ప్రధాన మంత్రి కార్యాలయం

అసోంలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

Posted On: 18 FEB 2021 3:23PM by PIB Hyderabad

నమస్కార్ అసోం!

శ్రీ శంకరభగవానుడి కర్మస్థలం, సాధుసంతుల భూమి అయిన మజూలీకి నా ప్రణామాలు. కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీజీ, శ్రీ రవిశంకర్ ప్రసాద్‌జీ, శ్రీ మన్సుఖ్ మాండవీయజీ, అసోం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ జీ, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోనరేడ్ సంగ్మాజీ, అసోం ఆర్థిక మంత్రి డాక్టర్ హిమంత్ బిస్వ శర్మ జీ.. అసోం సోదర, సోదరీమణులారా, పరిస్థితిని చూస్తుంటే అలి-ఆయే-లింగాంగ్ ఉత్సవ వేడుక రెండోరోజు కూడా కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది. నిన్న రైతులు, పాడి, వ్యవసాయ సంబంధిత అన్నదాతల ఉత్సవం జరిగితే.. ఇవాళ మజూలీతోపాటు అసోం, యావత్ ఈశాన్య భారతం అభివృద్ధికి సంబంధించిన మహోత్సవం. తాకామే లింగాంగ్ ఆఛేంగే ఛెలిడ్డుంగ్!

సోదర, సోదరీమణులారా,

భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా గారు.. ‘మహాబాహు బ్రహ్మపుత్ర మహామిలనర్ తీర్థ్ (అ) కత్ (అ), జుగ్ ధరీ ఆహిఛే ప్రకాఖీ హమన్యవర్ అర్థ్ (అ)’ అని పేర్కొన్నారు. అంటే బ్రహ్మపుత్ర నది విస్తారం.. బంధుత్వం, సౌభాతృత్వం, కలసిమెలి ఉండాలనే స్ఫూర్తిని కలిగించే తీర్థమని అర్థం. ఏళ్లుగా ఈ పవిత్రనది.. పరస్పర సంయమనం, అనుసంధానతకు పర్యాపదంగా నిలుస్తోంది. అయితే.. బ్రహ్మపుత్ర నదిపై అనుసంధానతను పెంచేందుకు గతంలో చేపట్టాల్సిన పనులేవీ సరైన సమయంలో జరగలేదు. దీని కారణంగానే అసోంతోపాటు ఈశాన్యరాష్ట్రాల్లో అనుంసధానత పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది. మహాభావు బ్రహ్మపుత్ర ఆశీర్వాదంతో ఈ దిశగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా కేంద్ర, అసోం ప్రభుత్వాల డబుల్ ఇంజన్ ప్రభుత్వం.. ఈ ప్రాంత భౌగోళిక, సాంస్కృతిక రంగాల్లోని అడ్డంకులను తొలగించేందుకు పనిచేస్తోంది. మేం బ్రహ్మపుత్ర శాశ్వత భావనను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు, అవసరాలను సమన్వయం చేస్తూ సాంస్కృతిక అనుసంధానతకు బాటలు వేస్తున్నాము. అసోంతోపాటు యావత్ ఈశాన్యభారతాన్ని భౌతికంగా, సాంస్కృతిక సమగ్రత పరంగా సశక్తీకరణ చేస్తున్నాము.

మిత్రులారా,
నేటి ఈ రోజు అసోంతోపాటు యావత్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఓ దీర్ఘదృష్టితో చేస్తున్న అభివృద్ధికి బాటలు వేయబోతోంది. డాక్టర్ భూపేన్ హజారికా బ్రిడ్జ్ అయినా.. బోగీబిల్ బ్రిడ్జ్ అయినా.. సరాయ్ ఘాట్ బ్రిడ్జ్ అయినా..  ఇలాంటి ఎన్నో బ్రిడ్జిలు అసోం జీవనాన్ని సౌలభ్యం చేస్తున్నాయి. ఇవి దేశ రక్షణను బలోపేతం చేయడంతోపాటు మన వీర సైనికులకు ఎంతో సౌకర్యవంతంగా మారాయి. అసోంతోపాటు ఈశాన్యరాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే వివిధ కార్యక్రమాలను మరోదశ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ్టినుంచి మరో రెండు పెద్ద బ్రిడ్జ్ ల పనులు ప్రారంభించుకోబోతున్నాం. కొన్నేళ్ల క్రితం నేను మౌజోలీ ద్వీపానికి వెళ్లినపుడు అక్కడి సమస్యలను దగ్గర్నుంచి చూసే అవకాశం లభించింది.  ఈ సమస్యలను పరిష్కరించేందుకు శ్రీ సర్బానంద్ సోనోవాల్ ప్రభుత్వం పూర్తి నిష్ఠతో పనిచేయడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. అసోంలో తొలి హెలిపోర్టు మజూలీలో ఏర్పాటైంది కూడా.

