ప్రధాన మంత్రి కార్యాలయం

కొవిడ్-19 స్థితి ని, దానిని స‌మ‌ర్ధంగా ఎదుర్కోవ‌డానికి తగిన స‌న్నాహాల‌ను స‌మీక్షించడానికి ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన ఉన్న‌త‌ స్థాయి స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

కొవిడ్‌-19 వ్యాక్సిన్ అప్పగింత, పంపిణీ, పాలన కు సంబంధించిన ప‌ద్ధ‌తుల పై చ‌ర్చించ‌డం జ‌రిగింది

కొవిడ్ తో పోరాటం లో ప్ర‌తి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటం పైన శ్ర‌ద్ధ తీసుకొన్న‌ విధంగానే, టీకామందు ప్ర‌తి ఒక్క‌రికీ చేరేలా చూసేందుకు ప్రాధాన్యమివ్వాలి: ప‌్ర‌ధాన మంత్రి

రాష్ట్రాల‌ లో స్థితి పై స‌మ‌గ్ర స‌మాచారాన్ని అందించిన ముఖ్య‌మంత్రులు

Posted On: 24 NOV 2020 3:09PM by PIB Hyderabad

కొవిడ్‌-19 వర్తమాన స్థితి ని, దానిని స‌మ‌ర్ధంగా ఎదుర్కోవ‌డానికి సన్నాహకాలను, ప్ర‌త్యేకించి ఆయా కేసు లు ఎక్కువ‌ గా ఉన్న 8 రాష్ట్రాలకు ప్రాధాన్యాన్నిస్తూఅన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల‌తో ఈ రోజున వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా  జ‌రిగిన ఒక ఉన్న‌త స్థాయి స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.  ఆ ఎనిమిది రాష్ట్రాల‌లో హ‌రియాణా, దిల్లీ, ఛత్తీస్‌ గ‌‌ఢ్, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, ప‌శ్చిమ బెంగాల్ ఉన్నాయి.  కొవిడ్-19  టీకామందు అప్పగింత, పంపిణీ, పాలన తాలూకు పద్ధతులపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

ఆరోగ్య రంగ సంబంధిత మౌలిక సదుపాయాలను పెంపొందించడం

మ‌హ‌మ్మారిని దేశం ఉమ్మడి ప్రయాసలతో ఎదుర్కొన్నద‌ని, వ్యాధి నయమైన వారి సంఖ్య, వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య ల పరంగా చూసినప్పుడు  భార‌త‌దేశం అనేక ఇతర దేశాల కంటె మెరుగ్గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు.  ప‌రీక్ష‌లు చేసే, చికిత్స అందించే నెట్ వర్క్ విస్తరణను గురించి ఆయ‌న ప్ర‌స్తావించి, ఆక్సిజ‌న్ ను అందుబాటులోకి తీసుకు రావ‌డానికి పిఎమ్ కేర్స్ ఫండ్ ప్ర‌త్యేక శ్రద్ధ తీసుకొందని తెలిపారు.  ఆక్సిజ‌న్ ను తయారు చేసే విష‌యంలో జిల్లా ఆసుప‌త్రులు, వైద్య క‌ళాశాల‌లను స్వ‌యంసామ‌ర్ధ్యం క‌లిగిన‌విగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న చెప్తూ, 160 కి పైగా కొత్త ఆక్సిజ‌న్ ప్లాంటుల‌ను ఏర్పాటు చేసే ప‌నులు పురోగ‌తి లో ఉన్నాయని తెలిపారు.


ప్రజల స్పందన నాలుగు దశలుగా ఉండింది

మ‌హ‌మ్మారి పట్ల ప్ర‌జ‌లు ఎలా ప్ర‌తిస్పందించారు అనేది అర్థం చేసుకోవ‌డం ముఖ్యమ‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొంటూ, దీనిని నాలుగు ద‌శ‌లుగా విడదీసి గుర్తించ‌వ‌చ్చ‌న్నారు.  మొద‌టి దశ లో ప్ర‌జ‌లు ఎంతో భ‌య‌ప‌డిపోయార‌ని,   రెండో ద‌శ‌ లో వైర‌స్ విషయం లో సందేహాలు తలెత్తాయన్నారు. ఆ దశ లో  చాలా మంది తాము వైరస్ ప్రభావానికి లోనైన సంగ‌తిని ఇత‌రుల‌కు తెలియ‌కుండా దాచిపెట్ట‌జూశారన్నారు.  మూడో ద‌శ‌ ఒప్పుకోలు కు సంబంధించిందని చెప్పారు; ఈ దశ లో ప్రజలు వైర‌స్ పట్ల మరింత లోతుగా ఆలోచించ‌డం మొద‌లుపెట్టి, అత్యంత జాగ‌రూక‌త‌ ను ప్ర‌ద‌ర్శించార‌న్నారు.  నాలుగో ద‌శ‌ లో వ్యాధి నయమయ్యే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో, ప్ర‌జ‌లు వైర‌స్ నుండి భ‌ద్ర‌త విషయం లో ఒక త‌ప్పుడు అభిప్రాయాన్ని ఏర్ప‌ర‌చుకొన్నారని, ఇది నిర్ల‌క్ష్యం పెరిగిపోవ‌డానికి దారితీసింద‌ని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ నాలుగో ద‌శ‌లోనే వైర‌స్ తీవ్ర‌త‌ ను గురించి చైత‌న్యాన్ని పెంచడానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవ‌ల‌సివుంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఇంత‌కు ముందు త‌గ్గుతూ వ‌చ్చిన దేశాల‌ లో దీని వ్యాప్తి పెరుగుతూ వస్తున్న స‌ర‌ళి ని కొన్ని రాష్ట్రాల‌లో సైతం గ‌మ‌నిస్తున్నామని,  ఇది పాల‌న యంత్రాంగం మ‌రింత ఎక్కువ అప్ర‌మ‌త్త‌ంగా ఉండడం అవ‌స‌ర‌మ‌ని సూచిస్తోంద‌ని ఆయన చెప్పారు.

