రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సాయుధ దళాల ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనంప్రాంతీయ బెంచ్ లకు సంబంధించిన విషయాలపైవీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలను ప్రారంభించింది

Posted On: 26 AUG 2020 6:01PM by PIB Hyderabad

సాయుధ దళాల ట్రిబ్యునల్ (ఎ.ఎఫ్.టి) 10 ప్రాంతీయ ధర్మాసనాలలో వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా విచారణలకు సాయుధ దళాల ట్రిబ్యునల్ ఛైర్ పర్సన్ జస్టిస్ రాజేంద్ర మీనన్ ఈ రోజు శ్రీకారం చుట్టారు.

2020 జూన్ 8 నుంచి భౌతికంగా విచారణలను నిర్వహిస్తున్న ఏకైక కోర్టు సాయుధ దళాల ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనం. సాయుధ దళాలకు చెందిన వ్యక్తులు (సర్వీసులో ఉన్నవారు, ఉద్యోగ విరమణ చేసినవారు) సుదూర ప్రాంతాల్లో ఉండటం వల్ల, వివిధ భద్రతా సంబంధమైన కారణాల వల్ల ఎదుర్కొంటున్న కష్టాలు, పరిమితులను పరిగణనలోకి తీసుకొని ప్రధాన బెంచ్ వద్ద భౌతిక విచారణలు జరుగుతున్నాయి. 

ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈ విచారణలను నిర్వహించిన ఘనతను ప్రధాన రిజిస్ట్రార్ డాక్టర్ రాకేష్ కుమార్ కు ఇచ్చారు ఛైర్ పర్సన్. ప్రధాన ధర్మాసనం వద్ద లోపరహితమైన పారిశుధ్య ప్రమాణాలను పాటించడానికి రాకేశ్ కుమార్ తగిన సలహాలను ఇస్తున్నారు. కోర్టు ప్రాంగణాలను ఎ.ఎఫ్.టి. ఉద్యోగులే రోజుకు రెండుసార్లు శుద్ధి చేస్తున్నారు. దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించక ముందు నుంచే ఇది జరుగుతోంది. పని సాఫీగా జరిగే విషయంలో రాజీ పడకుండానే న్యాయస్థానం ఆవరణలోకి ప్రవేశాలను కనీస స్థాయికి తగ్గించి సరైన రీతిలో భౌతిక దూరం పాటించారు. ఎ.ఎఫ్.టి. ముందు హాజరయ్యే న్యాయవాదులను పారదర్శకమైన సన్నటి తెర ద్వారా ట్రిబ్యునల్ న్యాయమూర్తుల నుంచి వేరుగా ఉంచారు. జడ్జిలు, కోర్టు సిబ్బంది మధ్య కూడా సరైన రీతిలో భౌతిక దూరాన్ని పాటించారు. 

సాయుధ దళాల ట్రిబ్యునల్ లో ప్రధాన ధర్మాసనం, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 10 ప్రాంతీయ ధర్మాసనాలు కలిపి మొత్తం 11 ధర్మాసనాలకు 34 మంది న్యాయ, పరిపాలనా సభ్యులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, ఇప్పుడు ప్రధాన ధర్మాసనంలో కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. చండీగఢ్, ముంబై, చెన్నై ధర్మాసనాలలో ఒక న్యాయ రంగపు సభ్యుడు, ఇద్దరు పరిపాలనా సభ్యుల చొప్పున ఉన్నారు. 

ప్రాంతీయ ధర్మాసనాలకు సంబంధించిన అత్యవసర విన్నపాలను ప్రధాన ధర్మాసనం వింటున్నప్పటికీ, ప్రాంతీయ ధర్మాసనాలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా వినడానికి ఒక పద్ధతిని రూపొందించాల్సిన అవసరం ఉందని భావించారు. అందుకు అనుగుణంగానే, దూర దృశ్య విచారణ కోసం ఆచరణీయమైన పద్ధతిని ప్రవేశపెట్టారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టే ఈ అవకాశంతో సాయుధ దళాల సిబ్బందికి అపారమైన ఉపశమనం కలిగింది. వివిధ ప్రాంతీయ ధర్మాసనాలలో వారి విన్నపాలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రాంతీయ ధర్మాసనాలకు సంబంధించిన విన్నపాలను న్యాయ విభాగపు సభ్యుడు జస్టిస్ మహమ్మద్ తాహిర్, పరిపాలనా సభ్యులు వైస్ అడ్మిరల్ పి. మురుగేశన్ (రిటైర్డ్), లెఫ్టినెంట్ జనరల్ సి.ఎ. కృష్ణన్ (రిటైర్డ్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తారు.

***



(Release ID: 1648867) Visitor Counter : 166