సోదర, సోదరీమణులారా,

ఇప్పుడు మజూలీ వాసుల రోడ్డు పనులు కూడా వేగంగా పూర్తవుతున్నాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న పనుల పరిష్కారం ప్రారంభం కాబోతోంది. కాలీబాటీ ఘాట్ నుంచి జోహరాట్ ఘాట్ ను అనుసంధానించే 8 కిలోమీటర్ల ఈ బ్రిడ్జ్ మజూలీలోని వేల కుటుంబాల జీవనరేఖగా మారనుంది. ఈ బ్రిడ్జ్ మీకోసం సరికొత్త అవకాశాలను, సౌకర్యాలను అందించనుంది. ఇదేవిధంగా ధుబరీ నుంచి మేఘాలయాలోని ఫుల్ బారీ వరకు 19కిలోమీటర్ల మేర పొడవైన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే.. అది బరాక్ ఘాటీకి అనుసంధానతను పెంచుతుంది. అంతే కాదు ఈ బ్రిడ్జ్ ద్వారా మేఘాలయా, మణిపూర్, మిజోరం, త్రిపురలకు అసోం నుంచి దూరం భారీగా తగ్గుతుంది. మీరే ఆలోచించండి.. ఇప్పుడు మేఘాలయా, అసోం మధ్య రోడ్డు మార్గం ద్వారా దూరం దాదాపు 250 కిలోమీటర్లుగా ఉంది. భవిష్యత్తులో ఇది కేవలం 19-20 కిలోమీటర్లకే పరిమితం అవుతుంది. ఈ బ్రిడ్జ్ పొరుగుదేశాలతో అంతర్జాతీయ సంబంధాలకోసం కీలకంగా మారనుంది.

సోదర, సోదరీమణులారా,

బ్రహ్మపుత్ర, బరాక్ సహా ఎన్నో నదులుండటం అసోం ప్రజలకు ఓ వరం. ఆ నదులను మరింత సమృద్ధిగా మార్చుకునేందుకు ఇవాళ మహాబాహు బ్రహ్మపుత్ర ప్రోగ్రామ్‌ను ప్రారంభించాం. ఈ కార్యక్రమం బ్రహ్మపుత్ర నీరు చేరే ప్రతి ప్రాంతానికి జల అనుసంధానత, పోర్టు ఆధారిత అనుసంధానిత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. నేటి ఈ కార్యక్రమం ప్రారంభంలో నీమాతీ-మజూలీ, నార్త్-సౌత్ గువాహతి, ధుబరీ-తసింగీమారీ ప్రాంతల మధ్య 3 రో-పేక్స్ సేవలను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రో-పేక్స్‌ తో అనుసంధానమైన మొదటి రాష్ట్రంగా అసోం నిలిచిపోనుంది. దీంతోపాటుగా జోగిఘోపాలో అంతర్గత జల రవాణా టర్మినల్ తోపాటు నాలుగుచోట్ల బ్రహ్మపుత్ర నదిపై పర్యాటక జెట్టీలు నిర్మించే పనికూడా ప్రారంభమైంది. మజూలీతోపాటు అసోంకు, ఈశాన్య భారతానికి చక్కటి అనుసంధానతకు బీజం వేసే ఈ బ్రిడ్జ్ ద్వారా ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయి. 2016లో మీరు వేసిన ఓటు ఇవాళ ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. మీ ఓటు శక్తే అసోంను మరింత ముందుకు తీసుకెళ్లనుంది.