ఆర్‌టి-పిసిఆర్ టెస్టుల‌ను పెంచ‌డం ముఖ్యమ‌ని, రోగుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ ను మెరుగుప‌ర‌చాల‌ని- ప్రత్యేకించి ఇంటి కి పరిమితమై ఉండవలసిన రోగుల- ప‌ర్య‌వేక్ష‌ణ‌ ను మెరుగుప‌ర‌చాల‌ని, గ్రామ‌ స్థాయి లో, కమ్యూనిటీ స్థాయిలో ఆరోగ్య కేంద్రాల‌కు చ‌క్క‌ని సౌక‌ర్యాల‌ను స‌మ‌కూర్చాల‌ని, వైర‌స్ బారి నుండి త‌ప్పించుకోవ‌డానికి గాను భ‌ద్ర‌త‌ కు సంబంధించిన జాగృతి ప్ర‌చార ఉద్య‌మాల‌ను నిర్వ‌హిస్తూ ఉండాల‌ంటూ ప్ర‌ధాన మంత్రి సూచనలు చేశారు.  మ‌ర‌ణాల రేటు ను 1 శాతం కంటే త‌క్కువ‌ కు కుదించడం మ‌న ల‌క్ష్యం కావాలి అని ఆయ‌న చెప్పారు.

టీకావేయించే కార్యక్రమం సాఫీ గా, పక్కాగా, నిలకడతనం కలిగిందిగా ఉంటుందనే హామీని ఇవ్వడం

టీకామందుల‌ అభివృద్ధి ప్రక్రియ ను ప్ర‌భుత్వం నిశితంగా ప‌రిశీలిస్తోంద‌ని, భార‌త‌దేశం లో టీకామందు త‌యారీదారు సంస్థ‌లతో, ప్ర‌పంచ‌ స్థాయి నియంత్ర‌ణాధికార సంస్థ‌ల‌తో, ఇత‌ర దేశాల‌కు చెందిన ప్ర‌భుత్వాల‌తో, బ‌హుప‌క్షీయ సంస్థ‌ల‌తో, అంత‌ర్జాతీయ కంపెనీల‌తో ప్ర‌భుత్వం సమాలోచనలు జరుపుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి మ‌రొక్క‌సారి బరోసానిచ్చారు.  పౌరుల‌కు ఉద్దేశించిన వ్యాక్సీన్ అవ‌స‌ర‌మైన అన్ని విజ్ఞానశాస్త్ర ప్రాతిప‌దిక‌ల‌కు తులతూగేట‌ట్లు చూడ‌టం జ‌రుగుతుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు.  కొవిడ్ తో పోరాటం జ‌రిపేట‌ప్పుడు ప్ర‌తి ఒక్క ప్రాణాన్ని కాపాడ‌టం పై శ్ర‌ద్ధ వ‌హించిన ట్లుగానే, టీకామందు ప్ర‌తి ఒక్క‌రికి అందేట‌ట్లు చూడ‌టం కూడా ప్రాధాన్య అంశంగా ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  టీకాలు వేయించే కార్య‌క్ర‌మం సాఫీగాను, పద్ధతి ప్రకారం సాగేదిగాను, నిల‌క‌డ‌తనంతో కూడుకొన్నదిగాను ఉండేట‌ట్లు చూడ‌టానికి అన్ని స్థాయిల‌ ప్ర‌భుత్వాలు క‌ల‌సిక‌ట్టుగా కృషి చేయ‌వ‌ల‌సి ఉంది అని ఆయ‌న అన్నారు.

