సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

భారత వ్యతిరేక శక్తులతో వ్యవహరించడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది: శ్రీ శ్రీపాద్ నాయక్

Posted On: 10 DEC 2020 4:55PM by PIB Hyderabad

"భారత వ్యతిరేక శక్తులతో వ్యవహరించడంలో మీడియాకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. మన దేశానికి వ్యతిరేకంగా భారత వ్యతిరేక శక్తులు మన మీడియాను దుర్వినియోగం చేయకుండా చూసుకోవడం మీడియా వ్యక్తులతో సహా మనందరి బాధ్యత"  అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి) రక్షణ సిబ్బంది కోసం గురువారం నిర్వహించిన మీడియా కమ్యూనికేషన్ కోర్సు  కార్యక్రమంలో రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఐఐఎంసి డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది, అదనపు డైరెక్టర్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీ కె. సతీష్ నంబ్రూదిపాద్, అదనపు డైరెక్టర్ జనరల్ (ట్రైనింగ్) శ్రీమతి. మమతా వర్మ కూడా హాజరయ్యారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాయక్ మాట్లాడుతూ.." ప్రస్తుతం తప్పుడు వార్తలు మరియు ద్వేషపూరిత వార్తల ధోరణి పెరుగుతున్నప్పుడు మీడియాపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం.  కొత్తతరం మీడియా ఉన్న ఈ యుగంలో  మీడియాపై అవగాహన సంభాషణకర్తలకు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వర్గానికి కూడా ముఖ్యమైనది. ఈ రోజు దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న నేపథ్యంలో  మీడియాను దుర్వినియోగం చేసే అవకాశం చాలా రెట్లు పెరిగింది. దీనిని మీడియా అక్షరాస్యత ద్వారా మాత్రమే నియంత్రించవచ్చని"  అన్నారు.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న మానసిక యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మీడియా అక్షరాస్యత కూడా సహాయపడుతుందని రక్షణ శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఈ మానసిక యుద్ధాన్ని భారత వ్యతిరేక శక్తులు ఒక సాధనంగా స్వీకరించడం నుండి మనం అప్రమత్తంగా ఉండాలి. బదులుగా దేశం మరియు దేశప్రజల శ్రేయస్సు కోసం మీడియా బలాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి అని సూచించారు.

భారత రక్షణ దళాల ధైర్యం, శౌర్యం, నిబద్ధత, అంకితభావం అసమానమైనవని శ్రీ నాయక్ అన్నారు.  అయినా కూడా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతియడానికి రోజంతా చురుకుగా ఉండే అంశాలు దేశంలో ఉన్నాయి. సరైన మీడియా విధానాన్ని అవలంబించడం ద్వారా మరియు విభిన్న మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వ్యవస్థీకృత పద్ధతిలో ఉపయోగించడం ద్వారా మన రక్షణ దళాలకు వ్యతిరేకంగా జరిగే  దుర్మార్గపు ప్రచారాలను ఎదుర్కోవచ్చు అని శ్రీనాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఐఐఎంసి డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది మాట్లాడుతూ " ఈ రోజు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటోంది. కరోనా నేపథ్యంలో  ఒక పదం చాలా ప్రాచుర్యం పొందింది మరియు దాని యొక్క అనేక ఫలితాలు మరియు పరిణామాలు కూడా చూడవచ్చు. ఈ పదం 'ఇన్ఫోడెమిక్'. ఈ పదం అధిక సమాచారం లేదా సంభాషణ విస్ఫోటనాన్ని  సూచిస్తుంది. అవసరానికి మించి సమాచారం ఉన్న నేపథ్యంలో  అందులో ఏ సమాచారాన్ని నమ్మాలి, ఏది తప్పుడు సమాచారం అనేది చర్చకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఆ చర్చ పేరు మీడియా మరియు సమాచార అక్షరాస్యత అని తెలిపారు.

ప్రొఫెసర్ ద్వివేది మాట్లాడుతూ ఈ రోజు నకిలీ వార్తలు పెద్ద వ్యాపారంగా మారాయని డిజిటల్ మీడియా కూడా దానిపై ప్రభావం చూపిందని అన్నారు. అటువంటి పరిస్థితిలో మీడియా అక్షరాస్యత అవసరం పెరుగుతుంది. ఐఐఎంసిలో ఈ మీడియా కమ్యూనికేషన్ కోర్సులను కోర్సు కోఆర్డినేటర్‌గా నిర్వహిస్తున్న శ్రీమతి విష్ణుప్రియ పాండే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఐఐఎంసి ప్రతి సంవత్సరం రక్షణ సిబ్బంది కోసం మీడియా మరియు కమ్యూనికేషన్‌కు సంబంధించిన స్వల్పకాలిక శిక్షణా కోర్సులను నిర్వహిస్తుంది. కెప్టెన్ స్థాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు అధికారులు ఈ కోర్సులలో పాల్గొంటారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ శిక్షణా కార్యక్రమం మొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడింది. ఈ సంవత్సరం జానపద మాధ్యమాల నుండి కొత్త మీడియా మరియు ఆధునిక కమ్యూనికేషన్ పద్ధతుల సమాచారం సైనిక అధికారులకు అందించబడింది. ఇది కాకుండా, కొత్త మీడియా యుగంలో, సైన్యం మరియు మీడియా మధ్య సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అన్నదానిపై కూడా అధికారులకు శిక్షణ ఇవ్వబడింది.

 

***



(Release ID: 1679760) Visitor Counter : 130