సోదర, సోదరీమణులారా,

వలసపాలకుల సమయంలో అసోం దేశంలోనే సుసంపన్నమైన రాజ్యంగా.. ఎక్కువ ఆదాయాన్నిచ్చే రాజ్యంగా ఉండేది. చిట్టగాంగ్, కోల్‌కతా పోర్టుల వరకు తేయాకు, పెట్రోలియం ఉత్పత్తులు, బ్రహ్మపుత్ర-పద్మ-మేఘన నదుల ద్వారా అక్కడినుంచి రైలు లైన్ ద్వారా చేరవేసేవారు. ఈ అనుసంధానతే అసోంను సుసంపన్న రాజ్యంగా ఉండేందుకు కారణం. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ మౌలికవసతులను మరింత బలో పేతం చేసుకోవాల్సిన అవసరముంది. కానీ గత పాలకులు వాటిని మరింత మరుగున పడేలా చేశారు. జలమార్గాలపై దృష్టిపెట్టని కారణంగా అవి కనుమరుగైపోయాయి. ఈ ప్రాంతంలో సరైన పాలన లేకపోవడం, అశాంతి నెలకొనడంతోపాటు అభివృద్ధి కూడా చేయలేదు. చరిత్రలో చేసిన ఈ తప్పులను సరిదిద్దేందుకు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు సంకల్పించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలను విస్తారంగా ముందుకు తీసుకెళ్తున్నాం. వాటిని వేగంగా పూర్తిచేసే పనిలో ఉన్నాం. ఇప్పుడు అసోం అభివృద్ధి ప్రాథమిక దశలో ఉంది.. దీన్ని అహోరాత్రులు శ్రమించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది.

సోదర, సోదరీమణులారా,

గత ఐదేళ్లుగా అసోంలో వివిధ రకాలుగా అనుసంధానతను పెంచేందుకు వరుసగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసోంను, ఈశాన్య రాష్ట్రాలను తూర్పు ఆసియా దేశాలతో అనుసంధానం చేసి మన సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలకు కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే అంతర్గత జల రవాణాను ఓ బలమైన శక్తిగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో బంగ్లాదేశ్‌తో జల రవాణా అనుసంధానత పెంచేందుకు ఓ ఒప్పందం చేసుకున్నాం. బ్రహ్మపుత్ర, బరాక్ నదులతో అనుసంధానతకోసం హుగ్లీ నదిలో ఇండో-బంగ్లాదేశ్ ప్రొటోకాల్ రూట్ పై పనులు జరుగుతున్నాయి. దీని ద్వారా అసోంతోపాటు మేఘాలయా, మిజోరం, మణిపూర్, త్రిపురలకు హల్దియా, కోల్‌కతా, గువాహటి, జోగీఘోపాలతోపాటు మరిన్ని కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఈశాన్యభారతాన్ని భారతదేశంతో కలిపేందుకు ఏ విధంగా అయితే పనులు జరుగుతున్నాయో.. ఆ నిర్భరతను ఈ మార్గం మరింత ముందుకు తీసుకెళ్తుంది.

సోదర, సోదరీమణులరా,

జోగీఘోపాలోని ఐడబ్ల్యూటీ టర్మినల్ ఈ మార్గాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దీంతోపాటు అసోంను, కోల్‌కతాతో, హల్దియా పోర్టుతో జలమార్గం ద్వారా అనుసంధానం చేస్తుంది. ఈ టర్మినల్ ద్వారా భూటాన్, బంగ్లాదేశ్ దేశాల కార్గో.. జోగీఘోపా మల్టీ మాడల్ లాజిస్టిక్స్ పార్క్‌ కార్గో, బ్రహ్మపుత్ర నదిపై వివిధ ప్రాంతాలకు వెళ్లే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

