ప్రధాన మంత్రి కార్యాలయం

అస‌మ్ లోని తేజ్‌పుర్ విశ్వవిద్యాల‌యం 18వ స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ తాలూకు భావ‌న నేటి యువ‌త‌రం మాన‌సికావ‌స్థ తో స‌రిపోయిన‌ట్లుగా ఉంది:  ప్ర‌ధాన మంత్రి

క్రికెట్ లో ఆస్ట్రేలియా పై భార‌త‌దేశం సాధించిన విజ‌యం కొత్త యువ భార‌త్ స్వభావాన్ని క‌ళ్ళ‌ కు క‌డుతోంది:  ప్ర‌ధాన మంత్రి

ఎన్ఇపి మ‌న విద్య వ్య‌వ‌స్థ ను డేటా, డేటా-ఎన‌లిటిక్స్ కోసం స‌న్న‌ద్ధం చేస్తుంది:  ప్ర‌ధాన మంత్రి

Posted On: 22 JAN 2021 2:15PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా అస‌మ్ లోని తేజ్‌పుర్‌ విశ్వ‌విద్యాల‌యం 18వ స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.  ఈ సంద‌ర్భం లో అస‌మ్ గ‌వ‌ర్న‌ర్ ప్రొఫెస‌ర్ జగదీశ్ ముఖీ, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్ట‌ర్ ర‌మేశ్ పోఖ్రియాల్ ‘నిశంక్’ ల‌తో పాటు అస‌మ్ ముఖ్య‌మంత్రి శ్రీ స‌ర్బానంద సోనోవాల్ కూడా పాల్గొన్నారు.  

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు 1200 మంది కి పైగా విద్యార్థుల జీవ‌న కాలం లో ఎప్ప‌టికీ గుర్తుపెట్టుకొని ప‌దిల‌ప‌ర‌చుకొనేట‌టువంటి రోజు అంటూ అభివ‌ర్ణించారు.  తేజ్‌పుర్ యూనివ‌ర్సిటీ లో విద్యార్థులు నేర్చుకొన్న‌దంతా కూడా అస‌మ్ ప్ర‌గ‌తి ని, దేశ ప్ర‌గ‌తి ని వేగ‌వంతం చేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని ఆయ‌న అన్నారు.  యూనివర్సిటీ గీతం లో ఒదిగిన భావోద్వేగం ఘ‌న‌మైన‌ తేజ్‌పుర్ చ‌రిత్ర లో మారుమోగుతోంద‌న్నారు.  యూనివర్సిటీ గీతం లోని కొన్ని పంక్తుల‌ను ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ఉదాహ‌రించారు.  


‘‘అగ్నిగఢర్ స్థాపత్య, కలియాభోమోరార్ సేతు నిర్మాణ్,

జ్ఞాన్ జ్యోతిర్మయ,

సేహి స్థానతే బిరాజిసే తేజ్ పుర్ విశ్వవిద్యాలయ..’’


ఈ మాట‌ల‌కు.. అగ్నిగ‌ఢ్  వంటి వాస్తు శిల్పం, కాలియా-భొమొరా సేతువు, జ్ఞాన జ్యోతి ఎక్క‌డ అయితే కొలువుదీరాయో ఆ ప్ర‌దేశం లో తేజ్‌పుర్ విశ్వ‌విద్యాల‌యం రూపుదాల్చింది.. అని భావం.  భూపేన్ దా, జ్యోతి ప్రసాద్ అగ్రవాల్‌, బిష్ణు ప్రసాద్‌ రాభా ల వంటి ప్ర‌తిష్ఠిత వ్య‌క్తిత్వాలు తేజ్‌పుర్ తో ప్రసిద్ధికెక్కారు అని ఆయ‌న అన్నారు.

విద్యార్థుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఈ రోజు మొద‌లుకొని భార‌త‌దేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 100 సంవ‌త్స‌రాల‌ ను పూర్తి చేసుకొనే వ‌ర‌కు ఉన్న కాలం సైతం మీ జీవితాల లో బంగారు సంవ‌త్స‌రాలే అవుతాయని చెప్పారు.  తేజ్‌పుర్ తాలూకు వైభ‌వాన్ని భార‌త‌దేశం లోను, యావ‌త్తు ప్ర‌పంచం లోను వ్యాప్తి చేయ‌వ‌ల‌సిందిగాను, అస‌మ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి ప‌రంగా కొత్త శిఖ‌రాల‌కు తీసుకు పోవ‌ల‌సిందిగాను వారికి ఆయ‌న విజ్ఞప్తి చేశారు.  ఈశాన్య ప్రాంతం అభివృద్ధి కి ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాలు, ప్ర‌త్యేకించి సంధానం, విద్య‌, ఆరోగ్యం రంగాల‌ లో ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాల వ‌ల్ల ద‌క్కిన అవ‌కాశాల‌ ను పూర్తి స్థాయి లో అందుకోండంటూ విద్యార్థుల‌ కు ఆయ‌న సూచించారు.

