రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌తో భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ; బెకాపై సంతకాలు చేయనున్న రెండు దేశాలు

Posted On: 26 OCT 2020 7:24PM by PIB Hyderabad

భారత్‌తో బంధం బలోపేతం కోసం, 2+2 మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో భాగంగా, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు. సౌత్‌ బ్లాక్‌లో, మార్క్‌ ఎస్పర్‌తో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. సైనిక సహకారం, రక్షిత సమాచార వ్యవస్థలు, సమాచార మార్పిడి, రక్షణ వాణిజ్యం, పారిశ్రామిక అంశాలతో కూడిన ద్వైపాక్షిక రక్షణ సహకారంతోపాటు రెండు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపైనా చర్చలు జరిపారు.

    రెండు దేశాల సైనిక సంబంధాలపై మంత్రులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. 'సర్వీస్‌ టు సర్వీస్‌', సంయుక్త స్థాయుల్లో సహకరించుకునే కొత్త అంశాలపై చర్చించారు. కొవిడ్‌ సమయంలో, అన్ని స్థాయుల్లో, ముఖ్యంగా మిలిటరీ కోపరేషన్‌ గ్రూప్‌ (ఎంసీజీ) స్థాయిలో చేపట్టిన రక్షణ చర్చలను కొనసాగించాలని నిర్ణయించారు. సమన్వయాధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరంపైనా మంత్రులిద్దరూ మాట్లాడుకున్నారు.

    ఈ పర్యటనలో 'బెకా' ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో అమాత్యులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. మలబార్‌ 2020 విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొనడాన్ని అమెరికా రక్షణ మంత్రి స్వాగతించారు.

    భారత రక్షణ రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహం కోసం ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మార్క్‌ ఎస్పర్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. భారత్‌లోని సరళమైన విధానాలను, అనుకూలమైన రక్షణ రంగ వ్యవస్థను ఉపయోగించుకోవాలని అమెరికా సంస్థలను ఆహ్వానించారు.

***



(Release ID: 1667681) Visitor Counter : 267