టీకామందు వేయించడానికి ఉన్న ప్రాథ‌మ్యాన్ని గురించి రాష్ట్రాల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  అద‌న‌పు శీత‌లీక‌ర‌ణ నిల‌వ స‌దుపాయాల ఆవ‌శ్య‌క‌తల అంశాన్ని కూడా రాష్ట్రాల‌తో చ‌ర్చించ‌డమైంద‌ని ఆయ‌న తెలిపారు.  మంచి ఫ‌లితాలు వ‌చ్చేట‌ట్లుగా రాష్ట్రస్థాయి సార‌థ్య సంఘం, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌, అలాగే జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షణ ఉండే విధం గా చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్య‌మంత్రుల‌కు ఆయ‌న సూచ‌న చేశారు.

టీకా మందుల విష‌యంలో అనేక వ‌దంతులను, భ్ర‌మ‌లను వ్యాప్తి లోకి తీసుకు రావడాన్ని గ‌త అనుభ‌వం మ‌న‌కు చాటిచెప్పింద‌ని ప్ర‌ధాన మంత్రి ముంద‌స్తు హెచ్చ‌రికను చేశారు.  వ్యాక్సీన్ దుష్ప్ర‌భావాల‌కు సంబంధించిన వదంతులను ప్రచారం లోకి తెచ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అన్నారు.  అటువంటి ప్ర‌య‌త్నాల‌ను మ‌రింత ఎక్కువ జాగృతి ని క‌ల‌గ‌జేయ‌డం ద్వారా ప‌రిష్క‌రించ‌వల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కిచెప్పారు; ఈ దిశ‌ లో పౌర స‌మాజం, ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్‌ ల విద్యార్థులు, ప్ర‌సార మాధ్య‌మాలు సహా సాధ్య‌మైనంత‌ సాయాన్ని తీసుకోవాల‌న్నారు.

ముఖ్య‌మంత్రులు ఏమ‌న్నారంటే..

ప్ర‌ధాన మంత్రి నాయ‌క‌త్వాన్ని ముఖ్యమంత్రులు ప్రశంసించారు;  రాష్ట్రాల‌ లో ఆరోగ్య సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌డంలో అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించినందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి వారు ధ‌న్య‌వాదాలను తెలియజేశారు.  త‌మ రాష్ట్రాల‌ లో నెల‌కొన్న క్షేత్ర స్థితిని గురించి ముఖ్యమంత్రులు స‌మ‌గ్ర‌ వివ‌రాల‌ను స‌మావేశం దృష్టి కి తీసుకువ‌చ్చారు.  కేసుల సంఖ్య‌ లో పెరుగుద‌ల‌ను గురించి ప్ర‌స్తావించారు.  కొవిడ్ అనంత‌ర చిక్కులు, ప‌రీక్ష‌ల‌ను పెంచడానికి తీసుకొన్న చ‌ర్య‌లు, రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు చేప‌ట్టిన చ‌ర్య‌లు, ఇంటింటికీ వెళ్ళ‌ి పరీక్షలు జరపడం, సార్వ‌జ‌నిక స‌మూహాల సైజును త‌గ్గించ‌డానికి అమ‌లుచేస్తున్న ఆంక్ష‌లు, నిషేధాజ్ఞల విధింపు, త‌దిత‌ర ఆంక్షాపూర్వ‌క చ‌ర్య‌లు, జాగ‌రూక‌త‌ను, ప్ర‌చార ఉద్య‌మాల‌ను నిర్వ‌హించ‌డం, మాస్కుల వినియోగాన్ని పెంచేందుకు తీసుకొన్న చ‌ర్య‌లు వంటి అంశాల‌ను వారు ప్ర‌స్తావించారు.  టీకాలు ఇప్పించే కార్య‌క్ర‌మానికి సంబంధించి వారు చ‌ర్చించి, కొన్ని సూచ‌నల‌ను, స‌ల‌హాల‌ను ఇచ్చారు.

కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి శ్రీ రాజేశ్‌ భూష‌ణ్‌, ప్ర‌స్తుత కొవిడ్ స్థితి పై ఒక నివేదిక‌ను స‌మ‌ర్పించి, స‌న్నాహ‌క చ‌ర్య‌ల తాలూకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.  లక్షిత సమూహాలకు పరీక్షల నిర్వహణ, అన్ని కాంటాక్టులను 72 గంట‌ల లోపు గుర్తించి వారికి పరీక్షలు జరపడం, ఆర్‌టి-పిసిఆర్ ప‌రీక్ష‌ల‌ సంఖ్యను పెంచ‌డం, ఆరోగ్య రంగ మౌలిక‌ స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చే దిశలో సాగుతున్న ప్ర‌య‌త్నాలు, రాష్ట్రాలు అందించిన స‌మాచారంపై తగిన అనంత‌ర చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం వంటి అంశాల‌ను ఈ సందర్భం లో ఆయ‌న చ‌ర్చించారు.  టీకామందు అప్పగింత, పంపిణీ, పాలనలపై ఒక సమర్పణ ను నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వి.కె. పాల్  సమావేశం ముందుకు తెచ్చారు.


 

***
 



(Release ID: 1675352) Visitor Counter : 238