ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌-2020 వారోత్సవాలను ప్రారంభించిన శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

భారతీయ ఆహార మార్కెట్‌లో భారత ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమది 32 శాతం: నరేంద్ర సింగ్ తోమర్

భారతదేశానికి బలమైన వ్యవసాయం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉంది: నరేంద్ర సింగ్ తోమర్

పీఎం ఎఫ్‌ఎమ్‌ఈ పథకం కింద సూక్ష్మస్థాయి ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ

Posted On: 16 OCT 2020 3:24PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్  అక్టోబర్ 16-2020 నుండి అక్టోబర్ 22 వరకు నిర్వహిస్తున్న  భారతదేశం- అంతర్జాతీయ ఆహార మరియు వ్యవసాయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సమావేశంలో ప్రసంగించిన శ్రీ తోమర్ "భారతీయ ఆహార మార్కెట్‌లో భారత ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమది 32 శాతం వాటా ఉందని చెప్పారు. భారతదేశ వ్యవసాయ మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని చెప్పారు.  ఆహార, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం రైతుల ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు.

వ్యవసాయంలో జిడిపి వృద్ధి రేటు 3.4 శాతంగా ఉందని, కోవిడ్ వంటి సంక్షోభ  కాలంలో కూడా భారతదేశ ఆర్ధిక వృద్ధికి ఈ రంగం ఎంతో దోహదపడిందని ఆయనఅన్నారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా 'అన్న దేవో భవ' అనే అవగాహన కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడంతో పాటు ఆహార వృధాను అరికట్టడంపై మనం దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి సూచించారు.

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివరించారు. 20,000 కోట్ల రూపాయల వ్యయంతో తమ మంత్రిత్వశాఖ పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్) అనే పథకాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు. 2 లక్షల సూక్ష్మస్థాయి ఆహార తయారీ పరిశ్రమలకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీతో ఈ పథకం అండగా నిలుస్తుందని..అలాగే స్వయం సహాయక సంఘాలు, ఎఫ్‌పిఓలు మరియు కుటీర పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపై కూడా దృష్టి పెడుతుందని చెప్పారు. వాణిజ్యమంత్రిత్వశాఖతో కలిసి ఆహారం, పండ్లు మరియు రెడీటు ఈట్‌ పదార్ధాల ఎగుమతిపై తమశాఖ పనిచేస్తోందని వివరించారు. అలాగే ఆహార ఉత్పత్తుల బ్రాండింగ్ మరియు మార్కెట్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.

ఫార్మ్ గేట్ నుండి రిటైల్ అవుట్లెట్ల వరకు సమర్థవంతమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు  ఆధునిక మౌలిక సదుపాయాల కోసం పీఎం కిసాన్ సంపద పథకాన్ని ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రారంభించిందని శ్రీ తోమర్ తెలిపారు. రైతులు, ప్రాసెసర్లు, చిల్లరవ్యాపారులతో కలిసి వ్యవసాయ ఉత్పత్పను మార్కెట్‌కు అనుసంధానించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇప్పటికి 37 ఎంఎఫ్‌పిలు ఆమోదించబడ్డాయని వాటిలో 20 కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు. ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని టాప్ టు టోటల్ వరకు తమ మంత్రిత్వ శాఖ విస్తరించిందని కేంద్రమంత్రి తెలిపారు. అర్హత ఉన్న పంటలకు ఈ పథకం కింద ఎక్కువ నిల్వ ఉన్న ప్రదేశం నుండి వినియోగ కేంద్రానికి రవాణా చేయడానికి ఆరునెలల పాటు.. అలాగే పంటలను నిల్వ చేసుకునే సౌకర్యాలు కల్పించుకోవడానికి(గరిష్టంగా 3 నెలలు) 50 శాతం సబ్సిడీని తమ మంత్రిత్వ శాఖ అందిస్తుందని తెలిపారు.


ఆగ్రో అండ్ ఫుడ్ టెక్ 14వ ఎడిషన్‌ సదస్సులో  ప్రసంగించిన శ్రీ తోమర్ వ్యవసాయం మరియు సంబంధిత రంగాలలో లభించే ఉత్పత్తులు, సేవలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఇది సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేవారంతా ఈ వేదిక ద్వారా లభించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరిష్కారాలు మరియు అవకాశాల నుండి ప్రయోజనం పొందుతారని చెప్పారు.

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో కలిసి సీఐఐ తన మొట్టమొదటి వర్చువల్ సిఐఐ అగ్రో & ఫుడ్ టెక్: ఇండియా - ఇంటర్నేషనల్ ఫుడ్ & అగ్రి వీక్‌ను నిర్వహిస్తోంది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన వారికి ఒక వేదికను సృష్టించే ఉద్దేశ్యంతో సీఐఐ హెచ్‌ఐవీఈ- వర్చువల్ ప్లాట్‌ఫాంపై ఈ సదస్సును 2020 అక్టోబర్ 16 నుండి 22 వరకు నిర్వహిస్తోంది. సిఐఐ అధ్యక్షుడు శ్రీ ఉదయ్ కోటక్, సిఐఐ ఉత్తర ప్రాంత ఛైర్మన్ శ్రీ నిఖిల్ సాహ్నీలు కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.

***



(Release ID: 1665326) Visitor Counter : 253