రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్మార్ట్‌ ఇండియా హాకథాన్‌-2020లో ప్రథమ బహుమతి గెలుచుకున్న 'డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ'

Posted On: 06 AUG 2020 3:07PM by PIB Hyderabad

డీఆర్‌డీవో ఆధ్వర్యంలో పనిచేసే స్వతంత్ర సంస్థ అయిన పుణెలోని 'డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ' (డయట్‌) స్మార్ట్‌ ఇండియా హాకథాన్‌ (ఎస్‌ఐహెచ్‌)-2020లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నవారితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు.     
 
    ఎస్‌ఐహెచ్‌-2020, నిర్విరామంగా 36 గంటలపాటు డిజిటల్‌ ఉత్పత్తులను రూపొందించే జాతీయ స్థాయి పోటీ. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ), ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) కలిసి ఈనెల 1-3 తేదీల మధ్య నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌&టెక్నాలజీ (ఎన్‌ఐఈటీ)లో ఈ కార్యక్రమం జరిగింది.
 
    ఆరుగురు విద్యార్థులతో కూడిన, డా.సునీత ధవళే ఆధ్వర్యంలోని డయట్‌ బృందం తొలి బహుమతి లక్ష రూపాయలను గెలుచుకుంది. సాఫ్ట్‌వేర్‌ విభాగంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన 'ఎంఎస్‌331 స్టేట్‌మెంట్‌'ను పరిష్కరించి ఈ బృందం మొదటి బహుమతి సాధించింది. తమ ఆవిష్కరణకు "దృష్టి" అని పేరు పెట్టింది. ముఖం, హావభావాలు, కదలికలను కృత్రిమ మేధస్సు ద్వారా ఈ ఆవిష్కరణ గుర్తిస్తుంది.
 
    వరుసగా రెండో ఏడాది కూడా బహుమతి గెలుచుకున్నందుకు డయట్‌ బృందాన్ని డీఆర్‌డీవో ఛైర్మన్‌ డా. జి.సతీష్‌ రెడ్డి అభినందించారు.

***



(Release ID: 1644112) Visitor Counter : 103