తేజ్‌పుర్ విశ్వ‌విద్యాల‌యం దాని ఇనవేశన్ సెంట‌ర్  కు కూడా ప్ర‌సిద్ధి గాంచింది అని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు.  ఈ అట్ట‌డుగు స్థాయి నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లు ‘వోక‌ల్ ఫార్ లోకల్’ కు వేగ‌గ‌తి ని అందిస్తున్నాయ‌ని, స్థానిక స‌మ‌స్య‌ల‌ ను ప‌రిష్క‌రించ‌డం కోసం వీటిని ఉప‌యోగించ‌డం జ‌రుగుతోందని, ఇవి అభివృద్ది కి కొత్త త‌లుపుల‌ ను తెరుస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.  శుద్ధ‌మైన తాగునీటి ని అందించ‌డానికి త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటు లోకి తీసుకు రావ‌డం, ప్ర‌తి ప‌ల్లె లో వ్య‌ర్థ ప‌దార్థాల ను శ‌క్తి రూపం లోకి మార్చ‌డానికి ప్ర‌తిజ్ఞ ను స్వీక‌రించ‌డం, బాయో గ్యాస్‌, సేంద్రియ ఎరువుల కు సంబంధించిన అంత‌గా ఖ‌రీదు కాన‌టువంటి, ప్ర‌భావ‌ వంత‌మైన‌టువంటి సాంకేతిక ప‌రిజ్ఞానం, ఈశాన్య ప్రాంత సుసంప‌న్న వార‌స‌త్వాన్ని, జీవ వైవిధ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు చేప‌ట్టిన ఒక ప్ర‌చార ఉద్య‌మం, కాల‌గ‌ర్భం లో క‌ల‌సిపోయే అపాయం ముంగిట‌ కు చేరుకొన్న ఈశాన్య ప్రాంత ఆదివాసి స‌మాజ భాష‌ల ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం, బాతాద్రవ్ థానా, నౌగావ్ ల‌లో వంద‌ల ఏళ్ళ నాటి కలప నక్కాశీ కళ ను సంర‌క్ష‌ించడం, వ‌ల‌స‌రాజ్యం హ‌యాం లోని అస‌మ్ పుస్తకాలను, ప‌త్రాలను డిజిట‌ల్ మాధ్యమం ద్వారా భ‌ద్ర‌ప‌ర‌చ‌డం వంటి తేజ్‌ పుర్ విశ్వవిద్యాల‌యం భుజాని కి ఎత్తుకొన్న బాధ్య‌త‌ల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించి, వాటిని కొనియాడారు.  

స్థానికం గా అనేక అవ‌స‌రాలను దృష్టి లో పెట్టుకొని కృషి చేయ‌డానికి ప్రేర‌ణ ల‌భించ‌డం వెనుక తేజ్‌పుర్ యూనివ‌ర్సిటీ కేంప‌స్ పాత్ర ఎంతైనా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  ఇక్క‌డ వ‌స‌తి గృహాల‌కు ఈ ప్రాంతం లోని న‌దుల, ప‌ర్వ‌తాల పేరులను పెట్ట‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు.  ఇవి పేరులు మాత్రమే కాదు, ఇవి జీవనానికి ఒక ప్రేర‌ణ ను కూడా అందిస్తున్నాయి అని ఆయ‌న అన్నారు.  జీవ‌న యానం లో మ‌నం అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌ని, ఎన్నో న‌దుల‌ను, ప‌ర్వ‌తాల‌ ను దాటుతూ ముందుకు పోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.  ప్ర‌తి ఒక్క ప‌ర్వ‌త శిఖ‌రాగ్రానికి చేరుకొనే క్ర‌మం లో మీ ప్రావీణ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది, మీ దృష్టి కోణం స‌వాళ్ళ ప‌రం గా స‌న్న‌ద్ధం గా ఉంటుంది అని ఆయ‌న అన్నారు.  అనేక ఉప న‌దులు ఒక న‌ది లో క‌లసి ఎలాగైతే స‌ముద్రం లోకి వెళ్తాయో మ‌నం కూడా జీవితం లో వివిధ వ్య‌క్తుల వ‌ద్ద నుంచి జ్ఞానాన్ని స్వీక‌రించి పాఠాల‌ను నేర్చుకొంటూ మ‌న ల‌క్ష్యాన్ని సాధించాలి, ఆ విధంగా నేర్చుకొన్న దానితో ముందుకు సాగిపోవాలి అని ఆయ‌న చెప్పారు.  ఎవ‌రైనా ఈ త‌రహా దృక్ప‌థం తో ముందుకు సాగిపోయిన‌ప్పుడు ఈశాన్య ప్రాంతం దేశ అభివృద్ధి కి తోడ్పాటు ను అందించ‌గ‌లుగుతుంది అని ఆయన అన్నారు.

