‌, పారాదీప్‌, కాండ్ లా లోని దీన్‌ దయాళ్‌ రేవు వంటి భారీ రేవుల లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. అలాగే మునుపెన్నడూ లేని రీతి లో జలమార్గాల అభివృద్ధి కి మా ప్రభుత్వం కృషి చేస్తోంది.  సరుకు ల రవాణా లో దేశీయ జలమార్గాలు చౌకైనవే కాకుండా పర్యావరణ హితకరమైనటువంటివి.  ఆ మేరకు 2030 వ సంత్సరానికల్లా  దేశం లో 23 జలమార్గాలను అందుబాటు లోకి తీసుకు రావాలని మేం సంకల్పించాం.  మౌలిక సదుపాయాల పెంపు, ప్రయాణానుకూల మార్గాభివృద్ధి, నౌకా గమన ఉపకరణాలు, నదుల సమాచార వ్యవస్థ సదుపాయ కల్పన తదితరాల ద్వారా మా సంకల్పాన్ని సాకారం చేయనున్నాం.  దీంతోపాటు బాంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మ్యాంమార్‌ లతో ప్రాంతీయ సంధానానికి ఉద్దేశించిన తూర్పు జలమార్గ అనుసంధానం- రవాణా గ్రిడ్‌ వల్ల ప్రాంతీయ వాణిజ్యం, సహకారం ప్రభావాన్వితం గా బలోపేతం అవుతాయి.

మిత్రులారా,

జీవన సౌలభ్యాన్ని పెంచడం లో సముద్ర మౌలిక సదుపాయాలు గొప్ప ఉపకరణాలు కాగలవు. “రో-రో, రో-పాక్స్‌” వంటి ప్రాజెక్టు లు నదులను ఉపయోగించుకోవాలన్న మా దార్శనికత లో గణనీయ పాత్ర ను పోషించగలుగుతాయి. సముద్ర- విమాన కార్యకలాపాలకు వీలు కల్పించే జల-విమానాశ్రయాలను 16 ప్రదేశాలలో అభివృద్ధిపరుస్తున్నాం. అంతేకాకుండా 5 జాతీయ జలమార్గాలలో రివర్ క్రూజ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను, జెటీల ను ఏర్పాటు చేయడం జరుగుతోంది.

మిత్రులారా,

ఎంపిక చేసిన రేవుల లో జాతీయ, అంతర్జాతీయ ఓడ ప్రయాణ కూడళ్లను కూడా అభివృద్ధి చేయాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ మేరకు 2023వ సంవత్సరానికల్లా మౌలిక సదుపాయాల పెంపుదల ను, నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  భారతదేశం లోని విశాలమైన తీర ప్రాంతం లో 189 వరకూ లైట్‌హౌసులు ఉన్నాయి.  వీటిలో 78 లైట్‌హౌసుల పరిసర ప్రదేశం లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేం రూపొందించాం.  ప్రస్తుత లైట్‌హౌసు ల అభివృద్ధి, ఆ పరిసర ప్రాంతాలను విశిష్ట సముద్ర పర్యాటక చిహ్నాలుగా తీర్చిదిద్దడం కూడా ఈ కీలక లక్ష్యం లో భాగమే.  అలాగే గుజరాత్‌, గోవా, మహారాష్ట్ర, కేరళ వంటి కొన్ని కీలక రాష్ట్రాలతోపాటు కొచ్చి, ముంబై ల వంటి ప్రధాన నగరాల్లో పట్టణ జలమార్గ వ్యవస్థల ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

మిత్రులారా,

ఇతర రంగాల తరహా లోనే సముద్ర రంగంలో కూడా సంబంధిత అభివృద్ధి కార్యకలాపాల విషయం లో ఒంటెద్దు పనితీరు కు తావు లేకుండా జాగ్రత్త వహిస్తున్నాం.  ఆ మేరకు ఇటీవలే అన్నిటినీ ఏకం చేసి నౌకాయాన శాఖ ను ‘నౌకాయానం-రేవులు-జలమార్గాల’ శాఖ గా మార్చాం.  ఇక ‘సముద్ర యానం-నౌకా గమన నిర్దేశం, వాణిజ్య నావికా దళానికి విద్య-శిక్షణ, నౌకా నిర్మాణం-మరమ్మతు పరిశ్రమ, నౌకల విచ్ఛిన్నం, చేపల వేట ఓడ ల పరిశ్రమ, తేలే ఉపకరణాల పరిశ్రమ ల ముందంజ’కు ఈ శాఖ కృషి చేస్తుంది.