మిత్రులారా,

ఒకవేళ సామాన్య ప్రజలకు సౌకర్యాన్ని అందించడం ప్రాథమికత అయితే.. అభివృద్ధి చేయాలన్న లక్ష్యం నిశ్చలం అయితే.. కొత్త మార్గాలు ఏర్పాటవడం పెద్ద కష్టమేమీ కాదు. మజూలీ, నేమాతీ మధ్య రో-పేక్స్ సేవ ఇలాంటిదే. దీని ద్వారా రోడ్డుపై 4.25 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు ఇకపై రో-పేక్స్ ద్వారా కేవలం 12 కిలోమీటర్ల ప్రయాణంలో మీతోపాటు సైకిల్, స్కూటర్, బైక్, కార్లను కూడా పడవలో తీసుకెళ్లవచ్చు. ఈ మార్గంలో నడుస్తున్న పెద్ద పడవల ద్వారా ఒకేసారి 1600 మంది ప్రయాణీకులును డజన్ల సంఖ్యలో వాహనాలను తీసుకెళ్లవచ్చు. ఈ సౌకర్యం ఇక గువాహటి ప్రజలకు కూడా లభించనుంది. ఇకపై ఉత్తర-దక్షిణ గువాహటి మధ్య దూరం దాదాపుగా 40కిలోమీటర్లు తగ్గి కేవలం 3 కిలోమీటర్లే ఉండనుంది. ఇదే విధంగా ధుబరీ-హత్‌సింగీమారీ మధ్య దూరం 225కిలోమీటర్లు తగ్గి కేవలం 30 కిలోమీటర్లుగా ఉండనుంది.

మిత్రులారా,

మా ప్రభుత్వం కేవలం జలమార్గాల రూపకల్పనపైనే పనిచేయడం లేదు. వీటిని వినియోగించే వారికి ఓ సమాచారాన్ని అందిస్తాను. ఇవాళ ఈ-పోర్టల్ ప్రారంభించాం. కార్-డీ పోర్టల్ ద్వారా నేషనల్ వాటర్‌వే ఉన్న అన్ని మార్గాల్లో కార్గో, క్రూయిజ్‌తో అనుసంధానమైన ట్రాఫిక్ డేటాను రియల్ టైంలో సమీకరించేందుకు దోహదపడుతుంది. ఇదే విధంగా జల పోర్టల్, నావిగేషన్‌తోపాటుగా జలరవాణాకు సంబంధించిన మౌలికవసతులకు సంబంధించిన వివరాలను కూడా అందిస్తుంది. జీఐఎస్ ఆధారిత భారత్ మ్యాప్ పోర్టల్.. పర్యాటకులతోపాటు వ్యాపార, వాణిజ్య నిర్వాహకులకు కూడా ఎంతగానో ఉపయుక్తం అవుతుంది. ఆత్మనిర్భర భారత నిర్మాణంలో భాగంగా దేశాభివృద్ధి కోసం వివిధ రవాణా మార్గాల అనుసంధానతకు బీజం పడుతోంది. దీంట్లో అసోం ఓ చక్కటి ఉదాహరణగా మారబోతోంది.

సోదర, సోదరీమణులారా,

అసోం, ఈశాన్య భారతం యొక్క జల-రైల్వే-హైవో అనుసంధానతతోపాటు ఇంటర్నెట్ అనుసంధానత కూడా చాలా అవసరం. ఈ దిశగానూ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు వేలకోట్ల రూపాయలను వెచ్చించడం ద్వారా.. గువాహటిలో ఈశాన్య భారతంలో తొలి, భారతంలోని ఆరో డేటా సెంటర్‌ ఏర్పాటుకానుంది. ఈ సెంటర్ ఈశాన్యభారతంలోని ఎనిమిది రాష్ట్రాలకు డేటా సెంటర్ హబ్ రూపంలో పనిచేస్తుంది. ఈ సెంటర్ ద్వారా అసోంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ-గవర్నెన్స్, ఐటీ సేవల ఆధారిత పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీల స్థాపనకు మార్గం సుగమం అవుతుంది. గత కొన్నేళ్లుగా.. ఈశాన్యభారతంలోని యువకులకోసం బీపీఓ ఎకోసిస్టమ్ రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్రాలకు ఈ సెంటర్ కొత్తశక్తిని అందించనుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కేంద్రం.. డిజిటల్ ఇండియా విజన్‌తో ఈశాన్య రాష్ట్రాలను బలోపేతం చేయనుంది.