ఆత్మనిర్భర్ భావన ను గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.  ఈ ఉద్యమం వనరులు, భౌతిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక శక్తి, వ్యూహాత్మక శక్తి లలో మార్పు ను తీసుకు రావడానికి సంబంధించిందని, అతి పెద్ద పరివర్తన సహజ ప్రవృత్తి, క్రియాశీలత, ప్రతిక్రియ ల తాలూకు పరిధిలో ఇమిడిపోయివుందని, అది నేటి యువత మానసికావస్థ కు తగినది గా ఉందని ఆయన విడమర్చి చెప్పారు.

నేటి యువ భారతదేశం సవాళ్ల ను స్వీకరించడం లో ఓ ప్రత్యేకమైనటువంటి పంథా ను కలిగివుందని ప్రధాన మంత్రి అన్నారు.  ఆయన తాను చెప్పదలచుకొన్న అంశాన్ని సోదాహరణం గా చెప్పడానికి ఆస్ట్రేలియా లో ఇటీవల యువ భారత క్రికెట్ జట్టు కనబరచిన ఆటతీరు ను గురించి ప్రస్తావించారు.  వారు అవమానకరమైన ఓటమి ని ఎదుర్కొన్నారు, అయినప్పటికీ కూడా అంతే వేగం గా పుంజుకొని తరువాతి పోటీ ని గెల్చుకొన్నారు.  క్రీడాకారులు గాయాల బారిన పడ్డప్పటికీ దృఢనిశ్చయాన్ని చాటారు.  వారు సవాలు తో తలపడి, క్లిష్ట స్థితులలో నిస్పృహ‌ కు లోనవడానికి బదులు సరికొత్త పరిష్కారాల కోసం వెతికారు.  అనుభవం లేనటువంటి ఆటగాళ్లు జట్టు లో ఉన్నారు, అయినా కానీ వారి ధైర్యం ఉన్నతమైంది గా ఉండింది, మరి వారు వారికి ఇచ్చిన అవకాశాన్ని చక్క గా వినియోగించుకొన్నారు.  వారు వారి ప్రతిభ తోను, వారి వ్యక్తిత్వం తోను ఒక మెరుగైనటువంటి జట్టు పైన పైచేయి ని సాధించారని ప్రధాన మంత్రి అన్నారు.
 