మిత్రులారా,

ఇందులో భాగం గా పెట్టుబడుల కు వీలు ఉన్న దాదాపు 400 ప్రాజెక్టు ల జాబితాను నౌకాయానం-రేవులు-జలమార్గాల శాఖ సిద్ధం చేసింది.  ఈ ప్రాజెక్టుల లో సామర్థ్యం 31 బిలియన్‌ డాలర్లు లేదా 2.25 లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులకు అవకాశాలున్నాయి.  మా సముద్ర రంగ సర్వతోముఖాభివృద్ధి లో మా చిత్తశుద్ధి ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

మేరీటైమ్ ఇండియా విజన్ -2030 ని ప్రారంభించడం జరిగింది.  ప్రభుత్వ ప్రాథమ్యాలను ఇది వివరిస్తుంది.  ఆ మేరకు సాగర్‌-మంథన్‌: మర్కెంటైల్ మరీన్ డమేన్ అవేర్ నెస్ సెంటర్ ను కూడా ఇవాళ ప్రారంభించడమైంది.  ఇది సముద్ర భద్రత, గాలింపు- రక్షణ సామర్థ్యాలు, సముద్ర పర్యావరణ రక్షణ-భద్రతలకు సంబంధించిన సమాచార వ్యవస్థ.  ఇక రేవు ల ఆధారిత ప్రగతి ని ప్రోత్సహించే ‘సాగరమాల’ ప్రాజెక్టు ను ప్రభుత్వం 2016వ సంవత్సరం లో ప్రకటించింది.  ఈ ప్రాజెక్టు లో భాగం గా 2015-2035 మధ్య కాలం లో అమలు కు వీలు గా 82 బిలియన్‌ డాలర్లు లేదా 6 లక్షల కోట్ల రూపాయల వ్యయం తో చేపట్టగల 574కు పైగా ప్రాజెక్టులను గుర్తించడమైంది.
మిత్రులారా,

దేశీయ నౌకా నిర్మాణం-మరమ్మతు బజారు పైనా భారత ప్రభుత్వం దృష్టి సారించింది.  స్వదేశీ నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ శిప్ యార్డు కోసం నౌకా నిర్మాణ ఆర్థిక సహాయ విధానాన్ని మేం ఆమోదించాం.  రెండు రేవు ల తీరం లో 2022వ సంవత్సరానికల్లా నౌక ల మరమ్మతు సముదాయాలను రూపొందిస్తాం.  ‘వ్యర్థం నుంచి సంపద’ను సృష్టించడానికి దేశీయ నౌకా పునరుపయోగ పరిశ్రమ ను కూడా ప్రోత్సహిస్తాం. ఇందుకోసం ‘నౌకా పునరుపయోగ చట్టం-2019’ ని రూపొందించడం సహా హాంకాంగ్‌ అంతర్జాతీయ సదస్సు తీర్మానాలను కూడా భారతదేశం అంగీకరించింది.

మిత్రులారా,

మా ఉత్తమ ఆచరణ విధానాలను ప్రపంచంతో పంచుకోవాలని భావిస్తున్నాం.  అందులో భాగం గా అంతర్జాతీయ ఉత్తమాచరణ ల అనుసరణకు కూడా మేం సిద్ధం. ‘బిమ్స్ టెక్‌, ఐఒఆర్‌’ దేశాల తో వాణిజ్యం, ఆర్థిక అనుసంధానం పై మా శ్రద్ధ ను కొనసాగిస్తాం.  అంతేకాకుండా 2026వ సంవత్సరానికల్లా మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను పెంచడంతో పాటు పరస్పర ఒప్పందాల ప్రక్రియ ను పూర్తి చేయాలని భారతదేశం యోచిస్తోంది.  అలాగే దీవులలో మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థ సమగ్ర అభివృద్ధి కి భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.  సముద్ర రంగం లో పునరుపయోగ ఇంధన వనరుల వినియోగం పెంపుపైనా మేం దృష్టి సారించాం.  ఆ మేరకు దేశవ్యాప్తం గా ప్రధాన రేవుల లో సౌర విద్యుత్తు, పవనాధారిత విద్యుత్తు ఉత్పాదన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం.  భారతదేశం రేవుల లో వాడే మొత్తం విద్యుత్తు లో 2030వ సంవత్సరానికల్లా పునరుపయోగ ఇంధనం వాటా ను 60 శాతం కన్నా అధిక స్థాయి కి పెంచాలని నిర్ణయించాం.

మిత్రులారా,

భారత తీర ప్రాంతం మీకోసం ఎదురుచూస్తోంది... శ్రమజీవులైన భారతీయులు మీకోసం వేచి ఉన్నారు... రండి- మా రేవులలో, ప్రజలపైనా పెట్టుబడులు పెట్టండి.  భారతదేశాన్ని మీ ప్రధాన వాణిజ్య గమ్యం గా చేసుకోండి... భారతదేశం రేవులను మీ వ్యాపార, వాణిజ్యాలకు కేంద్రాలు గా మలచుకోండి.  ఈ శిఖర సమ్మేళనానికి ఇవే నా శుభాకాంక్షలు.  విస్తృతమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి చర్చలు జరగాలని కోరుకొంటూ, ఇవే శుభకామనలు.

ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.



 

***



(Release ID: 1701969) Visitor Counter : 251