సోదర, సోదరీమణులారా,

భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా.. ‘కర్మయీ ఆమార్ ధర్మ్, ఆమీ నతున్ జుగార్ మానబ్, ఆనిమ్ నతున్ స్వర్గ్, అబహోలిత్ జనతార్ బాబే ధరాత్ పాతిమ్ స్వర్గ్’ అని చెప్పారు. అంటే మనం చేసే పనే మన ధర్మం. మనం కొత్త శకంలోని సరికొత్త వ్యక్తులం. అభివృద్ధికి దూరంగా ఉన్న వ్యక్తులకోసం సరికొత్త స్వర్గాన్ని నిర్మిస్తాం. భూతల స్వర్గాన్ని నిర్మిస్తాం అని అర్థం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతోనే మేం ఇవాళ అసోం, ఈశాన్య రాష్ట్రాలతోపాటు యావత్భారతంలో పనిచేస్తున్నాం. బ్రహ్మపుత్ర ఒడ్డున విరాజిల్లిన అసామియా సంస్కృతిని, ఆధ్మాత్మికత, వివిధ తెగల సమృద్ధ సంప్రదాయాలు, జీవవైవిధ్యం ఇవన్నీ మనకు వారసత్వంగా అందినవే. భగవాన్ శంకరుడు కూడా మజూలీ ద్వీపంలో మన సంస్కృతిని మరింత బలోపేతం చేసేందుకు విచ్చేశారు. ఆ తర్వాత మజూలీ ద్వీపం.. అసోం సంస్కృతికి ఆత్మగా మారింది. మీరందరూ నాటి సాధు,సంతుల సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న తీరు ప్రశంసనీయం. ముఖాశిల్పం, రాస్ ఉత్సవానికి సంబంధించి దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇది చాలా మంచి పరిణామం. ఈ శక్తి, ఈ ఆకర్షణ కేవలం మీకే సొంతం. దీన్ని సంరక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

సోదర, సోదరీమణులారా,

మజూలీ, అసోంలోని ఈ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రాకృతిక సామర్థ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న.. ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్‌తోపాటు వారి మొత్తం బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. వివిధ ప్రాంతాలను, ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నవారి నుంచి విడిపించే కార్యక్రమమైనా, సాంస్కృతిక విశ్వవిద్యాలయం స్థాపనైనా, మజూలీకి ‘జీవవైవిధ్య వారసత్వ స్థలం’ హోదా కల్పించే విషయమైనా, తేజ్‌పూర్-మజూలీ-శివసాగర్ హెరిటేజ్ సర్క్యూట్ అయినా, నమామి బ్రహ్మపుత్ర, నమామి బరాక్ వంటి ఉత్సవాల నిర్వహణ అయినా.. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నందుకు వారు అభినందనలకు పాత్రులు. వీటి ద్వారానే అసోం గుర్తింపు మరింతగా పెరుగుతోంది.

మిత్రులారా,

ఇవాళ వివిధ రకాల అనుసంధానత ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన ద్వారా అసోం పర్యాటకానికి కొత్తదార్లు తెరుచుకోనున్నాయి. క్రూయిజ్ టూరిజం విషయంలో అసోం దేశంలోనే ఓ ప్రత్యేకమైన స్థానంగా నిలిచిపోనుంది. నేమాతి, విశ్వనాథ్ ఘాట్, గువాహటి, జోగిఘోపేల్లో పర్యాటకుల జెట్టీలు ఏర్పాటుచేయడం ద్వారా పర్యాటక రంగంలో సరికొత్త అవకాశాలు కలుగుతాయి. క్రూయిజ్ ల్లో తిరిగేందుకు దేశ, విదేశీ పర్యాటకులు వచ్చినపుడు.. అసోం యువకుల ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. పర్యాటక రంగంలో.. తక్కువ చదువుకున్న వాళ్లు కూడా.. నైపుణ్యం ఉన్న రంగాల్లోని వారిలాగా ఎక్కువ మొత్తంలో సంపాదించేందుకు వీలుంటుంది. ఇదే కదా అభివృద్ధి అంటే. దీని ద్వారా పేదలు, సామాన్య ప్రజలు కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలనే మరింతగా ముందుకుతీసుకెళ్లాల్సిన అవసరముంది. వీటిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అసోంను, ఈశాన్యభారతాన్ని ఆత్మనిర్భరతకు బలమైన స్తంభంగా మార్చేందుకు మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరముంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా మరోసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదములు.

***



(Release ID: 1699526) Visitor Counter : 123