మ‌న క్రీడాకారులు క‌న‌బ‌రచిన ఈ విధ‌మైన గొప్ప ప్ర‌ద‌ర్శ‌న ఒక్క క్రీడా రంగ దృష్టి కోణం పరంగానే ముఖ్యమైంది కాద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు.  ఈ ప్ర‌ద‌ర్శ‌న తాలూకు ముఖ్య‌మైనటువంటి జీవిత పాఠాల ను శ్రీ మోదీ ఒక్క‌టొక్క‌టి గా వివ‌రించారు.  ఒక‌టోది, మ‌న‌ం మ‌న సామ‌ర్ధ్యం పట్ల న‌మ్మ‌కాన్ని క‌లిగివుండాలనే పాఠం; రెండోది, మ‌న దృక్ప‌థం స‌కారాత్మ‌కం గా ఉంటే స‌కారాత్మ‌క‌ ఫ‌లితాలు వ‌స్తాయనే పాఠం;  మూడో అంశం, మ‌రింత ముఖ్య‌మైనటువంటి పాఠం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  అది ఏమిటి అంటే, ఎవ‌రికైనా రెండు ఐచ్ఛికాలు ఎదురైన‌ప్పుడు, వాటిలో ఒక‌టోది భ‌ద్ర‌మైంది గా ఉండి, మ‌రొక‌టి క‌ష్ట‌మైన గెలుపు అయిన‌ప్పుడు.. ఆ వ్య‌క్తి ఖ‌చ్చితం గా విజ‌యం తాలూకు ఐచ్ఛికాన్నే అన్వేషించి తీరాలి.  ఒక్కొక్క సారి విఫ‌లం కావ‌డం లో ఎలాంటి హాని ఉండదు.  మ‌రి ఎవ‌రైనా క‌ష్ట‌మైన ప‌నులను చేప‌ట్ట‌కుండా ఊరుకోకూడ‌దు కూడాను.  మ‌నం ఏదైనా సంభ‌వించే వ‌ర‌కు వేచి ఉండి అది జ‌రిగిన త‌రువాత దాని ప‌ట్ల ప్ర‌తిస్పందించ‌డం కంటే, ఏదో ఒక‌టి చేసి స‌ద‌రు ప‌రిస్థితి ని అదుపులోకి తీసుకు రావ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.  మ‌నం గ‌నుక ఓట‌మి తాలూకు భ‌యాన్ని , అన‌వ‌స‌ర ఒత్తిడి ని అధిగ‌మించ‌గ‌లిగితే, మ‌నం నిర్భ‌య‌త్వాన్ని సంత‌రించుకొంటాం అని ఆయన అన్నారు.  ఈ ‘న్యూ ఇండియా’- ఏదైతే ల‌క్ష్యాల ప‌ట్ల స‌మ‌ర్ప‌ణ భావాన్ని క‌లిగి ఉండి, విశ్వాసం తొణికిస‌లాడుతోందో- అది క్రికెట్ మైదానం లో మాత్ర‌మే ప్రస్ఫుటం కావ‌డ‌మే కాకుండా ఈ స‌న్నివేశం లో మీరందరూ భాగ‌స్తులే అని విద్యార్థుల‌తో ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ఈ త‌ర‌హా ఆత్మ విశ్వాసం, ఎవ‌రూ న‌డ‌వ‌ని బాట‌ లో న‌డ‌వ‌టానికి భ‌యం అనేది లేక‌పోవ‌డం, యువ శక్తి.. ఇవి క‌రోనా కు వ్య‌తిరేకం గా దేశం సలుపుతున్నటువంటి పోరాటం లో దేశాన్ని బ‌ల‌ప‌ర‌చాయని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌త‌దేశం ఆరంభం లో ఎదురైన భయాందోళ‌న‌ల‌ ను దూరం చేసింది, సంక‌ల్పం, సహన శ‌క్తి ఉంటే వనరులు సైతం అందుబాటులోకి వస్తాయని చాటింద‌ని ఆయన అన్నారు.  భార‌త‌దేశం వేగ‌వంత‌మైన‌, ముందుజాగ్ర‌త్త‌ తో కూడిన నిర్ణ‌యాల‌ ను తీసుకొంద‌ని, వైర‌స్ తో ప్ర‌భావవంత‌మైన పోరాటాన్ని చేసింద‌ని పేర్కొన్నారు.  భార‌త‌దేశం లో రూపొందించిన ప‌రిష్కారాలు మహమ్మారి వ్యాప్తి ని అదుపులోకి తెచ్చాయ‌ని, ఆరోగ్య‌ సంబంధి మౌలిక స‌దుపాయాలు మెరుగుపడ్డాయ‌ని తెలిపారు.  టీకా మందు కు సంబంధించిన మ‌న ప‌రిశోధ‌న‌, ఉత్ప‌త్తి సామర్ధ్యాలు భార‌త‌దేశాని కి, ప్ర‌పంచం లో అనేక దేశాల‌కు సురక్ష్ క‌వ‌చాన్ని అందించే విష‌యం లో భరోసాను కల్పిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌న బ‌దిలీ, ఫిన్‌టెక్ డిజిటల్ ఇన్ క్లూజన్, ప్ర‌పంచం లోకెల్లా అతి పెద్దదైన టాయిలెట్ నిర్మాణ సంబంధిత ఉద్య‌మం, ప్ర‌తి ఒక్క కుటుంబానికి న‌ల్లా నీటి ని అందించేందుకు ఉద్దేశించిన అతి పెద్ద ఉద్య‌మం, ప్ర‌పంచం లోకెల్లా అతి పెద్ద‌దైన ఆరోగ్య బీమా ప‌థ‌కం, ప్ర‌పంచం లోకెల్లా అతి పెద్ద‌దైన టీకా మందు ను ఇప్పించే కార్య‌క్ర‌మం వంటి వాటి ని గురించి కూడా చెప్పారు.  ఈ కార్య‌క్ర‌మాలు భార‌త‌దేశం దృష్టికోణాన్ని ప్రముఖంగా ప్రకటిస్తున్నాయ‌న్నారు.  ఈ దృష్టికోణం ప‌రిష్కారానికై ప్ర‌యోగాన్ని చేయ‌డానికి భ‌య‌ప‌డ‌దు అని, పెద్ద ఎత్తున చేప‌ట్ట‌వ‌ల‌సిన ప‌థ‌కాల‌ ను చేప‌ట్ట‌డానికి తయారుగా ఉంటుందని సూచిస్తోందన్నారు.  ఈ ప‌థ‌కాలు అస‌మ్ కు, ఈశాన్య ప్రాంతానికి ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్నాయ‌న్నారు.  

