రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

లెహ్‌లోని 'దిహర్‌'లో కొవిడ్‌ నమూనాల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసిన డీఆర్‌డీవో

Posted On: 23 JUL 2020 12:59PM by PIB Hyderabad

లెహ్‌లోని ప్రయోగశాల 'డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రీసెర్చ్‌' (దిహర్‌)లో కొవిడ్‌ నమూనాల పరీక్ష కేంద్రాన్ని డీఆర్‌డీవో ఏర్పాటు చేసింది. కరోనా కేసుల గుర్తింపు కోసం, పరీక్షల సంఖ్యను పెంచడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రోగులను కూడా ఇది పర్యవేక్షిస్తుంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలకు తగ్గట్లుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ ఆర్‌.కె.మాధుర్‌ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు.

    దిహర్‌ పరీక్ష కేంద్రంలో రోజుకు 50 నమూనాలను పరీక్షించవచ్చు. కొవిడ్‌ పరీక్షల్లో ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి, భవిష్యత్తులో వచ్చే వైరస్‌ ప్రమాదాలను అడ్డుకోవడానికి, వ్యవసాయ పశువులకు వ్యాపించే వ్యాధులపై పరిశోధనలు చేయడానికి ఈ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నారు.

    కొవిడ్‌పై డీఆర్‌డీవో చేస్తున్న యుద్ధంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ ఆర్‌.కె.మాధుర్‌ ప్రశంసలు కురిపించారు. దిహర్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింనందుకు డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడానికి ఈ పరీక్ష కేంద్రం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరీక్షించారు. వైరస్‌ నుంచి రక్షణకు ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన భద్రత వ్యవస్థను; పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు, పర్యావరణ భద్రత చర్యలను ఆయనకు అధికారులు వివరించారు. దిహర్‌ డైరెక్టర్‌ ఒ.పి.చౌరాసియా సహా పరిశోధకులు, వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

        డీఆర్‌డీవోకు చెందిన లైఫ్‌ సైన్సెస్‌ ప్రయోగశాలల్లో దిహర్‌ ఒకటి. ఇది, శీతల వ్యవసాయ జంతువులపై పరిశోధనలు చేస్తోంది. రక్షణ ప్రయోజనాలకు ఉపయోగపడే ఔషధ, సుగంధ మొక్కలపైన; అత్యంత ఎత్తైన ప్రాంతాలు, మంచు ఎడారులకు సంబంధించిన గ్రీన్‌హౌస్‌ సాంకేతిక పరిజ్ఞానాలపైనా ప్రయోగాలు జరుపుతోంది.  
 



(Release ID: 1640635) Visitor Counter : 252