వ్యవసాయ మంత్రిత్వ శాఖ

దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఏడో దఫా చర్చలు ఈనెల 8న మరోసారి చర్చలు

పరిష్కారం దిశగా ఇరువర్గాలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది: నరేంద్ర సింగ్‌ తోమర్‌

Posted On: 04 JAN 2021 8:10PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై; కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఏడో దఫా చర్చలు దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌, వాణిజ్య శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్‌ ప్రకాష్‌ చర్చల్లో పాల్గొనగా, రైతుల తరపున 41 రైతు సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. ఈ ఆందోళనలో అసువులుబాసిన వారికి, ఇరువర్గాలు రెండు నిమిషాలు మౌనం పాటించి అంజలి ఘటించాయి.
 
    గత సమావేశాల్లోని చర్చలను దృష్టిలో ఉంచుకుని, రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం విశాల దృక్పథంతో కట్టుబడి ఉందని శ్రీ తోమర్ చెప్పారు. పరిష్కారం కోసం ఇరువర్గాలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు.

    రైతు సంక్షేమం దృష్ట్యా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులతో వ్యవసాయ చట్టాలపై చర్చలు జరుపుతామని కేంద్రమంత్రి వెల్లడించారు. వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం, వ్యవసాయ చట్టాల్లోని అంశాల వారీగా చర్చిద్దామని సూచించారు.

    ఈ సమావేశంలో, రెండు వర్గాలు వారి వారి అభిప్రాయాలు వెల్లడించాయి. ఈనెల 8వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి.

 

***



(Release ID: 1686177) Visitor Counter : 175