కొత్త అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్న నూత‌న సాంకేతిక‌తల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  భవిష్యత్తు లో విశ్వ‌విద్యాల‌యాల ను గురించి ఆయ‌న మాట్లాడుతూ, అవి పూర్తి స్థాయిలో వర్చువల్ గా ఉండవచ్చని, విద్యార్థుల‌ కు, అధ్యాప‌క సిబ్బందికి ప్ర‌పంచం లోని ఏ విశ్వ‌విద్యాల‌యం లో అయినా స‌రే పాలుపంచుకొనేందుకు అవ‌కాశం ఉండ‌వ‌చ్చ‌ని ప్రధాన మంత్రి అన్నారు.  ఆ త‌ర‌హా ప‌రివ‌ర్త‌న దిశ‌ లో ఒక నియంత్ర‌ణ పూర్వ‌క‌మైన ఫ్రేమ్ వ‌ర్క్ ను నెల‌కొల్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  కొత్త జాతీయ విద్య విధానం తో ఈ దిశ‌ లో ఒక అడుగు ను వేసిన‌ట్లు అయింద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు.  సాంకేతిక విజ్ఞానాన్ని బ‌హుళ విభాగాల‌ తో కూడిన విద్య‌ ను, స‌ర‌ళీకృత విధానాన్ని గ‌రిష్ఠ స్థాయి లో ఉప‌యోగించుకోవ‌డాన్ని ఈ విధానం ప్రోత్స‌హిస్తుంద‌న్నారు.  మ‌న విద్య వ్య‌వ‌స్థ‌ ను డేటా కేసం, డేటా ఎన‌లిటిక్స్ కోసం స‌న్న‌ద్ధం చేయ‌డానికి ఎన్ఇపి పెద్దపీట వేస్తోంద‌న్నారు.  డేటా ఎన‌లిసిస్ ప్ర‌వేశాల మొద‌లుకొని, బోధ‌న, మూల్యాంక‌నం వ‌ర‌కు ప్ర‌క్రియ‌ల‌ ను పెద్ద ఎత్తున మెరుగు ప‌రుస్తుంద‌న్నారు.

ఈ ల‌క్ష్యాల‌ ను నెర‌వేర్చుకోవ‌డం లో సాయప‌డ‌వ‌ల‌సిందిగా తేజ్‌పుర్ విశ్వ‌విద్యాల‌య విద్యార్థుల‌కు ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.  విద్యార్థులు వారి సాంప్ర‌దాయ‌క విద్య ను పూర్తి చేసుకొన్న త‌రువాత కేవ‌లం వారి భ‌విష్య‌త్తు కోసం కృషి చేయ‌డ‌మే కాకుండా దేశ భ‌విష్య‌త్తు కోసం కూడా కృషి చేయాలి అని ఆయ‌న అన్నారు.  వారు వారి ఆద‌ర్శాల‌ ను ఉన్న‌త‌మైన స్థాయి లో నిలిపి ఉంచాల‌ని, అది వారిని జీవితం తాలూకు మంచి చెడు ల నుంచి కాపాడుతుంద‌ని ఆయ‌న చెప్పారు.  రాబోయే 25-26 సంవ‌త్స‌రాల కాలం వారికి వారితో పాటు వారి దేశానికి కూడా ఎంతో ముఖ్య‌మైంద‌ని, విద్యార్థులు దేశాన్ని నూత‌న శిఖ‌రాల‌కు తీసుకుపోతార‌న్న ఆశ‌ ను ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.



 

***
 



(Release ID: 1691280) Visitor Counter : 121